భారత్, నేపాల్‌ సంబంధాలకు పరీక్ష | Sakshi Guest Column On India Nepal relations | Sakshi
Sakshi News home page

భారత్, నేపాల్‌ సంబంధాలకు పరీక్ష

Published Fri, Jul 26 2024 5:18 AM | Last Updated on Fri, Jul 26 2024 5:18 AM

Sakshi Guest Column On India Nepal relations

విశ్లేషణ

కేపీ శర్మ ఓలీ నాలుగోసారి నేపాల్‌ ప్రధాని అయ్యారు. తన తొలి పదవీకాలంలో ఓలీ భారత్‌ను చికాకుపెట్టారు. ఉదాహరణకు, బీర్‌గంజ్‌ సమీపంలోని థోరి నిజమైన అయోధ్య అని పేర్కొన్నారు. భారత్‌తో నేపాల్‌ సరిహద్దును విస్తరిస్తూ నేపాల్‌ మ్యాప్‌ను, రాజ్యాంగాన్ని మార్చారు. అయితే ఆయన చైనా అనుకూలుడనే సాధారణ అభిప్రాయం సరికాదు. ఆయన జాతీయవాద నాయకుడు. నేపాల్‌ స్థిరత్వాన్ని, అభివృద్ధిని కోరుకుంటారు. అందుకు భారత్‌తో సన్నిహిత సంబంధాలను కలిగి ఉండటం తప్పనిసరి. చైనాతో నేపాల్‌ సత్సంబంధాలను కొనసాగించడంలో భారత్‌కు ఎలాంటి సమస్య లేదు. కానీ భౌగోళికం, చరిత్ర, సంస్కృతితో పాటు ఇరు దేశాల మధ్య బహిరంగ సరిహద్దు భారత్‌–నేపాల్‌ సంబంధాన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.

నేపాల్‌లో కొత్త ప్రధానమంత్రి అధికారంలోకి రావడంతో, రాజ్యాంగ రాచరికాన్ని స్థాపించిన 1990 నాటి జన ఆందోళన్‌ నుండి ప్రభుత్వ అధిపతికి సంబంధించి 30వ మార్పును నేపాల్‌ చూసినట్లయింది. పైగా 2006లో అదే రాచరికాన్ని రద్దు చేసి పార్లమెంటరీ గణతంత్రాన్ని స్థాపించిన లోక్‌తంత్ర ఆందోళన తర్వాత ఆ దేశంలో ప్రభుత్వాధిపతి మారడం 15వ సారి. గత తొమ్మిదేళ్లలో నేపాల్‌లో ప్రభుత్వం 8 సార్లు మారింది. 

నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ (యూనిఫైడ్‌ మార్క్సిస్ట్‌–లెని నిస్ట్‌)కి చెందిన కేపీ శర్మ ఓలీ, కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ నేపాల్‌ (మావోయిస్ట్‌ సెంటర్‌)కు చెందిన పుష్ప కమల్‌ దహల్, నేపాలీ కాంగ్రెస్‌కి చెందిన షేర్‌ బహదూర్‌ దేవుబా వరుసగా ప్రధానమంత్రులు అవుతున్నారు. అయితే నేపాల్‌లో జరుగుతున్న రాజకీయ మార్పులతో భావజాలానికి సంబంధం లేదు.

ఓలీ స్పష్టమైన మెజారిటీతో నాలుగోసారి ప్రధాని అయ్యారు. 275 మంది సభ్యులున్న ప్రతినిధుల సభలో ఆదివారం (జూలై 21) ఆయన ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 188 ఓట్లు రావడంతో, మూడింట రెండు వంతుల మెజారిటీతో విజయం సాధించారు. భారత్‌లో నేపాల్‌ మాజీ రాయబారి, ఖాట్మండు యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్‌ లోక్‌ రాజ్‌ బరాల్‌ ఇటీవల నేపాలీ రాజకీయాలు ‘అసంబద్ధతలతో నిండి ఉన్నాయి’ అని అభివర్ణించారు. తన తొలి పదవీకాలంలో ఓలీ భారత్‌ను చికాకుపెట్టారు. అనేక భారత్‌ వ్యతిరేక ఎత్తుగడలు వేశారు. 

ఉదాహరణకు, బీర్‌గంజ్‌ సమీపంలోని థోరి నిజమైన అయోధ్య అని పేర్కొన్నారు. నేపాల్‌ పురావస్తు శాఖ ఈ ప్రాంతంలో తవ్వకాలు జరపడం గురించి పరిశీలిస్తోందని కొన్ని వార్తా సంస్థలు నివేదించాయి. ‘సత్యమేవ జయతే’ కాదు, ‘సింహదేవ జయతే’ అనేది భారతదేశ జాతీయ నినాదంగా కనిపిస్తోందని అన్నారు. భారత్‌తో నేపాల్‌ సరిహద్దును ఉత్తరం వైపు కాకుండా, వాయువ్యంగా విస్తరిస్తూ నేపాల్‌ మ్యాప్‌ను, రాజ్యాంగాన్ని మార్చారు. తద్వారా వివాదాస్పద ప్రాంతాన్ని అనేక రెట్లు పెంచి, పరిష్కారాన్ని కష్టతరం చేశారు.

