చైనా విదేశాంగ మంత్రితో జైశంకర్‌ భేటీ | Jaishankar Meets Chinese Foreign Minister | Sakshi
Sakshi News home page

చైనా విదేశాంగ మంత్రితో జైశంకర్‌ భేటీ

Published Thu, Jul 4 2024 10:27 AM | Last Updated on Thu, Jul 4 2024 10:37 AM

Jaishankar Meets Chinese Foreign Minister

అస్తానా: కజకిస్తాన్ రాజధాని అస్తానాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) వార్షిక శిఖరాగ్ర సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీని కలుసుకున్నారు. వీరు కరచాలనం చేసుకున్న వీడియో బయటకు వచ్చింది. భారత్‌-చైనా మధ్య  గత కొన్నేళ్లుగా సత్సంబంధాలు లేవు. ఈ నేపధ్యంలో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు కలుసుకోవడం ఆసక్తికరంగా మారింది. కాగా వాంగ్ యీని కలవడానికి ముందు జైశంకర్ ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్‌ను కూడా కలుసుకున్నారు.

ఎస్‌సీఓ సమ్మిట్‌లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించేందుకు వచ్చిన జైశంకర్ తజికిస్తాన్ విదేశాంగ మంత్రి సిరాజుద్దీన్ ముహ్రిద్దీన్‌ను కూడా కలుసుకున్నారు. జైశంకర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’ లో తన పర్యటన వివరాలు వెల్లడించారు. ‘ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌ను కలవడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. ప్రపంచ స్థితిపై అతని అంతర్దృష్టిని మెచ్చుకోవాల్సిందే. ప్రపంచ సమస్యలు, వాటి విస్తృత ప్రభావాల గురించి సమావేశంలో చర్చించాం. అలాగే సెప్టెంబరులో జరిగే శిఖరాగ్ర సమావేశ సన్నాహాలు, భారత్‌-యుఎన్ భాగస్వామ్య భవిష్యత్‌ అవకాశాల గురించి కూడా చర్చించామని జైశంకర్‌ తెలిపారు.

గుటెర్రెస్‌ను కలవడానికి ముందు జైశంకర్ తజికిస్తాన్, బెలారస్, రష్యా ప్రతినిధులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలను ఆయన షేర్‌ చేశారు. కాగా ఎస్‌సీఓలో భారతదేశం, ఇరాన్, కజకిస్తాన్, చైనా, కిర్గిజిస్తాన్, పాకిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సభ్యదేశాలు. ప్రస్తుత సమావేశాలను కజకిస్తాన్ నిర్వహిస్తోంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement