telangana political news
-
ఇద్దరూ ఇద్దరే..! తగ్గేదేలే..!!
తెలంగాణలో విగ్రహాల పేరుతో సాగుతున్న రగడ చాలా అభ్యంతరకరంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కాని... బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇద్దరు నోటికి వచ్చినట్టు మాట్లాడడం పద్ధతిగా లేదు. తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని రేవంత్ ప్రభుత్వం తలపెట్టింది. దానిని కేటీఆర్ వ్యతిరేకించారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామని ప్రకటించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు స్పందించారు. మిగతా వారి సంగతి ఏలా ఉన్నా సీఎం స్థానంలో ఉన్న రేవంత్ మాటలు మరి దురుసుగా ఉన్నాయి. 'నీ అయ్య విగ్రహం కోసం దేశం కోసం ప్రాణం ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహం తీసివేస్తావా... నీకు అధికారం అనేది కలలో మాట. రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గరకు పోతే వీపు చింతపడు అయితది. రాజీవ్ గాంధీ విగ్రహం తీయాడానికి తారిఖు చెప్పు. మా జగ్గన్నకు చెబుతా. ఆయన వచ్చి అక్కడ ఉంటాడు అప్పుడు తెలుస్తది అంటూ అక్కడ ఆగకూండా రాజీవ్ గాంధీ విగ్రహంను ముట్టుకుంటే.. చెప్పు తెగకపోతే చూస్తా" అని హెచ్చరించారు.కేటీఆర్ అసలు ఈ వివాదాన్ని లేవనెత్తాల్సిన అవసరం లేదు. ఒక వేళ అభ్యంతరం ఉంటే రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడ పెట్టవద్దని... తెలంగాణ తల్లి విగ్రహంను ఏర్పాటు చేయాలని చెప్పవచ్చు. ఇప్పటికే మేధావులు పలువురు ఆ సూచన చేసారు. అంత వరకు ఆగకుండా కేటీఆర్ ఏకంగా రాజీవ్ విగ్రహాన్ని అధికారంలోకి వస్తే తొలగిస్తామని అంటూ... కాంగ్రెస్ను రెచ్చగోట్టారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి మరి అన్యాయంగా కేసీఆర్ ప్రస్తావన తెచ్చి అవమానించిన తీరు బాగాలేదు. "పోద్దున్న నుంచి రాత్రి వరకు తాగి ఫార్మ్ హౌస్ లో పోర్లాడే కేసీఆర్ విగ్రహం సచివాలయం ముందు ఉండాలా అంటూ దారుణంగా మాట్లాడారు". అంతే కాక వాళ్ల అయ్య పోయేది ఎప్పుడు... వీడు పెట్టేది ఏప్పుుడు అంటూ పరుష భాషను వాడడం ఏ మాత్రం సరికాదు. ఇది ఆయన హోదాకు ఏ మాత్రం తగదు.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ ఏట్లాపడితే అట్లా మాట్లాడి హైలైట్ అయ్యేవారు. ఇప్పటికి అలాంటి పంథాను కొనసాగించాలని అనుకుంటే తెలంగాణ సమాజం హర్షించదు. అనవసరంగా కేసీఆర్ పేరు బయటకు తీసుకువచ్చి అది కూడా పిల్లల ముందు మాట్లడడం చాలా ఎబ్బెట్టుగా ఉంది. ఎంత కాదు అన్న కేసీఆర్... పదేళ్ల పాటు సీఎంగా పనిచేశారు అనే విషయం మర్చిపోకుడదు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమాన్ని నడిపి దేశం అంతటి దృష్టిని కేసీఆర్ ఆకర్షించారు. ఈ రోజు రేవంత్ సీఎంగా ఉన్నారంటే అది కేసీఆర్ తెలంగాణ ఉద్యమ ఫలితమే కదా! ఓడిపోయినంత మాత్రాన కేసీఆర్ విలువ తగ్గుతుందా! కేసీఆర్ కూడా గతంలో కొన్నిసార్లు అభ్యంతరకరంగా మాట్లడిన సందర్భరాలు లేకపోలేదు. అయినప్పటికి రేవంత్ కామెంట్స్ శ్రుతిమించాయని చెప్పకతప్పదు.ఇక్కడ విషయం ఏమిటంటే ఇంకా నాలుగేళ్ల వరకు ఎన్నికలు జరగవు. అప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టే రాజీవ్ గాంధీ విగ్రహం జోలికి ఎవరు వెళ్లరు. అలాంటిది రాజీవ్ విగ్రహంను టచ్ చేయి... చెప్పు తెగుద్ది అంటూ రేవంత్ మాట్లడాల్సిన అవసరమే లేదు. ఒక పక్క బీఆర్ఎస్కు మళ్లీ అధికారం రాదు అంటునే... రేవంత్ ఈ కామెంట్స్ చేయాల్సిన అవసరం ఏముంది? అయితే కేటీఆర్ వ్యాఖ్యల పుణ్యామా అని రేవంత్ సర్కార్కు ఒక ఐడియా వచ్చినట్టు అయ్యింది. వెంటనే సచివాలయంలోనే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని... స్థలాన్ని కూడా పరిశీలించారు.డిసెంబర్ తొమ్మిది నాటికి అంటే సోనియా గాంధీ పుట్టిన రోజు నాటికి తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని ప్రకటించారు. తెలంగాణ తల్లి విగ్రహాలకు సంబంధించి ఇంత కాలం క్రెడిట్ అంతా కేసీఆర్దే అని చెప్పాలి. తెలుగు తల్లి బదులు తెలంగాణ తల్లి విగ్రహాలను తయారు చేయించి అనేక చోట్ల ప్రతిష్టించేలా చర్యలు తీసుకున్నారు. బీఆర్ఎస్ ఆఫీసులో కూడా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుంది. ఎందువల్లో కాని సచివాలయంలో మాత్రం ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు ఆ అవకాశాన్ని రేవంత్ వాడుకుంటున్నారు.ఇక రేవంత్ కామెంట్స్పై కేటీఆర్ కూడా ఘాటుగానే స్పందించారు. ఇందులోను అధ్వాన్నపు భాషా మాట్లడడం మర్యాదగా లేదు. తాము అధికారంలోకి రాగానే సచివాలయం పరిసరాల్లో ఉన్న చెత్తను ఊడ్చిపారేస్తామని కేటీఆర్ అనడం పద్దతి కాదు. రాజీవ్ గాంధీ ఒక మాజీ ప్రధాని అన్నది గుర్తించుకోవాలి. రేవంత్, కేటీఆర్ రగడలో సంబంధం లేని రాజీవ్ గాంధీ, కేసీఆర్ల పేర్లు తీసుకుని వారిద్దరిని అవమానిస్తూ మాట్లాడి స్థాయిని దిగజార్చుకున్నారు. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కూడా చీఫ్ మినిస్టర్ బధులు.. చీప్ మినిష్టర్ అని అనడం, డిల్లీ గులాం అనడం రేవంత్ మానసిక రుగ్మత నుంచి త్వరగా కోలుకోవాలని కేటీఆర్ కామెంట్ చేశారు. మిగతా విషయాలు ఎలా ఉన్నా చెత్త అన్న పదాన్ని వాడడం కేటీఆర్ తప్పు అయితే... కేసీఆర్ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం రేవంత్ తప్పు అని చెప్పాలి.అధికారం కొల్పోయిన బాధ కేటీఆర్కు ఉండవచ్చు. అయినా ఆయన కొంత సంయమనం పాటించి ఉంటే... వివాదం ఇక్కడి దాకా వచ్చేది కాదు. అదే టైంలో ఛాన్స్ దోరికింది కదా అని మాజీ సీఎం కేసీఆర్ను బూతులు తిట్టిన మాదిరిగా రేవంత్ మాట్లడడం ఆయన అధికార అహంకారాన్ని సూచిస్తుంది. ఈ పరిణామాలు అన్నిటిని గమనిస్తే రేవంత్, కేటీఆర్ ఇద్దరూ మానసిక రుగ్మతతో ఉన్నారన్న అభిప్రాయం ప్రజలలో కలుగుతుంది. తెలంగాణ సమాజానికి కాని, తెలుగు ప్రజలకు కాని వీరి వ్యాఖ్యలు ఏ మాత్రం అదర్శవంతం కాదు. నేతలు తమను ప్రజలు మెచ్చుకునేలా మాట్లాడాలి కాని... ఆసహ్యించుకునేలా మాట్లడితే వారికే నష్టం. కాకపోతే బీజేపీకి చోటు ఇవ్వకుండా, కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య డైలాగ్ వార్ నడుపుతుండడమే కొసమెరుపు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
రేవంత్ పక్కన కూర్చోవాలని నాకు సోకు లేదు:ఈటల
హైదరాబాద్, సాక్షి: కాంగ్రెస్ పాలనలో మరోసారి మోసపోయామని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారని, ఈ ప్రభుత్వం ప్రజల్ని దండుకోవడం తప్ప పరిపాలన చేయడం లేదని మల్కాజ్గిరి ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ మండిపడ్డారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. .. రేవంత్ రెడ్డి గతంలో చెప్పిన మాటలు అవలోకనం చేసుకోవాలి(రాజకీయ పార్టీలు, నేతలు... ప్రజలను మోసం చేయాలని ఎదురుచూస్తారని గతంలో రేవంత్ చెప్పిన మాటల వీడియోను ఈటల ప్రదర్శించారు). ధర్మం తాత్కాలికంగా ఓడిపోవచ్చు. మాట తప్పిన వాళ్ళను కాలం ఖచ్చితంగా బొంద పెడుతుంది. విశ్వసనీయత లేని పార్టీలను, మోసం చేసినవాళ్లకు ప్రజలే బుద్ధి చెప్తారు అని అన్నారాయన. తెలంగాణ ప్రజలు.. మరోసారి మోసపోయామని చర్చించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అద్దాల మేడ లో కూసొని పేదల గురించి ఆలోచించడం లేదు. రైతు రుణమాఫీకి 6 పేజీల నియమ నిబంధనలు రైతుల పాలిట ఉరితాళ్లు. మూడున్నర ఎకరాల తడి పొలం ఉన్నవారికి రేషన్ కార్డు ఇవ్వరు. ఏడు ఎకరాల మెట్ట భూమి ఉన్నవారికి రేషన్ కార్డు ఉండదు. పదేళ్లుగా కొత్తగా రేషన్ కార్డు ఇవ్వలేదు. ప్రభుత్వ నిర్ణయంతో.. 69 లక్షల మంది రైతులకు నిరాశ ఎదురవుతుంది. రుణ మాఫీ చేస్తానని రేవంత్ అన్ని దేవుళ్ళ మీద ప్రమాణం చేశారు. రూ. 34 వేల కోట్ల రూపాయల రుణ మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన రేవంత్... ఇప్పుడు నిబంధనల పేరిట రైతులకు సున్నం పెడుతున్నారు. ఇదేకాకుండా.. వరి ధాన్యంకు క్వింటాలుకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి కేవలం సన్న వడ్లకే ఇస్తామని చెప్పి రేవంత్ మోసం చేశారు. రైతులను మోసం చేసిన రాజ్యం బాగుపడదు.కాంగ్రెస్ మ్యానిఫెస్టో చిత్తుకాగితంతో సమానం. రైతుల శాపనార్థాలు రేవంత్ రెడ్డికి తప్పవు. అప్పుల పేరిట.. శ్వేత పత్రాల పేరుతో తెలంగాణ ప్రజల కడుపు కొడుతున్నారు. 60 గజాల స్థలంలో ఇల్లు కట్టుకున్న దొమ్మరోళ్ళ, బిచ్చగాళ్ల ఇళ్లను కూలగొడుతున్నారు’’ అని ఈటల అన్నారు. ఇక.. తాజా ప్రొటోకాల్ వివాదంపైనా ఈటల స్పందించారు. కూకట్పల్లి జేఎన్టీయూలో పలు భవనాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన కార్యక్రమానికి ఈటలకు ఆహ్వానం అందలేదు. దీనిపై ఇంతకు ముందే ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ప్రోటోకాల్ విస్మరించారని మండిపడ్డారు. అయితే తాజాగా ఈ వివాదంపై మాట్లాడుతూ.. ‘‘ రేవంత్ రెడ్డి పక్కన కూర్చోవాలని నాకు సోకు లేదు. కానీ, ప్రొటోకాల్ ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధుల్ని ఆహ్వానించాలి. కానీ, అధికారులు అలా చేయలేదు. ప్రభుత్వం పిలవలేదు. రేవంత్ తీరును ప్రజలు రికార్డు చేసుకుంటున్నారు’’ అని అన్నారాయన. -
ఇప్పుడు స్వేచ్ఛగా ఉంది: కేకే ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం ఒకటి చోటుచేసుకుంది. కాంగ్రెస్ కండువా కప్పుకున్న తర్వాతిరోజు సీనియర్ నేత కే కేశవరావు బీఆర్ఎస్ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే ఆ తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలే ఆసక్తికరంగా ఉన్నాయి. కాంగ్రెస్ నా సొంత ఇల్లు. నేను కాంగ్రెస్ మనిషిని. తిరిగి పార్టీలోకి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు ఎంతో స్వేచ్ఛగా కూడా ఉంది. నైతిక విలువలతోనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాను. ఇదే విషయాన్ని రాజ్యసభ ఛైర్మన్ కూడా అదే చెప్పాను అని అన్నారాయన. అలాగే.. తెలంగాణలో కాంగ్రెస్ పాలనపైనా స్పందిస్తూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చిందే కాంగ్రెస్ ఎంపీల పోరాటం వల్లే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చాక పాలన ప్రజాస్వామ్య బద్దంగా ఉంది. ఆరు నెలల్లో ఎవరిని కూడా అంచనా వెయలేం. గత ప్రభుత్వంలో ఉన్నవాళ్లు ఫ్యామిలీ పబ్లిసిటీ చేసేవాళ్లు. కానీ, ఈ ఆరు నెలల్లో తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలనే చూశా అని అన్నారు. కేకేకు ప్రత్యేక సలహాదారు పదవి?రెండేళ్ల పదవీకాలం ఉండగానే కేకే రాజ్యసభకు రాజీనామా చేశారు. దీంతో ఆ సీటు మరొకరికి దక్కే అవకాశం కనిపిస్తోంది. అయితే త్వరలో కేకేకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు పదవి దక్కవచ్చనే ప్రచారం ఒకటి మొదలైంది. -
తెలంగాణ సీఎం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదా?
రాజకీయ నేతలు ఒక్కోసారి తాము మాట్లాడేది తమకే తగులుతుందన్న సంగతి మర్చిపోతుంటారు. ఎదుటివారిపై నోరు పారేసుకోవడంలో ఉత్సాహం చూపే క్రమంలో తమకే నష్టం చేసుకుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు అలాగే ఉన్నాయి. తాను కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నట్లు రేవంత్ అనుకోవడం లేదు. ఇంకా టీడీపీలోనే ఉన్నట్టుగా... ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి అత్యంత విధేయుడినన్నట్లే వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు మాదిరి రాజకీయాలలో రేవంత్ కూడా అదృష్టవంతుడే. దాన్ని ఆయన నిలబెట్టుకుంటే మంచిదే. కానీ అందుకు భిన్నంగా నోటి దురద తీర్చుకుంటున్న వైనం ఆయనకు నష్టం చేస్తుందని చెప్పక తప్పదు.ప్రస్తుతం ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పటికీ, మంత్రులను, పార్టీ నేతలను అజమాయిషీ చేయలేని నిస్సహాయ స్థితిలో పొరుగు రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడి తృప్తి పడుతున్నారనుకోవాలి. ఫిరాయింపు రాజకీయాలపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఆయన ప్రమాణికతను తెలియచేస్తుంది. ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఓడిపోవడంపై రేవంత్ రెడ్డి అతిగా స్పందించారు. ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికు గుణపాఠం చెప్పారని ఆయన అంటున్నారు. ప్రత్యర్ధులపై కక్షకట్టి పాలనను విస్మరించారని, టీడీపీని ఖతం చేయాలని పగబట్టారని, చివరికి సొంత పార్టీనే ఖతం చేసుకున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. మనం చేసిన పాపాలు ఏదో నాడు మనల్నే మింగేస్తాయి అని ఆయన ప్రవచనాలు వల్లించారు. వీటిలో దాదాపు అన్నీ ఆయనకు, ఆయన ప్రస్తుతం నాయకత్వం వహిస్తున్న పార్టీకే వర్తిస్తాయి.అంతకన్నా ముందుగా రేవంత్ ఒక విషయాన్ని గుర్తించాలి. తెలుగుదేశం ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉంది. అయినా రేవంత్ ఆ పార్టీకి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మద్దతు ఇస్తున్నారు. తద్వారా తన నైజాన్ని బయట పెట్టుకుంటున్నారు. అది కరెక్టా? కాదా? అన్నది ఆయన, కాంగ్రెస్ అధిష్టానం తేల్చుకోవాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డికు జనం గుణపాఠం చెప్పారని అంటున్న రేవంత్ గత పదేళ్లలో రెండు ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్ ఓడిపోయింది కదా! అనేదానికి తన విశ్లేషణ చెబుతారా! పలు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయింది కదా! అయినా అదృష్టం కలిసి వచ్చి కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది.అంతెందుకు కొడంగల్ లో 2018లో ఆయనే ఓటమి పాలయ్యారు కదా! అంటే అప్పుడు ఆయనకు ప్రజలు పాఠం చెప్పారని అంగీకరిస్తారా? తను చేసిన పాపం వల్లే అప్పుడు ఓడిపోయానని అంటారా! ఈ విషయాన్ని పక్కనబెడితే మరో సంగతి చూద్దాం. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇరవై మూడు రాష్ట్రాలలో అధికారంలో ఉండేది కదా. ప్రస్తుతం మూడు రాష్ట్రాలకే పరిమితం అయ్యిందంటే ఆ పార్టీ చేసిన పాపాల వల్లే మునిగిపోయిందా! గత మూడు టరమ్ లుగా దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోతోంది కదా! అంటే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తదితరులు చేసిన పాపాలే కాంగ్రెస్ ను మింగేశాయని రేవంత్ చెప్పదలిచారా!అలాగే, ఒకప్పుడు రెండు లోక్ సభ సీట్లతో ఉన్న బీజేపీ నిరాఘాటంగా మూడు దఫాలుగా పాలన చేస్తున్నది కదా! అలాగే ఏపీలో నలభై శాతం ఓట్లు తెచ్చుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి రాకూడదని ఏమైనా ఉందా? 2019లో కేవలం ఇరవై మూడు సీట్లకు పరిమితమైన తెలుగుదేశం పార్టీ ఈసారి జనసేన, బీజేపీలతో ప్రత్యక్షంగాను, కాంగ్రెస్, సీపీఐలతో పరోక్షంగానూ జతకట్టి అధికారంలోకి వచ్చింది కదా! చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం మూడుసార్లు ఓటమి చెందింది. అంటే ఆ మూడుసార్లు పాపాలు మూట కట్టుకోవడం వల్లే టీడీపీ ఓడిపోయిందని రేవంత్ చెబుతున్నారా! టీడీపీని ఖతం చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుకున్నారట.రేవంత్ ఎలా అబద్దం చెబుతున్నారో చూడండి. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వైఎస్సార్సీపీని ఖతం చేయాలని ప్రయత్నించడం పగ పట్టినట్లు కాదట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తను అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేయకపోయినా ఖతం చేసినట్లట. ఆ మాటకు వస్తే తెలంగాణలో పదిహేను మంది ఎమ్మెల్యేలు ఉన్న తెలుగుదేశం పార్టీ ఎందుకు ఖతం అయింది? ఓటుకు నోటు కేసు ద్వారా చంద్రబాబుతోపాటు రేవంత్ కు కూడా ఇందులో భాగస్వామ్యం ఉన్నట్లే కదా! టీడీపీని ఖతం చేసిన తర్వాత రేవంత్ కాంగ్రెస్ లో చేరిపోయారే!. ఇంకో విషయం చూద్దాం. రేవంత్ రెడ్డి సొంత ప్రాంతం అయిన మహబూబ్ నగర్ లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోయింది. అక్కడ బీజేపీ గెలిచింది. అలాగే 2019లో తాను ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరిలో సైతం ఈసారి బీజేపీ గెలిచింది. దీనికి నైతికంగా రేవంత్ బాధ్యత వహించారా? ఆయన ఏ పాపం చేస్తే ఈ రెండుచోట్ల ఇలా జరిగింది. కొడంగల్తోపాటు కామారెడ్డిలో శాసనసభకు పోటీచేసిన రేవంత్ కొడంగల్ లో గెలిచినా, కామారెడ్డిలో ఓడిపోవడమే కాకుండా మూడోస్థానానికే ఎందుకు పరిమితం అయ్యారు? ముఖ్యమంత్రి కాండిడేట్ కు అది అవమానం కాదా! తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్ ను ఖతం చేయడానికి సర్వశక్తులు ఒడ్డుతున్న రేవంత్ ఏపీ రాజకీయాలలో తలదూర్చి నీతులు చెబుతున్నారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాసరెడ్డి, కాలె యాదయ్య.. ఇలా ఎవరు దొరికితే వారిని కాంగ్రెస్ లోకి లాక్కొని ముఖ్యమంత్రి హోదాలో స్థిరపడాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు! గతంలో ఇదే రేవంత్ ఫిరాయింపులు చేసేవారిని రాళ్లతో కొట్టాలని అన్నారు కదా? ఇప్పుడేమో ప్రభుత్వ సుస్థిరతకు ఇతర పార్టీల నుంచి చేరికలు అవసరమని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఫిరాయింపు రాజకీయాలు చేసిన కేసీఆర్ ముక్కు నేలకు రాయాలని, క్షమాపణలు చెప్పాలని నీతి వాక్యాలు చెప్పారు. బాగానే ఉంది. మరి అదే పని ఇప్పుడు ఆయన కూడా చేస్తున్నారే. భవిష్యత్తులో ఒకవేళ కాంగ్రెస్ అధికారం కోల్పోతే అప్పుడు ఈయన ముక్కు నేలకు రాస్తారా! రేవంత్ ముఖ్యమంత్రి అయినా, ఏ మంత్రిపైన అయినా అజమాయిషీతో ఉండగలుగుతున్నారా!జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కాంగ్రెస్ లోకి తెచ్చినప్పుడు పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఇచ్చిన జెర్క్ కు రేవంత్ ఎందుకు భయపడ్డారు. ఆయన పార్టీ నుంచి పోతే పోయారులే అని అనుకుని ఊరుకోకుండా తప్పు ఎందుకు ఒప్పుకున్నారు! ప్రత్యర్ధులపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి కక్ష కట్టారని రేవంత్ అంటున్నారు. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై కేసులు వస్తే అవన్ని సక్రమం, తన గురువు అయిన చంద్రబాబుపై అవినీతి కేసులు వస్తే అవన్ని కక్ష అని ఆయన చెబుతున్నారన్నమాట.ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాలపై జ్యుడిషియల్ కమిషన్ లు ఎందుకు వేశారు? అవి కక్ష కిందకు రావా! ఆయా కేసుల్లో తమ నేతలను ఇరికించడానికి ప్రభుత్వం యత్నిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. రేవంత్ కూడా తన గురువు చంద్రబాబు స్టైల్ లోనే మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. చంద్రబాబు తాను ఏమి చేసినా, ఏమి మాట్లాడినా అదంతా కరెక్టు అని, అదే పని తన ప్రత్యర్ధులు చేస్తే, అవే మాటలు వారు మాట్లాడితే మాత్రం పెద్ద ఎత్తున దూషణలకు దిగుతుంటారు.సరిగ్గా అదే తరహాలో రేవంత్ నడుస్తున్నట్లు అనిపిస్తుంది. చంద్రబాబు మాదిరే తాను కూడా ఎన్ని మాటలు మార్చినా ప్రజలను ఏమార్చవచ్చని అనుకుంటే అది పొరపాటు. ఏపీ రాజకీయాలలో వేలు పెట్టి చంద్రబాబుకు మేలు చేయాలన్న ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డిను దూషించడం ద్వారా రేవంత్ రెడ్డి తనకు తానే నష్టం చేసుకున్నవారు అవుతారు. ఆ సంగతి అర్ధం అవడానికి రేవంత్ కు మరికొంత కాలం పట్టవచ్చు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ప్రణవ్ సవాల్ నేపథ్యంలో.. చెల్పూర్లో టెన్షన్.. టెన్షన్!
కరీంనగర్: మంత్రి పొన్నం ప్రభాకర్పై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించాలంటూ, అందులో నిజం ఉంటే హుజూరాబాద్ మండలం చెల్పూర్ హనుమాన్ ఆలయంలో ప్రమాణం చేయాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితెల ప్రణవ్ విసిరిన సవాల్ మంగళవారం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.ప్రణవ్, పాడి కౌశిక్రెడ్డి అక్కడికి చేరుకుంటే పరిస్థితి ఏంటనే ఉత్కంఠ రోజంతా నెలకొంది. ప్రణవ్ పిలుపుమేరకు మంగళవారం ఉదయమే చెల్పూర్కు కాంగ్రెస్ శ్రేణులు భారీగా చేరుకున్నారు. ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి మోసం చేశారంటూ ఫ్లెక్సీ ఏర్పా టు చేయడంతో బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరు కుని నిరసనకు దిగారు. ఆలయం వద్ద బీఆర్ఎస్– కాంగ్రెస్ శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఏసీపీ శ్రీనివాస్జి ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.ఇరువర్గాలతో మాట్లాడగా.. శాంతించకపోవడంతో లాఠీచార్జ్ చేశారు. కాంగ్రెస్ నాయకుడు బుర్రకుమార్ గౌడ్కు గాయాలయ్యాయి. ఇరువర్గాలను పోలీసులు జమ్మికుంట, సమీప పోలీసు స్టేషన్లకు తరలించారు. కాగా.. వొడితల ప్రణవ్బాబును సింగాపూర్లో, ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిని వీణవంకలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.చెల్పూర్ లో ఏసీపీ శ్రీనివాస్ జితో వాగ్వాదానికి దిగుతున్న కాంగ్రెస్ నాయకులుతడి బట్టలతో ఎమ్మెల్యే ప్రమాణంవొడితెల ప్రణవ్ చేసిన సవాల్ను స్వీకరించేందుకు సిద్ధమైన ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి కరీంనగర్ సీపీకి ఫోన్చేసి, తనకు అనుమతి ఇవ్వాలంటూ కోరగా నిరాకరించారు. ఎమ్మెల్యే ఇంటివద్ద జమ్మికుంట రూరల్ సీఐ కిశోర్, సీఐ సృజన్రెడ్డి సిబ్బందితో మోహరించారు. పోలీసుల అనుమతి రాకపోవడంతో ఎమ్మెల్యే తడి బట్టలతో దేవుడి మీద ప్రమాణం చేసి తను మంత్రిపై చేసిన ఆరోపణలు నిజమంటూ పేర్కొన్నారు. ప్రణవ్బాబు చిన్న పిల్లాడని పేర్కొన్నారు. పోలీసులపై కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడ్డారని, ఈ ఘటనపై కేసులు నమోదు చేయాలని డీజీపీని కలుస్తానని పేర్కొన్నారు.రాజకీయ ఉనికి కోసమే..రాజకీయ ఉనికి కోసమే ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అబద్ధపు ప్రమాణాలు చేస్తున్నారని వొడితెల ప్రణవ్బాబు అన్నారు. ఎన్నికల సమయంలో కుటుంబా న్ని అడ్డుపెట్టుకొని గెలిచిన వ్యక్తి మంత్రి పొన్నం ప్రభాకర్పై ఆరోపణలు చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉద్యోగాల పేరుతో డబ్బులు తీసుకొని మోసం చేసిన వ్యక్తి కౌశిక్రెడ్డి అన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే ఊరుకోమన్నారు.ఉద్యోగాల పేరిట కౌశిక్రెడ్డి మోసం చేశారుకోర్టులో ఉద్యోగాలు పెట్టిస్తానని చెప్పి డబ్బులు తీసుకొని మోసం చేసిన వ్యక్తి ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అంటూ చెల్పూర్ మాజీ సర్పంచ్ నేరేళ్ల మహేందర్గౌడ్ గ్రామంలోని హనుమాన్ ఆలయంలో ప్రమాణం చేశారు. నిరుద్యోగుల నుంచి డబ్బులు తీసుకొని మోసం చేసిన కౌశిక్రెడ్డి ఈ విషయమై సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. కేవలం ఉనికి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి ఆరోపణలు చేస్తున్నట్లు తెలిపారు. -
జీవన్రెడ్డి..తగ్గేదేలే!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: జగిత్యాల జిల్లాలో రగిలిన రాజకీయ చిచ్చు ఇంకా చల్లారడం లేదు. తనను సంప్రదించకుండా చిరకాల ప్రత్యర్థి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్కుమార్ను కాంగ్రెస్లో చేర్చుకున్నరంటూ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి రాజీనామాకు సిద్ధపడిన విషయం విధితమే. మంగళవారం అధిష్టాన పెద్దలను కలిసేందుకు హైదరాబాద్ వెళ్లినా ఆయన తీరులో ఏమాత్రం మార్పు లేదు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు, ప్రభుత్వ విప్లు అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఆది శ్రీనివాస్, పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు విజయరమణారావు, ఠాకూర్ మక్కాన్ సింగ్ జీవన్రెడ్డికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా.. ఫలితం కనిపించలేదు. కార్యకర్తలతో మాట్లాడాక బుధవారం నిర్ణయం తీసుకుంటారని, అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద భవి ష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని ఆయన అనుచరులు ‘సాక్షి’కి తెలిపారు. జీవన్రెడ్డి ప్రకటనపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.వెనక్కి తగ్గొద్దని ఒత్తిడి..ఎమ్మెల్సీ జీవన్రెడ్డి హైదరాబాద్ వెళ్లారని తెలుసుకున్న కాంగ్రెస్ జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అక్కడి ఆయన నివాసానికి తరలివెళ్లారు. నాయకుడు ప్రేమ్సాగర్రావు, మున్సిపల్ మాజీ చైర్మన్లు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులంతా జీవన్రెడ్డి ఇంటికి క్యూ కడుతున్నారు. పార్టీలో ఎమ్మెల్యే సంజయ్కుమార్ చేరికపై సరైన వివరణ ఇచ్చేదాకా వెనక్కి తగ్గొద్దని ఎమ్మెల్సీపై ఒత్తిడి పెంచుతున్నారు. అదే సమయంలో తన పదవికి రాజీనామా చేసే విషయంలో తగ్గేదే లే అన్నట్లుగా ఆయన ఉన్నారని విశ్వసనీయ సమాచారం.నాయకులు, కార్యకర్తల ఆవేదన..ఎమ్మెల్యే సంజయ్కుమార్ కాంగ్రెస్లో చేరినప్పటికీ ఎమ్మెల్సీ జీవన్రెడ్డికే ఆ పార్టీ నాయకులు మద్దతు పలుకుతున్నారు. మరోవైపు సంజయ్కుమార్ బీఆర్ఎస్ను వీడటంపై ఆ పార్టీ నాయకుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ధర్నాలు, రాస్తారోకోలు చేపడుతున్నారు. పదేళ్లపాటు అధికారంలో లేనప్పటికీ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు జీవన్రెడ్డి వెంటే ఉండి, పోరాటం చేశారు. అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే సంజయ్కుమార్ కాంగ్రెస్లో చేరడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు పోరాటం చేసిన వ్యక్తితో కలిసి పని చేయలేమని బహిరంగంగానే చెబుతున్నారు.ఎక్కడ చూసినా ఇదే చర్చ..జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్కుమార్ కాంగ్రెస్లో చేరడం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హాట్టాపిక్గా మారింది. సోమవారం నుంచి హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు, కూడళ్ల వద్ద ఎక్కడ చూసినా ఈ విషయంపైనే చర్చ జరుగుతోంది. జీవన్రెడ్డి పయనమెటు? రాజీనామా చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? సంజయ్ చేరికతో ఎలాంటి మార్పులు జరుగుతాయన్న అంశాలపై చర్చించుకుంటున్నారు. -
కాంగ్రెస్, బీఆర్ఎస్లకు గుణపాఠం చెప్పాలి.. : బండి సంజయ్
కరీంనగర్: మోసపూరితమైన వాగ్ధానాలతో మరో సారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చె ప్పాలని బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ సూచించారు. శుక్రవారం గన్నేరువరంలో స్ట్రీట్కార్నర్ మీటింగ్లో పాల్గొని ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. రాముడి పేరుతో రాజకీయాలంటూ ఇరుపార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. అయోధ్యలో రామాలయం నిర్మించడం తప్పా అని ప్రశ్నించారు.మైనార్టీ ఓట్లు పొందడానికి ఇరు పార్టీలు ఆరాటపడుతున్నాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలే నరేంద్ర మోదీకి పెద్ద కుటుంబమని, ఆ కుటుంబం నుంచి ఎవరిని దూరం చేయలేరని అన్నారు. ఆరు గ్యారంటీల అమలులో సీఎం రేవంత్రెడ్డి పూర్తిగా విఫలం అయ్యారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసిందని పదేపదే కాంగ్రెస్, బీఆర్ఎస్లు ప్రశ్నిస్తున్నాయని, కేంద్ర నిధులతో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు కనబడడం లేదా అని ప్రశ్నించారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 120రోజులు కావస్తున్నా ఇంతవరకు రైతుల రుణ మాఫీ ఎందుకు చేయలేదని, మహిళలకు రూ.2500 ఎందుకు ఇవ్వడం లేదన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాన్ని బీజేపీ ప్రశ్నిస్తేనే, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారని, ఇప్పుడు మళ్లీ మోసపోవద్దన్నారు. వివిధ పార్టీలకు చెందినవారు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నగునూరి శంకర్, జిల్లా ఉపాధ్యక్షుడు సాయిని మల్లేశం, కోమల ఆంజనేయులు, నియోజకవర్గ కన్వీనర్ ముత్యాల జగన్రెడ్డి, మాజీ సర్పంచ్ ఏలేటి చంద్రారెడ్డి, సొల్లు అజయ్వర్మ, అనిల్రెడ్డి, తిరుపతి పాల్గొన్నారు. -
వరంగల్ జనసభలో.. మోదీ నినాదం!
సాక్షి, వరంగల్: వరంగల్ నగరం కాషాయ జెండాలతో రెపరెపలాడింది. వరంగల్, మహబూబాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థులు అరూరి రమేశ్, సీతారాంనాయక్ను గెలిపించాలంటూ గ్రేటర్ వరంగల్ పరిధిలోని మామునూరు తిమ్మాపూర్ క్రాస్రోడ్డు లక్ష్మీపురం మైదానంలో బుధవారం నిర్వహించిన ఓరుగల్లు జనసభలో ప్రధాని నమో నినాదం మార్మోగింది. సభలో ఎక్కడ చూసినా నమో బొమ్మలతో కూడిన ప్లకార్డులు కనిపించాయి. భారీ ఆకృతి లో ఉన్న ఫ్లెక్సీలు సభా ప్రాంగణంలో ప్రజలు పట్టుకొని ఉండడం చూసి మోదీ ఫిదా అయ్యారు.ఓరుగల్లు అంటే అభిమానమంటూ..‘నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు.. నా అదృష్టం ఏమిటంటే నేను పనిచేసినటువంటి అహ్మదాబాద్ అధిష్టాత్మి దేవత కూడా భద్రకాళి. ఆ భద్రకాళి అమ్మవారికి, ఆమె చరణాలకు నేను ప్రణామం చేస్తున్నా. ఇక్కడినుంచి కొంచెం దూరంలో ఉన్న రామప్ప మందిరానికి కూడా నేను నమస్కారాలు చేస్తున్నా. ఈ ప్రాంతం కాకతీయుల విజయ గౌరవ పతాకకు ప్రతీక.మూడో దశ పోలింగ్ను కూడా పూర్తి చేసుకొని ఇక్కడకు వచ్చి మీ ఆశీర్వాదం తీసుకునేటువంటి అదృష్టాన్ని పొందా’ అంటూ మోదీ ప్రసంగం ప్రారంభించడంతో సభికులు పెద్దపెట్టున మోదీ.. మోదీ అంటూ నినాదాలు చేశారు. ‘నా దృష్టిలో వరంగల్ చాలా ముఖ్యమైనటువంటి చోటు. 40 సంవత్సరాల క్రితం బీజేపీకి ఇద్దరంటే ఇద్దరు ఎంపీలు ఉన్నప్పు డు అందులో ఒకరు మన హనుమకొండ నుంచి దివంగత నేత జంగారెడ్డి. బీజేపీ మీ అభిమానాన్ని, ఆశీర్వాదాన్ని, స్నేహాన్ని ఎప్పటికీ మరిచిపోలేదు.మాకు ఎప్పుడు కష్టం వచ్చినా వరంగల్ ప్రజానీకం వెన్నంటి నిలిచారు. అందుకే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇనుపగుప్పిటనుంచి వరంగల్ను బయటకు తీసేందుకు బీజేపీ సర్వప్రయత్నాలను చేయబోతోంది’ అని వ్యాఖ్యలు చేశారు. ‘కేంద్రం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉంది. వరంగల్లో మేం టెక్స్టైల్ పార్కు ఏర్పాటుచేశాం. కానీ, పార్కు నిర్వహణ విషయంలో సమస్యలు వచ్చేలా ప్రయత్నిస్తున్నారు.తెలంగాణకు నష్టం చేస్తున్నటువంటి, ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి వాళ్లకు జవాబు చెప్పాల్సిన సమయం వచ్చింది. మీ అందరిని కోరుతున్నాను. వరంగల్ నుంచి అరూరి రమేశ్, మహబూబాబాద్ నుంచి సీతారాంనాయక్ను లోక్సభకు పంపించండి. మోదీకి బలం చేకూర్చండి అంటూ సభికులను ఆయన అభ్యర్థించారు. ఇంకోవైపు కళాకా రులు నిర్వహించిన కళానృత్యాలు అందరినీ అలరించా యి. మోదీ పాటలకు సభకు హాజరైన కొందరు స్టెప్పులేయడం కనిపించింది.వేదికపై అగ్రనేతలు.. అభ్యర్థులు..వేదికపై మోదీకి ఒకవైపు మహబూబాబాద్, వరంగల్ ఎంపీ అభ్యర్థులు సీతారాంనాయక్, అరూరి రమేశ్ ప్రజలకు నమస్కరిస్తూ కనిపించారు. మురళీ ధర్గౌడ్, గుజ్జుల ప్రేమేందర్రెడ్డి అధ్యక్షతన సభ జరగగా. మోదీ ప్రసంగాన్ని హైదరాబాద్కు చెంది న రాక సుధాకర్ అనువదించారు.ప్రధాన వేదికపై నాయకులు పొంగులేటి సుధాకర్రెడ్డి, ఎర్రబెల్లి ప్రదీప్రావు, చందుపట్ల కీర్తిరెడ్డి, పార్టీ వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, జనగామ జిల్లాల అధ్యక్షులు గంట రవికుమార్, రావు పద్మ, నిశిధర్రెడ్డి, దశమంతరెడ్డితో పాటు నాయకులు కుమారస్వామి, మార్తినేని ధర్మారావు, గరికపాటి మోహన్రావు, కొండేటి శ్రీధర్, డాక్టర్ రాజేశ్వర్రావు, స్వాతిరెడ్డి, రావుల కోమల, జలగం అనిత, డాక్టర్ కాళీప్రసాద్, డాక్టర్ విజయరామారావు, అల్లం నాగరాజు, జలగం రంజిత్రావు, మాదిరెడ్డి దేవేందర్రెడ్డి, మల్లాడి తిరుపతిరెడ్డి కూర్చున్నారు. -
గ్యారంటీలు అమలైతే ఓట్లడగం! : మాజీ మంత్రి హరీశ్రావు
మెదక్: ఆరు గ్యారంటీలు అమలయ్యే గ్రామాల్లో మేం ఓట్ల అడగమని, అమలు కాని గ్రామాల్లో మీరు ఓట్లు అడగొద్దని మాజీ మంత్రి హరీశ్రావు సవాల్ విసిరారు. సోమవారం నర్సాపూర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. అమలు కాని గ్యారెంటీలపై మాట్లాడిన రాహుల్గాం«దీకి, కేసీఆర్ను బూతులు తిడుతున్న రేవంత్రెడ్డికి ఓట్లతో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీలు అబద్ధాలకు పుట్టిన కవలలని విమర్శించారు.ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ రిజర్వేషన్లు, బీజేపీ మతం పేరుతో ఓటర్లను రెచ్చగొడుతూ గ్లోబల్ ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. సీఎం రేవంత్రెడ్డి జిల్లాలను ఎత్తివేస్తానంటున్నారని, దీనిపై ప్రజలు ఆలోచించాలన్నారు. పదేళ్ల బీజేపీ పాలన కార్పొరేట్లకు దోచిపెట్టిందన్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు ఎన్నికలకు ముందు ఫేక్ వీడియోలు విడుదల చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ఆలోచనతో ఉన్నారని చెప్పారు.అనంతరం ఎమ్మెల్యే సునీతారెడ్డి మా ట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదన్నారు. హత్నూర మండలం రెడ్డిపాలెంలో పలువురికి బలవంతంగా కాంగ్రెస్ కండువాలు కప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 8న నర్సాపూర్లో నిర్వహించే రోడ్షోలో కేసీఆర్ పాల్గొంటారని, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి, నాయకులు సింగయ్యపల్లి గోపి, చంద్రగౌడ్, మన్సూర్, మున్సిపల్ చైర్మన్ అశోక్గౌడ్, పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, సత్యంగౌడ్, నయీమ్, ఆంజనేయులుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.ఇవి చదవండి: కాంగ్రెస్, బీఆర్ఎస్ల పోటీ.. రెండో స్థానం కోసమే! : కిషన్రెడ్డి -
అతని మృతికి కడియం శ్రీహరే కారణం : మాజీ ఎమ్మెల్యే రాజయ్య
హనమకొండ: జనగామ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు, చిల్పూరు జెడ్పీటీసీ పాగాల సంపత్రెడ్డి మృతికి స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరే కారణమని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం శివునిపల్లిలో సోమవారం జరిగిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ కడియంపై పలు ఆరోపణలు చేశారు.2023 అసెంబ్లీ ఎన్నికల్లో జెడ్పీ చైర్మన్గా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సంపత్రెడ్డి ఎంతో కృషి చేశారని, బీఆర్ఎస్ విజయోత్సవ సభలో కడియం ఒక్కొక్కరికి బూత్ల వారీగా నాయకులను సభలో నిలబెట్టి మీ బూత్లో ఎన్ని ఓట్లు పోలయ్యాయి అంటూ అవమానపర్చారన్నారు. అదే క్రమంలో పాగాల సంపత్రెడ్డి గ్రామం రాజవరం గురించి మాట్లాడుతూ ‘నువ్వు చిల్పూరు జెడ్పీటీసీగా, జెడ్పీ చైర్మన్గా ఉన్నావు, నీ గ్రామంలోనే ఓట్లు తక్కువ వచ్చాయి’ అని అవమానకరంగా మాట్లాడాడన్నారు.సంపత్రెడ్డి మనోవేదనతో సాయంత్రం మృతిచెందాడని, ఆయన చావుకు ముమ్మాటికీ కడియం కారణమన్నారు. చివరకు జనగామలో నిర్వహించిన సంతాపసభలో సైతం సంపత్రెడ్డి గురించి కాకుండా ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని రాజకీయాలు మాట్లాడిన చరిత్ర కడియం శ్రీహరిది అన్నారు. -
అభివృద్ధి కాంక్షతోనే.. పార్టీ మారా! : కడియం శ్రీహరి
హనమకొండ: స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే కాంక్షతోనే పార్టీ మారానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం గ్రేటర్ వరంగల్ 46వ డివిజన్ రాంపూర్లో ఎంపీ అభ్యర్థి కడియం కావ్యతో కలిసి ఆయన కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం భ్రష్టు పట్టించారన్నారు.ఇతర పార్టీల ద్వారా గెలిచిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించకుండా బీఆర్ఎస్లోకి చేర్చుకున్న కేసీఆర్ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవాలన్నారు. కల్వకుంట్ల కుటుంబం అవినీతికి, ఫోన్ ట్యాపింగ్, భూకబ్జాలకు పాల్పడిందని ఆరోపించారు. ముప్పై ఏళ్లుగా తనకు రాజకీయ జన్మనిచ్చి ఆదరించిన తీరుగానే తన బిడ్డ డాక్టర్ కడియం కావ్యను నిండు మనస్సుతో ఆశీర్వదించి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.అనంతరం ఎంపీ అభ్యర్థి కడియం కావ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాటల ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వమన్నారు. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఉద్యోగాలు ఇస్తామని కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలు యువతను మోసం చేశాయన్నారు. వర్ధన్నపేటలో భూములను కబ్జా చేసిన అరూరి రమేశ్ను నియోజకవర్గ ప్రజలు చెంప చెల్లుమనిపించారని, పార్లమెంట్ ఎన్నికల్లోను తగిన బుద్ధి చెప్పాలన్నారు. నాయకులు హన్మంతరావు, రాజు, రవి, రమేష్, రాజేందర్, కార్యకర్తలు పాల్గొన్నారు. -
వాయిస్ కాల్స్తో ఎలక్షన్ క్యాంపెయిన్..!