ఓలీ చైనా అనుకూలుడనే సాధారణ అభిప్రాయం సరికాదు. ఆయన జాతీయవాద రాజకీయ నాయకుడు. నేపాల్‌ స్థిరత్వాన్ని, అభి వృద్ధిని కోరుకుంటారు. అందుకు భారత్‌తో సన్నిహిత సంబంధాలు తప్పనిసరి. చైనాతో నేపాల్‌ సత్సంబంధాలను కొనసాగించడంలో భారత్‌కు ఎలాంటి సమస్య లేనప్పటికీ... ఇరు దేశాల మధ్య బహిరంగ సరిహద్దు, భౌగోళికం, చరిత్ర, సంస్కృతి భారత్‌–నేపాల్‌ సంబంధాన్ని ప్రత్యేకంగా మారుస్తున్నాయి.

ఇప్పటికే అంగీకరించిన విద్యుత్‌ వాణిజ్యం, వాతావరణ మార్పుల సహకారం, అనుసంధానంపై చొరవతో కూడిన కార్య క్రమాల ద్వారా దీనిని మరింతగా మార్చవచ్చు. గత రెండేళ్లుగా, నేపాల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ కాళీగండకి, త్రిశూలి, దేవిఘాట్‌లోని తన జలవిద్యుత్‌ కేంద్రాలలో ఉత్పత్తి చేసిన మిగులు విద్యుత్తును ఇండియన్‌ ఎనర్జీ ఎక్స్‌చేంజ్‌ ద్వారా భారత్‌కు యూనిట్‌కు రూ. 6 కంటే ఎక్కువ లాభదాయకమైన ధరకు విక్రయిస్తోంది. 

ఏప్రిల్‌ 2022లో ఆమోదించిన విద్యుత్‌ రంగ సహకారంపై భారత్‌–నేపాల్‌ ఉమ్మడి దార్శనికతా ప్రకటన మూడు కార్యకలాపాలను అంచనా వేసింది. నేపాల్‌లోని విద్యుత్‌ రంగ ప్రాజెక్టుల ఉమ్మడి అభివృద్ధి, సీమాంతర సరఫరా మౌలిక వ్యవస్థ, ద్వి–దిశాత్మక విద్యుత్‌ వాణిజ్యం. అయితే నేపాల్‌లోని కొన్ని ప్రతికూల శక్తులు వీటిని వ్యతిరేకిస్తున్నాయి.

నేపాల్‌కు అత్యంత అనుకూలంగా వ్యవహరించిన భారత ప్రధాని చంద్రశేఖర్‌ 1991 ఫిబ్రవరిలో ఖాట్మండును సందర్శించిన ప్పుడు, ఒక విలేఖరుల సమావేశంలో జలవిద్యుత్‌ రంగంలో భారత్‌– నేపాల్‌ సహకార అవకాశాల గురించి విస్తృతంగా మాట్లాడారని గుర్తుచేసుకోవడం ఆసక్తికరం. ఆ సమావేశం తర్వాత నేపాలీ యువ జర్నలిస్ట్‌ విజయ్‌ కుమార్‌ను తనతో కలిసి టీ తాగడానికి భారత ప్రధాని ఆహ్వానించారు. 

అప్పుడు చంద్రశేఖర్‌ చెప్పిన మొదటి విషయం, ‘‘జనాల మేత కోసం నేను చెప్పిన మాటలను నమ్మవద్దు’’ అని. విజయ్‌ కలవరపడటం చూసి, తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా గ్రామంలో కరెంటు లేని ఒక గుడిసెలో తన పెంపకం గురించి వివరించారు. భారత్‌ త్వరలో విముక్తి పొందుతుందని తండ్రి ఆయనతో అన్నారు: ‘‘అభివృద్ధి పథంలో మన మిత్రదేశం నేపాల్‌ నడిచినప్పుడు మనకు కరెంట్‌ ఇస్తుంది. ఇప్పుడు మన జుట్టు నెరి సిందిగానీ నేపాల్‌ నుంచి మన ఇంటికి కరెంట్‌ రాలేదు. నేపాల్‌ తనను చీకట్లో ఉంచుకుంటుంది, మనల్నీ చీకట్లోనే ఉంచుతుంది.’’

పరిస్థితులు ఎలా మారిపోయాయో ఈ ఉదంతం వివరిస్తుంది. గత కొన్ని దశాబ్దాలుగా నేపాల్‌కు భారత్‌ విద్యుత్తును సరఫరా చేస్తుండగా, ఇప్పుడు అది మారింది. అయితే నేపాల్‌ మిగులు విద్యుత్తును మాత్రమే భారత్‌ కొనుగోలు చేస్తోంది. ఇది నేపాల్‌ వాణిజ్య సంతు లనాన్ని సరిదిద్దుతుంది. నేపాల్‌ తన వాణిజ్యాన్ని సమతుల్యం చేసుకోవడానికి మరొక మార్గం ఏమిటంటే, భారత్‌ నుంచి పెట్రో లియం ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం ఆపేసి, వాటిని మరో చోటునుంచి దిగుమతి చేసుకోవడం.

నేపాల్‌కు భారత్‌ ఏకైక చమురు సరఫరాదారు. 2019 సెప్టెంబరులో భారత్‌లోని మోతీహారి (బిహార్‌) నుండి నేపాల్‌లోని అమ లేఖ్‌గంజ్‌ వరకు దక్షిణాసియాలో మొట్టమొదటి సీమాంతర పెట్రో లియం ఉత్పత్తుల పైప్‌లైన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ, ఓలీ సంయుక్తంగా ప్రారంభించారు. నేపాల్‌కు క్రమం తప్పకుండా సరసమైన పెట్రోలియం సరఫరాలను నిర్ధారించడానికి ఇండియన్‌ ఆయిల్‌ కార్పొ రేషన్‌ షెడ్యూల్‌ కంటే ముందే దీన్ని నిర్మించింది. నేపాల్‌ విద్యుత్‌ను భారత్‌ దిగుమతి చేసుకోవడమే కాకుండా, బంగ్లాదేశ్‌కు నేపాల్‌ విద్యు త్‌ను సరఫరా చేయడానికి అంగీకరించే యోచనలో ఉంది. ఇది దక్షిణా సియాలోని ఏదైనా మూడు దేశాలలో మొదటి త్రైపాక్షిక ఏర్పాటు.

నేపాల్‌తో రవాణా, కనెక్టివిటీ కోసం భారత్‌ ఇతర దేశాల కంటే ఎక్కువ చేయగలదు. బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌ కింద, ట్రాన్స్‌ –హిమాలయన్‌ మల్టీ–డైమెన్షనల్‌ కనెక్టివిటీ నెట్‌వర్క్‌ను నిర్మిస్తామని చైనా హామీ ఇచ్చింది. అయితే క్షేత్రస్థాయిలో దానికి ఎలాంటి ఆధా రాలు లేవు. ఖాట్మండుకు రైలు మార్గాన్ని నిర్మించడం ద్వారా, జల మార్గాల గుండా బంగాళాఖాతంలోకి నేపాల్‌కు యాక్సెస్‌ను అందించడం ద్వారా నేపాల్‌ భూపరివేష్టిత పరిస్థితిని సమర్థవంతంగా ముగించేలా భారత్‌ ప్రతిపాదించింది. బిహార్‌లోని రక్సోల్‌–ఖాట్మండు రైలు లింక్‌ తుది స్థాన సర్వే నివేదిక గతేడాది జూన్‌ నుండి నేపాల్‌ ప్రభుత్వం వద్ద ఉంది.

నేపాల్‌తో చైనా కుదుర్చుకున్న 2016 ట్రాన్సిట్‌ అండ్‌ ట్రాన్‌ ్సపోర్ట్‌ ఒప్పందం అనేక చైనీస్‌ ఓడరేవుల లోకి నేపాల్‌కు ప్రాప్యతను ఇస్తుంది. కానీ గత ఎనిమిదేళ్లలో, సుదీర్ఘమైన, ఆర్థికంగా లాభసాటి కాని దూరాల కారణంగా ఈ మార్గాలు ఉపయోగించలేదు. నేపాల్‌కు సంబంధించి మూడవ దేశ వాణిజ్యం కోల్‌కతా, విశాఖపట్నంలోని భారతీయ ఓడరేవుల ద్వారా కొనసాగుతోంది. గల్ఫ్, పశ్చిమాసియా, ఆఫ్రికా లేదా యూరప్‌కు ఎగుమతి చేయడానికి నేపాల్‌కు భారత పశ్చిమ తీరప్రాంతంలోని కాండ్లా వంటి ఓడరేవులు అవసరమైతే, భారత్‌ దాన్ని సులభతరం చేస్తుంది. 

నేపాల్‌లో తరచూ జరిగే నాయకత్వ మార్పు స్థానిక రాజకీయ అస్థిరతకు దారితీస్తుంది. తమ సాంస్కృతిక సాన్నిహిత్యం వల్ల భారతీయులు, నేపాలీలు ఒకరి పట్ల మరొకరు కొంత ఉదాసీనంగా ఉన్నారు. బదులుగా, వారు పరస్పరం ఎక్కువగా పట్టించుకోవాలి. 

జయంత్‌ ప్రసాద్‌ 
వ్యాసకర్త నేపాల్‌లో భారత మాజీ రాయబారి
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement