మీరు తీసుకునేది ‘ట్యాపింగ్‌’ పైసలే : మాజీ మంత్రి పెద్దిరెడ్డి | Sakshi
Sakshi News home page

మీరు తీసుకునేది ‘ట్యాపింగ్‌’ పైసలే : మాజీ మంత్రి పెద్దిరెడ్డి

Published Sat, May 4 2024 8:15 AM

-

విచారణలో బయటపడితే గండమే..

కాంగ్రెస్‌లో చేరేవారికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి హెచ్చరిక

కరీంనగర్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావు పంపుతున్న సొమ్ముతో కార్పొరేటర్లను, ప్రజాప్రతినిధులను, నాయకుల ను కొనాలని కాంగ్రెస్‌ నాయకులు చూస్తున్నరు.. ఆ డబ్బు తీసుకునేవాళ్లకు మేం చెప్పేదొక్కటే.. మీరు తీసుకునే సొమ్ము ఫోన్‌ ట్యాపింగ్‌ పైసలే.. విచారణలో బయటపడితే మీకు గండమే.. జైలుకు వెళ్లక తప్పదని మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జెనవాడ సంగప్ప హెచ్చరించారు.

కరీంనగర్‌కు చెందిన కొందరు కార్పొరేటర్లు కాంగ్రెస్‌లోకి వెళ్తున్నట్లు చర్చ జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం కరీంనగర్‌ ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ప్రధాని మోదీ నాయకత్వమే కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.

ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పుకోలేని స్థితిలో కాంగ్రెస్‌ ఉందని ఎద్దేవా చేశారు. రిజర్వేషన్ల రద్దు అంటూ ఆ పార్టీ విష ప్రచారం చేస్తోందన్నారు. కాంగ్రెస్‌ హయాంలో మంచి నీళ్లు దొరకలేదన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ నిజమైన బీసీ అయితే మోదీ, సంజయ్‌ బీసీలేనని, నువ్వు బీసీ పక్షం ఉంటావో.. ఓసీ పక్షం ఉంటావో చెప్పాలని డిమాండ్‌ చేశారు. నాయకులు కొలగాని శ్రీనివాస్‌, బొమ్మ జయశ్రీ,, బొంతల కల్యాణ్‌, కటకం లోకేశ్‌ పాల్గొన్నారు.

ఇవి చదవండి: ప్రచారంపై ఫోకస్‌ పెంచిన ప్రధాన పార్టీలు..

Advertisement
 

తప్పక చదవండి

Advertisement