హనమకొండ: మొబైల్.. ప్రస్తుతం ప్రతీ ఒక్కరి దైనందిన జీవితంలో భాగస్వామ్యమైంది. ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి మళ్లీ నిద్రించే వరకు చేతిలో అతుక్కుపోవాల్సిందే. టీ తాగుతున్నా.. భోజనం చేస్తున్నా.. ఇతర ఏ పని చేస్తున్న ఫోన్ చూడకుండా క్షణ కాలం ఉండలేని పరిస్థితి ఉంది. మానవ జీవితంలో ఇంతలా ఇమిడిపోయిన ఫోన్ అవసరాన్ని రాజకీయ నేతలు చక్కగా క్యాష్ చేసుకుంటున్నారు.ఒకవైపు సభలు, సమావేశాలు నిర్వహిస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో ప్రచారం పరుగులెత్తిస్తున్నారు. ఇందులో భాగంగా అభ్యర్థులు గతంలోకంటే ఈసారి ప్రచారానికి ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని విని యోగించుకుంటున్నారు. వాయిస్ మెయిల్ కాల్స్ ద్వారానే కాకుండా, సోషల్ సైట్స్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ (ఎక్స్)ను ఉపయోగించుకుంటున్నారు.‘తాము ఫలానా పార్టీ తరఫున పోటీచేస్తున్నాం.. మమ్మల్ని గెలిపిస్తే మన ప్రాంతంలో నెలకొన్న స మస్యలు పరిష్కరిస్తాం. అందుకోసం మమ్మల్నే గెలి పించాలంటూ’ కోరుతున్నారు. మరికొందరు ఓ అ డుగు ముందుకేసి తమ అభ్యర్థిని గెలిపిస్తే మీ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తాడని తెలుపుతున్నారు.వాయిస్ మెయిల్ కాల్స్తో ప్రచారంరెండు రోజుల నుంచి వాయిస్ మెయిల్ కాల్స్, ఫోన్ కాల్స్ ద్వారా అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. ప్రస్తుతం జరుగనున్న ఎన్నికల్లో యువత ఓట్లే కీలకం కావడంతో వారిని ఆకట్టుకోవడానికి ఫేస్బు క్, ట్విట్టర్ను వినియోగించుకుంటుండడం గమనార్హం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందుతున్న తరుణంలో ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ అందుబాటులోకి రావడంతో స్మార్ట్ఫోన్ల ద్వారా యువకులు అధికశాతం తమ అరచేతిలోనే ప్రపంచాన్ని చూస్తున్నారు.దీనికి తోడు అభ్యర్థులు ఫేస్బుక్, ట్వి ట్టర్ ద్వారా చాటింగ్ చేస్తున్నారు. యువత కూడా వీటి ద్వారా తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా వెలిబుచ్చుతున్నారు. పత్రికలు, టెలివిజన్ తరువాత ఇంటర్నెట్పైనే దృష్టి సారిస్తుండడంతో యువతను ఆకట్టుకోవడానికి రాజకీయ నేతలు తమపార్టీల ద్వారా చేపట్టే కార్యక్రమాలు, ప్రజల కోసం చేసే కార్యక్రమాల సందేశాలను ఫేస్బుక్, ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు.లోక్సభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్తేదీ సమీపిస్తుండడంతో ఫేస్ బుక్, ట్విట్టర్లో రాజకీయ పార్టీల చిత్రాలే అధికంగా కనిపిస్తున్నాయి. వరంగల్ లోక్సభ.. రాజకీయంగా చైతన్యం కలిగిన నియోజకవర్గమైనప్పటికీ మెజార్టీ ఓటర్లు సంప్రదాయ ఓటర్లే ఉంటారు. అయితే ఎన్నికల సంఘం నూతన ఓటర్ల నమో దుపై విస్తృతంగా ప్రచారం చేయడంతో ఈ మధ్య కాలంలో దాదాపు 24 వేల మంది కొత్త ఓటర్లుగా నమోదు చేయించుకున్నారు.దీంతో ఈసారి జరుగనున్న ఎన్నికల్లో యువత పాత్ర కీలకంగా కావడంతో లోక్సభకు పోటీ చేస్తున్న అభ్యర్థుల అనుచరులు ఓటర్లను ఆకట్టుకోవడానికి వాయిస్మెయిల్స్, ఫోన్కాల్స్, ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ను ఉపయోగించుకుంటున్నారని చెప్పొచ్చు. కాగా, ఈవాయిస్ కాల్స్తో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. -
No Headline
ఇంటెలిజెన్స్ నివేదికలు.. స్టేట్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ శాఖలు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పరిస్థితులపై రిపోర్టు తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ రిపోర్టులు ప్రస్తుతం సంచలనం కలిగిస్తున్నాయన్న ప్రచారం సాగుతోంది. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్లు ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్పై ఉన్న పరిస్థితిపై నివేదిక ఇవ్వడంతో వాటి బలాబలాలు, బలహీనతలపై తీవ్ర చర్చ సాగుతోంది. ప్రధానంగా ముఖ్యనేతలు ఈ సర్వేల రిపోర్టులతో ఉరుకులు పరుగులు పెడుతున్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో లోపాలను సరిదిద్దే విషయంలో చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. అంతలోపే వాటిని సరిదిద్దుకోగలుగుతామా.. లేదా అన్న మీమాంస వారిని వెంటాడుతుంది. మొత్తంగా పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ తేదీకి ముందు ఈ అంశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.సాక్షి,ఆదిలాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజల ఆదరణ ఎంత శాతం ఉంది.. తమకెంత ఉంది.. తమ అభ్యర్థిని, ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను జనం ఏ మేరకు ఆదరిస్తున్నారు.. సెగ్మెంట్ పరిధి లోని ఏయే నియోజకవర్గాల్లో బలంగా ఉన్నాం.. ప్రత్యర్థులు ఎక్కడ గట్టిగా ఉన్నారు.. ఈ పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లాలి.. లోటుపాట్లను ఎలా సరిదిద్దుకోవాలని ఆయా పార్టీల నుంచి సర్వే చేస్తు న్న కమిటీలు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా రిపోర్టు అందించారు. ఆదిలాబాద్ పార్లమెంట్కు సంబంధించి పార్టీల పరంగా ఆయా కమిటీలు ఇప్పటికే అధిష్టానాలకు నివేదికలు ఇచ్చా యి. ప్రచారానికి గడువు సమీపిస్తున్న తరుణంలో మిగిలిన రోజుల్లో ఆ లోపాలు అధిగమించాలని అక్కడి నుంచి ఆదేశాలు అందాయి. దీంతో అభ్యర్థులతో పాటు పార్టీ ఇన్చార్జీలు, ముఖ్య నేతలు ఇందులో తలమునకలయ్యారు. ప్రస్తుతం సర్వేల అలజడి కొనసాగుతుంది. పార్టీ కమిటీల రిపోర్ట్.. బీజేపీ పరంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సునిల్ బన్సల్ కమిటీ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిస్థితిపై కూడా ఇప్పటికీ ఒకట్రెండు సార్లు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. దాని ఆధారంగా లోటుపాట్లు సరిదిద్దుకునే చర్యలు ఇప్పటికే చేపడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ ఆధ్వర్యంలో సునిల్ కనుగోలు కమిటీ నివేదికను తయారు చేసి ఇచ్చారు. బీఆర్ఎస్ నుంచి సివిక్స్ పోల్స్ అనాలసిస్ (సీ–ప్యాక్)కమిటీ రిపోర్టు ఇచ్చింది. ప్రధానంగా అందులో నియోజకవర్గం వారీగా పరిస్థితులను వివరించినట్లు సమాచారం. ఏయే నియోజకవర్గాల్లో పార్టీ, అభ్యర్థి బలంగా ఉన్నారు.. ఎక్కడ పార్టీ, అభ్యర్థి బలహీనంగా ఉన్నారు.. అక్క డ నష్ట నివారణకు చర్యలు చేపట్టాలి.. ఇందుకోసం ఆ నియోజకవర్గాల్లో ప్రత్యేక సమావేశాల నిర్వహణ, ఇన్చార్జీలు పూర్తిస్థాయిలో దృష్టి సారించి ఆ లోటుపాట్లను అధిగమించేలా ఆయా కమిటీలు ఇచ్చిన నివేదికల ఆధారంగా పార్టీల్లో చర్యలు చేపడుతున్నారు. -
మరోసారి పీఠమెక్కేదెవరో..?
సాక్షి, మహబూబాబాద్: మానుకోట పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి పోటీలో ఉన్న ముగ్గురు అభ్యర్థులు గతంలో ఎంపీగా గెలిచిన వారే. ఇందులో ఏ ఇద్దరిని చూసినా ఒకే పార్టీలో పనిచేసిన పరిచయాలు ఉన్నాయి. గతంలో పనిచేసిన అనుభవానికి.. ప్రస్తుత పార్టీల చరిష్మాతో ఎవరికి వారుగా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ముగ్గురు సమర్థులే కావడంతో.. ఎంపీ పీఠం మళ్లీ ఎవరికి దక్కుతుందో అనేది పార్లమెంట్ పరిధిలో చర్చగా మారింది.ముగ్గురు ముగ్గురే..2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసిన బలరాంనాయక్ సమీప అభ్యర్థి కుంజ శ్రీనివాసరావుపై 68,957ఓట్ల మెజార్టీతో గెలిచి పార్లమెంట్లో అడుగు పెట్టారు. కేంద్ర కేబినెట్లో సహాయ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన సీతారాంనాయక్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాంనాయక్పై 34,992 ఓట్ల మెజార్టీతో గెలిచారు.ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మాలోత్ కవిత బలరాంనాయక్పై 1,46,663ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు అదే పార్టీ నుంచి మరోసారి బరిలో నిలిచారు. ఇందులో కవిత, సీతారాంనాయక్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందగా.. వారిద్దరి చేతిలో బలరాంనాయక్ ఓటమిపాలవ్వడం గమనార్హం.ఒకరి ఓట్లకు మరొకరు గాలం..మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు పాత వారే కావడంతో.. వారు పోటీ చేస్తున్న పార్టీతో పాటు.. ఇతర పార్టీల్లోని ఓటర్లకు గాల వేస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్న కవిత.. 2009లో కాంగ్రెస్ నుంచి మహబూబాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేసి బీఆర్ఎస్ నాయకుడు శంకర్నాయక్ చేతిలో ఓడిపోయారు. తర్వాత కవిత బీఆర్ఎస్లో చేరి ఎంపీగా గెలిచారు.కాగా మాజీ ఎమ్మెల్యే శంకర్నాయక్కు కవితకు మధ్య వైరం కొనసాగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే కవిత వర్గీయుల కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా ప్రస్తుతం ఆమె పోటీలో ఉండడంతో కాంగ్రెస్ ఓట్లను చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేసిన రెడ్యానాయక్కు కవిత కూతురు కావడం.. ఆ నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులతో ఉన్న పాత పరిచయాలు కూడా ఇప్పుడు కవితకు ఓటు బ్యాంకుగా మారే అవకాశం లేకపోలేదు.అదేవిధంగా ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న సీతారాంనాయక్ తెలంగాణ ఉద్యమకారుడిగా.. గిరిజన సామాజిక వర్గం నుంచి మేధావిగా గుర్తింపు పొందారు. ఈమేరకు 2014లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. కాగా ఎన్నికల వరకు బీఆర్ఎస్లో ఉన్న సీతారాంనాయక్కు మానుకోట పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిచయాలు ఉన్నారు. ఇప్పుడు ఆయన వారి వద్దకు వెళ్లి మద్దతు ఇవ్వాలని కోరుతూ.. బీఆర్ఎస్ ఓట్లకు గండి పెడుతున్నారు. ఇక బలరాంనాయక్కు అధికార పార్టీ ఎమ్మెల్యేలే అతిపెద్ద బలం.ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉండడం ఆయనకు కలిసొచ్చే అంశం. ఆయన గెలుపును ఎమ్మెల్యేలు సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో వచ్చే మెజార్టీతోనే అధినాయకుడి వద్ద మార్కులు పొందే అవకాశం ఉంది. ఇందుకోసం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఓటర్లతోపాటు.. బీఆర్ఎస్ నాయకులను పార్టీలో చేర్చుకుంటున్నారు. ఆ పార్టీ ఓటర్లను తమ వైపు తిప్పుకుంటున్నారు. ఇలా ముగ్గురు అభ్యర్థులు ప్రత్యర్థి పార్టీల ఓట్లను చీల్చే అవకాశం ఉంది. -
ప్రచారంపై ఫోకస్ పెంచిన ప్రధాన పార్టీలు..
సాక్షి,ఆదిలాబాద్: పార్లమెంట్ ఎన్నికల సంగ్రామంలో ఆయాపార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నా యి. సీఎం రేవంత్రెడ్డి ఈ సెగ్మెంట్ పరిధిలో ఆది లాబాద్, ఆసిఫాబాద్లలో జరిగిన సభల్లో వ్యూహా త్మకంగా బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు గొడం నగేశ్, ఆత్రం సక్కును విమర్శించడం ద్వారా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.ఎంపీ సోయం బాపూరావు ప్రస్తావన కూ డా ఇందులో భాగమేనని చర్చించుకుంటున్నారు. మరోపక్క బీజేపీలో ఇటీవల ఎమ్మెల్యేలకు ఆయా పార్లమెంట్ ఇన్చార్జి బాధ్యతలు తొలగించిన తర్వాత వారంతా తమ నియోజకవర్గాల్లో ప్రచారంలో దూకుడు పెంచారు. ఒక విధంగా ఈ నిర్ణయం విభేదాలకు చెక్తో పాటు ప్రచారంలో స్పీడ్ పెంచేందుకు ఉపయోగపడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ మైనార్టీ ఓట్లపై దృష్టి సారించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.సీఎం ప్రసంగంలో ఎంపీ సోయం ప్రస్తావన..సీఎం రేవంత్రెడ్డి ఆసిఫాబాద్ బహిరంగ సభలో ఎంపీ సోయం బాపూరావు ప్రస్తావన తీసుకురావడం వ్యూహాత్మకమేనన్న చర్చ సాగుతుంది. సిట్టింగ్ ఎంపీ సోయంకు టికెట్ ఇవ్వకుండా బీజేపీ ఆయనను అవమానించిందన్నారు. అంతేకాకుండా పార్లమెంట్ నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరించాలని కేంద్ర మంత్రుల చుట్టూ సోయం తిరిగినా వారు పట్టించుకోలేదని చెప్పారు. ప్రధానంగా సోయంకు ఆదివాసీ ఓటర్లలో పట్టు ఉంది.ఈ నేపథ్యంలో సీఎం వ్యూహాత్మకంగానే సోయం ప్రస్తావన తీసుకువచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అంతేకాకుండా బీజేపీ అభ్యర్థి నగేశ్, బీఆర్ఎస్ అభ్యర్థి సక్కు ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ జిల్లా అభివృద్ధికి పాటుపడింది లేదని చెప్పడం ద్వారా విమర్శలు ఎక్కుపెట్టారు. ఇదిలా ఉంటే ఇటీవల మంత్రి సీతక్క, ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ నార్నూర్ మండలం కొత్తపల్లి–హెచ్లో బంజారా దీక్షభూమి వేదిక వద్ద ప్రసంగిస్తూ తాము లంబాడాలకు వ్యతిరేకం కాదని చెప్పడం ద్వారా ఆ ఓటర్లను ఆకట్టునే ప్రయత్నం చేశారు.అంతే కాకుండా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి పార్టీ పరంగా కో ఇన్చార్జీలను నియమించారు. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్తో పాటు ఏఐసీసీ సభ్యుడు నరేశ్ జాదవ్ నియామకం ఇందులో భాగమేనని తెలుస్తోంది. తద్వారా ఆ సామాజిక వర్గ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నమే ఈ చర్య అన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతుంది.బీజేపీలో విభేదాలు సమసినట్టేనా..బీజేపీలో ఎంపీ అభ్యర్థిగా నగేశ్ను ప్రకటించిన త ర్వాత పార్టీ ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేదన్న విమర్శలు జోరుగా సాగాయి. ఎమ్మెల్యేలకు పార్లమెంట్ ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చిన తర్వాత వారి నియోజకవర్గాల్లో ఇతర నేతల జోక్యం పెరిగిందన్న భావం వ్యక్తమైందన్న ప్రచారం జరిగింది. పార్టీ అధిష్టానం దృష్టికి కూడా వెళ్లడంతో నష్ట నివారణ చర్యలకు దిగింది.ఇందులో భాగంగానే పార్టీ ఎమ్మెల్యేలందరికీ ఆయా పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి బా ధ్యతల నుంచి తొలగించారు. ఈ పరిణామం తర్వా త ఆయా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ప్రచార స్పీడ్ పెంచారు. ఒకవిధంగా ఇది పార్టీకి మంచి జరిగిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అంతేకాకుండా నగేశ్ ఇటీవల ఖానాపూర్ నియోజకవర్గంలో పర్యటించినప్పుడు మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్తో కలిసి విస్తృతంగా తిరిగారు. ఇది లంబాడా ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహాత్మక చర్య అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.ఎంఐఎం నేతను కలిసిన బీఆర్ఎస్ నాయకులు..బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కుకు సంబంధించి ఈ పార్లమెంట్ సెగ్మెంట్లోని నియోజకవర్గాల్లో ఆయా నేతలు, కార్యకర్తలు విస్తృతంగా తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు.ఇటీవల మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్సీ దండే విఠల్తో కలిసి భైంసాలో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ జాబిర్ అహ్మద్ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా మైనార్టీ ఓటర్లను రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో ఆదివాసీ, లంబాడా ఓటర్లతో పాటు గిరిజనేతర ఓటర్లను ఆకట్టుకునేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. -
ఆ ముగ్గురి చేరిక నిలిపివేత!
ఆదిలాబాద్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆరేళ్లపాటు పార్టీ బహిష్కరణకు గురైన జిల్లా కేంద్రానికి చెందిన పీసీసీ మాజీ జనరల్ సెక్రెటరీ గండ్రత్ సుజాత, డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజీద్ఖాన్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అల్లూరి సంజీవ్రెడ్డిల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది.ఇటీవల జగ్గారెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న ఈ ముగ్గురు ప్రభుత్వ సలహాదారు వేంనరేందర్రెడ్డిని కూడా కలిశారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించి పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన ఈ ముగ్గురు నాయకులను తిరిగి పార్టీలో చేర్చుకోవద్దంటూ కంది శ్రీనివాసరెడ్డి మద్దతుదారులు ఆందోళన చేపట్టారు.వెంటనే వారిని పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ ముగ్గురు నాయకుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీ దహనం చేయడంతో పాటు నోటికి నల్లగుడ్డలను ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను గమనించిన పార్టీ నాయకత్వం వారి చేరికలను నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది. దీంతో కంది వర్గీయుల పోరాటం ఫలించినట్లైందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.టీపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షి ఆదేశాల మేరకు ఆ నాయకుల చేరికలను నిలిపివేస్తున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, చేరికల కమిటీమెంబర్ జయప్రకాష్ రెడ్డి(జగ్గారెడ్డి) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా నాయకత్వంతో చర్చించి త్వరలోనే తగు నిర్ణయం తీసుకుంటామని అప్పటి వరకు వారి చేరిక నిలిపివేస్తున్నట్లుగా అందులో పేర్కొన్నారు.ఇవి చదవండి: ప్రచారంపై ఫోకస్ పెంచిన ప్రధాన పార్టీలు.. -
‘బండి’ని గెలిపించాలి..
కరీంనగర్: కరీంనగర్ మండలంలోని బొమ్మకల్లో శుక్రవారం బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్కు మద్దతుగా ఆ పార్టీ నాయకులు ప్రచారం నిర్వహించారు.నల్ల చెరువులో ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు, ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులను కలిసి ఎంపీగా సంజయ్ చేసిన అభివృద్ధి పనులను వివరించారు. ఆయనను మరోసారి గెలిపించాలని కోరారు. అనంతరం అభివృద్ధి పనులకు సంబంధించిన కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు దాది సుధాకర్, పాశం తిరుపతి, చిందం అశోక్, దాసరి రమణారెడ్డి, పుట్టపాక శ్రీధర్, పెద్ది లక్ష్మణ్, కాల్వ రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.సంజయ్కి పలు బీసీ సంఘాల మద్దతు..బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కి శుక్రవారం పలు బీసీ సంఘాలు మద్దతు తెలిపాయి. నాయకులు మాట్లాడు తూ.. జనాభాలో 50 శాతం ఉన్న బీసీలందరూ ఏకమై, బీసీ అభ్యర్థి అయిన సంజయ్ని గెలి పించాలని కోరారు. ప్రధాన రాజకీయ పార్టీల్లో ఒక్క బీజేపీ మాత్రమే బీసీ అభ్యర్థికి అవకాశం ఇచ్చిందని,ఈ అవకాశాన్ని ఉపయోగించుకొ ని, ఆయనను గెలిపించాలని పిలుపునిచ్చారు. నాయకులు కేశిపెద్ది శ్రీధర్ రాజు, ఎన్నం ప్రకా శ్, నాగుల కనకయ్య గౌడ్, నారోజు రాకేశ్చారి, దొగ్గలి శ్రీధర్, మియాపురం రవీంద్రాచారి, కాయితోజు బ్రహ్మచారి, రంగు సంపత్ గౌడ్, మాదాసు సంజీవ్, బోయిని ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
మీరు తీసుకునేది ‘ట్యాపింగ్’ పైసలే : మాజీ మంత్రి పెద్దిరెడ్డి
కరీంనగర్: ఫోన్ ట్యాపింగ్ ప్రధాన నిందితుడు ప్రభాకర్రావు పంపుతున్న సొమ్ముతో కార్పొరేటర్లను, ప్రజాప్రతినిధులను, నాయకుల ను కొనాలని కాంగ్రెస్ నాయకులు చూస్తున్నరు.. ఆ డబ్బు తీసుకునేవాళ్లకు మేం చెప్పేదొక్కటే.. మీరు తీసుకునే సొమ్ము ఫోన్ ట్యాపింగ్ పైసలే.. విచారణలో బయటపడితే మీకు గండమే.. జైలుకు వెళ్లక తప్పదని మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జెనవాడ సంగప్ప హెచ్చరించారు.కరీంనగర్కు చెందిన కొందరు కార్పొరేటర్లు కాంగ్రెస్లోకి వెళ్తున్నట్లు చర్చ జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రధాని మోదీ నాయకత్వమే కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పుకోలేని స్థితిలో కాంగ్రెస్ ఉందని ఎద్దేవా చేశారు. రిజర్వేషన్ల రద్దు అంటూ ఆ పార్టీ విష ప్రచారం చేస్తోందన్నారు. కాంగ్రెస్ హయాంలో మంచి నీళ్లు దొరకలేదన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ నిజమైన బీసీ అయితే మోదీ, సంజయ్ బీసీలేనని, నువ్వు బీసీ పక్షం ఉంటావో.. ఓసీ పక్షం ఉంటావో చెప్పాలని డిమాండ్ చేశారు. నాయకులు కొలగాని శ్రీనివాస్, బొమ్మ జయశ్రీ,, బొంతల కల్యాణ్, కటకం లోకేశ్ పాల్గొన్నారు.ఇవి చదవండి: ప్రచారంపై ఫోకస్ పెంచిన ప్రధాన పార్టీలు.. -
కడియం.. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి : పల్లా రాజేశ్వర్రెడ్డి
వరంగల్: ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని షోడాషపల్లి శివారులోని ఓ ఫంక్షన్ హల్లో వేలేరు, ధర్మసాగర్ మండలాల విస్తృత స్థాయి సన్నాహక సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్ను గెలిపించి కడియం శ్రీహరికి కర్రుకాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు. మంత్రిగా పని చేసి ఘన్పూర్కు చేసిన పని ఒక్కటైనా చూపెట్టాలని సవాల్ చేశారు. ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ.. కడియం రాజీనామా చేసి వస్తే రాజకీయంగా బొందపెట్టడానికి పార, గడ్డపార రెడీగా ఉన్నాయన్నారు.కడియం శ్రీహరి ఓ నకిలీ దళితుడైతే, ఆయన కూతురు నకిలీ దళితురాలని మండిపడ్డారు. ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ మాట్లాడుతూ.. తనను ఎంపీగా గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కడియం కావ్య తండ్రి చాటు బిడ్డ అని, అరూరి రమేశ్ కబ్జాదారుడని విమర్శించారు.కడియం శ్రీహరి, అరూరి రమేశ్ దొందూ దొందేనని విమర్శించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ చాడ సరిత, జెడ్పీ కో–ఆష్షన్ సభ్యురాలు జుబేదా లాల్, కార్పొరేటర్ ఆవాల రాధిక రెడ్డి, వైస్ ఎంపీపీ సంపత్, మండల అధ్యక్షుడు నర్సింగరావు, కో–ఆష్షన్ జానీ, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. -
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
ఖమ్మం: గత ఎన్నికల్లో తమను కడుపులో పెట్టుకుని అత్యధిక మెజార్టీతో గెలిపించగా ముగ్గురికి మంత్రి పదవులు దక్కడంతో ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తున్నామని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మంలోని జెడ్పీ సెంటర్ నుండి ముస్తఫానగర్, చర్చికాంపౌండ్, ప్రకాష్నగర్, బోసుబొమ్మ సెంటర్ మీదుగా గాంధీచౌక్ వరకు శుక్రవారం రాత్రి రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చికాంపౌండ్ సెంటర్లో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని, ఆ రెండు పార్టీల నడుమ లోపాయికారి ఒప్పందం ఉందని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ తాను చేసిన తప్పుల నుండి కాపాడుకోడానికి బీజేపీతో జత కడుతున్నారని చెప్పారు. ఎన్నో మోసపూరిత హామీలు ఇచ్చి మాయమాటలతో పదేళ్లు రాజ్యమేలారని విమర్శించారు. కనీసం పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కూడా ఇవ్వలేకపోయారని చెప్పారు.కాంగ్రెస్ హయాంలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కట్టిస్తామని చెప్పినప్పటికీ మంత్రి తుమ్మల ఖమ్మం నియోజకవర్గానికి అదనంగా ఇళ్లు కావాలని అడిగారని తెలిపారు. గృహనిర్మాణ శాఖకు మంత్రిగా ఉన్న తాను ఖమ్మంకు ఆరు వేల ఇళ్లు మంజూరు చేస్తానని ప్రకటించారు. ఎంపీగా రఘురాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే కేంద్రం నుంచి అదనంగా నిధులు వస్తాయని తెలిపారు.నిరుపేదలందరికీ ఇళ్లు..మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఖమ్మంలో రోడ్ల వెంట, కాల్వగట్ల వెంట గుడిసెలు వేసుకుని ఉంటున్న వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. వెంకటగిరి, బైపాస్ బ్రిడ్జిలు, దానవాయిగూడెం ఫిల్టర్ బెడ్, పుట్టకోట బెడ్ తన హయాంలో నిర్మించినవేనని తెలిపారు.ఖమ్మం ప్రజలు ప్రశాంతంగా అన్నదమ్ముల్లా కలిసిమెలసి ఉండాలంటే రఘురాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. జిల్లా నుంచి డిప్యూటీ సీఎం భట్టితో పాటు తామిద్దరం కలిసి ఖమ్మంను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి రాష్టంలోనే ఆగ్రగామిగా ఉంచుతామని తెలిపారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెబుతున్న వారు ధైర్యం ఉంటే రేవంత్రెడ్డిని తాకాలని సూచించారు.మతోన్మాద బీజేపీ మరోమారు గెలిస్తే ప్రజల మధ్య మతవిద్వేషాలను రెచ్చగొట్టి దేశాన్ని విభజిస్తుందని తెలిపారు. అనంతరం అభ్యర్థి రఘురాంరెడ్డి మాట్లాడుతూ తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ముగ్గురు మంత్రుల సమన్వయంతో జిల్లా అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. ఈ రోడ్డు షోలో డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, నాయకులు మహ్మ ద్ జావీద్, బాలసాని లక్ష్మీనారాయణ, సాధు రమేష్రెడ్డి, దొబ్బల సౌజన్య తదితరులు పాల్గొన్నారు. -
అగ్రనేతల క్యూ! సై.. అంటే సై!!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: లోక్సభ ఎన్నికల పోరు కీలక దశకు చేరింది. ఇంకా వారం రోజుల్లో ప్రచార పర్వం ముగియనుంది. ఈ మేరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రత్యేక వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి.రాష్ట్రంలో ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం రేవంత్ సొంత ఇలాకా కావడంతో పార్టీ అధిష్టానం పాలమూరుపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టింది. రెండింటిలోనూ విజయకేతనం ఎగురవేసి సత్తా చాటాలని బీజేపీ.. సిట్టింగ్ స్థానాలను తిరిగి దక్కించుకుని, పట్టు నిలుపుకోవాలని బీఆర్ఎస్ కదనరంగంలో దూకుడు ప్రదర్శిస్తున్నాయి.ప్రచార గడువు దగ్గరపడుతుండడంతో ఆయా పార్టీ ల అభ్యర్థులకు మద్దగా అగ్రనేతలు రంగంలోకి దింపుతున్నారు. మహబూబ్నగర్, నాగర్కర్నూల్ పార్లమెంట్ల పరిధిలో జాతీయ, రాష్ట్రస్థాయి నేతలు రోడ్షోలు, బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్లకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ప్రచారం మరింత హోరెత్తనుంది.ఇవి చదవండి: మరోసారి పీఠమెక్కేదెవరో..? -
బీజేపీతోనే అభివృద్ధి, సంక్షేమం : జేపీ నడ్డా
ఖమ్మం: పేదలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందాలంటే బీజేపీతోనే సాధ్యమని పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో సోమవారం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని, పదేళ్లలో దేశం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని అన్నారు. దేశంలో 80 కోట్ల మంది పేదలకు ఉచితబియ్యం, 75 ఏళ్లు నిండిన వారికి ఆయుష్మాన్ భారత్ అందిస్తున్న ఘనత తమదేనన్నారు. రాబోయే రోజుల్లో ఏడు కోట్ల కుటుంబాలకు పైపులైన్ ద్వారా వంటగ్యాస్ అందించడమే లక్ష్యమని చెప్పారు. కాంగ్రెస్లో కుటుంబపాలన సాగుతోందని, దానికి అండగా నిలిచిన పార్టీలదీ అదే చరిత్ర అని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల్లో అవినీతి జరిగిందని నడ్డా ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థులుగా తాండ్ర వినోద్రావు, సీతారాంనాయక్ను గెలిపించాలని కోరారు.దేశ భవిష్యత్ను నిర్ణయించే ఎన్నికలు..గత పదేళ్లలో భారతదేశం అభివృద్ధి పథంలో దూసుకుపోయిందని, దేశ ప్రజలే తన కుటుంబంగా భావించే నరేంద్ర మోదీని మరోసారి గెలిపించాల్సిన అవసరం ఉందని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. దేశంలో కాంగ్రెస్ వచ్చేది లేదని, రాహుల్ ప్రధాని అయ్యేది లేదని విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి అసత్య హామీలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఇచ్చిన చిప్ప పట్టుకొని రేవంత్రెడ్డి తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.కేసీఆర్, రేవంత్ ఇద్దరూ తోడు దొంగలేనని అన్నారు. కాలం చెల్లిన కమ్యూనిస్టులు కాంగ్రెస్తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని విమర్శించారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 17 సీట్లనూ బీజేపీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మాయమాటలు నమ్మకుండా బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.ఖమ్మం ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు మాట్లాడుతూ ఢిల్లీలో మాదిరి ఖమ్మం కాంగ్రెస్లోనూ కుటుంబపాలన సాగుతోందని, స్థానికేతరుడైన వియ్యంకుడిని మంత్రి పొంగులేటి తెచ్చి పెట్టారని ఆరోపించారు. స్థానికుడినైన తననే ఆదరింంచేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. మహబూబాబాద్ అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్ మాట్లాడుతూ తనను మరోసారి గెలిపిస్తే మహబూబాబాద్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి, నాయకులు గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, విజయరామారావు, ఎం.ధర్మారావు, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, రంగాకిరణ్, నాయకులు శ్రీకాంత్, నంబూరి రామలింగేశ్వరరావు, జీవీకే మనోహర్, ఎం.శ్రీనివాసరెడ్డి, ఉప్పల శారద, నాగేశ్వరరావు, రాయుడు నాగేశ్వరరావు, నరేంద్రబాబు పాల్గొన్నారు.ఇవి చదవండి: లెక్క తేలింది.. పోరు మిగిలింది.. -
లెక్క తేలింది.. పోరు మిగిలింది..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో మరో అంకం పూర్తయ్యింది. బరిలో నిలిచే అభ్యర్థుల సంఖ్య తేలింది. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో తుది పోరులో తలపడే అభ్యర్థుల సంఖ్యపై స్పష్టత వచ్చింది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 28 మంది, పెద్దపల్లిలో 42 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఇందులో ప్రధాన పార్టీలకు చెందినవారితో పాటు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. సోమవారం నామినేషన్ ఉపసంహరణకు చివరిరోజు కావడంతో కరీంనగర్లో ఐదుగురు, పెద్దపల్లిలో ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు విత్డ్రా చేసుకున్నారు. ఈ మేరకు ఫాం–5 పూరించి ఆర్వోలకు అందజేశారు. దీంతో రిటర్నింగ్ అధికారులు వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, స్వతంత్ర అభ్యర్థుల సమక్షంలో ఇండిపెండెంట్ అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు.కరీంనగర్లో 2, పెద్దపల్లిలో 3 ఈవీఎంలుఒక స్థానంలో 15మంది అభ్యర్థులకు మించితే రెండు ఈవీఎంలను ఉపయోగించాల్సి ఉంటుంది. పెద్దపల్లి బరిలో 42మంది ఉండటంతో మూడు ఈవీఎంలు, కరీంనగర్లో 28మంది అభ్యర్థులే ఉండటంతో రెండు ఈవీఎంలను ఉపయోగించాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. స్వతంత్ర అభ్యర్థులను ఎన్నికల బరిలో నుంచి తప్పించేందుకు ప్రధాన పార్టీల నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతోనే ఈసారి గతంలో కంటే ఎక్కువ మంది బరిలో నిలిచినట్లు తెలుస్తోంది.చీలిక ఓట్ల లెక్కల్లో అభ్యర్థులు2019లో పెద్దపల్లి లోక్సభ బరిలో 18 మంది అభ్యర్థులుండగా, ఈసారి 42 మంది పోటీలో ఉన్నారు. 2019లో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 15 మంది పోటీలో ఉండగా ఈసారి 28మంది ప్రధాన పా ర్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా బరి లో ఉన్నారు. పెద్దపల్లి పరిధిలో ప్రధాన పార్టీలకు రె బల్ అభ్యర్థుల బెడద లేదు. అయితే కరీంనగర్లో కాంగ్రెస్ టిక్కెట్ ఆశించి భంగపడిన అల్గిరెడ్డి ప్ర వీణ్రెడ్డి రెబల్ అభ్యర్థిగా పోటీలో దిగుతున్నారు. దీంతో రెబల్ అభ్యర్థితో పాటు చిన్న పార్టీలు, స్వ తంత్ర అభ్యర్థులు ఓట్లు సాధించనున్నారు. వీరి ఓ ట్ల చీలిక వల్ల ఏ పార్టీకి నష్టం చేకూరుతుంది? ఎంత మేరకు వీరి ప్రభావం ఉండనుందనే లెక్కలపై అ న్ని పార్టీల్లో జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి.నేటి నుంచి పెరగనున్న ప్రచార జోరు..ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మేరకు కీలక ఘట్టం ముగియడంతో అభ్యర్థులెవరో తేలిపోయింది. ప్రధాన పార్టీలతో పాటు, ఇతర చిన్న పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు మంగళవారం నుంచి ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. ఎలాగైనా ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు తమ ప్రణాళికను అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రచారాన్ని మరింత వేడెక్కించే పనిలో పడ్డారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకుంటున్నారు.ఇవి చదవండి: లెక్క లేదంటే.. వేటే..! -
లెక్క లేదంటే.. వేటే..!
సాక్షి, మంచిర్యాల: ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఆదిలాబాద్లో 12 మంది, పెద్దపల్లిలో 42మంది బరిలో ఉన్నారు. ఎ న్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను ప్రచారమూ ప్రభావితం చేస్తుంది. ఆ ప్రచార వ్యయం కూడా పె రుగుతూ వస్తోంది. ర్యాలీలు, సభలు, సమావేశాలు, సభలకు జనాలను తరలించే వాహనాలు, భో జనాలు, టెంట్లు ఇలా ప్రతీదానికి అభ్యర్థులు ఖ ర్చు చేయాల్సి వస్తుంది. వీటన్నింటికి కూడా ఎన్నిక ల సంఘం స్థానికంగా ధరలను అనుసరించి చెల్లింపులను నిర్దేశించింది.ఆ మేరకు వ్యయ వివరాలను అభ్యర్థులు నమోదు చేయాల్సి ఉంటుంది. బ్యాంకులో ఖాతా తెరిచి దాని ద్వారానే చెల్లింపులు చేయా లి. అభ్యర్థులు ప్రచార వ్యయానికి సంబంధించి ప్ర తీ ఖర్చు వివరాలను ఎన్నికలు పూర్తయిన తర్వాత నెల రోజుల్లోగా ఎన్నికల సంఘానికి సమర్పించాలి. లేనిపక్షంలో ఆ తర్వాత జరిగే ఎన్ని కల్లో పోటీకి అనర్హులుగా ప్రకటిస్తుంది. అలా వేటు పడిన వారిలో రాష్ట్ర వ్యాప్తంగా 107మంది ఉన్నారు.వ్యయ పరిశీలకులు వీరే..ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులుగా మహారాష్ట్రకు చెందిన ఐఆర్ఎస్ అ« దికారి జాదావార్ వివేకానంద, పెద్దపల్లి నియోజకవర్గానికి సమీర్ నైరంతర్య వ్యవహరిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో వీరు పర్యటించి రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ప్రచార వ్యయాలను పరిశీలిస్తారు.పెంపు ఇలా..లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచార వ్యయ పరి మితి 1952లో రూ.25వేలుగా ఉండేది. 1971లో రూ.35వేలు ఉండగా.. 1980లో రూ.లక్షకు పెరిగింది. 1984నుంచి 1991వరకు రూ.1.50లక్షలు, 199 6లో రూ.4.50లక్షలకు చేరింది. 1998లో రూ.15లక్షలు, 2004లో రూ.25లక్షలకు పెరుగుతూ వచ్చింది. 2014లో ఎన్నికల ప్రచార వ్యయ పరిమితిపై ప్ర ధాన సవరణ జరిగి రూ.70లక్షలకు పెరిగింది. దీని పై 2020లో 10శాతం పెరిగింది. ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కమిటీ సూచన మేరకు 2022లో ప్రచార వ్యయ పరిమితిని రూ.95లక్షలకు పెంచా రు. లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు గరి ష్టంగా రూ.95లక్షల వరకు ప్రచారానికి ఖర్చు చేసే అవకాశం ఉంది.107మంది పోటీకి అనర్హులు..రాష్ట్రంలోని 107మందిని ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల ప్రచార వ్య యానికి సంబంధించిన వివరాలు సమర్పించకపోవడంతో ప్రజాప్రాతినిధ్య చట్టం–1951 10ఏ ప్రకారం అనర్హత వేటు వేసింది. వీరిలో అత్యధి కంగా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన 68 మంది ఉ న్నారు. అప్పట్లో పసుపు రైతులు భారీ సంఖ్యలో నామినేషన్ వేసిన వారే కావడం గమనార్హం.వచ్చే జూన్ 23 వరకు వీరు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. నల్గొండ లోక్సభ నియోజకవర్గంలోని 2, మహబూబాబాద్, మెదక్లో ఒక్కొక్కరు ఉండగా.. వీరిపై జూన్ 10వరకు వేటు కొనసాగుతుంది. జుక్కల్, రామగుండం, కరీంనగర్, గజ్వేల్, మల్కాజ్గిరి, నాగార్జునసాగర్, ఆలేరు, జనగాం, మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఒక్కొక్కరు, దేవరకొండ 5, మిర్యాలగూడ, పాలకుర్తి ముగ్గురు చొప్పున, నల్గొండ, ములుగు 4 చొప్పున, నకిరేకల్ 2, మల్కాజ్గిరి ఒకరిపై జూలై 14వరకు వేటు వేసింది. పాలకుర్తిలో ముగ్గురిపై ఆగస్టు 25వరకు, డోర్నకల్ ఒకరిపై సెప్టెంబర్ 21వరకు అనర్హత వేటు పడింది.ఇవి చదవండి: దేవుడి పేరుతో బీజేపీ రాజకీయం.. : మంత్రి సీతక్క -
దేవుడి పేరుతో.. బీజేపీ రాజకీయం! : మంత్రి సీతక్క
ఆదిలాబాద్: దేవుడి పేరు చెప్పి బీజేపీ రాజకీయం చేస్తుందని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా మండలకేంద్రంలో సోమవారం నిర్వహించిన రోడ్షోలో ఆమె మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేసే బీజేపీని ఈ ఎన్నికల్లో ఓటుతో రద్దు చేయాలన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి బీజేపీ రాజకీయంగా పబ్బం గడుపుకుంటోందని విమర్శించారు. కార్యక్రమంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి, మాజీ జెడ్పీటీసీ రాందాస్, మండల అధ్యక్షుడు ఫైజుల్లాఖాన్, బ్లాక్ అధ్యక్షుడు గుండవార్ సంజయ్, నాయకులు రూపేశ్రెడ్డి, వామన్, శంకర్, చంద్రకాంత్, తదితరులు పాల్గొన్నారు.అభివృద్ధి అడిగితే అక్షింతలు పంపుతున్నారు..జైనథ్: అభివృద్ధి గురించి అడిగితే ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అక్షింతలు పంపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి సీతక్క విమర్శించారు. మండల కేంద్రంలో ఎన్ని కల ప్రచారంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. అనంతరం నాయకులతో కలిసి సరదాగా డప్పు కొట్టి కార్యకర్తల్లో జోష్ పెంచారు. అంతకు ముందు మంత్రి లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. ఇందులో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి, జెడ్పీటీసీ అరుంధతి వెంకట్ రెడ్డి, గడ్డం జగదీశ్రెడ్డి, తదితరులున్నారు.రుణమాఫీకి కేరాఫ్ కాంగ్రెస్..తాంసి: రైతు రుణమాఫీకి కేరాఫ్ కాంగ్రెస్ పార్టీయేనని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా భీంపూర్ మండలంలోని అర్లి(టి),తాంసి మండలంలోని కప్పర్ల గ్రామాల్లో రోడ్షో చేపట్టారు. అనంతరం పార్టీలో చేరిన పలువురికి కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, తలమడుగు జెడ్పీటీసీ గణేశ్రెడ్డి, నాయకులు నరేశ్ జాదవ్, తదితరులు పాల్గొన్నారు.రాహుల్గాంధీని ప్రధానిగా చూడడమే లక్ష్యం..గుడిహత్నూర్: రాహుల్గాంధీని దేశ ప్రధానిగా చూడడమే మన లక్ష్యమని, కార్యకర్తలు ఆ దిశగా కృషి చేయాలని మంత్రి సీతక్క అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సుగుణతో కలిసి మండల కేంద్రంలోని మాజీ ఏఎంసీ చైర్మన్ ఆడే శీల ఇంటికి చేరుకున్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ స్థానిక నాయకులను మంత్రికి పరిచయం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. విభేదాలు పక్కన పెట్టి సుగుణ గెలుపు కోసం సమష్టిగా కృషి చేయాలన్నారు. అనంతరం స్థానిక యువకులు మంత్రి సమక్షంలో పార్టీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కరుణాకర్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మాధవ్ మస్కే తదితరులు పాల్గొన్నారు.ఆడబిడ్డను పార్లమెంట్కు పంపుదాం..బోథ్: ఈ ప్రాంత ఆడబిడ్డ, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్కు పంపుదామని మంత్రి సీతక్క అన్నారు. సోమవారం రాత్రి బోథ్ మండలంలోని ధన్నూర్ బి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సుగుణ విజయం దాదాపు ఖాయమైందని ఆశాభావం వ్యక్తం చేశారు. జొన్న పంట కొనుగోళ్లను ఎకరాకు 8 క్వింటాళ్ల నుంచి మరింత పెంచుతామని రైతులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు పసుల చంటి, ఇంద్రారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఇవి చదవండి: ప్రజలు కేసీఆర్నే కోరుకుంటున్నారు.. -
Asaduddin Owaisi: ముస్లింలు, దళితులకు చంద్రబాబు శత్రువు...
రిపోర్టర్: ఈ సారి దేశవ్యాప్తంగా ఎన్నికలు హిందూ-ముస్లిం, ముస్లిం రిజర్వేషన్లు అనే ఎజెండాపై జరుగుతున్నట్లు కనిపిస్తోంది. దీనిపై మీ అభిప్రాయం…ఓవైసి: సాక్షాత్తు ప్రధాని నరేంద్రమోదీ తన లోపాలను కప్పిపుచ్చేందుకు ఇలాంటి వాతావరణం సృష్టించారు. నిన్నటి దాకా విశ్వగురు, జీ-20, చంద్రయాన్, 5ట్రిలియన్ ఎకానమి అంటూ ఊదరగొట్టారు. ఇప్పుడు అవన్నీ వదిలేసి.. హిందూ-ముస్లిం వివాదం తీసుకువ్చచారు. ఇది చూస్తే అర్ధమవుతోంది… ప్రధాని మోదీకి ముస్లిం మైనారిటీలంటే ఎంత ధ్వేషమో. ముస్లింలను ధ్వేషించడం ఒక్కటే… ప్రధాని మోదీ గ్యారంటీ.రిపోర్టర్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణాతో పాటు ముస్లిం రిజర్వేషన్లు ఉన్న ప్రతీచోటా వాటిని తీసివేయాలనే ప్రయత్నం జరుగుతోంది… దీనిపై మీ అభిప్రాయం.ఓవైసి: 2004లో గులాంనబీ అజాద్ కాంగ్రెస్ పరిశీలకులుగా హైదరాబాద్ వచ్చారు. అప్పుడు కాంగ్రెస్ నేత యూనుస్ సుల్తాన్ ఇంట్లో జరిగిన సమావేశంలో… ముస్లిం రిజర్వేషన్లు ఇస్తామని దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చారు. హామి ఇచ్చినట్లుగానే అధికారంలోకి రాగానే వైఎస్సార్ ప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించింది.ముందుగా కోర్టు దీనిపై అభ్యంతరం చెప్పింది. దీంతో ప్రముఖ ఆంత్రోపాలజిస్టు కృష్ణన్ ఆధ్వర్యంలో కమిటీ వేసి… ముస్లింలలో కుల ప్రాతిపదికన 4శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సహేతుకమే అని తేల్చారు. ఆ తరువాత వేసిన ఎస్ఎల్పీలో ముస్లిం రిజర్వేషన్లను అనుమతిస్తూ సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. చాలామంది ముస్లిం యువకులు, విద్యార్ధులు రిజర్వేషన్ల వల్ల లబ్ది పొందుతున్నారు.ఇప్పుడిప్పుడే ముస్లింలు కాస్త బాగుపడుతున్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు, డీఎస్పీలు, ఆర్డీవోలు, టీచర్లుగా ఉద్యోగులు పొందుతున్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వారికి ముస్లింలు అంటే తీవ్రమైన ధ్వేషం. 4శాతం రిజర్వేషన్ల ద్వారా ముస్లింలు లబ్దిపొందడం బీజేపీకి మింగుడుపడటం లేదు. విద్యా, ఉద్యోగ పరంగా ముస్లింలు స్వావలంబన సాధించడం బీజేపీకి నచ్చక వారు రిజర్వేషన్లు తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో ముస్లింలకు మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు లభించడం లేదు. ముస్లింలలోని నిమ్న కులాలు వారికి సమాజంలో ఉన్న సామాజిక, విద్యాపరమైన వెనకబాటు కారణంగా రిజర్వేషన్లు అందుతున్నాయి.ముస్లింల అభివృద్దిని అడ్డుకునేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్లతో కలిసి ఆంధ్రప్రదేశ్లు చంద్రబాబునాయుడు, జనసేన పార్టీలు పనిచేస్తున్నాయి. టీడీపీ, జనసేన పార్టీలు ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీల శత్రువులు. చంద్రబాబు, పవన్కళ్యాణ్లు బీజేపీ ఎజెండా ఆధారంగా ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే బీజేపీ, జనసేనతో కలిసి చంద్రబాబు ముస్లిం రిజర్వేషన్లు లేకుండా చేస్తాడు. ముస్లిం రిజర్వేషన్ల తరువాత వీరు దళితులకు కూడా రిజర్వేషన్లు లేకుండా చేస్తారు. ఏపీ ప్రజలంతా ఆలోచించి చంద్రబాబు, బీజేపీ, జనసేనలాంటి మతతత్వ, ఫాసిస్టు పార్టీలను ఓడిస్తారని ఆశిస్తున్నాను.ఏపీ ప్రజలందరితో నేను విజ్ఞప్తి చేస్తున్నాను… మీరంతా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి మద్దతుగా ఓటు వేయండి. జగన్మోహన్రెడ్డి మతతత్వవాది కాదు… జగన్మోహన్రెడ్డి లౌకికవాది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తరువాత చాలా సమస్యలున్నాయి.రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్రెడ్డి రాజకీయనిర్ణయాలు తీసుకున్నారు. జగన్మోహన్రెడ్డి ఎప్పుడు దళితులు, ముస్లింల ప్రయోజనాలపై రాజీపడలేదు. చంద్రబాబు మాత్రం ముస్లింలు, దళితుల ప్రజయోజనాలను తాకట్టుపెట్టి స్వలాభం ఆలోచించారు. 2002లో గుజరాత్ అల్లర్ల కారణంగా దేశం మొత్తం కాలిపోతుంటే, ముస్లింలపై దౌర్జన్యాలు జరుగుతుంటే చంద్రబాబు మాత్రం బీజేపీకి మద్దతిచ్చాడు. చంద్రబాబును ముస్లింలు ఎన్నటికీ నమ్మరు. ముస్లింల పట్ల చంద్రబాబుకు ఎలాంటి ప్రేమలేదు. -
నేను.. పక్కా లోకల్
కరీంనగర్: ‘నేను పక్కా లోకల్.. రూ.12 వేల కోట్ల నిధులతో కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేశా’నని బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. హుస్నాబాద్లో సోమవారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ముందుగా గిరిజన మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి స్వాగతం పలికారు. సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు అభ్యర్థులు దొరకక, బయటి ప్రాంతాల నుంచి తీసుకువస్తున్నారన్నారు. గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నయా పైసా ఇవ్వలేదని, అందుకే మాజీ సర్పంచ్లు బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ, కార్పొరేషన్ల అభివృద్ధికి కేంద్రమే నిధులు ఇచ్చిందన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులతోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కరెంట్ బిల్లులను కట్టిందన్నారు. పల్లెల అభివృద్ధికి పాటుపడిన సర్పంచ్లను నిలువునా మోసం చేసిందన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్కు ఎందుకు ఓటు వేయాలో ప్రజలు ఆలోచించాలన్నారు. కరీంనగర్ ఎంపీగా నన్ను ఓడించేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. ‘హుస్నాబాద్ ఎమ్మెల్యే నన్ను వెధవ అంటున్నారు. ఆయనపై నాకు ఎలాంటి ద్వేషం లేదు. ఆయన నన్ను ఎంత తిట్టినా పడతా’నని బండి అన్నారు. హామీలపై మొదట శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కల్యాణ్ నాయక్, పార్టీ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ఇవి చదవండి: బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు కేసీఆర్ లాంటి దొరలే..! -
బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు కేసీఆర్ లాంటి దొరలే..!
బీఆర్ఎస్, బీజేపీ ఎంపీ అభ్యర్థులపై సీఎం రేవంత్రెడ్డి తనదైన స్టైల్లో విమర్శలు గుప్పించారు. ‘ఆత్రం సక్కును చూశారు.. గోడం నగేశ్ను చూశారు.. వారు మీకు కొత్తేమి కాదు.. వాళ్ల పనితీనమేంటో కూడా మీకు తెలుసు.. మంచోడు మంచోడని మంచమెక్కిస్తే మంచమంతా పాడు చేశాడట వెనుకటికి ఆత్రం సక్కులాంటోడని’ అన్నారు. అలాగే గోడం నగేశ్ గురించి మా ట్లాడుతూ ‘బుద్ధిమంతుడని సద్దికట్టిస్తే బొడ్రాయి వద్ద భోంచేసి తిరిగి ఇంటికొచ్చి బోర్లాపడుకున్నడట.. అంటూ సామెతలను వివరిస్తూ వారిద్దరిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నగేశ్ ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా అన్ని పదవులు చేసిన విషయం మీకందరికీ తెలుసన్నారు. వారిద్దరు తక్కువేమి కాదని కేసీఆర్ దొర ఎంతనో ఈ గిరిజన నాయకులు అంతటి దొరలేనన్నారు. ఉదయం 11గంటలైతే తప్ప కిందకి దిగడని, సామాన్యులు చేయి కలిపితే వెంటనే జేబులో పెట్టి తుడ్చుకునే నగేశ్ లాంటి దొరలు మనకు అవసరమా అని ప్రశ్నించారు. ఫాంహౌస్లో ఉండే దొరలైనా ఆదిలాబాద్లో ఉండే ఈ దొరలతో మనకేం పని అని అన్నారు. సామాన్యురాలిగా, ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఆత్రం సుగుణను పార్టీ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టిందని ఆమెను భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్కు పంపించాలని కోరారు. ఇవి చదవండి: సీఎం హామీల జల్లు! -
సీఎం హామీల జల్లు!
ఆదిలాబాద్: సీఎం రేవంత్రెడ్డి హామీల జల్లు కురి పించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్ కళాశాల మైదానంలో సోమవారం నిర్వహించిన తెలంగాణ జన జాతర బహిరంగసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభ ప్రాంగణానికి చేరుకున్న ఆయన ప్రజలకు అభివాదం చేసిన అనంతరం ప్రసంగించారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధికి సంబంధించి అనేక హామీలు ప్రకటించారు. బోథ్ నియోజకవర్గ పరిధిలోని దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కుప్టి ప్రాజెక్ట్ను నిర్మించి రైతులకు సా గునీటిని అందిస్తామన్నారు. గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిన తూర్పు ప్రాంతంలోని తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ను నిర్మించడంతో పాటు దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరిట నామకరణం చేస్తామన్నారు. ముంపు నిర్వాసితుల అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామని తెలిపారు. అలాగే కేసీఆర్ నిర్లక్ష్యం చేసిన కడెం ప్రాజెక్ట్కు మరమ్మతులు చేసి దానిపై ఆధారపడ్డ ప్రజలకు సాగు, తాగునీటిని అందిస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మూతపడ్డ సీసీఐ ఫ్యాక్టరీని ప్రైవేట్ వ్యాపారులతో మాట్లా డి తెరిపిస్తామని తద్వారా ఈ ప్రాంత యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. అలాగే జిల్లా ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని భరోసానివ్వడం ఈ ప్రాంత వాసుల్లో ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతుంది. సభ సక్సెస్తో పార్టీ నేతల్లో హుషారు కనిపించింది. రెండు గంటలు ఆలస్యంగా... ప్రత్యేక హెలిక్యాప్టర్లో జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియానికి చేరుకున్న సీఎం అక్కడి నుంచి రోడ్డు మార్గాన సభ వేదిక వద్దకు చేరుకున్నా రు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 11గంటలకు హాజ రుకావాల్సి ఉండగా మధ్యాహ్నం 12.57 గంటలకు వచ్చారు. రెండు గంటలు ఆలస్యంగా హాజరైనప్పటికీ పార్టీశ్రేణులు, ప్రజలు సీఎం రాక కోసం ఓపిగ్గా నిరీక్షించారు. సభ వేదిక వద్దకు చేరుకుని ప్రజలకు అభివాదం చేశారు. ఈ సమయంలో పార్టీ శ్రేణులు కేరింతలు కొడుతూ ఉత్సాహాన్ని చాటారు. సాంస్కృతిక కళాకారుల బృందం ప్రదర్శన ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్, మాజీ ఎమ్మెల్యేలు రేఖానాయక్, రాథోడ్ బాపూరావు, రామారావు పటేల్, కోనేరు కోనప్ప, జెడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, కిసాన్ కాంగ్రెస్ æరాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, టీపీసీసీ కార్యదర్శి సత్తు మల్లేశ్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడె గజేందర్, శ్యాంనాయక్ తదితరులు పాల్గొన్నారు. పలువురి చేరిక.. బీజేపీ, బీఆర్ఎస్ల నుంచి పలువురు సీఎం స మక్షంలో కాంగ్రెస్లో చేరారు. బీఆర్ఎస్కు చెందిన మాజీ కేంద్రమంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, మున్సిపల్ వైస్చైర్మన్ జహీర్ రంజా నీ, కౌన్సిలర్లు ఆవుల వెంకన్న, కలాల శ్రీని వాస్, మడావి మంగళ, మాజీ ఎంపీపీ ఆడే శీల, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్ రెడ్డి తదితరులు కాంగ్రెస్లో చేరారు. వారికి సీఎం కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. ప్రత్యేక పోలీస్ బందోబస్తు.. సీఎం రాక నేపథ్యంలో పోలీసులు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా హెలిప్యాడ్ నుంచి సభ ప్రాంగణం వరకు దారి పొడవునా పోలీసులను మోహరించారు. సభా ప్రాంగణం వద్ద సీఆర్పీఎఫ్ బలగాలతో పాటు జిల్లా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. సీఎం రాకకు ముందు నుంచే బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకున్న ఎస్పీ గౌస్ ఆలం సీఎం వెనుదిరిగే వరకు అక్కడే ఉండి భద్రతను స్వయంగా పర్యవేక్షించారు. ఇవి చదవండి: ఒక్క రుణమాఫీపైనే ఒట్టా.. : ఏలేటి మహేశ్వర్రెడ్డి -
కాంగ్రెస్కు ఓటేసి గోసపడుతున్రు..
కరీంనగర్: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేసినందుకు ఇప్పుడు ప్రజలందరూ గోసపడుతున్నారని, ఇప్పుడు బీజేపీకి ఓటేస్తే ఆగమైతరని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. మల్యాలలో సోమవా రం రాత్రి రోడ్షో చేపట్టారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అంగడి బజార్లో వినోద్ మాట్లాడుతూ.. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ బడి తేలే.. గుడి తేలేదని, ఐదేళ్లలో కనీసం ఐదు రూపాయలు తేలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణకు 23 నవోదయ పాఠశాలలు రావాల్సి ఉండగా కేంద్ర ప్రభుత్వం ఒక్కటీ ఇవ్వలేదన్నారు. ఓట్ల కోసం బండి సంజయ్ వస్తే నిలదీయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీగా పోటీ చేసేందుకు కరీంనగర్ ఆయనకు పునరావాసమా..? అని ప్రశ్నించారు. తనను ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్కు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకొస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ గారడీ మాటలు, మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతోందని, నాలుగు నెలల్లోనే రాష్ట్రప్రభుత్వంపై ప్రజలు విసుగుచెందారని తెలిపారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత హక్కుల కోసం పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుక కావాలని, ఇందుకు వినోద్కుమార్ను గెలిపించుకోవాలని కోరారు. ఇవి చదవండి: నేను.. పక్కా లోకల్ -
ప్రధాన పార్టీల్లో ఆగని అలకలు
సాక్షి, ఆదిలాబాద్: ప్రధాన పార్టీల ఎంపీ అభ్యర్థులు ఖరారై రోజులు గడిచాయి. కాంగ్రెస్, బీజేపీ నుంచి టికెట్ ఆశించి దక్కని నేతలు అలక బూనారు. కొందరు పార్టీ కూడా మారారు. నామినేషన్ ప్రక్రియ మొదలైంది. భంగపడ్డ నేతలు పార్టీకి వ్యతిరేకంగా అడుగు వేస్తారా? కలిసి నడుస్తారా? అనేది కొద్దిరోజుల్లోనే తేలనుంది. ఇక టికెట్ దక్కించుకున్న అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు రెడీ అవుతున్నారు. ‘హస్తం’ నేతలు అలక వీడేదెప్పుడో! ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ ముఖ్యనేతలు కాంగ్రెస్లో చేరారు. దీంతో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో హస్తం నాయకత్వం కనిపిస్తోంది. తాజాగా మాజీ ఎంపీ సముద్రాల వేణుగోపాలాచారి, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. కాగా, టిక్కెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్, ఏఐసీసీ సభ్యుడు నరేశ్జాదవ్ ఇంకా ఎక్కడా ప్రచారంలో పాల్గొనడంలేదు. ఈనెల 22వ తేదీన కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ నామినేషన్ వేయనున్నారు. ఇదేరోజు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కూడా ఆదిలాబాద్ పర్యటనకు రానున్నారు. జిల్లా కేంద్రంలోని డైట్ మైదానంలో బహిరంగసభకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్య నేతలతో సీఎం సమావేశం కానుండగా, అప్పటికైనా నేతలు అలక వీడుతారో.. లేదో వేచి చూడాలి. కమలంలో ‘తిరుగుబాటు’ తప్పదా? బీజేపీ గోడం నగేశ్కు టికెట్ ఇచ్చిన తర్వాత పార్టీలో అసమ్మతి చోటుచేసుకుంది. ఆశావహుల్లో అసంతృప్తి నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కాంగ్రెస్లో చేరారు. జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ తిరిగి బీఆర్ఎస్లో చేరారు. మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ సైలెంట్గా ఉన్నారు. కాగా, ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్ ఈనెల 24న నామినేషన్ వేస్తున్నారు. ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్సాయి ఆరోజు ఆదిలాబాద్కు రానున్నారు. పార్టీ టికెట్ ఆశించిన సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావుకు పార్టీలో నిరాశ ఎదురు కాగా బీజేపీ రెబెల్గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. 24న ఆయన కూడా నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ బీ–ఫాం అందుకున్న సక్కు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆత్రం సక్కు పేరు ఖరారై చాలా రోజులైంది. ఓ దశలో అభ్యర్థిని మార్చుతారనే ప్రచారం జరిగింది. ఈ పరిస్థితుల్లో కొంత గందరగోళం కనిపించింది. రెండ్రోజుల క్రితం మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొనగా అభ్యర్థి మార్పు లేదని స్పష్టమైంది. గురువారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మాజీ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆత్రం సక్కు బీ–ఫాం అందుకున్నారు. ఈ నెల 23న లేదా 24వ తేదీన ఆయన నామినేషన్ వేయనున్నట్లు సమాచారం. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. తొలిరోజు రెండు నామినేషన్లు దాఖలు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. ఉదయం 11గంటలకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షిషా నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగనున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం మొదలైంది. తొలిరోజు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం జామిడి గ్రామానికి చెందిన రాథోడ్ సుభాష్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అలాగే అలయెన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఆధార్) పార్టీ తరఫున ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గంగాదేవిపాడు గ్రామానికి చెందిన మాలోత్ శ్యామ్లాల్నాయక్ నామినేషన్ వేశారు. వీరు సాదాసీదాగా అనుచరులతో వచ్చి కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజర్షిషాకు నామినేషన్ పత్రాలు అందజేశారు. పకడ్బందీ బందోబస్తు నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా పోలీసులు పకడ్బందీ బందోబస్తు నిర్వహించారు. వంద మీటర్ల పరిధి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశా రు. ఉదయం 11నుంచి మధ్యాహ్నం 3గంట ల వరకు నామినేషన్ల స్వీకరణ ఉండగా కలెక్టరేట్కు వెళ్లే రోడ్డుమార్గాన్ని మూసివేసి ట్రా ఫిక్ను మళ్లించారు. నామినేషన్లు వేసేందుకు వచ్చిన అభ్యర్థుల వాహనాలు క్షుణ్ణంగా తని ఖీ చేసి ఐదుగురినే లోనికి అనుమతించారు. గడవు ముగిసేవరకూ ముగ్గురు సీఐలు అ క్కడే విధులు నిర్వహించారు. ఆదిలాబాద్ డీ ఎస్పీ జీవన్రెడ్డి బందోబస్తును పరిశీలించి పలు సూచనలు చేశారు. మీడియా సెంటర్ను వద్ద వంద మీటర్ల పరిధిలో ఏర్పాటు చేశారు. ఇవి చదవండి: TS: డూప్లికేట్ ఓట్లపై ఫోకస్.. ఈసీ కీలక నిర్ణయం -
అవకాశమివ్వండి.. ప్రశ్నించే గొంతుకనవుతా : బోయినపల్లి
కరీంనగర్: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఐదేళ్లలో కరీంనగర్ను విద్యాహబ్గా తీర్చిదిద్దుతానని, పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకనవుతానని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని 60వ డివిజన్ ప్రజలతో సమావేశం అయ్యారు. అనంతరం జిల్లాకోర్టు ఆవరణలో న్యాయవాదులు, కక్షిదారులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ 2014 నుంచి 2019వరకు ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్కు రూ.వెయ్యికోట్లతో స్మార్ట్సిటీ, కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వేలైన్ తీసుకొచ్చినట్లు వెల్లడించారు. న్యాయవా దుల సంక్షేమానికి రూ.100కోట్లు కేటాయించడం ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరిందని అన్నారు. హైకోర్టులో జడ్జీల సంఖ్య పెరిగేందుకు తానే కారణమని తెలిపారు. ఎంపీ బండి సంజయ్ ఐదేళ్లల్లో ఒక్కరూపాయి తీసుకురాలేదని అన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ పదేళ్లల్లో కరీంనగర్ జిల్లాను 60ఏళ్లల్లో చూడని అభివృద్ధిని చేసి చూపించామని, వినోద్కుమార్ను ఎంపీగా గెలిపిస్తే అత్యధిక నిధులు తెచ్చి మరింత అగ్రగామిగా నిలుపుతామని స్పష్టం చేశారు. మేయర్ సునీల్ రావు, తులఉమ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ. రామకృష్ణరావు, రవీందర్సింగ్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లాహరిశంకర్ పాల్గొన్నారు. ఇవి చదవండి: కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి ఖరారు.. ఆయనకే చాన్స్ -
గ్యారంటీలే కాంగ్రెస్ విజయానికి బాటలు..
ఆదిలాబాద్: గ్యారంటీలే కాంగ్రెస్ విజయానికి బా టలు వేస్తాయని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాస రెడ్డి నేతృత్వంలో ఆదిలాబాద్ నియోజక వర్గంలో పార్టీ గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా తయారైందన్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో పార్టీ ఎంపీ అభ్యర్థికి ఊహించిన దానికంటే ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశముందన్నారు. ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో నాయకులు గుడిపెల్లి నగేష్, మంచికట్ల ఆశమ్మ, శ్రీ లేఖ, బండి దేవిదాస్, చారి, తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: వలసలు ఆగేదెలా? -
వలసలు ఆగేదెలా?
సాక్షి, ఆదిలాబాద్: పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ దగ్గర పడుతోంది. మరోవైపు బీఆర్ఎస్ నుంచి వలసలు ఆగడం లేదు. ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీలోకి జంపింగ్స్ కొనసాగుతున్నాయి. మొన్నటి వరకు ముఖ్యనేతలు కారు మార్చగా, ఇప్పుడు ద్వితీయ శ్రేణి నాయకుల వంతు వచ్చింది. ఈ పరిస్థితుల్లో వలసలు ఆగేదెలా అనే తర్జనభర్జన పార్టీలో సాగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి రానున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం జరగనుంది. ఇదీ పరిస్థితి.. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ క్రమంగా ఢీలా పడుతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వా త ఈ పార్టీ నుంచి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ముఖ్యనేతలు మాజీ ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, విఠల్రెడ్డి ఇది వరకే కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి ఐకేరెడ్డి కూడా చేరుతారనే ప్రచారం ఉంది. ఇదిలా ఉంటే తాజాగా నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని సోమవారం హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలోనే వారు హస్తం గూటికి చేరనున్నారు. వీరితో పాటు ఆదిలాబాద్ మున్సిపాలిటీకి చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారన్న ప్రచారం ఉంది. జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ బీజేపీలోకి, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి కాంగ్రెస్లోకి ఇది వరకే పార్టీ మారారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల్లో పార్టీ బలహీన పడింది. పార్లమెంట్ అభ్యర్థిగా ఆత్రం సక్కు పార్టీ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. బూత్ స్థాయిలో కార్యకర్తల్లో మనోధైర్యం నింపేందుకు కేటీఆర్ పర్యటన తోడ్పడుతుందా? అనేది వేచి చూడాల్సిందే. ఇవి చదవండి: కోర్టు తీర్పుపై ఉత్కంఠ.. కవితకు ఊరట దక్కేనా? -
ఈసారి మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకం.. కానీ రాజపూజ్యం ఎవరికో?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 13 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో జగిత్యాల, మెట్పల్లి నిజామాబాద్ పరిధిలోకి, సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, కరీంనగర్, మానకొండూరు, హుజూరాబాద్, హుస్నాబాద్ కరీంనగర్ పరిధిలోకి, పెద్దపల్లి, ధర్మపురి, రామగుండం, మంథని పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్ పరిధిలోకి వస్తాయి. మూడు స్థానాల్లోనూ అభ్యర్థులకు ఈ ఎన్నికలు చాలా కీలకం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎలాగైనా వీటిని కై వసం చేసుకోవాలని చూస్తున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండింటినైనా గెలిచి, తిరిగి పట్టు నిలుపుకోవాలని పావులు కదుపుతోంది. ఐదేళ్ల క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సామాన్యులుగా రంగంలోకి దిగిన బండి సంజయ్(కరీంనగర్) సిట్టింగ్ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ను ఓడించి, ధర్మపురి అర్వింద్(నిజామాబాద్) సిట్టింగ్ ఎంపీ కవితపై పైచేయి సాధించి, అనూహ్య విజయాలను అందుకున్నారు. ఈసారి తమ స్థానాలను నిలబెట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండగా.. అదే స్థాయిలో కాంగ్రెస్ కూడా వ్యూహాలు రచిస్తోంది. నినాదాలు.. మేనిఫెస్టోలు.. నిజామాబాద్, పెద్దపల్లిల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ ఎస్ తమ అభ్యర్థుల్ని ఇప్పటికే ప్రకటించాయి. వా రు ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్దన్(బీఆర్ఎస్), ధర్మపురి అర్వింద్(బీజేపీ), తాటిపర్తి జీవన్రెడ్డి(కాంగ్రెస్)లు పోటీ పడుతున్నారు. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ(కాంగ్రెస్), గోమాస శ్రీనివాస్ (బీజేపీ), కొప్పుల ఈశ్వర్ (బీఆర్ఎస్)లు బరిలో ఉన్నారు. కీలకమైన కరీంనగర్ నుంచి బండి సంజయ్(బీజేపీ), బి.వినోద్కుమార్(బీఆర్ఎస్)లు బరిలో ఉండగా.. కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. దేశభక్తి, అయోధ్య రామాలయం, ఉమ్మడి జిల్లాలో ప్రారంభించిన ప్రాజెక్టులు, హిందుత్వమే ఏజెండాగా బీజేపీ దూకుడుగా వెళ్తోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అధికారం కట్టబెట్టిన 6 గ్యారంటీలనే కాంగ్రెస్ నమ్ముకుంది. దీనికితోడు కేంద్ర నాయకత్వం ప్రకటించిన ‘పంచన్యాయ్’, రాష్ట్రానికి ప్రత్యేకంగా ప్రకటించిన మేనిఫెస్టో తమకు మేలు చేస్తాయని భావిస్తోంది. జాతీయ పా ర్టీలు రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోవని, తెలంగా ణగళం పార్లమెంట్లో వినిపించాలంటే.. తప్పకుండా తమను గెలిపించాలని బీఆర్ఎస్ కోరుతోంది. ఈసారి ఖర్చు రూ.కోట్లలోనే.. ఈసారి పార్లమెంట్ ఎన్నికల ఖర్చు క్రితంసారితో పోలిస్తే పెరిగేలా ఉంది. ప్రచారం, పెట్రోల్, భో జనం, సభల నిర్వహణ ఖర్చు అమాంతం పెరిగింది. ఇక, జన సమీకరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ లెక్కన అభ్యర్థుల వ్యయం శ్రీ క్రోధి నా మ సంవత్సరంలో రూ.కోట్లలో ఉండనుందని స మాచారం. దీనికి ప్రతిఫలంగా ప్రజలు ఓట్ల రూపంలో ఆదాయం ఇవ్వనున్నారు. ఇది ఎవరికి అధికంగా ఉంటే వారినే రాజయోగం వరించనుంది. ఈ నేపథ్యంలో ఎంపీ అభ్యర్థులు ఇప్పటికే తమ జాతకాలను పరీక్షించుకుంటున్నారు. ఎవరి ఆదాయ, వ్యయాలు ఎంత? ఎవరి రాజపూజ్యం ఎంత? ఎవరికి రాజయోగం ఉంది? తదితర వివరాలను పండితులను అడిగి తెలుసుకుంటున్నారు. ఇవి చదవండి: బస్సు యాత్రతో ‘కారు’ ప్రచారం -
ఇన్చార్జీలకు సవాలే..
సాక్షి, ఆదిలాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థితో పాటు ఇన్చార్జీగా వ్యవహరిస్తున్న నేతలకు కూడా గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా రాష్ట్ర మంత్రి సీతక్క వ్యవహరిస్తుండగా బీజేపీ ఇన్చార్జిగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పా యల్ శంకర్ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికీ ఇన్చార్జీ నియామకం చేపట్టలేదు. బీజేపీ సిట్టింగ్ సీటులో మళ్లీ గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేస్తుండగా కాంగ్రెస్ ఈ సెగ్మెంట్లో పాగా వేస్తామన్న వి శ్వాసం వ్యక్తం చేస్తోంది. బీఆర్ఎస్ ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటర్ల ఆదరణ తమకే అమితంగా ఉందంటూ విజయంపై భరోసాగా ఉంది. మొ త్తంగా ఈ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ స్పీడ్.. బీజేపీ అభ్యర్థిగా గొడం నగేష్ను ఖరారు చేయడంతో పాటు పార్లమెంట్ ఇన్చార్జీగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ను నియమించడంలో మిగితా పార్టీలకంటే ముందుంది. ఈ పార్టీ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటికే సమావేశాలు పూర్తి చేసింది. ఇక మండలాల వారీగా సమావేశాల నిర్వహణ ప్రారంభించింది. కాంగ్రెస్ ఆసిఫాబాద్ నియోజకవర్గం మినహా మిగితా అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు పూర్తి చేసింది. ఈనెల 7న అక్కడ కూడా సమావేశం నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే బీజేపీ నియోజకవర్గాల వారీగా సమావేశాల నిర్వహణలో అభ్యర్థితో పాటు ఇన్చార్జీ పాయల్ శంకర్ ఆదిలాబాద్లో మినహా మిగితా నియోజకవర్గాల్లో పాల్గొనడం లేదు. అయి తే కాంగ్రెస్లో అభ్యర్థితో పాటు ఇన్చార్జీ సీతక్క ప్ర తీ నియోజకవర్గ సమావేశంలో పాల్గొంటున్నారు. ఇన్చార్జీ నియామకమే లేదు.. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు పార్లమెంట్ ఇన్చార్జీగా పార్టీ పరంగా ఎవరినీ నియమించలేదు. అయితే మాజీ మంత్రి జోగు రామన్నను ఇన్చార్జీగా నియమించే అవకాశం ఉందని పార్టీలో ప్రచారం సాగుతోంది. ఈ నెల 5 తర్వాత ఈ విషయంలో నిర్ణయం వెలువడవచ్చని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇప్పటివరకు కేవలం బోథ్ నియోజకవర్గంలోనే ఈ పార్టీ సమావేశం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో బోథ్, ఆసిఫాబాద్లో మినహా మిగితా అన్నిచోట్ల ఓటమి చవి చూసింది. ఈ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఓట్ల పరంగా మిగితా అన్ని పార్టీలకంటే బీఆర్ఎస్ ముందుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పలువురు సీనియర్ నాయకులు పార్టీని వీడడం, నియోజకవర్గాల్లో క్యాడర్కు దిశానిర్దేశం చేసే నేతలు లేకపోవడం మైనస్గా మారుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ ఎలాంటి ఎత్తుగడలతో ముందుకెళ్తుందనేది వేచి చూడాల్సిందే. ఇవి చదవండి: ‘పొలంబాట’న కేసీఆర్.. సెంటిమెంట్ జిల్లాపై స్పెషల్ ఫోకస్! -
‘పొలంబాట’న కేసీఆర్.. సెంటిమెంట్ జిల్లాపై స్పెషల్ ఫోకస్!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: బీఆర్ఎస్ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. సాగునీరు అందక ఎండిపోయిన పంటల ను పరిశీలించనున్నారు. ఆయన పర్యటనను విజ యవంతం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక పార్టీ అధినేతగా మాజీ సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనకు రావడం ఇది రెండోసారి. మార్చి లో కరీంనగర్లోని ఎస్సారార్ కళాశాల మైదానంలో జరిగిన కరీంనగర్ కదనభేరీసభలో పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలి పించాలని సెంటిమెంట్ జిల్లా అయిన కరీంనగర్ నుంచే ప్రచార శంఖారావాన్ని పూరించారు. తాజా గా రైతుల పొలాలను పరిశీలించనున్నారు. నీరిచ్చే అవకాశం ఉన్నా .. పచ్చటి పొలాలను ప్రభుత్వమే ఎండబెట్టిందని, కంటికి రెప్పలా కాపాడుకున్న పంటలు కళ్లముందు ఎండిపోతోంటే దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతన్నల్లో భరోసా నింపేందుకు కేసీఆర్ మరోసారి కరీంనగర్ రానున్నారు. సెంటిమెంట్ జిల్లాపై స్పెషల్ ఫోకస్.. తెలంగాణ తొలి సింహగర్జన సభ నుంచి కేసీఆర్కు కరీంనగర్ జిల్లా అంటే సెంటిమెంట్. ఇటీవల కరీంనగర్ కదనభేరి బహిరంగ సభతో కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపారు. గెలుపోటములు సహజమని, పదేళ్లు జనరంజకమైన పాలన సాగించామని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన అడ్డగోలు హామీలతో జనం మోసపోయి ఓట్లు వేశారని, రానున్న రోజులు బీఆర్ఎస్ పార్టీదేనని ధైర్యం నింపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఆవశ్యకత, కాంగ్రెస్ హామీల అమలుపై క్షేత్రస్థాయిలో ప్రజలను జాగృతం చేసే పనిలో బీఆర్ఎస్ శ్రేణులు ముందుండాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ను దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్, బీజేపీ మైండ్గేమ్ ఆడుతున్నాయని, ఆ విషప్రచారంలో కార్యకర్తలు చిక్కుకోకుండా చూడాలని, కేడర్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రతినిధులకు ఇదివరకే కేసీఆర్ సూచించినట్లు పార్టీ వర్గాల సమాచారం. రెండు పార్లమెంట్ స్థానాలపై గురి.. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలుపించుకునే దిశగా మాజీ సీఎం కేసీఆర్ కసరత్తు ముమ్మరం చేసినట్లు సమాచారం. కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ సీనియర్ నేతలు కావడం, అపారమైన అనుభవం ఉండటం, పదేళ్లల్లో బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన పనులను క్షేత్రస్థాయిలో వివరించి ఓటు బ్యాంకును పటిష్టపరుచుకుని ఎలాగైనా రెండు సీట్లను కైవసం చేసుకునే దిశగా పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశనం చేయనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తల మధ్య ఉన్న భేదాభిప్రాయాలను తొలగించడంపైనా దృష్టి సారించినట్లు సమాచారం. నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం కొరవడటం, కొన్ని నియోజకవర్గాల్లో మొన్నటి వరకు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారితోనే ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య అంతరాలు పెరిగిపోవడం వంటి సమస్యలపై దృష్టిసారించనున్నారు. అన్నదాతకు అండగా.. సర్కారుపై సమరం చేసేందుకు వస్తున్న బీఆర్ఎస్ అధినేత పర్యటనపై ఆసక్తి నెలకొంది. ‘చొప్పదండి’లో తారాస్థాయికి అసమ్మతి చొప్పదండి నియోజకవర్గంలో పార్టీలో అసమ్మతి తీవ్రస్థాయికి చేరుకుంది. అసెంబ్లీ ఎన్నికల ముందునుంచే అప్పటి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్కు వ్యతిరేకంగా జట్టుకట్టిన ద్వితీయశ్రేణి నాయకులు.. కాంగ్రెస్, ఇతరపార్టీల వైపు వెళ్లారు. తాజాగా అదే నియోజకవర్గం నుంచి కీలకంగా వ్యవహరిస్తున్న ఓ నేత సుంకె తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గ ఇన్చార్జిగా సుంకె కొనసాగితే ఇతర పార్టీలోకి వెళ్లడమే మంచిదని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. చొప్పదండిలో నెలకొన్న అసమ్మతిపై పార్టీ అధిష్టానం ఏ మేరకు దృష్టిసారిస్తుందో వేచి చూడాలి. కేసీఆర్ పర్యటన సాగుతుందిలా ఉదయం 8.30కు ఎర్రవల్లిలోని ఫాంహౌస్ నుంచి బయలుదేరి ఉదయం 10.30 గంటలకు కరీంనగర్ మండలం మొగ్దుంపూర్ చేరుకుంటారు. గ్రామంలో ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడుతారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కరీంనగర్లోని మాజీమంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంటికి చేరుకుని అక్కడే భోజనం చేస్తారు. మధ్యాహ్నం 2గంటలకు రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లిలనెండిన వరిపంటను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు శభాష్పల్లి వద్ద మిడ్మానేరు రిజర్వాయర్ను పరిశీలిస్తారు. సాయంత్రం 4 గంటలకు రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు ఎర్రవెల్లి ఫాంహౌజ్కు బయల్దేరుతారు. -
మాది ప్రజలు గెలిపించిన ప్రభుత్వం : భట్టి విక్రమార్క
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ప్రజల తీర్పుతో, ప్రజా ఆకాంక్షలతో ఏర్పడిన ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని.. కూల్చేస్తామనే వారి కలలు నెరవేరే అవకాశం లేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్లో కొనసాగడానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇష్టపడకపోగా, ఎప్పుడెప్పుడు కాంగ్రెస్లో చేరదామా అనే ఉత్సాహంతో ఉన్నారని పేర్కొన్నారు. అయినా తాము ఫిరాయింపులను ప్రోత్సహించడం లేదని భట్టి చెప్పారు. ఢిల్లీలో పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం నడుస్తోందని.. ఈ సమావేశాల్లో ఖమ్మం లోక్సభ అభ్యర్థిపై చర్చించనుండగా రెండు, మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని తెలిపారు. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 12 నుంచి 14 స్థానాల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పిన భట్టి.. ఎన్నికల్లో తమకు ఏ పార్టీ పోటీ ఇచ్చే పరిస్థితి లేదన్నారు. గత ప్రభుత్వ తీరుతోనే నీటి సమస్య.. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ తీరుతోనే ప్రస్తుతం నీటి సమస్య వచ్చిందని.. గత వర్షాకాలంలో నీటిని సక్రమంగా వినియోగించుకోకపోవడంతోనే ఇప్పుడు ఇబ్బంది ఎదురవుతోందని భట్టి పేర్కొన్నారు. గత ప్రభుత్వం నీటిని రాజకీయాల కోసమే వాడుకోగా.. తాము ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో నీటిని తాగు అవసరాలకు ఎలా ఉపయోగించుకోవాలో ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. విద్యుత్ డిమాండ్ గరిష్టస్థాయిలో ఉన్నా అందుకు తగినట్లుగా సరఫరా చేస్తున్నామని చెప్పారు. చాలా మంది నాయకులు వారి స్థాయి దిగజార్చుకుని మాట్లాడుతున్నారని, వారు నిర్వహించిన మీడియా సమావేశంలో కరెంట్ పోకపోయినా పోయినట్లుగా చెబుతూ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారని భట్టి మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సరైన రీతిలో ప్రభుత్వాన్ని నడపకపోవడంతోనే ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. తాము ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా కృషి చేస్తున్నామని, కేంద్ర మంత్రి గడ్కరీ నుంచి రీజనల్ రింగ్ రోడ్డుకు క్లియరెన్స్ తీసుకొచ్చామని, ఇతర అంశాల్లోనూ నిధులపై ఒప్పించి తీసుకొచ్చామని భట్టి తెలిపారు. అంతేతప్ప ఢిల్లీ వెళ్లి ఇతర రాష్ట్రాల నేతలతో సమావేశమవుతూ దేశ్కీ నేత కావాలనుకోలేదని భట్టి చెప్పారు. కాగా, తుక్కుగూడలో నిర్వహించే సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి భారీ స్థాయిలో ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, పార్టీ నాయకులు రాయల నాగేశ్వరరావు, జావీద్, మలీదు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: మేం వచ్చాకే జనరంజక పాలన : తుమ్మల నాగేశ్వరరావు -
మేం వచ్చాకే జనరంజక పాలన : తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం: పదేళ్ల కాలంలో రైతు రుణమాఫీ చేయని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఖమ్మం నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని ప్రభుత్వ శాఖలను బీఆర్ఎస్ భ్రష్టు పట్టించిందని ఆరోపించారు. అవినీతి, కబ్జాలతో పాటు పోలీసుల సహకారంతో బీఆర్ఎస్ నేతలు తిరిగి అధికారంలోకి వస్తామని అనుకున్నా.. కాంగ్రెస్ శ్రేణుల శక్తిసామర్థ్యాల ఎదు ట వారి ఆశలు పటాపంచలయ్యాయని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఒక్కటొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు, వడ్డీ కడుతూనే హామీలను నెరవేరుస్తున్నామని తుమ్మల చెప్పారు. కాగా, అన్నిచోట్ల పంటలు కోతకు వచ్చాయని, జిల్లాలో నీరు లేక ఎక్కడా పంట ఎండిపోలేదన్నారు. వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలపైనే రైతులు ఆధారపడుతున్నందున ఒక్క సెకన్ కూడా కరెంట్ పోకుండా రోజుకు రూ.50కోట్లు వెచ్చించి రాష్ట్రంలో కరెంట్ సరఫరా చేస్తున్నామని మంత్రి తెలిపారు. కాగా, లోక్సభ ఎన్నికల్లో ఓట్ల కోసమే బీఆర్ఎస్ నేతలు నీళ్ల రాజకీయం చేస్తున్నారని.. కానీ వారికి అసెంబ్లీ ఎన్నికల మాదిరి పరాభవం తప్పదని చెప్పారు. తమ 120 రోజుల పాలనతో దేశమంతా తెలంగాణ వైపు చూస్తోందని.. అందుకనే ఇక్కడ ఇచ్చిన గ్యారంటీలను దేశమంతా అమలు చేస్తామని ప్రకటించేందుకు రాహుల్గాంధీ, ఖర్గే శనివారం తుక్కుగూడ సభకు వస్తున్నారని తెలిపారు. ఈమేరకు జిల్లా నుంచి నుంచి తుక్కుగూడ సభకు పార్టీ శ్రేణులు భారీగా తరలిరావాలని మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు మహ్మద్ జావీద్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య మాట్లాడగా డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా, కార్పొరేటర్లు లకావత్ సైదులు, మలీదు వెంకటేశ్వర్లు, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, రాపర్తి శరత్, నాయకులు సాధు రమేష్రెడ్డి, మిక్కిలినేని నరేందర్, ముస్తఫా, కొంగర జ్యోతిర్మయి, పొదిల రవికుమార్తో పాటు నాయకులు, కార్య కర్తలు పాల్గొన్నారు. ఇవి చదవండి: ఇన్చార్జీలకు సవాలే.. -
అలా.. మాట్లాడిన అతను పదవికి రాజీనామా చేయాలి : ఎంపీ అర్వింద్
నిజామాబాద్: రాష్ట్రంలో ముసింల ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ పాకులాడుతోందని, అందుకు నిదర్శనమే మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలని బీజేపీ అభ్యర్థి, ఎంపీ అర్వింద్ ధర్మపురి పేర్కొన్నారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సీఏఏ, ఎన్ఆర్సీ అమలు చేయమని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధికారికంగా ప్రకటించడాన్ని ఖండిస్తున్నామన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి, ముస్లింల ఓట్ల కోసం ఈ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. పార్లమెంట్లో పాసైన చట్టాలను ఏ రాష్ట్రమైనా అమలు చేయమనే అధికారం లేదన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే విధంగా మాట్లాడిన ఉత్తమ్కుమార్రెడ్డి వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి, ప్రధానకార్యదర్శి లక్ష్మీనారాయణ, స్రవంతిరెడ్డి, న్యాలం రాజు, శంకర్, మల్లేశ్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: ముఖ్యమంత్రి గుంపు మేస్త్రీ.. ప్రధానమంత్రి తాపీ మేస్త్రీ.. -
బీఆర్ఎస్తోనే అన్నివర్గాలకు న్యాయం : గంగుల కమలాకర్
కరీంనగర్: బీఆర్ఎస్తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని, రానున్న ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా వినోద్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించా లని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలు పునిచ్చారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భా గంగా కిసాన్నగర్ 3,25వ డివిజన్లో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఎమ్మెల్యే కమలాకర్, వినోద్కుమార్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడ్డాక స్మార్ట్సిటీ నిధులతో పాటు సీఎం హామీ నిధులు రూ.360 కోట్లతో కరీంనగర్ నగరాన్ని అద్దంలా తీర్చిదిద్దామని అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల మోసపూరిత వాగ్దానాలను తిప్పికొట్టి బీఆర్ఎస్కు అండగా నిలవాలని ప్రజలను కోరా రు. మేయర్ సునీల్రావు, బీఆర్ఎస్ నాయకులు చల్ల హరిశంకర్, ఎడ్ల అశోక్, కుర్ర తిరుపతి, కంసాల శ్రీనివాస్, కామారపు శ్యాం పాల్గొన్నారు. ఇవి చదవండి: బీజేపీ ఎందుకు సుమోటోగా తీసుకోవడం లేదు? -
కాంగ్రెస్ పాలనతోనే అభివృద్ధి : ఎంపీ బలరాంనాయక్
ఖమ్మం: కాంగ్రెస్ పాలనతోనే అభివృద్ధి సాధ్యమని మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ పేర్కొన్నారు. బుధవారం మణుగూరులోని డీవీ గ్రాండ్ హాల్లో పినపాక నియోజకవర్గ కో–ఆర్డినేటర్ కాటబోయిన నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో కలిసి మాట్లాడారు. గత బీఆర్ఎస్ పాలనలో అక్రమాలకు పాల్పడి రూ.7 లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. తాను గతంలో ఎంపీగా ఉన్నప్పుడు పినపాక, భద్రాచలం నియోజవర్గాల్లో రూ.కోట్ల నిధులతో రహదారి సౌకర్యం కల్పించానని, మణుగూరుకు అదనపు రైలు సౌకర్యం తన హయాంలోనే వచ్చిందని వివరించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నియోజకవర్గాన్ని మోడల్గా తీర్చిదిద్దేందుకు పులుసుబొంత, సీతమ్మసాగర్, వట్టి వాగు తదితర సమస్యలను సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, పార్లమెంట్ ఎన్నికల అనంతరం సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఇప్పటికే రూ.10 కోట్లతో మారుమూల గ్రామాలకు లింక్ రోడ్లు నిర్మిస్తున్నట్లు, రూ.20 కోట్లతో మున్సిపాలిటీ సమస్యలు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఎంపీగా బలరాంనాయక్ను గెలిపించుకుంటే మరింత అభివృద్ధి సాధించవచ్చని అన్నారు. ఈ నెల 6న తుక్కగూడలో జరిగే భారీ బహిరంగ సభకు తరxలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బీరం సుధాకర్రెడ్డి, మండలాల అధ్యక్షులు పీరినాకి నవీన్, గొడిశాల రామనాధం, ఓరుగంటి భిక్షమయ్య, సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, దుర్గంపూడి కృష్ణారెడ్డి, పాయం రామనర్సయ్య, శివ సైదులు, నియోజకవర్గ యువజన విభాగం ఉపాధ్యక్షుడు కొర్సా ఆనంద్, అశ్వాపురం ఎంపీపీ ముత్తినేని సుజాత, మణుగూరు వైస్ ఎంపీపీ కేవీరావు, భద్రాద్రి జిల్లా కార్మిక శాఖ మహిళా అధ్యక్షురాలు భోగినేని వరలక్ష్మి, తుక్కాని మధుసూదన్రెడ్డి, నియోజకవర్గ నాయకులు బషీరుద్దీన్, సామాశ్రీనివాసరెడ్డి, గాండ్ల సురేశ్ పాల్గొన్నారు. గెలుపే లక్ష్యంగా పనిచేయాలి.. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని కేంద్ర మాజీ మంత్రి, మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరామ్ నాయక్ అన్నారు. జ్వరంతో బాధపడుతున్న మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బట్టా విజయ్గాంధీని బుధవారం ఆయన పోలవరం గ్రామంలో పరామర్శించి మాట్లాడారు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకువస్తే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యాలు పూర్తిస్థాయిలో నెరవేరుతాయన్నారు. అనంతరం బలరామ్ నాయక్ను స్థానిక కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఇవి చదవండి: ‘పదేళ్ల తర్వాత.. సమైక్యరాష్ట్రం నాటి సంక్షోభమా?’ -
సీఎంను విమర్శించే స్థాయి డీకే అరుణకు లేదు : ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి
మహబూబ్నగర్: రాష్ట్రంలో ప్రజా పాలన అందిస్తున్న సీఎం రేవంత్రెడ్డిని విమర్శించే స్థాయి డీకే అరుణకు లేదని డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కుటుంబ అవసరాల కోసమే రాజకీయాల్లో ఉన్న డీకే అరుణ సీఎం రేవంత్రెడ్డిపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడం తగదన్నారు. మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిందని గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే ఐదు అమలుచేస్తున్నామని, పాలమూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి సీఎం కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. డీకే అరుణ పాలమూరుకు చేసిందేమిలేదని, ఆమె మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. కేంద్రంలో మోదీ, పాలమూరులో డీకే అరుణ ఓడిపోనున్నారని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, రాహుల్ ప్రధాని అవుతారన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్రెడ్డి 2 లక్షల మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందా అని విలేకరి అడిగిన ప్రశ్నకు అలాంటి వ్యక్తులను పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదని చెప్పారు. సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్కుమార్, అధికార ప్రతినిధి హర్షవర్ధన్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆనంద్గౌడ్, మాజీ చైర్మన్ రాధ, నాయకులు బెనహర్, బెక్కరి అనిత, సిరాజ్ ఖాద్రీ, సాయిబాబా, లక్ష్మణ్యాదవ్, ఫయాజ్, అజ్మత్అలీ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: బీజేపీ, బీఆర్ఎస్లు ప్రజలకు చేసిందేమీలేదు : మంత్రి సీతక్క -
లబ్ధికోసమే బీఆర్ఎస్ నీటి రాజకీయం : దుద్దిళ్ల శ్రీధర్బాబు
పెద్దపల్లి: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల చేతిలో భంగపడ్డ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మరోసారి తెలంగాణ ప్రజలు, రైతులను మోసగించి పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకే ‘నీళ్ల’ రాజకీయం చేస్తున్నారని రాష్ట్రమంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మండిపడ్డారు. జిల్లా కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు విజయరమణారావు, ఠాకూర్ మక్కాన్సింగ్తో కలిసి మాట్లాడారు. అధికారంలో ఉన్న పదేళ్లలో రైతులను ఏనాడూ పట్టించుకోని కేసీఆర్కు ఇప్పుడు వారి కష్టాలు గుర్తుకొచ్చాయని మొసలికన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. అయినా రైతులు ఆయనను నమ్మడం లేదన్నారు. కాంగ్రెస్ అఽధికారంలోకి రాగానే బీఆర్ఎస్ పాలనలో చేసిన మోసాలు, పాపాలు బయటకు వస్తున్నాయని, వాటినుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తాం.. వ్యవసాయ రంగంలో సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తామని, అలాగే పాలకుర్తి మండలంలో ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీధర్బాబు ప్రకటించారు. తమ ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమం కోసం పాటుపడుతోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీలన్నీ పక్కాగా అమలు చేస్తామని అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటికే 35కోట్ల మంది అక్కాచెల్లెళ్లు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సాగించారని అన్నారు. 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అర్హులందరికీ అందిస్తామని తెలిపారు. సాంకేతిక కారణాలతో పొరపాట్లు దొర్లినా ఇబ్బంది పడొద్దని, వారి నుంచి విద్యుత్ అధికారులు బిల్లులు వసూలు చేయరాదని సూచించారు. జిల్లా ప్రజలకు ఆరోగ్యశ్రీ ద్వారా రూ.15కోట్ల విలువైన వైద్యసేవలు అందించామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసిన బీఆర్ఎస్ పాలకుల తప్పిదాలను గాడిన పెట్టేందుకే సమయం పడుతోందని తెలిపారు. సమావేశంలో నాయకులు శంకర్, రమేశ్గౌడ్, సారయ్య, ప్రకాశ్రావు, మహేందర్, సంపత్, మల్లయ్య, శ్రీనివాస్, మస్రత్, కుమార్, ఈర్ల స్వరూప, కుమారస్వామి, అక్బర్అలీ పాల్గొన్నారు. ఇవి చదవండి: దానం నాగేందర్ను గెలిపించడమే మా బాధ్యత: కోమటిరెడ్డి -
ఎలక్షన్లు, కలెక్షన్లు అంటూ.. మాటల తూటాలు!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: లోక్సభ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం షురూవైంది. ఇరు పార్టీల నేతలు పరస్పరం మాటల తూటాలు పేలుతున్నాయి. ఆయా పార్టీల క్యాడర్ను ఈ ఎన్నికలకు సమాయత్తం చేయడంలో భాగంగా నిర్వహిస్తున్న సమావేశాల్లో నేతలు ఒకరినొకరు చేసుకుంటున్న ప్రత్యారోపణలతో ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయం వేడెక్కింది. ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీ నేతల విమర్శలు రాజకీయవర్గాల్లో రచ్చకు దారితీస్తున్నాయి. బీఆర్ఎస్ ఎద్దేవా? బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు అంటే ఎలక్షన్లు, కలెక్షన్లు అంటూ బీఆర్ఎస్ నేతలు సైటెర్లు వేశారు. గులాబీ పార్టీ సంగారెడ్డి నియోజకవర్గం ముఖ్య నాయకుల సమావేశం మంగళవారం స్థానిక ఓ ఫంక్షన్ హాలులో జరిగింది. దుబ్బాకలో ప్రజలు తిరస్కరించిన ఆయన్నే బీజేపీ మెదక్ లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దించిందని కారు పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ తీరును కూడా ఎండగట్టారు. నచ్చినోళ్లు జేబులో ఉండాలి నచ్చనోళ్లు జైలులో ఉండాలి అన్నట్లుగా బీజేపీ సర్కారు వ్యవహరిస్తోందని విమర్శించారు. ఆయనకు నిధులెక్కడివి? బీఆర్ఎస్ నేతల విమర్శలను కమలం పార్టీ తిప్పికొట్టింది. బీఆర్ఎస్ అభ్యర్థి పి.వెంకట్రాంరెడ్డికి రూ. వంద కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయంటూ బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు ప్రశ్నించారు. తాను ఎంపీగా గెలిచాక రూ.వంద కోట్లు సొంత నిధులతో పీవీఆర్ ట్రస్ట్ను ఏర్పాటు చేస్తామని వెంకట్రాంరెడ్డి ప్రకటించారు. ఇందులోంచి ఏటా రూ.20 కోట్లతో నియోజకవర్గంలోని నిరుపేద విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్యను అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ వివరాలను పక్కాగా వెబ్సైట్లో ఉంచుతానని స్పష్టం చేశారు. ఆయనకు రూ.వంద కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయంటూ సంగారెడ్డిలో బుధవారం నిర్వహించిన బీజేపీ ముఖ్యనేతల సమావేశంలో రఘునందన్ ప్రశ్నించారు. ఇవి చదవండి: కాంగ్రెస్కు ఓటేస్తే రైతుల పరిస్థితి ఆగమే.. : వినోద్కుమార్ -
కాంగ్రెస్కు ఓటేస్తే రైతుల పరిస్థితి ఆగమే.. : వినోద్కుమార్
కరీంనగర్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోటార్లు, ట్రాన్స్ఫా ర్మర్లు కాలిపోతున్నాయని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పొరపాటున ఆ పార్టీకి ఓటేస్తే రైతులు ఆగమయ్యే పరిస్థితి ఉంటుందని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అన్నారు. బుధవారం వీణ వంక మండల కేంద్రంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా మోటార్ వైండింగ్ షాపులో రిపేరు చేస్తున్న వ్యక్తితో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరెంట్ మోటార్లు కాలి పోయి రిపేరుకు వచ్చిన సందర్భాలు లేవన్నారు. కేసీఆర్ కొట్లాడి తెచ్చిన తెలంగాణలో పదేళ్ల పాటు ఏనాడు ఈ పరిస్థితి రాలేదని వివరించారు. కేసీ ఆర్ను కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులపైన ఉందని, రైతులు, ప్రజలు, యువత, మేధావులు ఆలో చన చేయాలని కోరారు. అలాగే వీణవంక మండల కేంద్రంలోని ఓ హోటల్లో చాయ్ తాగుతూ నాయకులు, కార్యకర్తలతో ముచ్చటించారు. పవర్కట్ ప్రాంతాలు.. విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తీసివేత పనులు చేపడుతున్నందున గురువారం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ కొలుపుల రాజు తెలిపారు. 11 కేవీ తీగలగుట్టపల్లి ఫీడర్ పరిధిలోని మాణికేశ్వరీనగర్, కార్తీకేయనగర్, విఘ్నేశ్వరనగర్, అయోధ్యనగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
రసవత్తరంగా మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ‘ఉప’ పోరు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప పోరు రసవత్తరంగా మారింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పోటాపోటీగా ఓటర్లను క్యాంప్లతో తరలించడంతో రాజకీయాలు హీటెక్కాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ డీలా పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరుగుతున్న తొలిపోరు కావడం, సిట్టింగ్ స్థానం కూడా కావడంతో ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత ఇలాకా మహబూబ్నగర్ కాగా.. కాంగ్రెస్ సైతం పట్టువదలకుండా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో ‘విందు’రాజకీయాలతో పాటు బేరసారాలు ఊపందుకున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఓటుకు ఒక్కో రేటు పలుకుతుండగా.. భారీ ఎత్తున తాయిలాలు, ఆఫర్లతో ఓటర్లను ఆకట్టుకుంటున్నట్లు సమాచారం. భారీగా తాయిలాలు.. ఓటర్లు చేజారకుండా ఆయా పార్టీలు క్యాంప్లకు తరలించి.. విందు రాజకీయాలకు తెరలేపడంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులతో పాటు కౌన్సిలర్లకు ఫుల్ డిమాండ్ పలుకుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్కరికి ఒక్కో రేటు నిర్ణయించడంతో పాటు నియోజకవర్గాల వారీగా కీలకంగా వ్యవహరిస్తున్న నాయకులకు సైతం పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెబుతున్నట్లు సమాచారం. ఇరు పార్టీల్లోనూ ఇప్పటికే మాట్లాడుకున్న దాని ప్రకారం ఓటర్లకు సగం అందజేయగా.. మిగతా మొత్తం పోలింగ్ రోజు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అంతేకాదు.. పలు నియోజకవర్గాలకు సంబంధించి బేరసారాలు పోటాపోటీగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఒకరు ఇంత ఇస్తామని చెబితే.. దానికంటే అదనంగా ఇస్తామని మరొకరు చెబుతూ ఓటర్లను తమ వైపునకు తిప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. గోవా, ఊటీ, కొడైకెనాల్.. ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పరిధిలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు, పురపాలికల కౌన్సిలర్లతో పాటు ఎక్స్అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఓట్లు వేయనున్నారు. కాంగ్రెస్ నుంచి యువ పారిశ్రామిక వేత్త, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు మన్నె జీవన్రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మాజీ జెడ్పీటీసీ సభ్యుడు నవీన్ కుమార్రెడ్డితో పాటు మరొకరు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో మొత్తం 1,439 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అయితే 70 శాతానికి పైగా ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు కాగా.. వారం కిందటే ఆ పార్టీ నేతలు వారిని టూరిస్ట్ బస్సుల్లో గోవా, ఊటీ ప్రాంతాలకు తరలించారు. సుమారు వంద మంది సభ్యులున్న బీజేపీ కూడా రెండు రోజుల కిందట కొడైకెనాల్కు తరలించింది. తాజాగా కాంగ్రెస్ సభ్యులు సైతం ఏపీ, కర్ణాటక ప్రాంతాలకు బయల్దేరి వెళ్లారు. మహిళా ఓటర్లకు ప్రత్యేక నజరానా.. మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 1,439 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 795 మంది మహిళలు, 644 మంది పురుషులు ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 151 మంది అధికంగా ఉండగా.. ఈ మేరకు ప్రధాన పార్టీల అభ్యర్థులు వారిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పలు నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు క్యాంప్లకు వెళ్లకుండా.. తమ భర్తలను పంపారు. మిగతా ఓటర్లకు ఇచ్చిన మొత్తం కంటే అధికంగా ఇస్తామని.. చీర, సారెలు సమర్పిస్తామని.. తమకే ఓటు వేసేలా ప్రమాణం చేయించుకున్నట్లు సమాచారం. ఇవి చదవండి: ఈ కూడలిలో ఎవరి ప్రభావం ఎంత? -
ఈ రెండుస్థానాల్లో పోటీ ఎవరు..?
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉత్తర తెలంగాణలో కీలకమైన పార్లమెంటు స్థానం కరీంనగర్. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీలు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుండగా.. హస్తం పార్టీ మాత్రం ఇంకా ఏ అభ్యర్థినీ ఖరారు చేయలేదు. పొరుగునే ఉన్న నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోకి జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్లు వస్తాయి. ఈ స్థానానికి సైతం ఇంకా అభ్యర్థిని ప్రకటించకపోవడం గమనార్హం. ఈ రెండుస్థానాల్లో ఎవరు పోటీ చేస్తారన్న విషయంలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ ప్రచారాలు ఇటు కేడర్లో అటు ఆశావహుల్లో గందరగోళం చెలరేగేలా చేస్తున్నాయి. హైకమాండ్ ఆలోచన ఏంటన్నది అర్థం కాక క్షేత్రస్థాయి హస్తం పార్టీ నేతలు సతమతమవుతున్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో అనూహ్యంగా పారాచూట్ లీడర్ అయిన గడ్డం వంశీకృష్ణను అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్, ఎప్పుడో అనుకున్న జీవన్రెడ్డి, ప్రవీణ్రెడ్డి పేర్లపై ఇంకా జాప్యం చేస్తుండటం పార్టీలో ఉత్కంఠకు, కేడర్లో గందరగోళానికి కారణమవుతోంది. పెద్దపల్లి తరహాలో నిజామాబాద్, కరీంనగర్లో పారాచూట్ లీడర్లకు ఎంపీ టికెట్ ఇస్తారన్న ప్రచారం ఆయా అభ్యర్థుల అనుచరుల్లో అయోమయానికి దారి తీస్తోంది. నేటికీ నెరవేరని ఢిల్లీ పెద్దల హామీ.. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హుస్నాబాద్ ఎమ్మెల్యే స్థానాన్ని త్యాగం చేసిన అలిగిరెడ్డి ప్రవీణ్రెడ్డికి ఎంపీ సీటు ఇస్తామని కాంగ్రెస్ స్పష్టమైన హామీ ఇచ్చింది. ఈ హామీ ఢిల్లీ పెద్దల నుంచి రావడంతో అంతా తదుపరి కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ప్రవీణ్రెడ్డి అనే అనుకున్నారు. అదే హామీపై అంగబలం, అర్ధబలం దండిగా ఉన్న ప్రవీణ్రెడ్డి సెగ్మెంట్లోని హుస్నాబాద్, మానకొండూరు, కరీంనగర్, హుజూరాబాద్, సిరిసిల్ల ఇతర అసెంబ్లీ సెగ్మెంట్లలో తన ప్రచార పోస్టర్లను కూడా అంటించారు. అయితే, ఇప్పటి వరకూ రెండుసార్లు ఎంపీ అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పెద్దలు ప్రకటించినా అందులో ప్రవీణ్రెడ్డికి చోటు దక్కకపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు వెలిచాల రాజేందర్రావు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసే అవకాశం తనకు ఇవ్వాలంటూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర పెద్దలను రాజేందర్రావు కలిసిన సందర్భంలోనూ ప్రవీణ్రెడ్డికే అన్న సంకేతాలు ఇచ్చినా.. ఆయన మాత్రం తన అభ్యర్థిత్వంపై వెనకడుగు వేయడం లేదు. ఇంకోవైపు కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పేరు కూడా తెరపైకి వచ్చింది. తన విజయావకాశాలపై కరీంనగర్ ఎంపీ సెగ్మెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో మల్లన్న అనుచరులు ఏకంగా బహిరంగ సర్వే చేపట్టారు. మరోవైపు నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ జీవన్రెడ్డిని ప్రకటిస్తారని అనుకున్నా.. తొలి రెండులిస్టుల్లో ఆయనకూ చాన్స్ రాలేదు. దీంతో ఈ రెండుస్థానాల్లో అధిష్టానం అభ్యర్థుల ప్రకటనను జాప్యం చేస్తుండటం, కొత్త అభ్యర్థుల పేర్లు తెరపైకి వస్తుండటంతో ఆ పార్టీ నేతల్లో గందరగోళం, అయోమయాలకు కారణమవుతోంది. అసలు అధిష్టానం మనసులో ఏముందో అర్థం కాని పరిస్థితి నెలకొందని పేరు తెలిపేందుకు ఇష్టపడని ఓ సీనియర్ నేత ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. పాఠాలు నేర్వలేదా? రాష్ట్రంలో ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ కేసులో ఈడీ దూకుడు ప్రధానాంశాలుగా ఉన్నాయి. ఇందులో ఎమ్మెల్సీ కవిత అరెస్టు, ఈడీ దర్యాప్తు దూకుడు తదితర అంశాలను బీజేపీ ఆయుధాలుగా మార్చుకుని నిజమాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బీఆర్ఎస్పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు మేడిగడ్డకు మరమ్మతులు చేయకపోవడం వల్లే రాష్ట్రంలో కరువు వచ్చిందని, ఇచ్చిన హామీలను ఇంతవరకూ నెరవేర్చలేదని బీఆర్ఎస్ పార్టీ హస్తం పార్టీపై దుమ్మెత్తి పోస్తోంది. అయితే, ఈ సందర్భంలో నిజామాబాద్, కరీంనగర్ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ వాయిస్ వినిపించే వారు కరవయ్యారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంకా అభ్యర్థుల ప్రకటనలో కాలం గడిపేస్తున్న కాంగ్రెస్.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అభ్యర్థి ప్రకటన ఆలస్యం చేసి చేతులు కాల్చుకున్న సంగతిని మర్చిపోయిందా? గతం నుంచి పాఠాలు నేర్వకపోతే ఎలా? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ గాలి వీచినా.. అభ్యర్థి ప్రకటనను జాప్యం చేసి కరీంనగర్లో దాన్ని అనుకూలంగా మలుచుకోవడంలో హస్తం పార్టీ విఫలమైందన్న విమర్శలు మూటగట్టుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కేవలం 17 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంలోనూ అదే మల్లగుల్లాలు పడుతోంది. పోనీ, ప్రకటించిన వారిలోనూ పారాచూట్ నేతలకే పెద్ద పీట వేయడాన్ని కేడర్ జీర్ణించుకోలేకపోతుంది. దీంతో తమ నాయకులను పక్కనబెట్టి.. ఎక్కడ పారాచూట్ లీడర్లకు టికెట్ కేటాయిస్తారో? అని జీవన్రెడ్డి, ప్రవీణ్రెడ్డి అనుచరుల్లో ఆందోళన నెలకొంది. ఇవి చదవండి: Liquor Case: కవితకు జైలా? బెయిలా? -
ఈ కూడలిలో ఎవరి ప్రభావం ఎంత?
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో పట్టున్న సీపీఎం, సీపీఐ పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు కోసం వేచిచూస్తున్నాయి. బీఆర్ఎస్తో వెళ్లేది లేదని ఖరాఖండిగా చెబుతూనే కాంగ్రెస్ స్నేహ హస్తం కోసం ఎదురుచూస్తున్నాయి. ఉభయ పార్టీల ప్రతిపాదనపై ఇప్పటివరకు కాంగ్రెస్ స్పందించకపోవడంతో కామ్రేడ్స్ అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. సీపీఎం ఇప్పటికే నిరీక్షణను పక్కనపెట్టి భువనగిరి అభ్యర్థిని ప్రకటించడమే కాక మిగతా స్థానాల్లో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై సమాలోచనలు చేస్తోంది. సీపీఐ మాత్రం దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో ఉన్నందున రాష్ట్రంలో ఒక్క ఎంపీ స్థానమైనా తమకు ఇవ్వాలని పట్టుబడుతోంది. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ చర్చలకు పిలవకపోవడంతో ఈనెలాఖరు నాటికి ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ కలిసి పోటీ చేశాయి. సీపీఎం నల్లగొండ, ఖమ్మం స్థానాల్లో.. సీపీఐ మహబూబాబాద్, భువనగిరిలో పోటీ చేసినా ఫలితం దక్కలేదు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం ఉమ్మడి జిల్లాలో ఒంటరిగా, సీపీఐ కాంగ్రెస్తో జత కట్టాయి. ఆ ఎన్నికల్లో నమోదైన ఓట్ల ఆధారంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఈ పార్టీల ప్రభావం ఎంత మేరకు ఉంటుందన్న అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఓ వైపు కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ అభ్యర్థిని ప్రకటించగా.. నేడో, రేపో ఖమ్మం అభ్యర్థిని కూడా ప్రకటించే అవకాశముంది. దీంతో సీపీఎం భువనగిరి ఒక్క స్థానానికే పరిమితవుతుందా, ఖమ్మంలోనూ పోటీ చేస్తుందా అన్నది తేలాల్సి ఉంది. పోటీలో ఆ పార్టీ అభ్యర్థిని పెట్టకపోతే కాంగ్రెస్కు ఎన్ని ఓట్లు కలిసొస్తాయన్న చర్చ జరుగుతోంది. ఇక సీపీఐ నేతలు జాతీయ నాయకత్వం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో ఒక్క స్థానంలోనైనా పోటీ చేయకపోతే కేడర్ బలహీనమవుతుందన్న ఆలోచనలో నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా బీజేపీని నిలువరించడమే లక్ష్యంగా తమ అడుగులు ఉంటాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇవి చదవండి: ఈ రెండుస్థానాల్లో పోటీ ఎవరు..? -
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం! : బీబీ పాటిల్
సంగారెడ్డి: సాధ్యం కాని హామీలు ఇచ్చి అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని బీజేపీ లోక్సభ అభ్యర్థి బీబీ పాటిల్ ఆరోపించారు. మండల పరిఽధి మామిడ్గి గ్రామ శివారులోని ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఆదివారం రాత్రి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు పాండురంగారెడ్డి, పాండురంగారావు పాటిల్, శ్రీనివాస్రెడ్డి, మల్లప్ప ఆధ్వర్యంలో బసంత్పూర్, రాజోల, గంగ్వార్, గణేష్పూర్, మామిడ్గి తదితర గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీజేపీలో చేరారు. అనంతరం బీబీ పాటిల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు దూరమవుతున్నారన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకుంటున్నారన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం తిరిగి మళ్లి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. 400 కంటే అధిక స్థానాలు ఎన్డీఏ కూటమి గెలుచుకుంటుందన్నారు. తెలంగాణలోనూ బీజేపీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. తనకు మరో సారీ అవకాశం ఇస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ జహీరాబాద్ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. సమావేశంలో నాయకులు సుధీర్ కుమార్ బండారి, జగన్నాథ్, జనార్దన్రెడ్డి, ఓంకార్, మల్లేశం, రాహుల్, సతీష్గుప్త, అరవింద్ చౌహన్ పాల్గొన్నారు. ఇవి చదవండి: బీజేపీ వరంగల్ అభ్యర్థిగా ‘అరూరి’.. -
బీఆర్ఎస్ పాలన దోచుకోవడం.. దాచుకోవడమే.. : కోదండరామ్
ఆదిలాబాద్: దోచుకోవడం దాచుకోవడమే లక్ష్యంగా పదేళ్ల బీఆర్ఎస్ పాలన సాగిందని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. పట్ట ణంలోని జేకే ఫంక్షన్హాల్లో జిల్లా అధ్యక్షుడు తిలక్రావు అధ్యక్షతన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం పార్లమెంట్ సన్నాహక సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ అవినీతికి నిలు వెత్తు నిదర్శనంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు నిలిచాయన్నారు. కేంద్రప్రభుత్వ గుర్తింపు పొందిన జాతీయస్థాయిలోని స్వతంత్ర సంస్థ ఆడిటింగ్లో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రణాళిక, అమలు సరిగాలేదని, నిధుల వినియోగం సక్రమంగా లేదని చెప్పిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కంపెనీ నుంచి కేసీఆర్ అందినకాడికి దండుకున్నారని విమర్శించారు. అవసరానికంటే అదనంగా ఖర్చు చేసి పనులు చేపట్టారన్నారు. రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులు దశాబ్దాల క్రితం కట్టారని అవన్నీ నేటికి చెక్కు చెదరకుండా ఉన్నాయని కేసీఆర్ కట్టిన కాళేశ్వరం పనులు మాత్రం ఆదిలోనే పునాదులు కదులుతున్నాయన్నారు. కోట్లాడి తెచ్చిన రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనతో అవినీతి పెరిగిపోయిందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యం పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా టీజేఎస్ శ్రేణులు పనిచేయాలని కోదండరామ్ అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన ఖానాపూర్ అభివృద్ధి చేసేలా ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలతోపాటు గిరిజన వర్సిటీ ఏర్పాటు చేసి పోడు భూములు, డీ 27, డీ28 కాలువల సమస్యలను సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్తానన్నారు. అంతకముందు నాయకులు కోదండరామ్ను సన్మానించారు. పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మోహన్రెడ్డి, నాయకులు సర్దార్ వినోద్, దుర్ము, గోనె శ్రీనివాస్, బెనహర్ సిరాజ్, రాజేశ్వర్రెడ్డి, లింగన్న పాల్గొన్నారు. నిర్వహణ లేకనే ‘కడెం’కు ప్రమాదం.. కడెం ప్రాజెక్ట్ నిర్వహణను గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే ప్రమాదం నెలకొందని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ విమర్శించారు. కడెం ప్రాజెక్టును ఆదివారం ఆయన సందర్శించారు. వరద గేట్ల మరమ్మతు పనులను పరిశీలించారు. రాష్ట్రంలో హైదరాబాద్ ఇంజినీర్లు మొదట కట్టిన ప్రాజెక్టుల్లో కడెం ఒకటన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ ఏర్పడిన తర్వాత కడెంను పట్టించుకోకపోవడంతో డేంజర్ జోన్లోకి వెళ్లిందని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి, మరమ్మతు చేయిస్తోందని తెలిపారు. కడెం ప్రాజెక్ట్కు బ్యాలెన్సింగ్ రిజర్వార్గా ఎగువన కుప్టి ప్రాజెక్టు నిర్మిస్తే ఆయకట్టును స్థిరీకరించవచ్చని పేర్కొన్నారు. ప్రాజెక్టు ఆధునికీకరణ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఆయన వెంట టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు తిలక్రావు ఉన్నారు. ఇవి చదవండి: సార్.. గిరాకీల్లేవ్! -
బాసరలో మంత్రి సీతక్క పూజలు..
ఆదిలాబాద్: బాసర సరస్వతి అమ్మవారిని రాష్ట్ర గిరిజన, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి మాజీ ఎమ్మెల్యేలు విఠల్రెడ్డి, నారాయణ్రావుపాటిల్ స్వాగతం పలి కారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అతకుముందు బాసరలోని పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సీతక్క సమావేశం నిర్వహించారు. మంత్రివెంట ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, నాయకులు ఉన్నారు. కదిలి పాపహరేశ్వరాలయంలో.. మండలంలోని శ్రీమాతాన్నపూర్ణ పాపహరేశ్వర స్వామిని ఆదివారం రాష్ట్రమంత్రి సీతక్క దర్శించుకున్నారు. అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. మంత్రికి ఆలయ పరిసరాలు, విశిష్టతను అర్చకులు వివరించారు. డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, కాంగ్రెస్ నాయకులు ఆత్రం సుగుణ, ఆత్రం భాస్కర్, నాయకులు రాజారెడ్డి, రమణ, విద్యాసాగర్రెడ్డి, పరుశురాం, ఆలయ కమిటీ చైర్మన్ వెంకట్రావు పాటిల్ ఉన్నారు. ఇవి చదవండి: బీఆర్ఎస్ పాలన దోచుకోవడం.. దాచుకోవడమే.. : కోదండరామ్ -
కేజ్రీవాల్, కవితల అరెస్ట్ ప్లాన్ ప్రకారమే జరిగిందా?
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, శాసనమండలి సభ్యురాలు కవితను, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ ఆధినేత అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేసిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. సుప్రింకోర్టులో కవిత పిటిషన్పై విచారణ జరుగుతున్న సమయంలోనే, సరిగ్గా ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడానికి ఒక రోజు ముందుగా, అది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోది తెలంగాణలో పర్యటిస్తున్న తరుణంలోనే ఈ అరెస్టు జరగడం విశేషం. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇంటిపైకి దాడి చేసి, సోదాలు చేసి ఆయనను అరెస్టు చేయడం దేశ చరిత్రలోనే మొదటిసారిగా కనిపిస్తుంది. కేజ్రీవాల్, కవితలకు ఈడీ ఇచ్చిన ఒకటి, రెండు నోటీసులకు స్పందించారు. విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత వారికి అరెస్టు అనుమానం వచ్చిందేమో తెలియదు కానీ విచారణకు హాజరవకుండా కాలయాపన చేశారు. ఎవరు అక్రమాలకు పాల్పడినా చర్య తీసుకోవడం తప్పు కాదు. కానీ ఈ దర్యాప్తు సంస్థలు వేల కోట్ల అక్రమాలు చేసినట్లు అభియోగాలు ఎదుర్కుంటున్న వారిని చూసి, చూడనట్లు వదిలేస్తూ, వంద కోట్లు ఆరోపణలపై ఇంత గట్టిగా హడావుడి చేయడం సహజంగానే అనుమానాలకు తావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ కేసుకు ఎక్కడ లేని ప్రాధాన్యత ఇస్తోంది. ఢిల్లీలో ఆమ్ ఆద్మి పార్టీ ప్రభుత్వంపై కోపంతోనే, అక్కడ బీజేపీకి ఉన్న బలం తగ్గడంతోనే తన చేతిలోని అధికారాన్ని బీజేపీ ఇలా వినియోగిస్తోందన్నది పలువురి అభియోగం. లిక్కర్ స్కామ్ జరిగింది కనుకే అధికారులు చర్య తీసుకున్నారన్నది బీజేపీ వాదన. 2023 శాసనసభ ఎన్నికలు జరగడానికి ముందే కవితను ఈ కేసులో అరెస్టు చేయవచ్చన్న ప్రచారం జరిగింది. ఎందువల్లో కానీ అలా జరగలేదు. దాంతో బీఆర్ఎస్, బీజేపీల మద్య రాజీ కుదిరిందేమో అన్న సందేహాలు వ్యక్తం అయ్యాయి. దీనివల్ల అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి కొంత నష్టం జరిగింది. కనీసం ఇరవై సీట్లు వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నది బీజేపీ నేతల మనోగతంగా ఉంది. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నందున, మాచ్ ఫిక్సింగ్ ఆరోపణ చేయడానికి కాంగ్రెస్కు అవకాశం ఇవ్వరాదన్న లక్ష్యంతోనే ఈ అరెస్టుకు బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉండవచ్చని చాలామంది నమ్ముతున్నారు. కానీ ఇందువల్ల బీజేపీకి ఏమైనా కలిసి వస్తుందా అన్నది చర్చనీయాంశం. ప్రస్తుతం బీఆర్ఎస్ విపక్షంలో ఉంది. తన ఉనికిని కాపాడుకునే పనిలో ఉంది. అలాంటప్పుడు తమవంతుగా ఒక దెబ్బకొట్టి బీఆర్ఎస్ను ఇంకా బలహీనపరిస్తే కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఎదగవచ్చని బీజేపీ నేతలు భావించి ఉండవచ్చు. విశేషం ఏమిటంటే బీజేపీ ఢిల్లీలో జరిగినట్లు చెబుతున్న వంద కోట్ల రూపాయల స్కామ్ పై ఇంత శ్రద్ద చూపుతోంది కానీ, వేల కోట్ల స్కామ్ల గురించి పట్టించుకోకుండా, తమ వైపునకు వస్తే చాలన్నట్లుగా వ్యవహరిస్తోందన్న విమర్శలు కూడా ఉన్నాయి. ప్రత్యేకించి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై ఉన్న కేసులలోకానీ, టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీలు కొందరిపై ఉన్న కేసులలో కానీ,ఆదర్శ్ స్కామ్ లో పదవీచ్యుతుడైన కాంగ్రెస్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ పార్టీ మారి బీజేపీలో చేరగానే రాజ్యసభ సీటు ఇచ్చిన తీరుకానీ, చీలిక వర్గం శివసేన, చీలిక వర్గం ఎన్సీపీ నేతల పట్ల అనుసరించిన వైఖరులు కానీ ఈ అనుమానాలకు తావిస్తున్నాయి. కవిత ఈ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోవడం తప్పే అని ఎవరైనా ఒప్పుకుంటారు. ఆప్కు చెందిన మంత్రి మనీష్ సిసోడియా ఇదే కేసులో సంవత్సర కాలంగా జైలులో ఉన్నారు. లిక్కర్ వ్యాపారాన్ని ప్రైవేటు వ్యాపారులకు అప్పగించడానికి వీలుగా విధానాన్ని మార్చడంపై వచ్చిన ఆరోపణలు, ఢిల్లీ పూర్తి స్థాయి రాష్ట్రం కాదు కనుక, కేంద్రం ఇందులో జోక్యం చేసుకుని సీబీఐ, ఈడీ వంటి వాటిని ప్రయోగించగలిగింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను అరెస్టు చేయడం ద్వారా ఎన్నికల సమయంలో ఆ పార్టీని ఇరుకున పెట్టాలని బీజేపీ తలపెట్టిందన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. నిజంగానే అవినీతిపై బీజేపీ ఫోకస్ పెడితే మంచిదే. అలాకాకుండా కేవలం ప్రత్యర్ధులను భయపెట్టడానికి, తన రాజకీయ అవసరాలు తీర్చుకోవడానికే ఈడీ, సీబీఐ వంటివాటిని వాడితే అది ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచినట్లే అవుతుంది. గతంలో బీజేపీ ఈ సంస్థలపై, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏ విమర్శలు చేసిందో, అదే పని ఇప్పుడు బీజేపీ కూడా చేస్తుందని భావించవలసి ఉంటుంది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికలకు ముందు ప్రధాని మోదిని టెర్రరిస్టుతో పోల్చారు. సీబీఐ, ఈడీ వంటివాటితో తమపై దాడులు చేయిస్తోందని ద్వజమెత్తేవారు. సీబీఐ తనను అరెస్టు చేయడానికి రావచ్చని, అప్పుడు ప్రజలంతా తన చుట్టూ నిలబడి రక్షించుకోవాలని అనేవారు. తమ అనుమతి లేకుండా సీబీఐ రాష్ట్రంలోకి రాకూడదని ఆదేశాలు కూడా ఇచ్చారు. అప్పట్లో కొందరు టీడీపీ ప్రముఖులపై ఈడీ, ఐటీ, సీబీఐ సంస్థలు దాడులు చేశాయి. 2019 ఎన్నికలలో టీడీపీ ఓటమి పాలయ్యాక, చంద్రబాబుకు పీఎస్ గా పనిచేసిన శ్రీనివాస్ ఇంటిలో ఐటీ శాఖ సోదాలు చేసి రెండు వేల కోట్ల రూపాయల మేర అక్రమాలకు సంబంధించిన ఆదారాలు దొరికినట్లు సీబీటీడీ ప్రకటించింది. అలాగే చంద్రబాబుకు ఆదాయపన్ను శాఖ మనీ లాండరింగ్ తదితర ఆరోపణలకు సంబందించి పలుమార్లు నోటీసులు ఇచ్చింది. అయినా ఆయన ఏదో రకంగా వాటి నుంచి బయటపడుతూనే ఉన్నారు. టీడీపీ ఓడిపోయిన వెంటనే చంద్రబాబు యుటర్న్ తీసుకుని ప్రధాని మోదిని, బీజేపీని పొగడడం ఆరంభించారు. అంతవరకు మోది అంత అవినీతి పరుడు లేడని, టెర్రరిస్టు అని, భార్యను ఏలుకోలేని వాడు దేశాన్ని ఏమి ఏలతాడని అంటూ వ్యక్తిగతంగా చంద్రబాబు దాడి చేసేవారు. కానీ ఓటమి తర్వాత బీజేపీకి పూర్తిగా సరెండర్ అయిపోయారు. తన పార్టీకి చెందిన నలుగురు ఎంపీలను బీజేపీలోకి పంపించారు. పవన్ కల్యాణ్ను బీజేపీ గూటికి పంపించి, తనకు, బీజేపీకి మధ్య రాయబారిగా వాడుకున్నారు. బీజేపీ కూడా చంద్రబాబు కేసుల జోలికి రాకుండా వదలిపెట్టేసిందని అనుకోవాలి. ఏపీలో చంద్రబాబు టైమ్ లో జరిగిన పలు కుంభకోణాలలో సీబీఐ దర్యాప్తు కోరుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం లేఖ రాసినా కేంద్రం స్పందించలేదంటేనే చంద్రబాబు మేనేజ్మెంట్ స్కిల్ ఏ రకంగా ఉన్నది జనం అర్దం చేసుకున్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు అవినీతి పరుడని, పోలవరాన్ని ఏటీఎమ్గా వాడుకున్నారని మోది ఆరోపించారు. కానీ ఇప్పుడు అదే చంద్రబాబుతో కలిసి ఎన్నికల ప్రచారానికి వచ్చారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్గా ఉన్న రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావు సంచలన ఆరోపణ చేస్తూ చంద్రబాబు, లోకేష్లకు 150 కోట్ల మేర ముడుపులు చెల్లించామని చెప్పారు. అయినా ఈడీ, సీబీఐ ఏవీ స్పందించలేదు. ఐటీ ఇచ్చిన నోటీసులో దుబాయిలో జరిగిన మనీలాండరింగ్ గురించి కూడా ప్రస్తావించినా తదుపరి చర్యలేదు. చంద్రబాబు ఏపీలో స్కిల్ కార్పొరేషన్ నిధుల దుర్వినియోగం కేసులో అరెస్టు అయితే బీజేపీ అద్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్వయంగా చంద్రబాబు కుమారుడు లోకేష్ను వెంటబెట్టుకుని వెళ్లి హోం మంత్రి అమిత్షాను కలిసి సాయం చేయాలని అడిగారు. ఇది ఎలాంటి సంకేతం ఇస్తుంది! తాజాగా హైదరాబాద్లో ఐఎమ్.జి భరత్ అనే సంస్థకు అప్పనంగా 850 ఎకరాల భూమిని ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇచ్చిన కేసులో సీబీఐ విచారణ జరగాలని హైకోర్టు అబిప్రాయపడింది. తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ విషయమై ప్రశ్నించింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఎటూ చంద్రబాబు శిష్యుడే కనుక దానినుంచి తప్పించవచ్చు. ఈ రకంగా అటు బీజేపీని, ఇటు కాంగ్రెస్ను మేనేజ్ చేసే విధంగా చంద్రబాబు వ్యవహరించగలుగుతున్నారని చెప్పాలి. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ అనేవారు. కానీ కేంద్రంలోని బీజేపీ పెద్దలు కొందరు, న్యాయ వ్యవస్థలోని ఒకరిద్దరు ప్రముఖులు అండగా నిలిచి చంద్రబాబుపై కేసు రాకుండా చూడగలిగారు. ఇలా పలు ఆరోపణలు ఎదుర్కుంటున్న చంద్రబాబు జోలికి ఈడీ, సీబీఐ వంటివి ఎందుకు రావడం లేదని ఎవరైనా ప్రశ్నిస్తే ఏమి చెబుతాం. బీజేపీలో చేరిన సుజనా చౌదరి సుమారు ఏడువేల కోట్ల రూపాయల మేర బ్యాంకులకు ఎగవేశారని, మోసానికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. అయినా పార్టీ మారగానే ప్రధాని ఎదురుగా కూర్చోగలిగారు. అలాగే చంద్రబాబు కూడా మోదితో కలిసి సభలో పాల్గొనగలిగారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఈ నేర్పరితనం కేసీఆర్లో, కేజ్రీవాల్లో కొరవడడం వల్లే ఇప్పుడు కేసీఆర్ కుమార్తె కవిత, అలాగే కేజ్రీవాల్ జైలు పాలయ్యారా అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం, మహారాష్ట్రలో కూడా పార్టీ విస్తరించడానికి ప్రయత్నించడం, ప్రధాని మోదిపై, బీజేపీ నేతలపై తీవ్రంగా విమర్శలు గుప్పించడం వంటివి చేశారు. తొలుత మోదితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నా, ఎందువల్లో కేసీఆర్ ఆయనకు దూరం అయ్యారు. చివరికి పలకరించుకోలేని స్థితికి వచ్చారనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ కూడా తన కుమార్తెను అరెస్టు చేస్తుంటే నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవలసి వచ్చింది. ఇంకో వైపు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ నేతలపై దాడి పెంచింది. ఎంపీగా పోటీచేయాలని ఉబలాటపడిన మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబానికి చెక్ పెడుతూ ఆయన కుటుంబానికి చెందిన కాలేజీలో ప్రభుత్వ స్థలంలో రోడ్డు వేశారని అధికారులు తవ్వేశారు. ఆక్రమిత స్థలంలో భవనాలు కట్టారని వాటిని కూల్చివేశారు. దీంతో మల్లారెడ్డి కర్నాటకకు పరుగెత్తి డీకే శివకుమార్ను వేడుకున్నారు. ఆ మీదట తాము ఎంపీ సీటుకు పోటీచేయడం లేదని ప్రకటించారు. అంతేకాక బీఆర్ఎస్ నుంచి ఎందరు దొరికితే అందరిని కాంగ్రెస్, బీజేపీలు గుంజుకుంటున్నాయి. ఎంపీలు కొందరిని బీజేపీ లాగితే ఎమ్మెల్యేలు ఇంతవరకు పదహారు మందిని కాంగ్రెస్ లాగేసినట్లేనని చెబుతున్నారు. వీరంతా ముఖ్యమంత్రి రేవంత్ను కలిసి మద్దతు ఇస్తున్నారట. అందువల్లే తన ప్రభుత్వాన్ని ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో ఆయన ఉన్నారు. పఠాన్చెరు ఎమ్మెల్యే మహీపాల్ రెడ్డి సోదరుడిని అక్రమ మైనింగ్ కేసులో అరెస్టు చేశారు. ఇవన్నీ బ్లాక్ మెయిలింగ్ ధోరణులేనని బీఆర్ఎస్ అంటోంది. కేసీఆర్ కూడా అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్, టీడీపీల నుంచి పలువురు ఎమ్మెల్యేలను కలుపుకున్నారు. కానీ అప్పట్లో ఈ రకంగా దాడులు జరగలేదు. వారిని ప్రలోభపెట్టి ఆకర్షించుకున్నారు. అయినా అది కూడా విమర్శలకుగురి అయింది. ఇప్పుడు దాని ఫలితం అనుభవించవలసిన పరిస్థితి ఎదురైంది. నైతికంగా కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న దానిని తప్పు పట్టలేని దైన్యంలో కేసీఆర్ పడ్డారు. ఈ పరిణామాలన్నీ చూస్తే తెలంగాణలో బలపడడానికి కాంగ్రెస్, బీజేపీలు ఆడుతున్న గేమ్లో బీఆర్ఎస్ బలి అవుతుందా అన్న సందేహం వస్తుంది. అయితే కేసీఆర్ను తక్కువ అంచనా వేయజాలం. ఆయన పలు డక్కీలు తిన్నవాడే. వీటన్నిటిని ఎలాంటి వ్యూహాలతో తిప్పి కొట్టి బీఆర్ఎస్ను సురక్షితంగా నిలబెట్టుకుంటారో చూడాలి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇదేమాదిరిగా చిత్తశుద్దితో కాకుండా ప్రత్యర్ధులను లొంగదీసుకునే వ్యూహాలనే అమలు చేస్తే ఏదో ఒక రోజు దెబ్బతింటుంది. ఇది చరిత్ర చెప్పిన సత్యం. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
బీజేపీతోనే దేశ సమగ్రాభివృద్ధి : మాజీ ఎమ్మెల్యే రఘునందన్
సంగారెడ్డి: దేశ, రాష్ట్ర సమగ్రాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని ఆత్మకూర్ గ్రామంలో బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్చార్జిలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెదక్ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించి ప్రధాని మోదీకి కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు. మోదీ పాలనా దక్షతతో దేశం ప్రపంచంలోనే ఐదో ఆర్థిక శక్తిగా ఎదిగిందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి, సంగారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి పులిమామిడి రాజు, నాయకులు మాణిక్ రావు, సంగమేశ్వర్, చిన్న పటేల్, విష్ణువర్థన్ రెడ్డి, సుధాకర్ పాల్గొన్నారు. మోదీ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి దేశ ప్రజలకు ఉపయోగపడే పథకాలను పీఎం మోదీ అమలు చేస్తున్నారని, వీటిని గ్రామగ్రామాన వివరించాలని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు పిలుపునిచ్చారు. శుక్రవారం జిన్నారంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం సైనికుల్లా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు జగన్రెడ్డి, ప్రతాప్రెడ్డి, రవీందర్రెడ్డి, రాజిరెడ్డిల పాల్గొన్నారు. ఇవి చదవండి: కేసీఆర్ కీలక నిర్ణయంతో.. ఉత్కంఠకు తెర! -
కేసీఆర్ కీలక నిర్ణయంతో.. ఉత్కంఠకు తెర!
సంగారెడ్డి: మెదక్ లోక్సభ స్థానం బీఆర్ఎస్ అభ్యర్థిత్వంపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. అనూహ్యంగా ఎమ్మెల్సీ, మాజీ కలెక్టర్ వెంకట్రాంరెడ్డిని అభ్యర్థిగా ప్రకటిస్తూ ఆ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ అభ్యర్థిత్వం ఎంపిక విషయంలో శుక్రవారం కేసీఆర్ తన వ్యవసాయక్షేత్రంలో పార్టీకి చెందిన జిల్లా నాయకులతో సమావేశమయ్యారు. మాజీ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, సుభాష్రెడ్డి, ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్రెడ్డి, సునీతారెడ్డి, కొత్త ప్రభాకర్రెడ్డి తదితర నాయకులతో సుధీర్ఘంగా చర్చలు జరిపిన అనంతరం కేసీఆర్ ఈ మేరకు వెంకట్రాంరెడ్డికి మెదక్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఇప్పటికే ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే రఘునందన్రావు పేరు ఖరారైన విషయం విధితమే. కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఇంకా ఖరారు కావాల్సి ఉంది. మారిన నిర్ణయం వెనుక.. మెదక్ ఎంపీ టికెట్కు ముందుగా గజ్వేల్కు చెందిన మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డికి దాదాపు ఖరారైందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఆయన నియోజకవర్గంలో ఎన్నికల పనిలో కూడా నిమగ్నమయ్యారు. పార్లమెంట్ స్థానం పరిధిలోని పటాన్చెరు తదితర అసెంబ్లీ స్థానాల్లో నిర్వహించిన పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశాల్లో కూడా వంటేరు పాల్గొన్నారు. ఆయనతో పాటు ఈ టికెట్ను మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డి, తెలంగాణ ఉద్యమకారుడు బీరయ్య యాదవ్ తదితరులు ఆశించారు. అయినప్పటికీ వంటేరు ప్రతాప్రెడ్డికి దాదాపు ఖాయమైందని గులాబీ పార్టీ వర్గాలు భావించాయి. అధికారికంగా ప్రకటించకపోవడంతో ఈ స్థానం నుంచి స్వయంగా అధినేత కేసీఆరే బరిలోకి దిగుతారనే ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో అనూహ్యంగా వెంకట్రాంరెడ్డికి ఈ టికెట్ ఖరారు చేస్తూ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. సిద్దిపేట మాజీ కలెక్టర్గా.. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తికి చెందిన వెంకట్రాంరెడ్డికి ఉమ్మడి మెదక్ జిల్లాలో సన్నిహిత సంబంధాలున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత సిద్దిపేట కలెక్టర్గా ఆయన సుమారు ఐదేళ్ల పాటు పని చేశారు. అంతకు ముందు ఉమ్మడి మెదక్ జిల్లా డ్వా మా ప్రాజెక్టు డైరెక్టర్గా పనిచేశారు. జాయింట్ కలెక్టర్గా, అదనపు కలెక్టర్గా 2014 నుంచి 2017 వరకు పనిచేశారు. మధ్యలో కొన్ని రోజులు మెదక్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్గా కూడా బాధ్యతల్లో కొనసాగారు. 2021లో కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసిన వెంకట్రాంరెడ్డికి కేసీఆర్ ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. కేసీఆర్తో సన్నిహిత సంబంధాలున్న వెంకట్రాంరెడ్డికి అనూహ్యంగా మెదక్ అభ్యర్థిత్వం దక్కడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆర్థికంగా బలమైన నేత కలెక్టర్గా, జాయింట్ కలెక్టర్గా, ఉన్నతాధికారిగా ఉమ్మడి మెదక్ జిల్లాతో సంబంధం ఉన్న వెంకట్రాంరెడ్డికి రాజకీయంగా పెద్దగా సంబంధాలు లేవు. 2021 నవంబర్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై నప్పటికీ.. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో పెద్దగా పాల్గొన్న దాఖలాలు లేవు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒకటీ రెండు నియోజకవర్గాలకు ఇన్చార్జిగా అధినేత నియమించినప్పటికీ.. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న దాఖలాలు తక్కువ. కానీ ఆర్థికంగా బలమైన నేతగా పేరుంది. ఈ నేపథ్యంలో ఆయనను అభ్యర్థిగా ప్రకటించడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇవి చదవండి: రానున్న లోక్సభ ఎన్నికలు దేశానికి అత్యంత కీలకం! : ఎంపీ గోడం నగేశ్ -
రానున్న లోక్సభ ఎన్నికలు దేశానికి అత్యంత కీలకం! : ఎంపీ గోడం నగేశ్
ఆదిలాబాద్: బీజేపీ విలువలతో కూడిన పార్టీ అని, నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలు ఉన్న పార్టీలో చేరడం గర్వంగా ఉందని మాజీ ఎంపీ, ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్ అన్నారు. పట్టణంలోని ఎస్ఎస్.కాటన్లో ఎమ్మెల్యే రామారావుపటేల్ ఆధ్వర్యంలో శుక్రవారం పార్లమెంట్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగేశ్ మాట్లాడారు. ప్రధాని మోదీ నేతృత్వంలో భారతదేశం ప్రపంచ దేశాల సరసన నిలిచిందన్నారు. ఆర్థికంగా ఐదోస్థానంలో నిలిపిన ఘనత మోదీకి దక్కుతుందని తెలిపారు. రానున్న లోక్సభ ఎన్నికలు దేశానికి అత్యంత కీలకమని, అత్యధిక స్థానాలు గెలుచుకుని మోదీని మూడోసారి ప్రధానిని చేసుకోవాల్సిన అవసరముందన్నారు. తనపై నమ్మకంతో పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిందని, నాయకులు, కార్యకర్తలు సహకరించి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే రామారావు పటేల్తో కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. గతంలో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు భైంసా మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయమై తనపై కొందరు అపోహలు ప్రచారం చేస్తున్నారని, అప్పట్లో పార్టీ నిర్ణయం మేరకే పనిచేశానన్నారు. ఏ పార్టీలో ఉన్నా నిబద్ధత, నిజాయితీతో పనిచేశానని గుర్తు చేశారు. కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి.. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గోడం నగేశ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ఎమ్మెల్యే రామారావుపటేల్ కోరారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉందని స్థానిక కాంగ్రెస్ నాయకులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని, కానీ తాను అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే నియోజకవర్గానికి రూ.140 కోట్ల అభివృద్ధి నిధులు మంజూరు చేయించారని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో సైతం బీజేపీని గెలిపించుకుని కేంద్రం నిధులతో మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. సమావేశంలో నాయకులు బి.గంగాధర్, సోలంకి భీంరావు, సావ్లి రమేశ్, పట్టణ అధ్యక్షుడు మల్లేశ్వర్, మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు. -
పార్టీ ఏదైనా.. పోటీలో ఉండటం ఖాయం! : సోయం బాపూరావు
సాక్షి, ఆదిలాబాద్: బీజేపీ సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావు మళ్లీ తెరపైకి వచ్చారు. ఆయన కాంగ్రెస్లో చేరనున్నారనే ప్రచారం జోరందుకుంది. హస్తం పార్టీ హైకమాండ్ కూడా పాజిటివ్గా ఉందనే టాక్ మొదలైంది. గురువారం రాత్రి రాష్ట్రంలో ఐదు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం ఆదిలాబాద్ స్థానం పెండింగ్ పెట్టడం వెనక ఇదే కారణమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. బీజేపీ టికెట్ గొడం నగేశ్కు కేటాయించిన తర్వాత సోయం కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారం సాగింది. అయితే చేరికలు, అభ్యర్థి ఎంపిక పరిశీలన వేగవంతం చేయడంతో ఇక కాంగ్రెస్ ప్రక్రియ కొలిక్కి వచ్చిందని అందరూ భావించారు. అయితే తాజా రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ఈ విషయమై సోయం బాపూరావును ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించినప్పుడు.. ‘పార్టీ ఏదైనా.. తాను పోటీలో ఉండటం ఖాయం..’ అని పేర్కొనడం గమనార్హం. సీనియర్ నేతలను ఢీకొట్టగలరా.. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అభ్యర్థి ఎంపిక విషయంలో కొద్ది రోజులుగా పరిణామాలు వేగంగా మారు తూ వచ్చాయి. చివరకు ఉపాధ్యాయురాలు ఆత్రం సుగుణ, ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్ తమ పోస్టులకు స్వచ్ఛంద విరమణ ప్రకటించి సీఎం సమక్షంలో గురువారం కాంగ్రెస్లో చేరిన తెలిసిన విదితమే. ఈ ఇద్దరి నుంచే ఎవరినైనా అభ్యర్థిగా ఎంపిక చేస్తారని ప్రచారం సాగింది. సుగుణ అనుచరులు సంబరాలు సైతం చేసుకున్నారు. అయితే ఒక్కరోజుకే పరిస్థితి మారిపోయింది. తాజాగా సోయం బాపూరావు కాంగ్రెస్లో చేరనున్నారనే ప్రచారం వారి అభ్యర్థిత్వం విషయంలో బ్రేక్ పడినట్టేననే చర్చ సాగుతుంది. బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు గొడం నగేశ్, ఆత్రం సక్కు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారని, ఈ సీనియర్ నేతలను కొత్త నేతలు ఢీకొట్టగలుగుతారా.. అనే సమీకరణాల్లోనూ పార్టీ ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీంతో గోండు సామాజిక వర్గానికే చెందిన సిట్టింగ్ సోయంనే పార్టీలోకి చేర్చుకొని బరిలోకి దించాలని హైకమాండ్ పాజిటివ్గా ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి కూడా మనస్సు మార్చుకున్నారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే సోయం బాపూరావుకు బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయానికి శనివా రం రావాలని పిలుపు అందింది. గొడం నగేశ్కు సహకరించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, తెలంగాణ ఇన్చార్జి తరుణ్ చుగ్ కోరేందుకే పిలిచారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోయం పార్టీ కార్యాలయానికి వెళ్తారా.. లేదా అనేది ఆసక్తికరం. పోటీలో ఉండటం ఖాయమని చెబుతున్న నేపథ్యంలో బీజేపీ పెద్దలను ఆయన కలవకపోవచ్చనే ప్రచారం సాగుతుంది. మరోవైపు లంబాడాకు ఇస్తారనే చర్చ.. రాష్ట్రంలో తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ ఆదిలాబాద్ విషయంలో చివరి క్షణంలో పెండింగ్ పెట్టిందన్న ప్రచారం విస్తృతంగా సాగుతుంది. కాగా ఈ పెండింగ్ విషయంలో లంబాడా సామాజికవర్గ కాంగ్రెస్ నేతలు మరో రకంగా చెబుతున్నారు. బీజేపీ, బీఆర్ఎస్లు ఆదివాసీ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించిన దృష్ట్యా లంబాడా సామాజిక వర్గానికి కాంగ్రెస్కేటాయించే యోచనలో ఉండడంతోనే పెండింగ్ పెట్టిందని చెబుతుండటం గమనార్హం. మహబూబాబాద్ టికె ట్ లంబాడాకు కేటాయించడంతో ఆదిలాబాద్ స్థా నం సమీకరణాల్లో భాగంగా ఆదివాసీకే కేటాయిస్తారనే ప్రచారం ఉన్నప్పటికీ రాష్ట్ర, దేశ వ్యాప్తంగా ఉన్న బంజారా జనాభా దృష్ట్యా పార్టీ ప్రయోజనాల కోసం లంబాడాకు ఇవ్వాలని యోచిస్తుందని చెప్పుకొస్తున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న నేతలను కూడా పార్టీ పరిశీలిస్తుందని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్, ఏఐసీసీ సభ్యుడు నరేశ్ జాదవ్లలో ఎవరికైనా టికెట్ దక్కవచ్చనే ప్రచారం కూడా లేకపోలేదు. ఏదేమైనా కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు అయ్యేవరకు ఈ చర్చలు సాగే పరిస్థితి కనిపిస్తుంది. ఇదిలా ఉంటే హోలీ పండగ తర్వాత నిర్ణయం వెలువడవచ్చని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇవి చదవండి: MLC Kavitha: ఈడీ కస్టడీలో కవిత.. ఈరోజు అప్డేట్స్ -
అభ్యర్థుల ఖరారు పూర్తితో.. వ్యూహాలకు కసరత్తు!
సాక్షి, మహబూబ్నగర్: నాగర్కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటనతో ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్ నియోజకవర్గాల ప్రధాన పార్టీల లోక్సభ అభ్యర్థుల ప్రకటన పూర్తయింది. విజయం కోసం ప్రధాన పార్టీలు సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. ఎంపీ అభ్యర్థులు ఎవరో తేలడంతో స్థానికంగా సమీకరణాలు సైతం శరవేగంగా మారుతున్నాయి. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కొంతమంది నాయకులతో కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. 100 రోజుల్లో తాము అమ లు చేసిన పతకాలు, అభివృద్ధి పనులు, చేపట్టబోయే పనుల గురించి ఓటర్లకు వివరించాలని భావిస్తోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ వంద రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఓటర్ల ముందు ఎండగట్టాలని నిర్ణయించింది. బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వ పథకాలపైనే ఎక్కువగా ఆధారపడ్డారు. ఇప్పటికే ప్రధాని మోదీ పర్యటన పూర్తి కాగా ఇతర నేతలను రప్పించి సభలు, రోడ్షోలు నిర్వహించి ఓటర్లను తమవైపు తిప్పుకోవాలని భావిస్తోంది. నాగర్కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థి ప్రొఫైల్.. పేరు: రేపల్లే శివ ప్రవీణ్ కుమార్ తల్లిదండ్రులు: ప్రేమలత, సవారన్న పుట్టిన తేది: 23-11-1967 స్వస్థలం: అలంపూర్ విద్యార్హతలు: ఎంఏ(పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) హార్వర్డ్ యూనివర్సిటీ, యూఎస్ఏ వృత్తి: ఐపీఎస్ అధికారి(1995 బ్యాచ్, గతేడాది ఉద్యోగానికి రాజీనామా), గురుకుల కార్యద ర్శితో పాటు ప్రభుత్వశాఖలో వివిధ హోదాలో పనిచేశారు. స్వేరోస్ సంస్థ స్థాపించి పలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టారు. రాజకీయ అనుభవం: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతూ గత శాసనసభ ఎన్నికల్లో సిర్పూర్ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. ఇవి చదవండి: ‘పల్లా’కు మతిభ్రమించింది.. : సుంకెట అన్వేష్రెడ్డి -
‘పల్లా’కు మతిభ్రమించింది.. : సుంకెట అన్వేష్రెడ్డి
నిజామాబాద్: జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకెట అన్వేష్రెడ్డి విమర్శించారు. నగరంలోని కాంగ్రెస్ భవన్లో శుక్రవారం ఆయన మాట్లాడారు. పల్లా రాజేశ్వర్రెడ్డి రైతు సమన్వయ సమితి ఉన్న అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రకతి వైపరీత్యాలు వచ్చినా స్పందించలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పంట నష్టపోయిన రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన పంటలపై సర్వే చేయిస్తున్నట్లు చెప్పారు. సర్వే కాకుండానే రెండు లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు రాజేశ్వర్రెడ్డి ఎలా చెబుతారని ప్రశ్నించారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బీన్హందాన్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గంగారెడ్డి, సిరికొండ గంగారెడ్డి, అల్లూరి మహేందర్ రెడ్డి, శశిధర్రెడ్డి, సుంకెట బుచ్చిరెడ్డి పాల్గొన్నారు. ఇవి చదవండి: పసుపుబోర్డు ఎక్కడుందో చెప్పాలి.. : ఎంపీ బాజిరెడ్డి -
పసుపుబోర్డు ఎక్కడుందో చెప్పాలి.. : ఎంపీ బాజిరెడ్డి
నిజామాబాద్: ‘పసుపు బోర్డు తెచ్చానని గొప్పలు చెప్పడం కాదని.. జిల్లాలో బోర్డు ఎక్కడ ఏర్పాటు చేశారో ఎంపీ అర్వింద్ చూపించాలని.. నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఎంపీకి అహంకారంతో ఉన్నారని.. నిజాంషుగర్ ఫ్యాక్టరీ పేరిట మరోసారి బాండ్ పేపర్ డ్రామా ఆడుతున్నారన్నారని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు అర్వింద్ను కచ్చితంగా ఓడిస్తారన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బాజిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందని, కాంగ్రెస్ మూడోస్థానానికి పరిమితం అవుతుందన్నారు. పసుపుబోర్డు పేరుతో ఇప్పటికే ఎంపీ అర్వింద్ ప్రజలను మోసం చేశారన్నారు. ఆయన ఎంపీ కాకముందే పసుపు క్వింటాలుకు రూ. 17వేలు ధర పలికిందన్నారు. పసుపు దిగుబడి తగ్గినందునే ధర పెరిగిందన్నారు. గత ఐదేళ్లలో ఎంపీ అర్వింద్ అహంకారంతో నడుచుకున్నారని.. ఆయన ఓటమి ఖాయమన్నారు. కేంద్రంలో మోదీ గెలవాలని కానీ.. అర్వింద్, బండి సంజయ్ లాంటి వాళ్లు ఓడిపోవాలని ప్రజలు భావిస్తున్నారన్నారు. సీఎం రేవంత్ హామీలు అమలు చేయడం లేదు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్నారని బాజిరెడ్డి విమర్శించారు. రుణమాఫీ చేయలేదని, రైతుబంధు ఇవ్వలేదని, కల్యాణలక్ష్మికి అదనంగా తులం బంగారం హామీలు ఇచ్చి మోసం చేశారన్నారు. అధికారంలో ఉండి కూడా అబద్ధాలు ఆడుతున్నారన్నారు. తాను ఎంపీగా గెలిచి ప్రశ్నించే గొంతునవుతానని పేర్కొన్నారు. బీఆర్ఎస్కు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఇవి చదవండి: తర్జన భర్జన! తెరపైకి రోజుకో పేరు.. -
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి : కొప్పుల ఈశ్వర్
పెద్దపల్లి: ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మళ్లీ ఓట్ల కోసం వస్తున్న కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఓదెల, ఎలిగేడు మండల కేంద్రాల్లో శుక్రవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రసాధనలో ముందుండి పోరాడి తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. 10ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దేశంలో ఎక్కడా లేని అద్భుత పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత కేసీఆర్దే అన్నారు. ఐటీ రంగంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి 18 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్దే అని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులను వివరిస్తూ, కాంగ్రెస్ విధానాలను ఎండగడుతూ గ్రామాల్లో ప్రజలకు తెలియజేస్తూ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈ సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, నియోజకవర్గ నాయకురాలు దాసరి ఉష, ఎంపీపీ తానిపర్తి స్రవంతి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఐరెడ్డి వెంకటరెడ్డి, బైరెడ్డి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: అభ్యర్థుల ఖరారు పూర్తితో.. వ్యూహాలకు కసరత్తు! -
వంశీ చేతికే పెద్దపల్లి టికెట్..
కరీంనగర్: తెలంగాణ లోక్సభ స్థానాల్లో పోటీచేసేందుకు ఐదుగురు పేర్లతో కూడిన మూడో జాబితాను కాంగ్రెస్ అధిష్టానం గురువారం ప్రకటించింది. ఇందులో పెద్దపల్లి(ఎస్సీ) నుంచి మాజీ ఎంపీ, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమారుడు గడ్డం వంశీకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఆమోదముద్ర వేసింది. కరీంనగర్ పార్లమెంట్ నుంచి ప్రవీణ్రెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. వెలిశాల రాజేందర్రావు సహా మరికొందరు నేతలు కరీంనగర్ టికెకోసం భారీగా ప్రయత్నాలు చేస్తుండడంతో మరోజాబితాలో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. తాత, తండ్రి పోటీచేసిన స్థానం నుంచి.. లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో చూపిన జోష్తో పార్లమెంట్ ఎన్నికల్లో సైతం సత్తా చాటాలని చూస్తోంది. గెలుపు గుర్రాలను బరిలో నిలిపేలా వ్యూహా రచన చేస్తోంది. అందులో భాగంగా పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేసి గెలిచిన గడ్డం వెంకటస్వామి, మాజీ ఎంపీ వివేక్ కుటుంబానికి అధిష్టానం టికెట్ ఖరారు చేసింది. స్థానిక మంత్రి, ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నా బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి మారినప్పుడు ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్రెడ్డి గడ్డం వంశీకి టికెట్ కేటాయించేట్లు చేసి మాట నిలుపుకున్నారు. ఇప్పటికే పెద్దపల్లి, కరీంనగర్ స్థానాలకు బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్, బండిసంజయ్, బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్, బోయినపల్లి వినోద్కుమార్ పేర్లు ఖరారు చేశాయి. కరీంనగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసే అభ్యర్థి తేలితే ఉమ్మడి జిల్లాలోని రాజకీయం మరింత వేడెక్కనుంది. బయోడేటా.. పేరు: గడ్డం వంశీకృష్ణ భార్య: రోష్ని, ఇద్దరు పిల్లలు చదువు: బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ (యూఎస్లోని పర్డ్యూ విశ్వవిద్యాలయం నుంచి 2010లో) వృత్తి: విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్లో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గడ్డం వంశీకృష్ణ -
సిట్టింగ్ స్థానంలో ఎందుకీ పరిస్థితి..?
సాక్షి, ఆదిలాబాద్: కమలం పార్టీలో ముసలం మొదలైంది. బీజేపీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా గొడం నగేశ్ను ప్రకటించిన తర్వాత ఆ పార్టీలో విభేదాలు వెలుగుచూశాయి. తాజాగా కేంద్ర మంత్రి జిల్లా ప ర్యటనలో బహిర్గతమయ్యాయి. అయితే పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలందరి ఏకాభిప్రాయంతోనే పార్టీ అభ్యర్థి ఎంపిక జరిగిందని కమలం నేతలు చెప్పుకొచ్చారు. కార్యకర్తలూ అదే కావచ్చని అనుకున్నారు. ఆ తర్వాత టికెట్ ఆశించిన ఆశావహుల్లో కొందరు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, అభ్యర్థి గెలుపునకు దోహద పడతామని చెప్పుకుంటూ వచ్చారు. కొంత మంది సైలెంట్గా ఉన్నారు. మరోవైపు చివరిదాకా టికెట్ ఆశించి భంగపడ్డ సి ట్టింగ్ ఎంపీ సోయం అలక బూనారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మరి వీరందరిని సమన్వయపర్చి ఏకతాటిపైకి తీసుకొచ్చేప్రయత్నం జరుగుతుందా అంటే ఇప్పటివరకు ఆ దిశగా చర్యలేమి కనిపించడం లేదన్న అభిప్రాయం కార్యకర్తల్లో వ్యక్తమవుతుంది. అందరూ డుమ్మా.. బీజేపీ పార్లమెంట్ స్థాయి సమావేశం తలమడుగు మండలం ఉండంలో బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి అర్జున్ ముండా హాజ రయ్యారు. పార్లమెంట్ పరిధిలోని ముఖ్య నేతలంతా ఇందులో పాల్గొనాలి. అయితే నిర్మల్, ముథోల్, సిర్పూర్ ఎమ్మెల్యేలు మహేశ్వర్రెడ్డి, రామారావు ప టేల్, హరీష్బాబు రాలేదు. సిట్టింగ్ ఎంపీ సో యం కూడా దూరంగా ఉన్నారు. టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు సైతం గైర్హాజరవడం గమనార్హం. దీంతో అసలు ఏం జరుగుతుందోనని కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ఏకతాటిపైకి తెచ్చేదెవరు..? మార్చి 10న ఢిల్లీ నుంచి విడుదలైన బీజేపీ అభ్యర్థుల రెండో జాబితాలో ఆదిలాబాద్ సిట్టింగ్ స్థానం నుంచి నగేశ్ పేరు వెల్లడైంది. అంతకు నాలుగు రో జుల ముందే ఆయన బీఆర్ఎస్ నుంచి కమలం పా ర్టీలో చేరారు. ఈ క్రమంలో నగేశ్కు టికెట్ ఇవ్వొద్ద ని పార్టీలోని పలువురు సీనియర్లు, ఆశావహులు ఢిల్లీ వెళ్లి అగ్రనేతలను కలిసి విన్నవించారు. అయినప్పటికీ పార్టీ నగేశ్ వైపే మొగ్గుచూపింది. అయితే టికెట్ ఖరారైన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి హైదరాబాద్ నుంచి వస్తున్న అభ్యర్థి నగేశ్కు మొదట నిర్మల్ జిల్లా సోన్ వద్ద పార్టీ శ్రేణులు స్వా గతం పలకాలి. కానీ అలాంటిదేమి కనిపించలేదు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ వద్ద ఆయనకు కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో పరిస్థితులను చక్కదిద్దే బాధ్యత ఇప్పుడు ఎవరు తీసుకుంటారనేది కార్యకర్తల్లో నెలకొంది. ప్రస్తుతం ఆదిలా బాద్ పార్లమెంట్ ఇన్చార్టీగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఉన్నారు. బుధవారం పార్లమెంట్ స్థాయి సమావేశం ఉందని ఆదిలాబాద్ పట్టణ కార్యదర్శి వేదవ్యాస్ నుంచి ప్రకటన జారీ కావడంపై పార్టీ సీనియర్ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ స్థాయి సమావేశ ఆహ్వానం ఇలా పట్టణ కార్యదర్శి నుంచి జారీ కావడమేంటా అని విస్తుపోతున్నారు. ఆ ఆహ్వానంలో ఎమ్మెల్యే శంకర్, అభ్యర్థి నగేశ్ పాల్గొంటున్నారని, కేంద్ర మంత్రి వస్తున్నారని పేర్కొన్నారు. మిగతా ఎమ్మెల్యేల పేర్లు ఎందుకు ఇందులో పొందుపర్చలేదనేది సామాన్య కార్యకర్త ప్రశ్నించే పరిస్థితి. ఈ లెక్కన పార్లమెంట్ ఇన్చార్జీగా వ్యవహరిస్తున్న శంకర్ అందరిని ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయడం లేదా.. లేనిపక్షంలో ఈ వ్యవహారం తనది కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నారా అనే సందిగ్ధం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ‘సోయం’కు బుజ్జగింపులు సిట్టింగ్ స్థానం నుంచి తిరిగి టికెట్ దక్కకపోవడంతో అలకబూనిన సోయం బాపూరావును ఇటీవల హైదరాబాద్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి కలిసి బుజ్జగింపు ప్రయత్నాలు చేశారు. కేంద్రంలో మరోసారి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవి ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అయితే ఈ విషయంలో జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో చెప్పించాలని సోయం చెప్పడంతో దానికి కిషన్రెడ్డి సరే అన్నట్టు పార్టీలో ప్రచారం ఉంది. అదే జరిగితే తాను నగేశ్ పక్షాన ప్రచారానికి వెళ్లే విషయాన్ని పరిశీలిస్తానని కిషన్ రెడ్డికి సోయం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. సోయం బుజ్జగింపుల వరకే రాష్ట్ర నాయకులు పరిమితమవుతారా.. లేనిపక్షంలో ఈ పార్లమెంట్ పరిధిలోని ఇతర అసంతృప్తి నేతలను కూడా బుజ్జగించే ప్రయత్నం చేస్తారా అనేది చూడాల్సిందే. ఇవి చదవండి: నాటి సీఎం స్థాయిలోనే నిర్ణయాలు! -
ప్రతిఒక్కరూ రజాకార్ సినిమా చూడండి : ఎంపీ బండి సంజయ్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ల పరిధిలో నిజామాబాద్–ఖమ్మం వరకు ఎన్హెచ్–563, ఆర్ఎఫ్సీఎల్ పునరుద్ధరణ, రైలు మార్గాల నిర్మాణం, టర్మరిక్ బోర్డు, నిజాం షుగర్ ఫ్యాక్టరీకి నిధులు.. ఇలా ఎన్నో ఇచ్చాం.. వచ్చే పదేళ్లలో తెలంగాణ ప్రగతిపై ఫోకస్ చేసి, మరెన్నో ఇస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రంలో రోడ్లు, రైలు, గోదాంలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు. సోమవారం జగిత్యాల పట్టణంలోని గీతా విద్యాలయం మైదానంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రసంగించారు. రాష్ట్రంతోపాటు ఉమ్మడి జిల్లాలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. వికసిత్ భారత్, వికసిత్ తెలంగాణ కోసం బీజేపీని గెలిపించాలని, అబ్ కీ బార్ 400 పార్ అని పిలుపునిచ్చారు. పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధరతో రైతులను, సంక్షేమ పథకాలతో మహిళలను, రుణాలిచ్చి యువతను ఆదుకున్నామని తెలిపారు. పసుపు మద్దతు ధర, టర్మరిక్ బోర్డు ఏర్పాటు, నిజాం షుగర్ ఫ్యాక్టరీకి, ఆర్ఎఫ్సీఎల్ పునరుద్ధరణకు రూ.6,400 కోట్లు వెచ్చించామన్నారు. కాళేశ్వరం అవినీతి విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ల తీరును ఎండగట్టారు. ఆ పార్టీలు తెరచాటు మిత్రులని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ అగ్రనాయకులు లక్ష్మణ్, సత్యనారాయణరావు, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి, నిర్మల్ ఎమ్మెల్యే పరమేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. రజాకార్ సినిమా చూడండి వీరులను కన్న గడ్డ జగిత్యాలలో పీఎఫ్ఐ లుచ్చాగాళ్లు అడ్డా పెట్టి, పాకిస్తాన్ జిందాబాద్ అంటుంటే వాళ్లకు ఆర్థికసాయం చేస్తున్న వాళ్లను వదిలేద్దామా? నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులు జగిత్యాల సొంతం. రాముని పేరు చెబితే కాంగ్రెస్, బీఆర్ఎస్ వాళ్లు గజగజ వణుకుతున్నరు. దేశ ప్రజల భాగస్వామ్యంతో అయోధ్యలో రాముని గుడిని కట్టింది బీజేపీయే. మా పార్టీ బరాబర్ శ్రీరాముని పేరుతో ఎన్నికల్లోకి వెళ్తుంది. మీకు దమ్ముంటే బాబర్ పేరుతో ఓట్లడగండి. తెలంగాణ ప్రజాలారా... ప్రతిఒక్కరూ రజాకార్ సినిమా చూడండి. నిజాం సమాధి వద్ద మోకరిల్లిన కేసీఆర్, ఒవైసీ సోదరులను కట్టేసి, ఈ సినిమా చూపించండి. – ఎంపీ బండి సంజయ్ ఐదో ఆర్థిక శక్తిగా మన దేశం ప్రధాని మోదీ వల్లే మన దేశం ప్రపంచ దేశాల్లో బలమైన ఐదో ఆర్థిక శక్తిగా ఎదిగింది. మయన్మార్, పాకిస్తాన్ లాంటి దేశాలను దారికి తెచ్చిన ఘనత ఆయనదే. మోదీ వల్లే దేశంలో సుస్థిరత, సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతాయి. ఇటీవల సీఏఏ అమలు చేశారు. త్వరలో ఎన్ఆర్సీ, యూసీసీ కోడ్ను కూడా అమలు చేస్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి. – ఎంపీ ధర్మపురి అర్వింద్ దేశ ప్రజలందరూ ప్రధాని కుటుంబమే ప్రధాని నరేంద్ర మోదీకి కుటుంబం లేదంటున్న విపక్షాలకు సిగ్గులేదు. దేశ ప్రజలందరూ ఆయన కుటుంబమే. వేములవాడ రాజన్న ఆశీర్వాదంతో తెలంగాణ నుంచి బీజేపీ తరఫున అత్యధిక ఎంపీ స్థానాలు గెలిచి, ప్రధానికి కానుకగా ఇద్దాం. పదేళ్ల యూపీఏ హయాంలో జరగని స్కాం లేదు. బీఆర్ఎస్ కాళేశ్వరం నుంచి కరెంటు వరకు అవినీతిమయం చేసింది. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు చేయలేక చేతులెత్తేసింది. – ఏలేటి మహేశ్వర్రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత -
కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో..? కొనసాగుతున్న ఉత్కంఠ!
సాక్షి, ఆదిలాబాద్: లోక్సభ ఎన్నికలకు గాను కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక విషయంలో ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతుంది. పలువురి పేర్లు వినబడుతున్నప్పటికీ పార్టీ ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఆదివాసీ నేతనే బరిలోకి దించాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అదే జరిగితే ఈ టికెట్పై ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్కు నిరాశ తప్పదని అంటున్నారు. కాగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జును రంగంలోకి దించాలని అధిష్టానం ఆసక్తితో ఉన్నట్టుగా కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. అయితే గడిచిన అసెంబ్లీ ఎన్నికలతోనే ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చిన ఆయన ఇప్పుడే పార్లమెంట్కు పోటీ చేసే విషయంలో ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఒకవేళ ఆయన పోటీకి ముందుకు రాకపోతే ఆశావహుల్లో ఎవరికై నా టికెట్ లభించవచ్చనే చర్చ సాగుతోంది. ఆశావహుల ముమ్మర యత్నాలు.. కాంగ్రెస్ టికెట్ కోసం 22 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్రం సుగుణ, ఎల్ఐసీ ఉద్యోగానికి ఇటీవలే రాజీనామా చేసి పార్టీలో చేరిన కోవ దౌలత్రావు మొకాశి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్లో క్రియాశీలకంగా ఉన్న మర్సుకోల సరస్వతి ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్నారు. అప్పట్లో కాంగ్రెస్ నుంచి ఆసిఫాబాద్ టికెట్ను ఆశించిన ఆమె దక్కకపోవడంతో పార్టీ వీడారు. తాజాగా ఆమె పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ర్యాండమ్ సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా ఆదివాసీలకే టికెట్ ఇవ్వాలని మెజార్టీ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పార్టీ ఆదివాసీ అభ్యర్థికే మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం ఉంది. ఇదిలా ఉంటే నియోజకవర్గాల ఇన్చార్జీల నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేయగా ఆశావహుల్లోని ఓ అధికారి పేరు ఎక్కువ మంది చెప్పినట్లు తెలుస్తోంది. జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ఈ విషయంలో సమాలోచన చేస్తున్నట్లు సమాచారం. అపాయింట్మెంట్ ఫిక్స్ అనే ప్రచారం.. బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ ఎంపీ సోయం బాపూరావు కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం ఇప్పటికీ కొనసాగుతుంది. ఇదిలా ఉంటే శనివారం సీఎం రేవంత్రెడ్డితో ఆయన అపాయింట్మెంట్ ఫిక్స్ అయ్యిందనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక ఇంకా ఓ కొలిక్కి రాలేదనేది స్పష్టమవుతోంది. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారయ్యారు. మరోపక్క ఎన్నికల నోటిఫికేషన్ నేడు రానుంది. ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థి ఎంపికను త్వరగా ముగించాలనే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇవి చదవండి: కాంగ్రెస్లోకి మాజీ ఎంపీ జితేందర్రెడ్డి -
మోదీ పాలన చూసే.. బీజేపీలో చేరా! : గోడం నగేశ్
ఆదిలాబాద్: గత పదేళ్లలో అవినీతి రహిత పాలనను అందిస్తూ, దేశ ఆర్థిక వ్యవస్థను అగ్రరాజ్యాలకు ధీటుగా తీసుకెళ్లిన ప్రధాని మోదీకి నేనేందుకు మద్దతివ్వకూడదనే ఉద్దేశంతోనే బీజేపీలో చేరానని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్ అన్నారు. ఎంపీ అభ్యర్థిగా ప్రకటించాక తొలి సారి జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయనకు బీజేపీ శ్రేణులు మావల బైపాస్ వద్ద ఘన స్వాగతం పలికారు. మావల మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో కార్యకర్తల సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. కార్యకర్తల గౌరవాన్ని కాపాడుతూ, పార్టీ ప్రతిష్టతను పెంచేలా పనిచేస్తాన్నారు. మోదీని మూడోసారి ప్రధానిగా చేయడమే లక్ష్యంగా కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోదీయే ఉండాలని ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్, నాయకులు అమర్సింగ్ తిలావత్, అశోక్ ముస్తాపురే, నగేష్, విజయ్, జ్యోతిరెడ్డి, కృష్ణయాదవ్, వేదవ్యాస్, ధోని జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యనేతల గైర్హాజరు! సమావేశానికి పార్టీ ఎంపీ సోయం బాపూరావు, ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్రెడ్డి, పాల్వాయి హరీష్ బాబు, రామారావు పటేల్తో పాటు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నాయకులేవరూ హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల నేపథ్యంలో పార్టీ అభ్యర్థిత్వం ఖరారయ్యాక నిర్వహించిన తొలి సమావేశానికి ముఖ్య నేతలు డూమ్మకొట్టడంపై రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఇవి చదవండి: కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో..? కొనసాగుతున్న ఉత్కంఠ! -
వరంగల్: బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం కావ్య ఖరారు!
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం కావ్య పేరును ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు గులాబీ దళపతి, పార్టీ అధినేత కేసీఆర్ బుధవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించారు. రాజకీయ అరంగేట్రం చేసేందుకు ఎప్పటి నుంచో వేచిచూస్తున్న మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కావ్యకు ఎట్టకేలకు బీఆర్ఎస్ ‘బీ’ఫామ్ దక్కింది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న పసునూరి దయాకర్ను ఈసారికి పోటీ నుంచి తప్పించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సిట్టింగ్ ఎంపీని మార్చడం తథ్యమన్న నేపథ్యంలో వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి ఎవరిని ఎంపిక చేస్తారన్న చర్చ మొదలైంది. వరంగల్ ఎంపీ స్థానం ఎస్సీలకు రిజర్వు కావడంతో పార్టీలో ఈ సామాజిక వర్గానికి చెందిన నేతల్లో ఎవరికి అవకాశం దక్కుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్కు రాజీ నామా చేయడంతో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్, కడియం కావ్య పేర్లు ప్రధానంగా వినిపించాయి. అరూరి రమేష్ మొదట ఆసక్తి చూపినా.. ఆ తర్వాత ఎందుకో పార్టీ మారాలనే యోచనలో పడటం పార్టీలో గందరగోళానికి తెరతీసింది. ఇదే సమయంలో ఆయన మంగళవారం హైదరాబాద్లో కేంద్ర మంత్రులను కలవడం.. బుధవారం హనుమకొండలో ప్రెస్మీట్ ఏర్పాటు చేశారు. ప్రెస్మీట్లో మాట్లాడేకంటే ముందే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తదితరులు ఆయనను తమ వాహనాల్లో ఎక్కించుకుని హైదరాబాద్ తీసుకెళ్లి కేసీఆర్ను కలిపించారు. ఉమ్మడి వరంగల్ కీలక నేతలు, ప్రజాప్రతినిధులతో సుమారు గంటన్నర పాటు చర్చించిన కేసీఆర్.. కడియం కావ్య పేరును ఖరారు చేసినట్లు ప్రకటించారు. ఉన్నత విద్యాభ్యాసం.. సామాజిక సేవలో సీనియర్ రాజకీయ నాయకులు కడియం శ్రీహరి పెద్ద కూతురైన కావ్య దక్కన్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేశాక, ఉస్మానియా మెడికల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎండీ (పాథాలజీ) పూర్తి చేసి వరంగల్లో కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్గా పనిచేశారు. గతంలో వర్ధన్నపేట సామాజిక వైద్యకేంద్రంలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తూనే అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. ఆమె బాలికల విద్యా వ్యాప్తి కి విశేషించి కృషి చేస్తున్నారు. మెనుస్ట్రువల్ హైజీన్పై కడియం ఫౌండేషన్ ద్వారా వందలాది చైతన్య కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా హైజీన్ కిట్స్ పంపిణీ చేస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా డాక్టర్ కావ్య తన ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. మానుకోట బీజేపీ ఎంపీ అభ్యర్థిగా సీతారాంనాయక్.. మహబూబాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ను ప్రకటించారు. ఆయన బీఆర్ఎస్ నుంచి బీజేపీలో అలా చేరారో.. లేదో.. ఇలా టికెట్ తెచ్చుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మల్లయ్యపల్లి గ్రామానికి చెందిన సీతారాంనాయక్ కేయూ ప్రొఫెసర్గా కొనసాగుతూనే ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఇలా బీఆర్ఎస్(అప్పటి టీఆర్ఎస్) అధినేత కేసీఆర్కు దగ్గరైన ఆయన.. స్వరాష్ట్రంలో 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందారు. మానుకోట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్పై 34,992 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన స్థానంలో మాలోత్ కవితకు టికెట్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన మౌనంగా ఉంటూ వచ్చారు. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లెందు టికెట్ ఇవ్వాలని కోరగా.. అదీ దక్కలేదు. దీంతో బీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తితో ఉన్న సీతారాంనాయక్ టికెట్ రాదని తెలిసి, ఈ నెల 10న బీజేపీలో చేరారు. చేరిన మూడు రోజులకే మానుకోట టికెట్ కేటాయించడం గమనార్హం. ఇవి చదవండి: బండ పగలకొడతాం.. సాగునీరు పారిస్తాం! : మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
బండ పగలకొడతాం.. సాగునీరు పారిస్తాం! : మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి
మహబూబ్నగర్: ‘బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో సంగంబండ రిజర్వాయర్ కింద ఉన్న బండను పగలకొట్టకుండా 15 గ్రామాలకు సాగునీరు అందించడంలో నిర్లక్ష్యం వహించింది.. నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లింపులోనూ మొండిచేయి చూపారు.. బండ పగలకొట్టింటే 25 వేల ఎకరాలకు సాగునీరు అందేది.. పైన రిజర్వాయర్ కింద కాల్వలు పూర్తయినా ఒక బండ పగలగొట్ట లేని చరిత్ర ఆ ప్రభుత్వానిది.. వారి నిర్లక్ష్యం వల్ల నీళ్లు లేక పదేళ్ల పాటు ఈ ప్రాంత రైతులు పంటలను ఎండబెట్టుకోవాల్సి వచ్చింది.. దీంతో 15 గ్రామాల్లో రైతుల పొలాలు ఎండిపోయాయి. సభాముఖంగా హామీ ఇస్తున్నా.. ఈ ప్రాంత రైతుల 19 ఏళ్ల కల నెరవేరబోతుంది.. ఆ బండ పగలగొట్టి సాగునీరు పారిస్తామ’ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. బుధవారం వారు స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి సంగంబండ లో లెవల్ కెనాల్ కింద ఉన్న సంగంబండను పరిశీలించి ప్రజాదీవెన సభలో పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ భీమా ప్రాజెక్టులో అంతర్భాగమైన సంగంబండ రిజర్వాయర్ లెఫ్ట్ లో లెవల్ కెనాల్ కోసం 500 మీటర్ల బండ తొలగి సంగబండ గ్రామానికి చెందిన ముంపు బాధితులకు చెల్లించాల్సిన కూలీ డబ్బులు పదేళ్లుగా నిలిచిపోయాయని, దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రెండు నెలల్లో రూ.12 కోట్లు ప్రభుత్వం ముంపు బాధితుల ఖాతాలో జమ చేసిందన్నారు. ఉజ్జెల్లికి రూ.13.34 కోట్లు, కొత్తగార్లపల్లికి రూ.1.19 కోట్లు జమ చేసేందుకు చొరవ తీసుకుంటామన్నారు. నేరడ్గం, ఆర్ఆర్ సెంటర్లు అనుగొండ, గడ్డంపల్లి గ్రామాలకు సైతం అందాల్సిన బెనిఫిట్స్ అందిస్తామన్నారు. పాలమూరు నుంచి వచ్చిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు.. ఈ ప్రాంతంపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది.. పాలమూరు సమస్యలు తెలిసినందుకే జూరాల నుంచి కొడంగల్– నారాయణపేట ప్రాంతాలకు ఎత్తిపోతల ద్వారా కృష్ణా నీళ్లు మళ్లించే పథకానికి రూ.3 వేల కోట్లు వెచ్చించారని చెప్పారు. మక్తల్లో కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడిన ముదిరాజ్ వాకిటి శ్రీహరిని గెలిపించినందుకే ఇక్కడికి వచ్చామని మంత్రులు పేర్కొన్నారు. లక్ష మెజార్టీతో గెలిపించండి! రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పాలమూరు ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డిని ప్రకటించిందని, వంశీని లక్ష మెజార్టీతో గెలిపిస్తే.. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. వంశీచంద్రెడ్డి గెలవక ముందే రూ.వందల కోట్ల నిధులు పాలమూరుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. గెలిచాక తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎంపీ చేయని విధంగా వంశీ పనిచేస్తాడనే నమ్మకం ఉందన్నారు. విద్యార్థి విభాగం నుంచి యువజన రాష్ట్ర కాంగ్రెస్, జాతీయ రాజకీయాల్లోకి వచ్చిన వంశీచంద్రెడ్డి సోనియా, రాహుల్గాంధీలతో అత్యంత సన్నిహితంగా ఉంటారన్నారు. వంశీచంద్రెడ్డికి మక్తల్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ ఇవ్వాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు. రూ.350 కోట్లు మంజూరు చేయండి: వాకిటి శ్రీహరి మక్తల్ నియోజకవర్గంలో ఏడు లిఫ్టు ఇరిగేషన్లు పునరుద్ధరించేందుకు రూ.350 కోట్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంత్రులను కోరారు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్లో అభివృద్ధికి సహకరించాలన్నారు. నారాయణపేట– కొడంగల్ ఎత్తిపోతల పథకం పేరులో తమ ప్రాంతం పేరు పెట్టాలని కోరడంతో మక్తల్– నారాయణపేట– కొడంగల్ ఎత్తిపోతల పథకం మార్చారన్నారు. అలాగే మక్తల్లో 33/11 కేవీ సబ్స్టేషన్, సంగంబండ దగ్గర సోలార్ ప్లాంట్ ఏర్పాటు, ఊట్కూర్ మండలం పూలిమామిడిలో 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్, దేవరకద్రలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని మంత్రులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్కుమార్రెడ్డి, నాయకులు బాలకృష్ణరెడ్డి, గోపాల్రెడ్డి, లక్ష్మారెడ్డి, హన్మంతు, సురేశ్కుమార్, రవికుమార్, గణేశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: వీడిన సస్పెన్స్..! లోక్సభ అభ్యర్థిగా డీకే అరుణ.. -
వీడిన సస్పెన్స్..! లోక్సభ అభ్యర్థిగా డీకే అరుణ..
మహబూబ్నగర్: మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఎవరనే దానిపై సస్పెన్స్ వీడింది. మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేరు ఖరారైంది. ఈ లోక్సభకు సంబంధించి డీకే అరుణతో పాటు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్రెడ్డి, రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ మధ్య టికెట్ పోరు కొనసాగడంతో అధిష్టానం పెండింగ్లో పెట్టిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు బుధవారం రెండో జాబితాను ప్రకటించగా.. మహబూబ్నగర్ నుంచి డీకే అరుణకు చోటు దక్కింది. నాగర్కర్నూల్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎంపీ రాములు కుమారుడు, కల్వకుర్తి జెడ్పీటీసీ సభ్యుడు భరత్ ప్రసాద్ పేరును తొలి జాబితాలోనే ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో రెండు లోక్సభ స్థానాలకు బీజేపీ అభ్యర్థులు ఖరారుకావడంతో ప్రచారం జోరందుకోనున్నట్లు తెలుస్తోంది. ఇవి చదవండి: 'బీజేపీ టికెట్' నగేశ్కే.. -
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. బాజిరెడ్డి వైపు మొగ్గు!
నిజామాబాద్: నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బాజిరెడ్డికి పార్టీ టికెట్ కేటాయించింది. ఈ మేరకు బుధవారం రాత్రి పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటన చేశారు. మాస్ లీడర్గా పేరుపొందిన బాజిరెడ్డి గోవర్ధన్కు జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో మంచి పట్టు ఉంది. సిరికొండ మండలం చీమన్పల్లికి చెందిన ఆయన తొలుత పోలీస్ పటేల్గా పనిచేశారు. అనంతరం 1981లో చీమన్పల్లి సర్పంచ్గా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1987లో సిరికొండ ఎంపీపీగా ఎన్నికై న ఆయన 1992లో సిరికొండ పీఏసీఎస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. 1993లో రాష్ట్ర ఎస్ఎఫ్సీ డైరెక్టర్గా నియమితులయ్యారు. అనంతరం రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. కాంగ్రెస్ నుంచి రెండు సార్లు, బీఆర్ఎస్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆర్టీసీ చైర్మన్గా కూడా విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, బాన్సువాడ నియోజకవర్గాల్లో మంచి పేరు ఉంది. ఎంపీ నియోజకవర్గంలో మున్నూరుకాపు ఓట్లు ఎక్కువగా ఉండడం.. ఆయన కూడా ఇదే సామాజిక వర్గం కావడంతో బీఆర్ఎస్ అధినేత బాజిరెడ్డి వైపు మొగ్గుచూపారు. ఆయనకు టికెట్ కేటాయించడంతో జిల్లాలోని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, బాజిరెడ్డి అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేశ్ బిగాల శుభాకాంక్షలు తెలిపారు. ‘జహీరాబాద్’ అభ్యర్థిగా అనిల్కుమార్.. జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి పేరు ఖరారైంది. గాలి అనిల్కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ముగుడంపల్లి మండలం మాడ్గి గ్రామానికి చెందిన గాలి అనిల్కుమార్ పటాన్చెరు నియోజక వర్గంలో స్థిరపడ్డారు. కాగా ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా బీబీ పాటిల్, కాంగ్రెస్ అభ్యర్థిగా సురేష్ షెట్కార్ లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవి చదవండి: వరంగల్: బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం కావ్య ఖరారు! -
అభ్యర్థి ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్స్..!
సాక్షి,ఆదిలాబాద్: మాజీ ఎంపీ గొడం నగేశ్ బీజేపీలో చేరికతో ఆ పార్టీలో ముసలం మొదలైంది. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని ముఖ్య నేతలంతా కలిసి ఢిల్లీ వెళ్లి అగ్రనేతలతో సోమవారం భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీలో ముందు నుంచి పనిచేస్తున్న వారికే అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు. ఇదిలా ఉంటే లంబాడాలను పరిగణలోకి తీసుకోవాలని ఆ సామాజికవర్గం నేతలు విన్నవించారు. పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి బీఎల్ సంతోష్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ను వారు కలిశారు. కాగా గొడంకు టికెట్ ఇవ్వమని అగ్రనేతలు చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎంపీకా.. లేనిపక్షంలో ఇతర నేతలను ఆదిలాబాద్ స్థానానికి పరిగణలోకి తీసుకుంటారా అనేది ప్రస్తుతం హాట్టాపిక్గా మారింది. సంజాయిషీ ఇచ్చారనే ప్రచారం.. ఢిల్లీ వెళ్లిన లంబాడా నేతలు తమకు టికెట్ ఇవ్వాలని అడుగుతూనే మరోపక్క ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో గొడం నగేశ్ను పార్టీలోకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన ఓ ఎమ్మెల్యే ఇక్కడ ఒంటరయ్యారన్న ప్రచారం సాగుతోంది. మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు ఆ ఎమ్మెల్యేను వ్యతిరేకిస్తున్నారా అనేది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఎంపీ టికెట్ నగేశ్కు ఇవ్వాలని నేను చెప్పలేదని ఒంటరైన ఆ ఎమ్మెల్యే జిల్లా నేతలకు సంజాయిషీ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పుకుంటున్నారు. ఆదిలాబాద్ ఎంపీ టికెట్ ఎవరికి ఇవ్వాలన్నది అధిష్టాన నిర్ణయమేనని ఆ ఎమ్మెల్యే జిల్లా నేతలతో చెప్పుకొచ్చినట్లు ప్రచారం సాగుతుంది. ఏదేమైనా బీజేపీలో రెండు రోజులుగా సాగుతున్న పరిణామాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఢిల్లీలో సందడి.. మాజీ ఎంపీ గొడం నగేశ్ ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం కాషాయ కండువా కప్పుకున్న విషయం విదితమే. ఆయన పార్టీలో చేరిన మరుసటి రోజే ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని ముఖ్య నేతలంతా ఢిల్లీ బాట పట్టారు. మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జాదవ్ రాజేశ్బాబు, హరినాయక్ జట్టుగా హస్తీనకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్నగారి భూమయ్య, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, ఆదిలాబాద్ పార్లమెంట్ ప్రభారి మయూర్ చంద్ర, మరో ఒకరిద్దరు నేతలు కలిసి మరో జట్టుగా దేశ రాజధానికి వెళ్లినట్లు సమాచారం. అక్కడ బీఎల్ సంతోష్, డాక్టర్ లక్ష్మణ్ను కలిశారు. కాగా ఇందులో ఒక బృందానికి అగ్రనేతలు గొడం నగేశ్కు టికెట్ ఇవ్వమని చెప్పినట్లు పార్టీలో ప్రచారం సాగుతుంది. అయితే ఇందులో ఎవరికీ టికెట్ ఇస్తామనే విషయంలో అగ్రనేతలు ఎలాంటి హామీ ఇవ్వనట్లు తెలుస్తోంది. లంబాడాల ఓట్లు లక్షన్నర వరకు ఉన్న దృష్ట్యా టికెట్ ఇస్తే గెలుస్తామని రాథోడ్ రమేశ్, రాథోడ్ బాపూరావు, రాథోడ్ జనార్దన్ నేతల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల మద్దతు కూడా తమకు ఉందని చెప్పినట్లు సమాచారం. పార్టీలోకి ఎవరు వచ్చినా చేర్చుకోవాలని, సీటు ఇవ్వొద్దని నేతలంతా ముక్తకంఠంతో కోరినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పార్టీ నాయకత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్లు ఆ తర్వాత నేతలు ఢిల్లీలో మీడియా సమావేశంలో చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పటికే ఢిల్లీలో ఉన్న బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి జిల్లా నేతలతో కలిసి ఉండటం గమనార్హం. కాగా ఎంపీ సోయం బాపూరావు ఎక్కడ ఉన్నారన్నది తెలియరాలేదు. నగేశ్ చేరిక తర్వాత ఆయన సైలెంట్గా ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇవి చదవండి: పదవుల కోసం పోయెటోళ్లతో పరేషానొద్దు: కేసీఆర్ -
కలిసొచ్చిన కరీంనగర్ గడ్డపై నుంచే.. ప్రచారానికి శ్రీకారం!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: దశాబ్దాల పాటు తెలంగాణ ప్రజలు కోరుకున్న స్వరాష్ట్ర సాధన లక్ష్యంగా ఉద్యమ పార్టీగా పురుడు పోసుకున్న నాటి టీఆర్ఎస్, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ కలిసొచ్చిన కరీంనగర్ గడ్డపై నుంచే పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది. మంగళవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ఎస్సారార్ కళాశాల గ్రౌండ్లో లక్ష మందితో పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా ‘కరీంనగర్ కదనభేరి’ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించి ఎన్నికల ప్రచార శంఖారావం పూరించనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం చవిచూసిన అనంతరం పార్టీ అధినేత కేసీఆర్ మొదటిసారిగా కరీంనగర్కు రానున్న నేపథ్యంలో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈనెల 7న కరీంనగర్లో సమావేశం ఏర్పాటు చేసి సభ ఏర్పాట్లు, కాంగ్రెస్, బీజేపీల వైఖరి, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆవశ్యకతను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ, బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్కుమార్ కరీంనగర్లోనే మకాం వేసి వారం రోజులుగా సభ ఏర్పాట్లపై కార్యకర్తలకు దిశానిర్దేశనం చేశారు. లక్ష మంది సమీకరణకు.. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజక వర్గాల నుంచి లక్ష మందికిపైగా జనాన్ని సమీకరించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, కరీంనగర్, సిరిసిల్లలో బీఆర్ఎస్ విజయం సాధించగా చొప్పదండి, మానకొండూర్, హుస్నాబాద్, వేములవాడలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. పార్లమెంట్ పరిధిలో వచ్చిన ఓట్లను పరిగణనలోకి తీసుకుంటే కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్కే 5వేల పైచిలుకు ఓట్లు అధికంగా వచ్చిన విషయాన్ని కార్యకర్తలకు వివరిస్తూ భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు నియోజక వర్గాల్లో కాంగ్రెస్కు 5,12,352 ఓట్లు రాగా బీఆర్ఎస్కు 5,17,601, బీజేపీకి 2,50,400 ఓట్లు వచ్చాయని, పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీ సీట్ల సంఖ్య తగ్గినా ఐదువేల పైచిలుకు మెజార్టీ బీఆర్ఎస్కే ఉందని, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేస్తే గెలుపు తథ్యమనే వాదనను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 3 నెలలు గడిచాయని, వారు ఇచ్చిన హామీలు అమలు కాక ప్రజలు అసహనంతో ఉన్నారని, బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఐదేళ్లలో చేసిన అభివృద్ధి పెద్దగా ఏమీ లేదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి మరోసారి ఎంపీ సీట్లను బీఆర్ఎస్ కై వసం చేసుకునే దిశగా కార్యకర్తల్లో మనోనిబ్బరాన్ని నింపుతున్నారు. నగరం గులాబీమయం! కరీంనగర్ ‘కదనభేరి’ బహిరంగ సభ ఏర్పాట్లతో నగరం గులాబీమయమైంది. ప్రధాన కూడళ్లతో పాటు ఎస్సారార్ కళాశాలకు వెళ్లే రహదారి మొత్తం గులాబీ జెండాలు, పార్టీ అధినేతల కటౌట్లతో సిద్ధం చేశారు. ఎస్సారార్ మైదానంలో సభ ఏర్పాట్లకు సంబంధించి వాహనాల పార్కింగ్, తదితర పనులన్నీ పూర్తయ్యాయి. ఇవి చదవండి: అభ్యర్థి ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్స్..! -
హ్యాట్రిక్ గెలుపే లక్ష్యంగా.. : బీబీ పాటిల్
మెదక్: బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన మరుసటి రోజే అనూహ్యంగా జహీరాబాద్ ఎంపీ టికెట్ దక్కించుకున్న సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ హ్యాట్రిక్ గెలుపే లక్ష్యంగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ప్రజల దగ్గరకు వెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. అంతే కాకుండా పార్టీ క్యాడర్తో మమేకమై ప్రచారం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన పలువురు నేతలను కలిసి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే శాస్త్రవేత్త, బీజేపీ నేత పైడి ఎల్లారెడ్డిని కలిసి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మాజీ ఎంపీ దివంగత ఎం.బాగారెడ్డి కుమారుడు ఎం.జైపాల్రెడ్డిని ఫోన్ద్వారా సంప్రదించే ప్రయత్నం చేసినా అందుబాటులోకి రాలేదని సమాచారం. జైపాల్రెడ్డి టికెట్ను గట్టిగా ఆశించారు. అతను చివరి వరకు పోటీలో ఉన్నా అనూహ్యంగా బీబీ పాటిల్కు టికెట్ కేటాయించడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. బీబీ పాటిల్ తనతో ఉన్న క్యాడర్ను బీజేపీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. పాటిల్ 2014 సార్వత్రిక ఎన్నికల ముందు వరకు పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు పెద్దగా తెలియని వ్యక్తి. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి అయినా ఈయన మహారాష్ట్రలో నిర్మాణ రంగంతో పాటు వివిధ వ్యాపారాలు చేసుకునేవారు. అప్పట్లో పాటిల్ బీజేపీ టికెట్ను ఆశించినా దక్కలేదు. తర్వాత పలు కారణాల వల్ల బీఆర్ఎస్ ఆవిర్భవించినప్పుడు ఆ పార్టీలో చేరి జహీరాబాద్ నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. 1.44లక్షల మెజార్టీతో గెలిచి తొలిసారి పార్లమెంట్లో అడుగు పెట్టారు. అనంతరం పార్లమెంట్ పరిధిలోని తన పార్టీ ఎమ్మెల్యేలతో కొంత గ్యాప్ పెరిగింది. అయినా రాష్ట్ర నాయకత్వంతో సన్నిహిత సంబంధాలుండడం వల్ల 2019 ఎన్నికల్లోనూ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో ఓటమి అంచువరకు వెళ్లి 6,229 మెజార్టీతో బయట పడ్డారు. ఎమ్మెల్యేలు సహకరించడం లేదని ఆయన పలుమార్లు అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తపరిచారు. అధికారిక కార్యక్రమాల్లో, సీఎం, మంత్రుల సభల్లో మాత్రమే పాల్గొంటూ వచ్చారు. కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయించి తన పార్లమెంట్ పరిధిలోని రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తూ వచ్చారు. ఇటీవల ప్రధాని మోదీ చేతుల మీదుగా రహదారుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయించారు. ఇవి చదవండి: బీఆర్ఎస్కు గుడ్బై చెప్పిన మాజీ ఎంపీ.. -
నేను కూడా చిన్నతనంలో కబడ్డీ మాత్రమే.. : మంత్రి పొన్నం
సంగారెడ్డి: గ్రామీణ యువత క్రీడలను అలవర్చుకోవాలని, క్రీడా స్ఫూర్తి ఐక్యతను ప్రోత్స హిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం పోతారం(ఎస్) లో జరుగుతున్న జిల్లా స్థాయి కబడ్డీ క్రీడా పోటీలను సందర్శించి క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడారు. ఈ సందర్భంగా మంత్రి ప్రభాకర్ మాట్లాడుతూ.. నేను కూడా చిన్నతనంలో కబడ్డీ మాత్రమే ఆడేదని, ఈ ఊరు నుంచి కబడ్డీ క్రీడాకారులు పోలీసులు ఉద్యోగాలు సాధించడం అభినందనీయమన్నారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న కబడ్డీ క్లబ్ అధ్యక్షుడు మడక కృష్ణను అభినందించారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మాజీ సర్పంచ్లు కేడం లింగమూర్తి, బత్తిని సాయిలు, ఎంపీటీసీ భొమ్మగాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వైకుంఠ రథం అందజేస్తా.. లయన్స్ క్లబ్ ఆఫ్ హుస్నాబాద్, కరీంనగర్ రెనే ఆస్పత్రి ఆధ్వర్యంలో పట్టణంలోని సీవీ రామన్ పాఠశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. వైద్య శిబిరంలో మంత్రి వైద్య పరీక్షలు చేసుకున్నారు. శిబిరంలో ప్రముఖ ఛాతీ వైద్యులు, గుండె సంబంధించిన వైద్యులు, జనరల్ ఫిజీషియన్ వైద్యులు ఉచిత పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బాడీ ఫ్రీజర్లు, వైకుంఠ రథాలు పెట్టుకోవడానికి వసతి కోసం కలెక్టర్, ఆర్డీఓలతో మాట్లాడి ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. లయన్స్ క్లబ్కు నా తండ్రి జ్ఞాపకార్థం వైకుంఠ రథం విరాళంగా ఇస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అయిలేని అనిత, వైస్ చైర్పర్సన్ అయిలేని అనిత, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, లయన్స్ క్లబ్ నిర్వాహకులు రాజగోపాల్రావు, కాయిత నారాయణ రెడ్డి, చిట్టి గోపాల్రెడ్డి తదితరులు ఉన్నారు. మంత్రిని సన్మానించిన ఆర్టీసీ ఉద్యోగులు హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ను ఆర్టీసీ ఉద్యోగులు శాలువా కప్పి సన్మానించారు. ఆర్టీసీ ఉద్యోగులకు 2017 సంవత్సరానికి సంబంధించి వేతన సవరణ 21 శాతం ప్రభుత్వం ప్రకటించిన సందర్భంగా మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇవి చదవండి: హ్యాట్రిక్ గెలుపే లక్ష్యంగా.. : బీబీ పాటిల్ -
పోరు.. జోరు! క్షేత్రస్థాయిలో మొదలైన క్యాంపు రాజకీయాలు..
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోరు ఇక హోరెత్తనుంది. సోమవారంతో నామినేషన్లకు తుది గడువు ముగియనుండగా.. ఇదేరోజు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు మన్నె జీవన్రెడ్డి, నవీన్కుమార్రెడ్డి నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. ఈ మేరకు ఎవరికి వారు భారీ ఏర్పాట్లకు సన్నాహాలు మొదలుపెట్టారు. పోటాపోటీగా ఊరేగింపు, భారీ ర్యాలీల మధ్య ఇరువురు వేర్వేరు సమయాల్లో మహబూబ్నగర్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కౌంటర్లో నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కనుంది. కాంగ్రెస్: ఉదయం 11 గంటలకు.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిచిన ప్రముఖ పారిశ్రామికవేత్త, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు మన్నె జీవన్రెడ్డి ఆదివారం హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డి చేతులమీదుగా బీఫాం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో జీవన్రెడ్డి చిన్నాన్న, ఎంఎస్ఎన్ ఫార్మా పరిశ్రమల అధినేత మన్నె సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి జీవన్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం సహకారంతో ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కృషి చేసేందుకు తనకు అవకాశం కల్పించాలని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. కాగా, జీవన్రెడ్డి ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య సోమవారం ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి సైతం.. బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్కుమార్రెడ్డి శనివారం ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేతులమీదుగా బీఫాం అందుకున్నారు. ఈ క్రమంలో మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ సమావేశం సోమవారం ఏర్పాటు చేశారు. స్థానిక జేజేఆర్ ఫంక్షన్ హాల్లో ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్తోపాటు ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, మాజీ శాసనసభ్యులు పాల్గొననున్న సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశం అనంతరం ముఖ్య నేతలు, పార్టీ శ్రేణులతో కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్కుమార్రెడ్డి ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్లో నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. 28న పోలింగ్.. 2న లెక్కింపు బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్లో చేరి కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ఆయన రాజీనామాతో ఎమ్మెల్సీ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఈ నెల నాలుగో తేదీన కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం సోమవారం నామినేషన్లకు తుదిగడువు కాగా.. ఎన్నికల అధికారులు 12న స్క్రూట్నీ చేపట్టనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు 14 కాగా.. 28న ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది. వచ్చే నెల రెండో తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇవి చదవండి: కసితో పనిచేసి పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుదాం : కేటీఆర్ -
కసితో పనిచేసి పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుదాం : కేటీఆర్
సాక్షి, కామారెడ్డి: ‘‘మొన్నటి ఎన్నికల్లో ఓటమి చేదు అనుభవం. జరిగిందేదో జరిగిపోయింది. ఓటమితో కుంగిపోవద్దు. భవిష్యత్తు కోసం కలిసికట్టుగా కసితో పనిచేసి విజయాలు సొంతం చేసుకుందాం’’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొ న్నారు. ఆదివారం.. జిల్లా కేంద్రంలోని సత్య కన్వెన్షన్ లో పార్టీ కామారెడ్డి నియోజకవర్గ కార్యకర్తల విస్తృ త స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలవికాని హామీలు, అబద్ధపు ప్రచారాలు, మాయ మాటలతో మోసపోయామని తక్కువ సమయంలోనే ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. కేసీఆర్ గెలుపు కోసం అందరూ కష్టపడ్డారని, అయితే తప్పుడు ప్రచారాలతో నష్టం జరిగిందని పేర్కొన్నారు. కేసీఆర్ భూములు గుంజుకుంటడంటూ చేసిన తప్పుడు ప్రచారాన్ని మనం సరిగా తిప్పికొట్టలేకపోయామన్నారు. కేసీఆర్ గెలిస్తే కామారెడ్డిని వదిలి గజ్వేల్కు పోతాడంటూ జరిగిన ప్రచారంతోనూ నష్టం జరిగిందన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బాన్సువాడ, బాల్కొండలలో గెలిచామని, జుక్కల్, కామారెడ్డి, బోధన్లలో స్వల్ప తేడాతో ఓడిపోయామని పేర్కొన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీచేసే అభ్యర్థికి భారీ మెజారిటీ ఇవ్వడానికి కార్యకర్తలంతా కలిసి పనిచేయాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గంప గోవర్ధన్ నాయకత్వంలో పనిచేసినట్టే, ఎంపీ ఎన్నికల్లోనూ ఆయన నాయకత్వంలో అందరూ కలిసి పనిచేయాలని కేటీఆర్ కోరారు. ఈనెల 15 నాటికి వంద రోజులు.. ఎన్నికలలో గెలవడానికి కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చిందని, వాటిని అమలు చేయకుంటే ఊరుకునేది లేదని కేటీఆర్ పేర్కొన్నారు. రూ. 2 లక్షల రుణ మాఫీ చేస్తామని, రైతుబంధు, పింఛన్ పెంచుతామని, మహిళలకు రూ.2,500 ఇస్తామని హామీలు ఇచ్చారని, ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు. రేవంత్రెడ్డి పాలనకు మార్చి 15 నాటికి వంద రోజులు నిండుతాయని పేర్కొన్నారు. వంద రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజలతో కలిసి పోరాటాలు చేద్దామన్నారు. సిరిసిల్లలో రాజీనామా చేసి మల్కాజ్గిరిలో పోటీ చేయడానికి తాను సిద్ధమని, రేవంత్రెడ్డి కొడంగల్లో రాజీనామా చేసి, సీఎం సీటును వదులుకుని రావాలని సవాల్ చేస్తే సమాధానం లేదని విమర్శించారు. కేటీఆర్ ముందే బయటపడ్డ విభేదాలు.. కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. పార్టీ సీనియర్ నాయకుడు తిర్మల్రెడ్డి తన ప్రసంగంలో గంప గోవర్ధన్ పేరును ప్రస్తావించకపోవడంతో మొదలైన గలాట కొంతసేపు ఉద్రిక్తతకు దారి తీసింది. అలాగే సీడీసీ మాజీ చైర్మన్ నర్స య్య వేదికపైన అడ్డుగా ఉన్నారంటూ పక్కకు జరిపిన సందర్భంలోనూ గొడవ చెలరేగింది. కాగా సమావేశానికి ముందు ఓ ఫామ్హౌజ్లో పార్టీ ముఖ్యనేతలతో కేటీఆర్ సమావేశమై విభేదాలను పక్కనపెట్టి కలిసి పనిచేయాలని సూచించారు. ఇవి చదవండి: బీసీ కులగణన వెంటనే చేపట్టాలి: ఎమ్మెల్సీ కవిత -
మాట తప్పితే ఊరుకోం..
మెదక్: ఎన్నికల్లో గెలవడం కోసం అడ్డగోలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే మాట మార్చడం కాంగ్రెస్కు అలవాటుగా మారిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మ ఆరోపించారు. బుధవారం ఎల్ఆర్ఎస్పై రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామని చెప్పిన మాటలు ఉత్తమాటలుగా మిగిలాయన్నారు. రుణమాఫీ ఇప్పటివరకు చేయలేదన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ రమేష్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కౌన్సిలర్లు, మెదక్, నిజాంపేట ఎంపీపీలు జయరాంరెడ్డి, సిద్దిరాములు, మండల పార్టీ అధ్యక్షుడు అంజాగౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. చార్జీల పేరిట వసూలు: సునీతారెడ్డి ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక చౌరస్తాలో చేపట్టిన ధర్నాలో ఆమె మా ట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని మండిపడ్డారు. ప్లాట్లు, లే అవుట్లను క్రమబద్దీకరించేందుకు చార్జీల వసూల పేరిట రూ. వేల కోట్లు ప్రజల నుంచి గుంజాలని ప్రభుత్వం యోచిస్తుందని మండిపడ్డారు. ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, మున్సిపల్ చైర్మన్ అశోక్గౌడ్, పార్టీ నాయకులు చంద్రాగౌడ్, శేఖర్, జితేందర్రెడ్డి, సత్యంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: TS: కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. పరిశీలనలో పేర్లు ఇవే -
పాలమూరు బాధ్యత నాదే..! : సీఎం రేవంత్రెడ్డి
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘పాలమూరులో విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి కల్పనతో పాటు సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి తగిన నిధులు కేటాయించి వేగంగా పూర్తి చేస్తాం.. దేశంలోనే పాలమూరు ఆదర్శంగా తీర్చిదిద్దుతాం.. ఇక్కడి బిడ్డగా పాలమూరును అభివృద్ధి చేసే బాధ్యత నాదే’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోని ఎంవీఎస్ కళాశాల మైదానంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘పాలమూరు ప్రజాదీవెన’ బహిరంగసభలో ఆయన పాల్గొని లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ 3,650 రోజులు, కేంద్రంలో మోదీ 3,650 రోజులు అధికారంలో ఉన్నారని.. వీళ్లు పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారా అని ప్రశ్నించారు. కేసీఆర్ కరీంనగర్ నుంచి పాలమూరుకు వస్తే ఆయనను ఇక్కడి ప్రజలు ఎంపీగా గెలిపించారని గుర్తుచేశారు. ఆనాడు తుమ్మిళ్ల వద్ద కుర్చీ వేసుకొని ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పి మరిచాడని, పదేళ్లు అయినా ఆ పనులు పూర్తి చేయలేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉత్తమ్కుమార్రెడ్డితో మాట్లాడి జిల్లాలో ఉన్న ఆర్డీఎస్, నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్, పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలు, కల్వకుర్తి, కొడంగల్– నారాయణపేట ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వాలని, పచ్చని పంటలు పండాలనే ఉద్దేశంతో సమీక్ష చేశామన్నారు. ఈ ధైర్యం ఇక్కడి బిడ్డల చలువే.. ఆనాడు హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడినప్పుడు నెహ్రూ పాలమూరు బిడ్డ బూర్గుల రామకృష్ణారావును మొదటి సీఎంగా చేసి ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని రేవంత్రెడ్డి అన్నారు. ఆ తర్వాత నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చారని.. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే ఈ పదేళ్లు దుర్మార్గుడు, దుష్టుడు రాష్ట్రాన్ని పరిపాలించాడన్నారు. గుర్తించిన ఉద్యమకారులు, నిరుద్యోగ యువత, అన్నివర్గాల లక్షలాది మంది ప్రజలు నడుం బిగించి రాష్ట్రానికి పట్టిను పీడ నుంచి విముక్తి కల్పించారన్నారు. డిసెంబర్ 3న కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకి రాగా.. సోనియాగాంధీ, రాహుల్గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, ప్రియాంకాగాంధీ సహకారంతో మళ్లీ పాలమూరు బిడ్డకు సీఎంగా అవకాశం వచ్చిందన్నారు. మా తాతలు, ముత్తాతలు ముఖ్యమంత్రి కాదు.. రూ.లక్షల కోట్లు ఇవ్వలేదు.. మా అయ్య పేరు చెప్పుకొని ఈ కుర్చీలో కూర్చోలేదు.. 2006లో సామాన్య కార్యకర్తగా ప్రజలకు సేవలు చేయాలనే ఉద్దేశంతో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి గెలిచానని.. మిడ్జిల్ జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా మీరందరూ కష్టపడి నన్ను గెలిపించారన్నారు. తెలంగాణలో సీఎంగా నిటారుగా నిలబడి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎవరితోనైనా కొట్లాడటానికి ఈ ధైర్యం ఉందంటే పాలమూరు బిడ్డలు ఇచ్చిన ఆత్మవిశ్వాసమే కారణం అన్నారు. పాలమూరు ప్రజాదీవెన బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అధ్యక్షతన కొనసాగింది. సీఎం రేవంత్రెడ్డి సాయంత్రం 6.28 గంటలకు ఎంవీఎస్ మైదానంలో ఏర్పాటు చేసిన సభావేదికపైకి వచ్చారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు జీఎంఆర్ సీఎం రేవంత్రెడ్డిని మొదట సత్కరించారు. సీఎం రేవంత్రెడ్డికి ఆయన భారీ చిత్రపటాన్ని కాంగ్రెస్ నేతలు అందజేశారు. రాత్రి 7.38 గంటలకు సీఎం రేవంత్రెడ్డి ప్రసంగం ప్రారంభమై.. రాత్రి 8.17 గంటలకు ముగిసింది. మొత్తం 39 నిమిషాల పాటు మాట్లాడారు. రాత్రి 8.20 గంటలకు సీఎం కాన్వాయ్ సభాస్థలం నుంచి బయలుదేరి క్రిస్టియన్పల్లి నుంచి బైపాస్ మీదుగా హైదరాబాద్ వెళ్లింది. సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతున్న సమయంలో జనంలో మధ్యలో ఓ యువకుడు గురుకులాల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని ప్లకార్డు ప్రదర్శించడంతో పోలీసులు అడ్డుకున్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి స్వగ్రామం రంగారెడ్డిగూడలో సీఎం రేవంత్రెడ్డి రాత్రి భోజనం చేశారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు కల్పించారు. చల్లా, మన్నెను గెలిపించాలి.. ఇప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్పీ ఎన్నికలు వచ్చాయి.. ఈ ఎన్నికల్లో పార్టీ పరంగా మన్నె జీవన్రెడ్డిని అభ్యర్థిగా ఏఐసీసీ ప్రకటించనుంది. ఆ రోజు నన్ను ఏ విధంగా గెలిపించారో.. జీవన్రెడ్డిని అదేవిధంగా గెలిపించాలని సీఎం రేవంత్రెడ్డి కోరారు. ఆయన జెడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యుల మర్యాదను కాపాడుతారన్నారు. అదేవిధంగా మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డితో పాటు నాగర్కర్నూల్ అభ్యర్థిని గెలిపించాలని.. రాహుల్గాంధీని ప్రధానమంత్రిని చేయాలని విజ్ఞప్తి చేశారు. మూడు, ఆరు నెలల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని ఇటు కేసీఆర్, అటు మోదీ అంటున్నారని రేవంత్ ధ్వజమెత్తారు. పాలమూరోడు సీఎం అయిండని కేసీఆర్ అసూయ పడుతున్నారని.. పాలమూరు బిడ్డ సీఎం కాకూడదా.. ఇక్కడి ప్రజలు విద్యావంతులు కాదా అని ప్రశ్నించారు. 2014లో నాగం జనార్దన్రెడ్డి మహబూబ్నగర్ ఎంపీగా నిలబడినప్పుడు పాలమూరు ప్రాజెక్ట్కు జాతీయ హోదా ఇస్తామని మోదీ హామీ ఇచ్చి.. ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు అసెంబ్లీ ఎన్నికల కంటే అధిక మెజార్టీ రావాలన్నారు. ఇందిరమ్మ కమిటీల ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. పాలమూరులో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను బొందపెట్టాలన్నారు. కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, దామోదర రాజనర్సింహ, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు, ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు ప్రసంగించారు. ఇవి చదవండి: ఎవరు ఎటువైపు.. ‘గులాబీ’ గూటికి పగుళ్లు! -
పాత.. కొత్త.. ‘కారు’ అభ్యర్థులు ఖరారు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ రెడీ అవుతోంది. అభ్యర్థుల ఎంపిక ప్రారంభించింది. మొదటి జాబితాలోనే ఉమ్మడి జిల్లాలోని రెండు స్థానాల క్యాండిడేట్ల జాబితా విడుదల చేసింది. కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్కు గులాబీ దళపతి మరోసారి అవకాశం కల్పించారు. పెద్దపల్లి నుంచి కొత్తగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కు అవకాశం కల్పించారు. బీజేపీ ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన ద్వారా రాజకీయ ప్రత్యర్థులపై ఒత్తిడిని పెంచే వ్యూహాన్ని అమలు చేస్తుండటంతో బీఆర్ఎస్ సైతం తొలివిడతలో రాష్ట్రవ్యాప్తంగా నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల హీట్ను పెంచింది. మరోవారం పదిరోజుల్లో కాంగ్రెస్ పార్టీ సైతం తొలిజాబితాను విడుదల చేసేందుకు కసరుత్తు చేస్తోంది. బోయినపల్లి వినోద్కుమార్ పుట్టిన తేదీ: 1959 జూలై 22 విద్యార్హతలు: ఎల్ఎల్బీ (కేయూ) అనుభవం: టీఆర్ఎస్ పోలిట్బ్యూరో సభ్యులు, లోక్సభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు అదనపు సమాచారం: సీపీఐలో వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభంతో టీఆర్ఎస్లో చేరి 2004–09 మధ్యలో వరంగల్ ఎంపీగా, 2014–19లో కరీంనగర్ ఎంపీగా పని చేశారు. 2019లో బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. సామాజిక వర్గం: వెలమ (ఓసీ) కొప్పుల ఈశ్వర్ పుట్టిన తేదీ: 1959 ఏప్రిల్ 20 విద్యార్హతలు: బీఏ అనుభవం: సాంఘిక, సంక్షేమశాఖ మంత్రిగా పని చేశారు. అదనపు సమాచారం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1994లో మేడారం నుంచి తొలిసారిగా టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2004, 08లో టీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. 2009, 10, 14, 18లో ధర్మపురి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధించారు. 2014–18 వరకు ప్రభుత్వ చీఫ్ విప్గా పని చేశారు. 2019 నుంచి మంత్రిగా పని చేశారు. సామాజిక వర్గం: ఎస్సీ (మాల) ఇవి చదవండి: నేడు సికింద్రాబాద్, సంగారెడ్డిలలో మోదీ పర్యటన -
గెలుపు వ్యూహాలపై మాజీ సీఎం కేసీఆర్ సమాలోచన..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ నుంచే పార్లమెంట్ ఎన్నికల కదనభేరి మోగించబోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ.. గులాబీ దళాన్ని ఎన్నికలకు సన్నద్ధం చేసేలా.. లోక్సభ ఎన్నికల కసరత్తును ప్రారంభించనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నైరాశ్యంలో ఉన్న పార్టీ క్యాడర్లో జోష్ నింపేలా.. వచ్చే లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కరీంనగర్లోని ఎస్సారార్ కళాశాల ఆవరణలో నిర్వహించే బహిరంగసభను వేదికగా చేసుకోవాలని ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇప్పటికే జనవరిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ అధ్యక్షతన పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా సన్నాహాక సమావేశాలు నిర్వహించారు. తాజాగా ఆదివారం మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్లోని తెలంగాణభవన్లో కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ స్థానాల ముఖ్యనేతలతో విడివిడిగా సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన గెలుపు వ్యూహాలపై సమాలోచనలు చేశారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీల వలసలు ఆపేలా.. అలాగే ఈనెల 12న కరీంనగర్లో నిర్వహించబోయే బహిరంగసభను సక్సెస్ చేయడంపై నేతలతో కేసీఆర్ సుధీర్ఘంగా చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దశమిరోజు ఇద్దరు అభ్యర్థుల ప్రకటన.. పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అన్ని పార్టీలు ఎన్నికల కసరత్తు ప్రారంభించాయి. ఇప్పటికే బీజేపీ లోక్సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులతో కూడిన తొలిజాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధికి ముగ్గురు పేర్లతో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)కు పంపింది. కాంగ్రెస్, బీజేపీకి ధీటైన అభ్యర్థులను బరిలో నిలిపేందుకు పార్టీ ముఖ్యనేతల నుంచే ఇప్పటికే అభిప్రాయాలు సేకరించింది. ఇక తెలంగాణభవన్లో నిర్వహించిన సమావేశంలోనే ఎంపీ అభ్యర్థులుగా కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ బొయినపల్లి వినోద్కుమార్, పెద్దపల్లి నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను ప్రకటించాలనుకున్నా.. ఆదివారం అష్టమి, సోమవారం నవమి కావడంతో వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దశమి రోజు అధికారికంగా మొదట జాబితాలో కరీంనగర్, పెద్దపల్లి స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని నేతలు చెబుతున్నారు. లేదంటే ఈనెల 12న కరీంనగర్ ఎస్సారార్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించే బహిరంగసభలో ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీ అధిష్టానం వీరిద్దరికీ జనవరిలోనే టికెట్పై గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో వీరు తమ నియోజకవర్గం పరిధిలో వాల్రైటింగ్స్, ఫ్లెక్సీలతో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. అధికారికంగా అభ్యర్థుల ఖరారు చేసిన తరువాత పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచారంలో దిగేందుకు నేతలు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ఇవి చదవండి: పేదోడి కడుపు నింపడమే కాంగ్రెస్కు తెలుసు : మంత్రి సీతక్క -
‘బండి’ది ఓట్ల రాజకీయం..!
కరీంనగర్: ఇన్నాళ్లు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న ఎంపీ బండి సంజయ్కుమార్ పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఓట్ల రాజకీయానికి తెరలేపారని కరీంనగర్, జగిత్యాల, హన్మకొండ జెడ్పీ చైర్మన్లు కనుమల్ల విజయ, దావ వసంత, సుధీర్బాబు ఆరోపించారు. కరీంనగర్లోని ఓ హోటల్లో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎంపీగా ఐదేళ్లలో గ్రామాల అభివృద్ధి గురించి పట్టించుకోని సంజయ్ సర్పంచ్ల పదవీ కాలం ముగిశాక సానుభూతి చూపిస్తూ మొసలి క న్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ను అబాసుపాలు చేయడానికే సర్పంచులకు రావాల్సి న బిల్లులపై పోరాటం చేస్తామని ఓట్ల జిమ్మిక్కులు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్కుమార్ బెస్ట్ పార్లమెంటేరియన్గా గుర్తింపు పొందారని గుర్తు చేశారు. ఎంపీగా ఏం చేశావో చెప్పి ఓట్లు అడగాలని స్పష్టం చేశారు. శ్రీరాముని ఫొటో, అక్షింతలు పంపి సెంటిమెంట్తో ఓట్లు దండుకునే ప్రయత్నం సరికాదన్నారు. ఇప్పటికైనా సంజయ్ అభివృద్ధిపై అబద్ధాలు మాట్లాడడం మానుకోవాల ని హితవు పలికారు. బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, నాయకులు మారుతి, నయీం పాల్గొన్నారు. ఇవి చదవండి: ఎన్నికల సమయంలోనే రాజకీయాలు -
మళ్లీ సెంటిమెంట్ వైపు తెలంగాణ రాజకీయాలు
తెలంగాణలో రాజకీయాలు మళ్లీ సెంటిమెంట్ వైపు నడుస్తున్నట్లున్నాయి. శాసనసభలో కృష్ణా జలాల వాటాకు సంబంధించి, ప్రాజెక్టులను కృష్ణా నది యాజమాన్య బోర్డుకు అప్పగించే అంశంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ల మధ్య జరిగిన వాగ్యుద్దం చూస్తే గాలిలో కత్తులు తిప్పుతున్నట్లుగా కనిపించింది. ఇరుపక్షాలు ఒకదానిపై మరొకటి అప్పర్ హ్యండ్ అవడానికి గట్టి ప్రయత్నమే చేశాయి. వీరిద్దరు కాకుండా భారతీయ జనతా పార్టీ, ఎమ్ఐఎమ్లు కొంత ప్రాక్టికల్గా మాట్లాడారు. సీపీఐ మిత్రపక్షమైన కాంగ్రెస్కు మద్దతుగా బీఆర్ఎస్ పై పరోక్ష విమర్శలు చేశారు. ఈ క్రమంలో రాయలసీమకు నీటిని పెద్ద ఎత్తున తీసుకువెళ్లడానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న కృషిని ఏపీలోని ప్రతిపక్ష తెలుగుదేశం గుర్తించకపోయినా, తెలంగాణ రాజకీయ పక్షాలు అకనాలెడ్జ్ చేసినట్లు అనిపిస్తుంది. వాస్తవం ఏమిటంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి వృధాగా పోతున్న కృష్ణా జలాలను రాయలసీమకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. అలాగే ఏపీకి రావాల్సిన నీటి వాటాను పూర్తి స్థాయిలో తీసుకోవడానికి గాను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను తలపెట్టారు. కాని కొందరు ఎన్జీటీకి వెళ్లి నిలుపుదల చేయించారు. ఇందులో ఏపీలో విపక్ష తెలుగుదేశం పరోక్ష పాత్ర ఉందన్న ఆరోపణలు లేకపోలేదు. ఈ అంశాన్ని పక్కనబెడితే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం, సాగర్ తదితర ప్రాజెక్టులను రివర్ బోర్డుకు అప్పగించడానికి అంగీకరించిందంటూ బీఆర్ఎస్ వివాదం చేసింది. దీనిపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆద్వర్యంలో నల్గొండలో సభ జరపతల పెట్టిన నేపధ్యంలో ఈ అంశాన్ని కాంగ్రెస్ చేపట్టి శాసనసభలో ఏభై శాతం నీటి వాటా ఇచ్చేవరకు ప్రాజెక్టులను అప్పగించబోమంటూ ఒక తీర్మానాన్ని పెట్టింది. ఆ తీర్మానానికి బీఆర్ఎస్తో సహా వివిధ పార్టీలు ఆమోదం తెలిపాయి. బీఆర్ఎస్ మాత్రం ఆ తీర్మానంలో తమ గత ప్రభుత్వంపై చేసిన విమర్శలను తొలగించాలని డిమాండ్ చేసింది. కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎమ్బీ) కు ప్రాజెక్టులు అప్పగిస్తే తెలంగాణకు నష్టం జరుగుతుందని, దానికి ముందు తెలంగాణకు కూడా కృష్ణా జలాలలో ఏభై శాతం ఇవ్వాలని తెలంగాణ రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ట్రిబ్యునల్ నిర్ణయం ప్రకారం ఉమ్మడి ఏపీకి 811 టీఎమ్సీల నీటిని కేటాయించారు. రెండు రాష్ట్రాలలో ఉన్న ప్రాజెక్టుల ఆధారంగా, ఇతర ప్రాధాన్యాల ఆధారంగా తెలంగాణకు 299 టీఎమ్సీలు, ఆంధ్రప్రదేశ్కు 512 టీఎమ్సీలు నీటిని వాడుకునే అవకాశం కల్పించారు. రాష్ట్ర విభజన సమయంలో దీనికి ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. దానికి కారణం ఏమిటంటే అప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధన ముఖ్యం అంతా భావించారు. నీళ్లు, నియామకాలు, నిధులు అంశాల ప్రాతిపదికన తెలంగాణ ఉద్యమం వచ్చిందని భావిస్తారు. ఇప్పుడు అదే నీటి అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చి కాంగ్రెస్, బీఆర్ఎస్లు రాజకీయ లబ్ది పొందడానికి యత్నించాయి. వచ్చే పార్లమెంటు ఎన్నికలలో ఈ సెంటిమెంటును వాడుకోవడానికి ఈ రెండు పార్టీలు ఇప్పటినుంచే కృషి చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడాన్ని బీఆర్ఎస్ తప్పుపడుతుంటే, ఆ మొత్తం తప్పంతా బీఆర్ఎస్ దేనని కాంగ్రెస్ బుట్ట బోర్లవేస్తోంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇస్తూ ఎప్పుడెప్పుడూ ఏమి జరిగింది? చెప్పే యత్నం చేశారు. కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ ఆధ్వర్యంలో ఎఫెక్స్ కమిటీ సమావేశంలో కృష్ణా జలాలలో తెలంగాణకు 299 టీఎమ్సీలు వాటానీటికి, ఏపీకి 511 టీఎమ్సీలు నీరు ఇవ్వడానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారని ఉత్తమ్ తెలిపారు. కొద్ది నెలల క్రితం కేసీఆర్ వద్ద పనిచేసిన ప్రభుత్వ కార్యదర్శి స్మితా సబర్వాల్ ప్రాజక్టులను అప్పగించడానికి అంగీకరిస్తూ లేఖ రాశారని, దానిని ఆమోదించడం లేదని, ఏభై శాతం నీటి వాటాకు ఒప్పుకుంటేనే బోర్డుకు అప్పగిస్తామని ఉత్తమ్ చెప్పారు. ఈ క్రమంలో నీటి పారుదల శాఖను కేసీఆర్ నాశనం చేశారని, వేల కోట్లు దుర్వినియోగం చేశారని ఉత్తమ్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో మొత్తం తప్పు బీఆర్ఎస్దే తప్పు అని రుజువు చేయడానికి మంత్రి వాదన వినిపించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఉన్న స్నేహం కారణంగానే పోతిరెడ్డి పాడు రెగ్యులేటర్ సామర్ధాన్ని 44వేల క్యూసెక్కుల నుంచి 92 వేల క్యూసెక్కులకు పెంచుకోగలిగారని, అలాగే రాయలసీమ లిఫ్ట్ ద్వారా రోజుకు 8 టీఎమ్సీలు తీసుకువెళ్లే స్కీమ్ను చేపట్టారని ఆయన అన్నారు. కాగా ఒక సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుంటూ ప్రతిపక్షనేత కేసీఆర్ ఎందుకు సభకు రావడం లేదని ప్రశ్నించారు. ఆయన వచ్చి ఇంతటి ముఖ్యమైన విషయంపై మాట్లాడాలి కదా అని అన్నారు. ఈ చర్చలో పాల్గొంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్రావు తమ పార్టీపై నెపం వేయడానికి మంత్రి వక్రీకరణ చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే ప్రాజెక్టులను కేఆర్ఎమ్బీకి అప్పగించడానికి అంగీకరిస్తూ అధికారులు లేఖ రాశారని ఇటీవలవరకు ఉన్న ఈఎన్సీ మురళీదర్ బోర్డు సమావేశం తర్వాత చేసిన వ్యాఖ్యల వీడియోను హరీష్ ప్రదర్శించారు. దానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి జోక్యం చేసుకుంటూ ఆయన బీఆర్ఎస్ ఏజెంట్ అని అందుకే తీసివేశామని, మరికొందరు ఏజెంట్లు ఉన్నారని, వారిపై కూడా చర్య తీసుకుంటామని అన్నారు. హరీష్ రావు, మరో నేత కడియం శ్రీహరిలు 299 టీఎమ్సీల కేటాయింపు తమకు సంబంధం లేనిదని, గతంలో ట్రిబ్యునల్ చేసిందని వివరించే యత్నం చేశారు. మంత్రి ఉత్తమ్ ఆ విషయాన్ని దాటవేస్తూ మాట్లాడడం విశేషం. అలాగే కేసీఆర్ సభకు రాని అంశాన్ని హరీష్రావు సమాదానం చెప్పకుండా దాటవేశారు. నిజానికి తెలంగాణకు కేటాయించిన 299 టీఎమ్సీల నీటిని పూర్తిగా వాడుకోగలిగితే ముప్పై లక్షల ఎకరాలు సాగు చేయవచ్చు. కాని ఇంకా ఆ పరిస్తితి రాలేదు. అంతేకాక కృష్ణానదికి నీరురావడం ఆరంభం అయిన వెంటనే కల్వకుర్తి వంటి లిఫ్ట్ స్కీమును ఆపరేట్ చేసి నీటిని తీసుకోవచ్చు. వీటన్నిటినీ విస్మరించి, కేఆర్ఎమ్బీ ప్రాజెక్టులు అప్పగించడం వల్ల ఏదో నష్టం జరుగుతుందన్న చందంగా కాంగ్రెస్, బీఆర్ఎస్లు చర్చను జరిపారయి. ఇది పరస్పరం విమర్శలకే ఉపయోగపడుతుంది. కేసీఆర్ కూడా ఎన్నికలలో పరాజయం తర్వాత తొలిసారి నల్గొండలో కృష్ణా జలాలకు సంబంధించిన సమస్యపైనే భారీ సభలో మాట్లాడబోతున్నారు. అంటే తెలంగాణ సెంటిమెంట్ తమతోటే ఉండేలా వారుప్లాన్ చేసుకుంటున్నారని అనుకోవాలి. దీనిని తిప్పికొట్టడానికి కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు బీటలు వారిన వైనం, అవినీతిపై ఫోకస్ పెట్టింది. కాగా బీజీపీ సభ్యుడు మహేష్ రెడ్డి మాట్లాడుతూ రెండు రాష్ట్రాలు ఘర్షణ పడే పరిస్తితి ఉన్నప్పుడు కేఆర్ఎమ్బీకి ప్రాజెక్టులను అప్పగిస్తే తప్పేముందని అభిప్రాయపడ్డారు. బోర్డుకు ప్రాజెక్టులకు అప్పగించడం వల్ల వచ్చే నష్టం ఏమిటి? లాభం ఏమిటన్న దానిపై ఆలోచించాలని సూచించారు. కాంగ్రస్, బీఆర్ఎస్లు ఈ కోణంలో కాకుండా పరస్పరం నిందలు మోపుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చాయి. ఎమ్ఐఎమ్ నేత అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ విభజన చట్టం చేసినప్పుడే తాము ఈ సమస్యలు వస్తాయని చెప్పామని గుర్తు చేశారు. కానీ అప్పట్లో ఏ రాజకీయ పార్టీ దీని గురించి పట్టించుకోలేదని అన్నారు. వాస్తవానికి తెలంగాణలో ఉన్న నీటి ప్రాజెక్టులకు ఎంత నీరు అవసరమో, అంతమేర నీటిని పొందడానికి యత్నించడం తప్పు కాదు. కానీ ఆ పాయింట్లో ఈ నేతలు ఎవరూ మాట్లాడలేదు. కేవలం ఏభై శాతం కృష్ణానది జలాలలో వాటా ఇవ్వాలన్న డిమాండ్కే పరిమితం అయ్యారు. ఎందుకంటే వచ్చే పార్లమెంటు ఎన్నికలలో ఆయా పార్టీలు దీనిని ఒక నినాదంగా తీసుకోవాలని చూస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ ఇప్పటికే సభలు, ఉద్యమాలకు పిలుపు ఇచ్చింది. దానిని తిప్పి కొట్టడానికి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రతి వ్యూహం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రత్యేకించి కాళేశ్వరం ప్రాజెక్టులో దెబ్బతిన్న మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు ప్లాన్ చేశారు. కర్నాటక రాష్ట్రం తుంగభద్ర నదిపై కడుతున్న కొత్త ప్రాజెక్టు, వర్షాభావ పరిస్థితిలో కృష్ణానదికి నీటి కొరత ఏర్పడుతున్న విషయాన్ని కూడా ఆయా సభ్యులు ప్రస్తావించారు. ఇంకో సంగతి చెప్పాలి. కేసీఆర్, వైఎస్ జగన్మోహన్రెడ్డిలు గతంలో భేటీ అయిన సందర్భాన్ని తనకు అనుకూలంగా వాడుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నించింది. అప్పట్లో గోదావరి నుంచి కృష్ణానదికి నీటిని మళ్లించే ఒక స్కీమును కేసీఆర్ ప్రతిపాదించారు. దానికి తొలుత వైఎస్ జగన్మోహన్రెడ్డి సముఖత వ్యక్తం చేశారు. అప్పుడు ఏపీ శాసనసభలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిని ప్రశంసించారని అంటూ ఉత్తంకుమార్ రెడ్డి ఒక వీడియోని ప్రదర్శించారు. నిజానికి అది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్గా దానిని చూపారు. ఆ తర్వాత రోజులలో ఏపీ ప్రభుత్వం ఆ స్కీముపై వెనక్కి తగ్గింది. నిజానికి దానివల్ల తెలంగాణకే ఎక్కువ ప్రయోజనం.దానిని గుర్తించే ఏపీ వెనక్కి తగ్గింది. కానీ ఉత్తమ్ మాత్రం అదేదో ఏపీకి కేసీఆర్ మేలు చేసేసినట్లు పిక్చర్ ఇచ్చారు. అలాగే ఒకసారి కుటుంబంతో సహా కంచి వెళుతూ కేసీఆర్ మధ్యలో నగరిలో ప్రస్తుత మంత్రి రోజా ఇంటి వద్ద ఆగి భోజనం చేశారు. ఆ సందర్భంలో మాట్లాడుతూ గోదావరి జలాలు పెద్ద ఎత్తున సముద్రంలో కలుస్తున్నాయని, వాటిని రాయలసీమకు తరలించగలిగితే ఈ ప్రాంతం సస్యశ్యామలమవుతుందని అన్నారు. దానిని వక్రీకరిస్తూ కేసీఆర్ ఏదో రాయలసీమకు నీళ్లు ఇస్తానని అన్నట్లు ఉత్తమ్, తదితర కాంగ్రెస్ సభ్యులు చెప్పడం విశేషం. తెలంగాణతో పోల్చితే ఏపీలో విస్తీర్ణం ఎక్కువ సాగు భూమి ఎక్కువ. జనాభా ఎక్కువ. నది దిగువ ప్రాంతం కావడంతో వరదలు వచ్చినా భరించేది ఆ రాష్ట్రమే. అలాగే మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలు వాడుకున్న తర్వాత మిగిలిన నీటినే ఏపీ వాడుకోవల్సిన పరిస్థితి పలుమార్లు వస్తోంది. శ్రీశైలంలో నీటి కొరత ఉన్నప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం జల విద్యుత్ ఉత్పత్తి చేసి నీటిని కిందికి వదలివేస్తుంటుంది. తెలంగాణ శాసనసభలో అక్బరుద్దీన్ చెప్పినట్లు కృష్ణాపై పది అనుమతి లేని ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో ఉన్నాయి. వాటికి శ్రీశైలంలో తక్కువ నీటి మట్టం ఉన్నా లిప్ట్ ద్వారా నీటిని తీసుకువెళతారు. అదే ఏపీ వైపు నీటి మట్టం 854 ఉంటేనే అది కూడా వరద నీటినే తరలించుకోగలుగుతారు. కొన్నిసార్లు తన వాటా నీటిని కూడా వాడుకోలేకపోతున్నామని ఏపీ వాదన. ఈ నేపధ్యంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోత స్కీమ్ను చేపట్టింది. అయితే ఈ విషయాలతో సంబంధం లేకుండా తెలంగాణ ఎమ్మెల్యేలు ఏపీతో సమానంగా నీటి వాటాను డిమాండ్ చేస్తూ చర్చలు జరిపారు. చివరికి దీనిని ఎంత సెంటిమెంటుగా మార్చుతారో తెలియదు కానీ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యులు మాత్రం గాలిలో కత్తులతో పోరాటం చేసినట్లే అనిపించింది. – కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
మళ్లీ గెలిపిస్తే ఎములాడను అభివృద్ధి చేస్తా.. : బండి సంజయ్
కరీంనగర్: మళ్లీ ఎంపీగా గెలిపిస్తే వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని కరీంనగర్ ఎంపీ, బీజేపీజాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్కుమార్ పేర్కొన్నారు. వేములవాడరూరల్ మండలం చెక్కపల్లి, నూకలమర్రి, నమిలిగుండుపల్లి, వట్టెంల, శాత్రాజుపల్లి గ్రామాలలో సోమవారం ప్రజాహితయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అయోధ్య అక్షింతలను కూడా రేషన్ బియ్యమంటూ హేళన చేస్తూ కాంగ్రెస్ నేతలు ప్రధాని మోదీపై అక్కసు వెళ్లగక్కుతున్నారన్నారు. వేములవాడకు రూ.500 కోట్లు ఇస్తానని కేసీఆర్ మోసం చేసిండని, మూలవాగుపై బ్రిడ్జి రెండుసార్లు కూలిందన్నారు. బ్రిడ్జి నుంచి రాజన్న ఆలయం, బద్ది పోచమ్మ గుడి వరకు రోడ్డు విస్తరణ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. వేములవాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం రూ.575.95 కోట్లకు పైగా నిధులు ఇచ్చిందని తెలిపారు. రెండోసారి ఎంపీగా గెలిపిస్తే వేములవాడ, కొండగట్టు ఆలయాలను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అధికారం పోయినా కేసీఆర్ మంది కొంపలు ఎట్లా ముంచాలనేదానిపైనే కుట్రలు చేస్తున్నాడన్నారు. నిరుద్యోగులు, రైతుల కోసం పోరా డితే తనపై వంద కేసులు బనాయించి, రెండు సా ర్లు జైలుకు పంపారని గుర్తు చేశారు. బీజేపీ జిల్లా అ ధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, నాయకులు చెన్నమనేని వికాస్రావు, తిరుపతి, రవికిశోర్ పాల్గొన్నారు. కరెంట్ సౌకర్యం కల్పించండి శాత్రాజుపల్లిలో ఆయుష్మాన్ సెంటర్ను బండి సంజయ్ తనిఖీ చేశారు. సెంటర్లో కరెంట్ సౌకర్యం, ఫ్యాన్లు, టేబుళ్లు లేకపోవడంతో వెంటనే విద్యుత్ సిబ్బందికి ఫోన్ చేసి 24 గంటల్లో కరెంట్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. టాయిలెట్లు కూడా లేకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాథమిక పాఠశాలకు బెంచీలను తన సొంత ఖర్చుతో ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇవి చదవండి: 25 మంది ఎమ్మెల్యేలతో హరీష్ రావు కాంగ్రెస్లోకి వస్తే..: రాజగోపాల్ రెడ్డి -
ఆ దందాలో కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు? : సునీతారావు
కరీంనగర్: లిక్కర్ దందాలో ఆధారాలతోసహా చిక్కిన బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవితను బీజేపీ ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయలేదని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటేనన్నారు. సోమవారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో కరీంనగర్ పార్లమెంట్ ని యోజకవర్గ పరిధిలోని జిల్లా, మండల, బ్లాక్, పట్ట ణ, నగర మహిళా విభాగం అధ్యక్షులతో ఆమె వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమీక్షించారు. బీఆర్ఎస్ హయాంలో బీసీలకు జరిగిన అన్యాయంపై కవిత ఎప్పుడూ నోరుమెదపలేదన్నారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో మహాత్మా జ్యోతిబాపూలే విగ్రహం ఏర్పాటు చేయాలని తన తండ్రి, అప్పటి సీఎం కేసీఆర్ను ఎందుకు అడగలేదని నిలదీశారు. తెలంగాణ ఉద్యమంలో కవిత, కేటీఆర్ పాల్గొనలేదని చెప్పారు. బీఆర్ఎస్ అంటేనే బందిపోట్ల రాష్ట్ర సమితి అని ధ్వజమెత్తారు. నోట్ల రద్దు చేసి నల్లధనం బయటకు తీసుకువస్తానని చెప్పిన ప్రధాని మోదీ ఏ అకౌంట్లోనూ రూ.15 లక్షలు వేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే బీఆర్ఎస్కు కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు. ఆటో డ్రైవర్లకు డబ్బులు ఇచ్చి కాంగ్రెస్కు వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారని ఆరో పించారు. ఇన్ని రోజులు బీజేపీ, బీఆర్ఎస్ దోచుకొన్న డబ్బును వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖర్చు చేస్తారని అన్నారు. వాళ్లిచ్చిన డబ్బు తీసుకుని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. అధి ష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా ఆ అభ్యర్థి విజయం కోసం కృషి చేయాలని సూచించారు. ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలన్నారు. జిల్లాలో పార్టీ కమిటీల విషయంలో నిర్లక్ష్యం కనిపిస్తుంద న్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 17కు కనీసం 15 స్థానాలు సాధించేలా పనిచేయాలని ఆమె కోరారు. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్నా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాయకులు చర్ల పద్మ, తాటిపర్తి శోభారాణి, పద్మ, ముద్దం లక్ష్మి, చంద్రకళ, తాటిపర్తి విజయలక్ష్మి, సరళ, నీలం పద్మ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: మేడిగడ్డకు కేసీఆర్ వస్తానంటే హెలికాప్టర్ సిద్ధం: సీఎం రేవంత్ -
మోదీతోనే దేశాభివృద్ధి : బండి సంజయ్కుమార్
కరీంనగర్: ప్రధాని నరేంద్రమోదీతో దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్కుమార్ పేర్కొన్నారు. గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనుల్లో కేంద్ర ప్రభుత్వం నిధులే అధికమని వివరించారు. ఆదివా రం రెండో రోజు ప్రజాహిత యాత్ర కథలాపూర్ మండలం సిరికొండ, కథలాపూర్, దుంపేట, దూలూర్, పోసానిపేట, తాండ్య్రాల, అంబారిపేట, కలిగోట గ్రామాతో పాటు రుద్రంగి, చందుర్తి మండలాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా స్థానిక మహిళలు భారీ ఎత్తున తరలివచ్చి స్వాగతం పలికారు. బండి సంజయ్కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్లు, మొక్కల పెంపకం, మరుగుదొడ్ల నిర్మాణాలు, చెత్త సేకరణకు ట్రై సైకిళ్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఆయా గ్రామాల్లో ఇంటింటా తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కలిగోట సూరమ్మ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి కాలువలు నిర్మిస్తే ఈ ప్రాంతానికి సాగునీటి సమస్య తీరుతుందని ప్రజలు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. పలు గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ప్రజలు విన్నవించగా.. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో తారు రోడ్లు నిర్మించామని, మరోసారి అధికారంలోకి వచ్చాక మండలంలోని అన్ని గ్రామాల్లో రోడ్డు సౌకర్యం మెరుగుపరుస్తామని తెలిపారు. పలువురు యువకులు ఎంపీతో సెల్పీ ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఆయా గ్రామాల్లో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్, ఛత్రపతి శివాజీ విగ్రహాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. రుద్రంగిలోని ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాన్ని సందర్శించారు. చందుర్తి మండలంలోని పలు గ్రామాల్లో ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్ర ప్రజలను పలకరిస్తూ, సమస్యలు తెలుసుకుంటూ ముందుకుసాగింది. లింగంపేటలోని రేషన్షాపులలో పేదలకు అందిస్తున్న బియ్యాన్ని పంపిణీ చేశా రు. అక్కడ ఉన్న వారితో ఉపాధిహామీ పథకం గు రించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఏడు పథకాల గురించి వారికి వివరించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బీజేపీ నియోజకవర్గ నేత చెన్నమనేని వికాస్రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరావు, ప్రతాప రామకృష్ణ ఎంపీ సంజయ్కుమార్కు మద్దతు ప్రకటించి పాదయాత్ర చేశారు. ఇవి చదవండి: బీఆర్ఎస్కు ఊహించని ఎదురుదెబ్బ! -
నల్గొండ సభను విజయవంతం చేయాలి : గంగుల కమలాకర్
కరీంనగర్: ఈనెల 13న నిర్వహించే చలో నల్గొండ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ ఎమ్మెల్యే నివాసంలో నల్గొండ సభకు సంబంధించి కరీంనగర్ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. కృష్ణానదిపై తెలంగాణ ప్రాజెక్టులు, నీటిహక్కులను హరించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర సంస్థ కేఆర్ఎంబీకి అధికారాలు అప్పగించడం ద్వారా జరగబోయే దుష్పరిణామాలను తెలంగాణ సమాజానికి వివరించేందుకు నల్గొండలో ఈనెల 13న నిర్వహించతలపెట్టిన బహిరంగ సభను విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణను వివరించారు. కరీంనగర్ నియోజకవర్గం నుండి 2000 మందిని తరలిస్తున్నట్లు వెల్లడించారు. మేయర్ వై.సునీల్ రావు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, పాక్స్ చైర్మన్ పెండ్యాల శ్యామ్ సుందర్రెడ్డి, గ్రంథాలయ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: మోదీతోనే దేశాభివృద్ధి : బండి సంజయ్కుమార్ -
ఓట్ల కోసమే బండి సంజయ్ పాదయాత్ర : కోమటిరెడ్డి పద్మాకర్రెడ్డి
కరీంనగర్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్కుమార్ ఓట్ల కోసమే పాదయాత్ర ప్రారంభించారని కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్రెడ్డి అన్నారు. శనివారం ప్రెస్భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే వాటిని గాలికి వదిలేసి పాదయాత్ర పేరుతో సానుభూతి రాజకీయాలకు తెరలేపారని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే భగవంతుని పేరుతో రాజకీయాలు చేసే బండి సంజయ్ కరీంనగర్, వేములవాడ, కొండగట్టు దేవస్థానాల అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా తేలేదని తెలిపారు. ఇప్పటికైనా మతం, సెంటిమెంట్ల పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. ఈ సమావేశంలో డీసీసీ ఉపాధ్యక్షుడు మడుపు మోహన్, కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పులి ఆంజనేయులుగౌడ్, నాయకులు రహ్మత్ హుస్సేన్, రామిడి రాజిరెడ్డి, కంకణాల అనిల్ కుమార్, బాలబద్రి శంకర్, మహ్మద్ ఆమేర్, పరుశురాంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: వారి నోళ్లు మూయించేందుకే ప్రజాహిత యాత్ర.. -
వారి నోళ్లు మూయించేందుకే ప్రజాహిత యాత్ర..
కరీంనగర్: ఎంపీగా గెలిచినప్పటి నుంచి ప్రతీ నిమిషం ప్రజల్లోనే ఉన్నానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యరద్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. శనివారం మేడిపల్లిలో ప్రజాహిత యాత్ర ప్రారంభం సందర్భంగా అంబేడ్కర్, శివాజీ విగ్రహాలకు పూలమాలలు వేసిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. కుటుంబానికి సైతం సమయం ఇవ్వకుండా తన నియోజవర్గ ప్రజలతో మమేకమై ప్రతీ సందర్భంలోనూ వెన్నంటి ఉన్నానని గుర్తు చేశారు. పార్లమెంట్ నియోజకవర్గంలోని మేడిపల్లి మండలానికి ఎంపీగా ఏమీ చేయలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. మేడిపల్లి–గోవిందారం రోడ్డుకు రూ.22కోట్లు, గోవిందారం బస్టాండ్కు రూ.15 లక్షలు, వెంకట్రావ్పేటకు రూ.20 లక్షలు, దేశాయిపేటకు రూ.20లక్షలు, తొంబర్రావుపేట, పోరుమల్ల, కొండాపూర్, మేడిపల్లి గ్రామాలకు రూ.10 లక్షల చొప్పున నిధులు కేటాయించామని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు మేడిపల్లి మండలానికి చేసిందేమీ లేదన్నారు. ‘బండి సంజయ్ ఏం చేశాడు’ అని మాట్లాడుతున్న నేతల నోళ్లు మూయించేందుకే ప్రజాహిత యాత్ర అని చెప్పారు. అనంతరం ప్రజాహితయాత్ర మండలంలోని కొండాపూర్, రంగాపూర్, భీమారం, మన్నెగూడెం నుంచి రాత్రి 10 గంటల వరకు కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చేరింది. కాగా జగిత్యాల జిల్లా మెట్పల్లి, కోరుట్ల పరిసర ప్రాంతాల్లో బైపాస్ రోడ్డు నిర్మాణంతో తాము నష్టపోతున్నామని, అలైన్మెంట్ మార్పించాలని పలు వురు రైతులు సంజయ్కు వినతిపత్రం ఇచ్చారు. యాత్రలో నారాయణఖేడ్, హుస్నాబాద్ బీజేపీ నాయకులు సంగప్ప, బొమ్మ శ్రీరాంచక్రవర్తి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల బీజేపీ అధ్యక్షులు మొరపల్లి సత్యనారాయణ, ప్రతాప రామకృష్ణ, మండల అధ్యక్షుడు ముంజ శ్రీనివాస్ పాల్గొన్నారు. కథలాపూర్లో ఘనస్వాగతం కథలాపూర్ మండలం బొమ్మెన, తక్కళ్లపెల్లి గ్రామాల్లో శనివారం రాత్రి ప్రజలను పలకరిస్తూ.. నమస్కరిస్తూ ఎంపీ సంజయ్ యాత్ర నిర్వహించారు. ఆయా గ్రామాల ప్రజలు ఎంపీకీ ఘన స్వాగతం పలికారు. మండలంలోని గంభీర్పూర్ గ్రామంలో బ్యాంక్ ఏర్పాటు చేయించాలని గ్రామస్తులు వినతిపత్రం ఇచ్చారు. బీజేపీ నియోజకవర్గ నాయకుడు చెన్నమనేని వికాస్రావు, కిసాన్మోర్చా జిల్లా అధ్యక్షుడు కొడిపెల్లి గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: పూట గడవడమూ కష్టమే! -
చిహ్నం మార్పు చేస్తే ఊరుకోం.. : బోయినపల్లి వినోద్కుమార్
కరీంనగర్: తెలంగాణ చిహ్నంలో మార్పులు చేస్తామని అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడటం సరికాదని, తెలంగాణ చరిత్రను కనుమరుగు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ... తెలంగాణ చిహ్నంలో 8వందల ఏళ్ల చరిత్ర కలిగిన కాకతీయ తోరణం, చార్మినార్ చిహ్నాలు ఉన్నాయని, కేబినెట్లో తీర్మాణం చేసి తొలగిస్తామని, తెలంగాణ చిహ్నం రాచరిక పోకడలకు సూచికగా ఉందని మాట్లాడటం పద్ధతి కాదన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికీ సీమాంధ్ర పాలకుల మైకంలో ఉన్నారని అర్థం అవుతోందని అన్నారు. గత ప్రభుత్వం 7వేల స్టాప్నర్సు, 15వేల కానిస్టేబుల్ పరీక్షలు నిర్వహిస్తే కాంగ్రెస్ ఇచ్చినట్లు గొప్పలు చెప్పుకోవడం సరికాదన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, గంగాధర ఎంపీపీ శ్రీరాం మధు, బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు జక్కుల నాగరాజు యాదవ్, ద్యావ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఇవి చదవండి: Telangana Budget: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు అప్డేట్స్ -
రానున్న లోక్సభ ఎన్నికలపై.. బీజేపీ నేతల గురి!
సాక్షి, పెద్దపల్లి: రానున్న లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. జాతీయ అంశాలతో ప్రభావితమయ్యే నియోజకవర్గమవడం, ఎస్సీ స్థానం కావడంతో ఇక్కడ గెలుపును ఆ పార్టీ నిర్దేశించుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన ఓట్లు సాధించకపోయినా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు జాతీయ అంశాల ఆధారంగా తమకు మద్దతు పలుకుతారని బీజేపీ అధిష్టానం అంచనా వేస్తుంది. ఇందులో భాగంగా రాబోయే ఎన్నికల్లో పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా బీజేపీ అంతర్గతంగా అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తుంటే, మరోవైపు ఇక్కడ పోటీ చేసేందుకు సిద్ధమవుతోన్న నేతలు నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలతో ప్రజలకు చేరువవుతున్నారు. పార్టీ దృష్టిలో పడేందుకు పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో వాల్రైటింగ్స్ చేయిస్తూ, ఫ్లెక్సీలు కూడా కట్టిస్తున్నారు. వికసిత్ సంకల్ప్ భారత్ వంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలతో మమేకమవుతున్నారు. టీడీపీ, బీజేపీ పోత్తులో గెలుపు! పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కంచుకోటగా నిలుస్తోంది. అలాగే బీజేపీ సైతం ప్రత్యక్షంగా పోరులో నిలవక, పోత్తులో భాగంగా టీడీపీకి పలుమార్లు సీటు కేటాయించింది. అందులో భాగంగా 2004లో టీడీపీ తరుఫున డాక్టర్ సుగుణకుమారి పోటీ చేసి గెలిచారు. 2019లో బీజేపీ తరుఫున ఎస్.కుమార్ నిలవగా 92,606 ఓట్లు సాధించారు. పార్లమెంట్ పరిధిలో గతంలో కంటే ఓటు బ్యాంకు స్థిరంగా పెరగడాన్ని గమనిస్తోన్న అధిష్టానం గతంలో వైఫల్యాలకు గల కారణాలను విశ్లేషించుకుంటుంది. పొత్తులో టీడీపీ గెలిచిందని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీకి సానుకూల వాతవరణం నెలకొన్న నేపథ్యంలో సరైన అభ్యర్థిని దింపి పక్కా ప్రణాళికతో గెలవవచ్చని భావిస్తుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన అభ్యర్థులకు గట్టి పోటీనిచ్చే అభ్యర్థులను బరిలో దింపేలా అధిష్టానం ఆలోచిస్తుంది. ఇందులో భాగంగా ఇదే నియోజకవర్గంలోని మాజీ ఎంపీ, మాజీ మంత్రిని పార్టీలో చేర్చుకొని టిక్కెట్ ఇచ్చేందుకు సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. ఎంపీ టికెట్ రేసులో వీరే.. పెద్దపల్లి పార్లమెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు పలువురు నాయకులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. పాలకుర్తి మండలానికి చెందిన ఐఏఎస్ నరహరి క్లాస్మేట్, అతను స్థాపించిన ఆలయ ఫౌండేషన్ సీఈవో మిట్టపల్లి రాజేందర్కుమార్, విశ్వహిందూ పరిషత్ నాయకుడు అయోధ్య రవి, బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి సోగాల కుమార్, కరీంనగర్కు చెందిన బీజేపీ ఎస్సీ రాష్ట్ర మోర్చా అధికార ప్రతినిధి జాడి బాల్రెడ్డి, క్యాతం వెంకటరమణ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే వీరిలో ముగ్గురి పేర్లతో కూడిన షార్ట్ లిస్టు బీజేపీ అధిష్టానానికి చేరింది. అయితే పార్టీ టికెట్ వీరిలో ఎవరికై నా ఇస్తారా, చివరి నిమిషంలో మరెవరినైనా రంగంలోకి దింపుతారా అనే అంశం ఆసక్తిగా మారింది. ఇవి చదవండి: కేసీఆర్ హామీతో.. ఆ స్థానం పదిలమేనా!? -
కేసీఆర్ హామీతో.. ఆ స్థానం పదిలమేనా!?
ఖమ్మం: వచ్చే ఏప్రిల్లో రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ ముగ్గురూ బీఆర్ఎస్ నేతలే కాగా, వీరిలో జిల్లాకు చెందిన వద్దిరాజు రవిచంద్రతో పాటు జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగు లింగయ్య యాదవ్ ఉన్నారు. ఆయా స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు నామినేషన్ల స్వీకరణ మొదలుకాగా.. ప్రస్తుత ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని పరిశీలిస్తే కాంగ్రెస్కు రెండు, బీఆర్ఎస్ కు ఒక స్థానం దక్కనున్నాయి. అయితే, గతంలోనే కేసీఆర్ మరోమారు వద్దిరాజుకు అవకాశమిస్తామని హామీ ఇచ్చినందున ఆయనకే పదవి దక్కుతుందని అనుచరుల్లో ప్రచారం జరుగుతోంది. బీసీ కోటాలోనూ రవిచంద్రకే అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -సాక్షిప్రతినిధి, ఖమ్మం ఇరవై నెలలు పదవిలో... బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండా ప్రకాష్ ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో ఆ స్థానంలో వద్దిరాజు రవిచంద్రను కేసీఆర్ రంగంలోకి దించారు. బీఆర్ఎస్కు అప్పుడు ఉన్న సంఖ్యాబలంతో ఆయన మే 2022లో రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఇరవై నెలల కాలంలో ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పరంగా తనదైన ముద్ర వేయడమే కాక మున్నూరుకాపు సామాజిక వర్గం ముఖ్యనేతగా బీఆర్ఎస్లోకి ఆ సామాజిక వర్గ నేతలను చేర్పించడంలో కీలకపాత్ర పోషించారు. అసెంబ్లీ ఎన్నికల సమయాన ఇల్లెందు, కొత్తగూడెం నియోజకవర్గ బాధ్యతలను కేసీఆర్ ఆయనకు అప్పగించారు. ఇక పార్లమెంట్లో ఉమ్మడి జిల్లా, రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలే కాక విభజన సమస్యలపైనా తన గళం వినిపించారు. హామీ నెరవేర్చాలని.. బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్రతోపాటు మరో ఇద్దరి పదవీకాలం పూర్తి కానుండగా.. ఈసారి ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని చూస్తే ఒక్క స్థానం దక్కనుంది. ఒక్కో రాజ్యసభ స్థానానికి 31 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా.. బీఆర్ఎస్కు 39 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో ఆ పార్టీకి ఒక స్థానం దక్కడం ఖాయమనే చెప్పాలి. కాగా, రాజ్యసభ సభ్యుడిగా రెండోసారి వద్దిరాజుకు అవకాశం దక్కుతుందని కేసీఆర్ గతంలో పలు వేదికలు, సమావేశాల్లో ప్రస్తావించడంతో ఈ హామీ నెరవేర్చాలని ఆయన అనుచరుల నుంచి విన్నపాలు వస్తున్నాయి. కాగా, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఏప్రిల్లో పదవీకాలం ముగియనున్న రాజ్యసభ సభ్యులకు వీడ్కోలు ఏర్పాటుచేయగా.. వద్దిరాజు మాట్లాడుతూ తమ పార్టీ అధినేత కేసీఆర్ మళ్లీ ఆశీర్వదిస్తే ఇదే సభలో అడుగు పెడతానన్న ఆశాభావం వ్యక్తం చేశారు. రాజ్యసభ సభ్యుడిగా తన పదవీకాలంలో చరిత్రలో నిలిచిపోయే ఘటనల్లో భాగస్వామిని కావడానికి అవకాశమచ్చిన కేసీఆర్కు రుణపడి ఉంటానని తెలిపారు. అభ్యర్థుల ప్రకటనకు కసరత్తు! రాజ్యసభకు ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయగా.. నామినేషన్ల స్వీకరణ మొదలైంది. ఈనెల 27వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. నామినేషన్ల స్వీకరణ గడువు 15వరకు ఉండగా, కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నాయి. అసెంబ్లీ బలాబలాలను పరిశీలిస్తే కాంగ్రెస్కు రెండు, బీఆర్ఎస్కు ఒక స్థానం దక్కనుండడంతో రాజ్యసభలో పార్టీ వాణిని బలంగా వినిపించే అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లపై చర్చ జరుగుతుండగా.. బీఆర్ఎస్ తరఫున మాత్రం వద్దిరాజుకే ఖాయమని ప్రచారం ఉంది. రెండు, మూడు రోజుల్లోనే రెండు పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశముందని సమాచారం. ఇవి చదవండి: పురుమల్లకు షోకాజ్ నోటీసు జారీ.. -
కాంగ్రెస్ బలోపేతానికి పాత మిత్రులు కలిసిరావాలి..
కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పాత మిత్రులు కలిసి రావాలని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి పోటీచేయని పాత కాంగ్రెస్ నాయకులు తిరిగి పార్టీలోకి రావాలన్నారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఏఎంసీ చైర్మన్ ఆకారపు భాస్కర్రెడ్డి బుధవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు. అభివృద్ధి, సంక్షేమం కోసం కాంగ్రెస్ పాటుపడుతుంటే, కొంతమంది మతం పేరిట, దేవుళ్ల ఫొటోలతో గెలవాలనుకుంటున్నారని విమర్శించారు. సీనియర్ నాయకుడైన భాస్కర్రెడ్డి, తిరిగి పార్టీలోకి రావడం సంతోషకరమన్నారు. సొంత గూటికి ఆకారపు భాస్కర్రెడ్డి బీఆర్ఎస్ నాయకుడు, ఏఎంసీ మాజీ చైర్మన్ ఆకారపు భాస్కర్రెడ్డి సొంత గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన ఆయన, కొన్ని సంవత్సరాల క్రితం బీఆర్ఎస్లో చేరారు. బుధవారం బీఆర్ఎస్కు గుడ్బై చెప్పి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో జరిగిన కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి, పార్టీ రాష్ట్ర ఇన్చార్జీ రోహిత్ చౌదరి, బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లో చేర్చుకున్నారు. బీఆర్ఎస్లో సీనియర్ నాయకులకు గుర్తింపు లేదని ఆకారపు భాస్కర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు పురుమల్ల శ్రీనివాస్, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మేనేని రోహిత్ రావు, మూల వెంకట రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: ‘కుప్టి’కి నిధులు కేటాయించేలా చూస్తా.. -
'నేను పక్కా లోకల్..' : ఎంపీ బండి సంజయ్
కరీంనగర్: ‘నేను పక్కా లోకల్.. నరేంద్రమోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను చెప్పి జనంలోకి వెళ్లి ఓట్లు అడగుతా. దమ్ముంటే మీరు ఎంపీగా చేసినప్పుడు తెచ్చిన నిధులేమిటో.. మీరు చేసిన అభివృద్ధి ఏమిటో.. చెప్పి ఓట్లడిగే దమ్ముందా?’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. శనివారం కరీంనగర్లోని తీగలగుట్టపల్లి కోదండ రామాలయం సమీపంలో రూ.10లక్షల ఎంపీ నిధులతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. కరీంనగర్ జిల్లాజైలు వద్ద రూ.15 లక్షల ఎంపీ ల్యాడ్స్ నిధులతో కొనుగోలు చేసిన అంబులెన్స్, వైద్య పరికరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలనే పట్టించుకోని మేధావి వినోద్ కుమార్ అని, ప్రజలను ఎలా గుర్తుపడతారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఉన్న లోపాయికారి ఒప్పందం ఏమిటో కరీంనగర్ ప్రజలకు తెలుసని, తనపై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను జనం పట్టించుకోవడం లేదని అన్నారు. గ్రామాల్లోకి వెళితే మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమిటో తెలుస్తుందన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.12వేల కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చానని స్పష్టంచేశారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో బీజేపీ కార్యకర్తలు, జైలు అధికారులు పాల్గొన్నారు. ఇవి చదవండి: ఐదేళ్లలో ఐదు పైసలు కూడా తేలేదు! -
‘హస్త’వాసి ఎవరో..?
సాక్షి, ఆదిలాబాద్: లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు పలువురు ఆశావహులు ము మ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదిలాబాద్ టికెట్ కోసం పోటాపోటీ నడుస్తుంది. ఏఐసీసీ ఆదేశాల మేరకు హైదరాబాద్లోని గాంధీ భవన్ వేదికగా రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ స్థానాలకు మూడు రో జుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. ఈ ప్రక్రియ శనివారంతో ముగిసింది. ఈ స్థానం కోసం 15 నుంచి 20 మంది వరకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. తుది జాబితా వివరాలు తెలి యరాలేదు. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ పరిశీలన తర్వా త స్క్రీనింగ్ కమిటీకి అభ్యర్థుల పేర్లు చేరుతాయి. అక్కడ వడపోత అనంతరం సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి చేరుతుంది. ఆతర్వాత అభ్యర్థి ఎంపికను ఏఐసీసీ ప్రకటిస్తుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇదిలా ఉంటే ఎస్టీలో ఆదివాసీ, లంబాడా సామాజిక వర్గాల్లో ఎవరికిస్తారనే దానిపై పార్టీలో ఆసక్తి నెలకొంది. పలువురు ఉదోగ్యుల యత్నాలు.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆదిలాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే వారు దరఖాస్తు కూడా చేసుకున్నారు. ఇందులో ప్రధానంగా ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, నిర్మల్ జిల్లా కుబీర్కు చెందిన ఐటీశాఖ అసిస్టెంట్ కమిషనర్ రాథోడ్ ప్రకాశ్, ఉట్నూర్ అదనపు డీఎంహెచ్వో కుమురం బాలు, ఐటీడీఏ పీవీటీజీ ఏపీవో ఆత్రం భాస్కర్, ఐటీడీఏ బీఎడ్ కళాశాల ప్రిన్సిపాల్ మేస్రం మనోహర్, పరిశ్రమల శాఖ రిటైర్డ్ అధికారి రాంకిషన్, ఆదిలాబాద్ ఎల్ఐసీ ఉద్యోగి దౌలత్రావు, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, ఆదివాసీ సంఘం మహిళా జిల్లా అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, డిప్యూటీ తహసీల్దార్ మే స్రం బాబురావు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు ఉట్నూర్కు చెందిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధి రోషన్, ఇతర జిల్లాలకు చెందిన వారు కూడా ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సబావత్ శ్రీనివాస్ నాయక్తో పాటు నరేశ్జాదవ్, శ్రావణ్ నాయక్ శనివారం దరఖాస్తు చేసుకున్నారు. పార్టీ పరంగా.. కాంగ్రెస్ పార్టీ పరంగా పలువురు టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్టానంపై ఆశతో ముందుకు కదులుతున్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ పోటీ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా శాసన సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఆమెకు ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారని, ఈ దిశగా తనకు పోటీకి అవకాశం ఇవ్వాలని ఆమె అధిష్టానాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇక గతంలో కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలై న ఏఐసీసీ సభ్యుడు నరేశ్ జాదవ్ మరోసారి పోటీకి ఆసక్తి కనబరుస్తున్నారు. అలాగే యూత్ కాంగ్రెస్ మాజీ నాయకులు శ్రావణ్ నాయక్ టికెట్ కోసం గట్టిగా యత్నిస్తున్నారు. ఉట్నూర్ ఎంపీపీ పంద్రం జైవంత్రావు తనకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నా రు. శాసనసభ ఎన్నికల్లో బోథ్ నుంచి పోటీ చేసిన అడె గజేందర్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తంగా పార్టీపరంగా పోటీకి ఆసక్తి కనబరుస్తున్న వారి సంఖ్య 15 నుంచి 20 మంది ఉండటంతో అధిష్టానం ఎవరి వైపు దృష్టి సారిస్తుందో వేచి చూడాల్సిందే. -
బీజేపీలోకి జనార్దన్ రాథోడ్
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ శనివారం కమలం గూటికి చేరారు. హైదరా బాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ని ర్వహించిన కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు కిషన్రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అంతకు ముందు ఉట్నూర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూ లమాలలేసి నివాళులర్పించారు. బంజారా సంప్రదాయ నృత్యాలు, డప్పుచప్పుళ్ల నడుమ ఉట్నూర్ డివిజన్ కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం భారీ కాన్వాయ్తో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు పలువురు నాయకులు కూడా బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నాయకత్వాన్ని యా వత్ దేశం స్వాగతిస్తుందన్నారు. పార్టీ ఏ బాధ్యత అ ప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తూ ముందు కు సాగుతానని వెల్లడించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పతంగే బ్రహ్మా నంద్, వకుళాభరణం ఆదినాత్ పాల్గొన్నారు. ఇవి చదవండి: ‘హస్త’వాసి ఎవరో..? -
కాంగ్రెస్ సై! ఖమ్మం స్థానంపై ప్రత్యేక దృష్టి..
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాష్ట్ర మంత్రి, ఖమ్మం పార్లమెంట్ ఇన్చార్జి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వాన వరుస భేటీలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం హాజరు కానున్నారు. – సాక్షిప్రతినిధి, ఖమ్మం సత్తా చాటేలా.. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన కాంగ్రెస్.. హడావుడి ముగియగానే పార్లమెంట్ ఎన్నికలపై గురి పెట్టింది. ఈ ఎన్నికల్లో తెలంగాణ నుంచి అత్యధిక స్థానాలను గెలుచుకోవడం ద్వారా జాతీయస్థాయిలోనూ సత్తా చాటాలని యోచిస్తోంది. ఎన్నికలను ఎదుర్కొనేందుకు కేడర్ను సమాయత్తం చేసేలా సన్నాహక సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో విస్తరించి ఉంది. ఈ నేపథ్యాన నేతలు, కేడర్ను ఏకతాటిపైకి తీసుకొచ్చేలా ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలయ్యాయి. కాంగ్రెస్కు అండగా.. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ గాలి వీచిన సమయంలోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని గెలుపు సాధించింది. ప్రతీ ఎన్నికల్లోనూ ఒకటి, రెండు సీట్లు మినహా.. కాంగ్రెస్, ఆ పార్టీతో జతకట్టిన పార్టీలే విజయం సాధిస్తూ వచ్చాయి. అదే తరహాలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను కై వసం చేసుకున్నప్పటికీ 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో చుక్కెదురైంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన రేణుకా చౌదరి.. బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి తీర్పు రాకుండా ఉండేలా కాంగ్రెస్ చర్యలు చేపట్టింది. ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఆరు చోట్ల కాంగ్రెస్ పార్టీ, కొత్తగూడెంలో పొత్తుతో సీపీఐ విజయం సాధించడంతో.. లోక్సభ స్థానంలోనూ గెలుపు ఇక నల్లేరు మీద నడకేనని ఆ పార్టీ భావిస్తోంది. సన్నద్ధం! పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశాలు నిర్వహించనుంది. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈ సమావేశాలను రాష్ట్ర మంత్రి, ఖమ్మం పార్లమెంట్ ఇన్చార్జ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వాన నిర్వహిస్తారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆయనతో పాటు మంత్రులు దిశానిర్దేశం చేస్తారు. పార్టీ ఇచ్చిన హామీలు, అమలవుతున్న తీరు.. మిగతా హామీలు ఎప్పటి నుంచి అమలవుతాయనే అంశాలపై ప్రజలకు వివరించాల్సిన ఆవశ్యకతను కేడర్కు అవగాహన కల్పిస్తారు. అంతేకాక నియోజకవర్గాల వారీగా బలాబలాలపై సమీక్ష చేయనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా ప్రత్యేకం.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ జిల్లాలు ప్రధాన పాత్ర పోషించాయి. ఈ క్రమంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మూడు మంత్రి పదవులు దక్కాయి. గతంలోనే బలీయమైన శక్తిగా ఉన్న కాంగ్రెస్ ఈ అసెంబ్లీ ఎన్నికలతో మరింత పట్టు సాధించినట్లయింది. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరగా పార్టీకి సంస్థాగతంగా ఉన్న పట్టుకు వారి బలం కూడా తోడు కావడంతో తిరుగులేని విజయాన్ని కై వసం చేసుకుంది. మరోవైపు మల్లు భట్టి విక్రమార్క ప్రభావం చూపించడంతో కాంగ్రెస్కు తిరుగులేకుండా పోయింది. ఇదే ఊపును పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొనసాగించేలా చూడాల్సిన బాధ్యత ఇప్పుడు ముగ్గురు మంత్రులపై పడింది. ఇవి చదవండి: అఖిలను పక్కకు పెట్టేసినట్టే.. -
వినతులు పెండింగ్ ఉండొద్దు! : మంత్రి పొంగులేటి
ఖమ్మం: ప్రజలు విన్నవించే సమస్యలను పెండింగ్లో పెట్టకుండా పరిష్కరించాలని రాష్ట్ర రెవె న్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులు ఆదేశించారు. కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రజాదర్బార్లో ఆయన ప్రజల నుండి వినతులు స్వీకరించారు. నేలకొండపల్లి మండలం చెరువుమాధారానికి చెందిన రైతులు 110 ఎకరాల్లో వరి విత్తనాలు వేయగా 60 రోజుల్లోనే కంకులు వచ్చి నష్టపోయామని విన్నవించగా విచారణ చేపట్టి కంపెనీపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని డీఏఓ విజయనిర్మలను ఆదేశించారు. అలాగే, రాజుపేట వద్ద నిర్మించిన చెక్డ్యాంను సాగర్ నీటితో నింపాలని గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు రేలా వెంకటరెడ్డి వినతిపత్రం అందజేశారు. అధికారులు విచారణ చేపట్టకుండా ఫ్యామి లీ సర్టిఫికెట్ జారీచేశారని నేలకొండపల్లి మండలం నాచేపల్లికి చెందిన మల్లెల వెంకటాచారి ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టాలని సూచించారు. ఆతర్వాత మంత్రి మాట్లాడుతూ రాజుపేటలోని ఖబరస్తాన్కు ప్రహరీ నిర్మించి విద్యుత్ సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వ భూముల కబ్జాపై సర్వే చేయాలని సూచించారు. మహాశివరాత్రి సందర్భంగా తీర్థాల, కూసుమంచి ఆలయాలకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. తొలుత మంత్రి పొంగులేటి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులతో పాటు విద్యుత్ శాఖ నుండి మంజూరైన బీమా చెక్కులను అందజేశారు. అనంతరం కూసుమంచి మండలం ధర్మాతండాకు చెందిన విద్యార్థి జర్పుల సింధు రోడ్డు ప్రమాదంలో గాయపడిన కోమాలోకి వెళ్లగా మంత్రి పరామర్శించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 24 గంటల వైద్యసేవలు.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 24 గంటల పాటు వైద్యం అందేలా తమ ప్రభుత్వం కృషిచేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కూసుమంచి లో హోమియో ఆస్పత్రి భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం కలిగేలా వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం లింగారంతండాలో జీపీ భవనం, పలుచోట్ల రహదారి నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈకార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, ఆర్డీఓ గణేష్, జిల్లా ఉపాధి కల్పనశాఖ అధికారి శ్రీరాం, ఆర్అండ్బీ ఈఈ శ్యాంప్రసాద్, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ సులోచన, మత్స్యశాఖ ఏడీ ఆంజనేయస్వామితో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు వాణిశ్రీ, డాక్టర్ రాములు, ఉమామహేశ్వరరావు, బానోత్ శ్రీనివాస్నాయక్, మోహ న్, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు మాదాసు ఉపేందర్, జూకూరి గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, కూసుమంచిలో రహదారి పక్కన ఉన్న ఓ టీ స్టాల్ వద్ద కాన్వాయ్ నిలిపిన మంత్రి టీ తాగాక నిర్వాహకుడు అనిల్తో మాట్లాడి వ్యాపారంపై ఆరా తీశారు. తమ్మినేని కృష్ణయ్యకు నివాళి.. మండలంలోని తెల్దారుపల్లిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం గతంలో హత్యకు గురైన నాయకుడు తమ్మినేని కృష్ణయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నాయకులు రాయల నాగేశ్వరరావు, తమ్మినేని నవీన్, తమ్మినేని మంగతాయారు పాల్గొన్నారు. ఇవి చదవండి: కాంగ్రెస్ సై! ఖమ్మం స్థానంపై ప్రత్యేక దృష్టి.. -
బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి! అరూరికి కష్టకాలమేనా?
సాక్షి, వరంగల్: పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడించాలనుకుంటున్న బీఆర్ఎస్కు జిల్లాలో ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. కొందరు పార్టీ ముఖ్యులతోపాటు కార్పొరేషన్, మున్సిపాలిటీల్లోని కార్పొరేటర్లు, కౌన్సిలర్లు తమ అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కుతున్నారు. ఇందుకు ఉదాహరణే ఇటీవల నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో పుట్టిన ముసలమని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ప్రధానంగా మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు, కార్పొరేషన్లో కార్పొరేటర్ల అనైక్యతా రాగాలు ఆ పార్టీకి బీటలు పడేలా చేస్తున్నాయి. చైర్మన్ల ఒంటెద్దు పోకడలు, ఏ విషయంలోనూ తమను పట్టించుకోవడం లేదని అప్పట్లో తమ ఎమ్మెల్యేల వద్ద మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో ఇన్నాళ్లూ మిన్నకుండిపోయారు. ఇప్పుడు వారే గళమెత్తుతుండడంతో ఆ పార్టీకి ఏంచేయాలో పాలుపోవడం లేదు. పార్టీ ఎమ్మెల్యేలు మాజీలు కావడంతో తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. నర్సంపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ గుంటి రజనిపై అవిశ్వాసం వీగిపోయినా కూడా ఆ పార్టీలో అలజడి చెలరేగింది. ఏకంగా 13 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో గులాబీ పార్టీకి ఊహించని దెబ్బ తగిలినట్లయ్యింది. అదేకోవలో ఇప్పుడు వర్ధన్నపేట మున్సిపాలిటీలో అవిశ్వాసం ఎటువైపు దారి తీస్తుందన్న చర్చ జోరుగా సాగుతోంది. 12 మంది కౌన్సిలర్లు ఉన్న ఈ మున్సిపాలిటీలో 9 మంది చైర్పర్సన్ ఆంగోతు అరుణపై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ జనవరి 11న కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక నర్సంపేట మున్సిపాలిటీ చైర్పర్సన్పై అవిశ్వాసం సృష్టించిన రగడ ఆ పార్టీలో పెద్ద కలకలం రేపుతుండగా.. ఇక వర్ధన్నపేటలో రాజకీయం ఎటువైపు మలుపు తిరుగుతుందోనని గులాబీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. అప్పట్లో అధికారం అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌన్సిలర్లను నియంత్రించారు. ఇప్పుడు వారు మాజీలు కావడంతో ఎవరిని నియంత్రించలేక పోతున్నారని పలువురు పేర్కొంటున్నారు. అరూరికి కష్టకాలమేనా? బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్కు పార్టీలో జరుగుతున్న అంతర్గత కలహాలను నియంత్రించడం కత్తిమీద సాముగా మారింది. వర్ధన్నపేట మున్సిపాలిటీలో అవిశ్వాసం కూడా ఆయనను టెన్షన్ పెట్టిస్తోంది. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా అరూరి పేరును కూడా బీఆర్ఎస్ పరిగణనలోకి తీసుకునే అవకాశముందని జోరుగా ప్రచారం జరుగుతుండగా.. ఇప్పుడు పార్టీ జిల్లా బాధ్యతలు ఆయనకు తలనొప్పిగా మారాయని సమాచారం. ఒక్కొక్కరు సొంత పార్టీ వారిపైనే అవిశ్వాసం పెడుతుండడంతో అరూరితోపాటు ఆయా నియోజకవర్గాల్లోని మాజీ ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా పరిణమించిందని తెలుస్తోంది. ఈ ప్రభావం రానున్న పార్లమెంట్ ఎన్నికలపై తప్పక ప్రభావం చూపే అవకాశముందన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికై నా ముఖ్య నాయకులు ఏకతాటిపైకి వచ్చి అసంతృప్తులను నిలువరిస్తేనే పార్టీకి ఎంపీ ఎన్నికల్లో అవకాశాలుంటాయని, లేకపోతే పెద్ద మొత్తంలో ఎదురు దెబ్బతగిలే అవకాశముందని శ్రేణులు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి ఎరబ్రెల్లి దయాకర్రావు, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి జిల్లాకు చెందిన వారు కావడంతో బీఆర్ఎస్ బలోపేతంపై దృష్టిసారించాలని కార్యకర్తలు కోరుతున్నారు. ఇవి చదవండి: వినతులు పెండింగ్ ఉండొద్దు! : మంత్రి పొంగులేటి -
సీఎం సారూ.. సమస్యలివీ! ప్రజల వినతి..
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్/నిర్మల్: రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వస్తున్న ఎనుముల రేవంత్రెడ్డిపై ఇక్కడి ప్రజలు ఎ న్నో ఆశలు పెట్టుకున్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ సభకు సంబంధించి అధికారులు, అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం పర్యటన సందర్భంగా ఇక్కడి అభివృద్ధి కోసం నిధుల ప్రకటన, కొత్త పనుల కోసం హామీలు ఇవ్వాలని కోరుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. సాగునీటి ప్రాజెక్టులకు నిధులు.. ఉమ్మడి జిల్లాలో సరైన సాగునీటి ప్రాజెక్టులు లేక ఇంకా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నీటి వనరులున్నా సమర్థవంతంగా ఉపయోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రధాన ప్రాజెక్టులైన కడెం, సరస్వతి కాలువ(ఎస్సారెస్పీ) ఆధునీకరించాల్సి ఉంది. మధ్యతరహా ప్రాజెక్టుల్లో స్వర్ణ, వట్టివాగు, సాత్నాల, ఎన్టీఆర్, పీపీ రావు ప్రాజెక్టు, గడ్డెన్నవాగు, సదర్మాట్ ఉన్నాయి. కుమురంభీం జిల్లా పరిధిలో కుమురంభీం ప్రాజెక్టు కాలువలు పూర్తి చేయాల్సి ఉంది. తాంసిలో మత్తడివాగు, పెన్గంగా ప్రాజెక్టు, హాజీపూర్ మండలం ముల్కల్లలోని ర్యాలీవాగు, వేమనపల్లి మండలం నీల్వాయి, భీమారంలో గొల్లవాగు ప్రాజెక్టులు ఉన్నాయి. గత కాంగ్రెస్ హయాంలో చేపట్టిన కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపై ఉన్న డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ ప్రాణహిత–చేవేళ్ల ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కనపెట్టింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం రాకతో ఈ ప్రాజెక్టుపై మళ్లీ ఆశలు పెరిగాయి. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల పరిధిలో ప్రాణహిత, గోదావరి తీర ప్రాంత రైతుల పంటలు ఏటా నీట మునుగుతున్నాయి. వీటి కోసం శాశ్వత పరిష్కారం చూపాల్సి ఉంది. మంచిర్యాల, నస్పూర్ పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు వరదలు వచ్చి ముంపునకు గురవుతున్నాయి. గిరిజనుల గోస.. ఉమ్మడి జిల్లా ఏజెన్సీ పరిధిలో గిరిజనులకు ఇప్పటికీ అటవీ సమీప గ్రామాలకు సౌకర్యాల్లేవు. చాలా చోట్ల విద్య, వైద్యం, తాగునీరు, అన్ని కాలాల్లో రవాణాకు రోడ్లు అందుబాటులోకి తేవాల్సి ఉంది. ఇంద్రవెల్లి, నార్నూర్, జైపూర్, లింగాపూర్ మండలాల్లో వానాకాలాల్లో ఇప్పటికీ మట్టిరోడ్లే దిక్కవుతున్నాయి. పక్కా ఇళ్ల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. అటవీ అనుమతులు రాక పనులు ముందుకు సాగడం లేదు. ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు, ప్రాథమిక కేంద్రాలు, సామాజిక ఆస్పత్రుల్లో సరిపడా వైద్య సిబ్బంది లేక అరకొర వైద్యం అందుతోంది. ఏజెన్సీలో సౌకర్యాలు మెరుగుపర్చాల్సి ఉంది. జిల్లా కేంద్రాల్లో ప్రధాన ఆస్పత్రులతోపాటు ఆదిలా బాద్ రిమ్స్లోనూ సిబ్బంది ఖాళీలతో వైద్యంపై ప్రభావం పడుతోంది. ఉట్నూరు ఐటీడీఏను సమగ్రంగా ప్రక్షాళన చేయాల్సి ఉంది. నాలుగు జిల్లాల విస్తరణతో పరిపాలనలో సమస్యలు వస్తున్నాయి. ఆసిఫాబాద్లో మినీ ఐటీడీఏ ఏర్పాటు కార్యాచరణ దాల్చలేదు. గిరిజనేతరులకు.. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరులకు ఉద్యోగ, ఉపాధి, విద్యాసంస్థల్లో అవకాశాలు తక్కువగా ఉన్నా యి. అటవీ హక్కుల చట్టం కింద గిరిజనులకు మాత్రమే పోడు పత్రాలు ఇవ్వడంతో గిరిజనేతరులకు సైతం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పోడు హక్కు పత్రాలు తమకు కూడా ఇవ్వాలని వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. సింగరేణి ప్రాంతంలో కార్మికులకు.. సింగరేణి ప్రాంతంలో కొత్త గనుల ప్రారంభం, ఓపెన్ కాస్టుల స్థానంలో భూగర్భ గనులు ప్రారంభించాలనే ప్రతిపాదనలు అటకెక్కాయి. దీంతో ఉపాధి అవకాశాలు తగ్గి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పెరుగుతున్నారు. మున్సిపాలిటీల్లో.. ఉమ్మడి జిల్లాలో నిర్మల్, భైంసా, ఖానాపూర్, ఆది లాబాద్, కాగజ్నగర్, మంచిర్యాల, లక్సెట్టిపేట, నస్పూర్, చెన్నూరు, క్యాతనపల్లి, మందమర్రి, బె ల్లంపల్లి పట్టణాలున్నాయి. వీటి పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయి. పట్టణ వాసులకు తాగునీరు, రోడ్లు, మౌలిక వసతులు అరకొరగా అందుతున్నా యి. ఇక ఉట్నూరు, ఆసిఫాబాద్ మున్సిపాలిటీలు గా అప్గ్రేడ్ చేసినప్పటికీ ఇంకా గ్రామ పంచాయతీ లుగానే కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంగా ఉన్న ఆసిఫాబాద్కు మున్సిపాలిటీ హోదా దక్కలేదు. ఇక మందమర్రి పట్టణంలో ఏజెన్సీ వివాదంతో ఎన్నికలు జరగడం లేదు. ఈ సమస్య పరిష్కారానికి చొర వ చూపాలని కోరుతున్నారు. ఇక గ్రామ పంచాయతీలకు నిధులు, సర్పంచులకు పెండింగ్లో ఉన్న బిల్లుల చెల్లింపు పూర్తి చేయాల్సి ఉంది. ఇవి చదవండి: ఇష్టంతో ఉమ్మడి జిల్లాకు వచ్చా! : మంత్రి సీతక్క -
ఇష్టంతో ఉమ్మడి జిల్లాకు వచ్చా! : మంత్రి సీతక్క
కుమరం భీం: మహబూబ్నగర్ నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇన్చార్జిగా ఇష్టంతో వచ్చానని, ఇక్కడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి ధనసరి అనసూయ(సీతక్క) అన్నారు. ఇంద్రవెల్లిలో శుక్రవారం నిర్వహించే సీఎం రేవంత్రెడ్డి సభను విజయవంతం చేసేందుకు అన్ని గ్రామాల నుంచి పెద్దఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని రోజ్ గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో బుధవారం సాయంత్రం సన్నాహక సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ రేవంత్రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు ఇంద్రవెల్లి నుంచే దళిత గిరిజన దండోరా శంఖం పూరించి అధికారం సాధించారన్నారు. అదే పోరాట స్ఫూర్తితో ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లి సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు ప్రేమ పంచుతున్నారని, కాళ్లు కడిగి గ్రామాలకు ఆహ్వానించడం ఇక్కడి ప్రజల గొప్పతనమని పేర్కొన్నారు. ప్రజలు చూపిన అభిమానంతోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా ఎంచుకున్నానని, ప్రజల కష్టసుఖాలు పంచుకుంటానన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఇతరుల రక్తం తాగి రాజభోగం అనుభవించారని విమర్శించారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న అటవీ భూమికి రైతుబంధు ఇవ్వని బీఆర్ఎస్ హైవేలకు మాత్రం ఇచ్చిందని ఎద్దేవా చేశారు. పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ను అధికా రంలోకి తెచ్చే బాధ్యతను ప్రజలు తీసుకోవాలని కోరారు. ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్న డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావుకు నామినేటెడ్ పోస్టు ఒక్కటే పరిష్కారమన్నారు. డీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ 95 శాతం పూర్తయిన కుమురంభీం, జగన్నాథ్పూర్ ప్రాజెక్టుల ద్వారా సాగు నీరందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసానికే భగీరథ నీరు రావడం లేదంటే, గడచిన పదేళ్లలో అభివృద్ధి ఏ మేరకు జరిగిందో ప్రజలు ఆలోచించాలన్నారు. ఈ సందర్భంగా మంత్రిని శాలువాతో సన్మానించారు. కార్యక్రమానికి ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీరా శ్యాంనాయక్ అధ్యక్షత వహించారు. ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్, నాయకులు రావి శ్రీనివాస్, గణేశ్ రాథో డ్, గుండ శ్యాం, ఆసిఫ్, గోపి, కుసుంరావు, మునీర్ అహ్మద్, అశోక్, మంగ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి! అరూరికి కష్టకాలమేనా? -
‘నామినేటెడ్’ ఎవరికో?
కరీంనగర్: పదేళ్ల నిరీక్షణ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇదివరకు ప్రతిపక్ష నాయకులుగా ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే పార్టీ బలోపేతానికి కృషి చేసిన ప్రధాన నాయకులు, ముఖ్య కార్యకర్తలు రాష్ట్ర, జిల్లా స్థాయిలో నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెంచుకున్నారు. తాము కోరుకున్న కమిటీలో స్థానం కల్పించాలని కోరుతూ నేతల చుట్టూ తిరుగుతున్నారు. కరీంనగర్, జమ్మికుంట, హు జూరాబాద్ మార్కెట్ కమిటీల చైర్మన్ పదవులతో పాటు శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్(సుడా), జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, రాష్ట్ర స్థాయిలోని కార్పొరేషన్ల చైర్మన్, డైరెక్టర్ల పదవులకు పోటీ పడుతున్నారు. కరీంనగర్, హుజూరా బాద్, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాల నుంచి పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. గ్రంథాలయ సంస్థకు తీవ్ర పోటీ.. జిల్లా స్థాయి నామినేటెడ్ పోస్టుల్లో ఎలాంటి రాజ కీయ ఒత్తిళ్లు లేకుండా గౌరవప్రదమైన హోదా కలి గిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి కోసం తీవ్ర పోటీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణలకు ఆయా నియోజకవర్గాలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు తమ మనసులో మాట చెప్పినట్లు సమాచారం. చైర్మన్ పదవితోపాటు డైరెక్టర్ల నియామకం కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. రైతుబంధు సమితులు కొనసాగేనా? గత బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లా, మండల స్థాయిలో రైతుబంధు సమన్వయ సమితులు ఏర్పాటు చేసింది. వీటిని కొత్త ప్రభుత్వం రద్దు చేస్తుందా.. కొనసాగిస్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పదవులను తమకు ఇవ్వాలంటూ పలువురు కాంగ్రెస్ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేసుకుంటున్నారు. 7 మార్కెట్లు, 3 ఉప మార్కెట్లు జిల్లాలో 7 వ్యవసాయ మార్కెట్లు కరీంనగర్, జమ్మికుంట, చొప్పదండి, గంగాధర, హుజూరాబాద్, మానకొండూర్, గోపాల్రావుపేటలతోపాటు 3 ఉప మార్కెట్లు కమలాపూర్, కేశవపట్నం, ఎల్కతుర్తి ఉన్నాయి. గత ప్రభుత్వం చైర్మన్ పదవులను రిజర్వేషన్ ప్రాతిపదికన కేటాయించింది. ప్రస్తుత ప్రభుత్వం అదే పద్ధతిని పాటిస్తుందా లేదా పాత పద్ధతిలో కమిటీలను నియమిస్తుందో వేచిచూడాలి. దేవస్థాన కమిటీలు.. రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన ఇల్లందకుంట సీతారామాలయం, కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్రోడ్లో గల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయాలకు రూ.25 లక్షల పైబడి ఆదాయం వస్తుంది. వీటికి దేవాదాయ పాలక కమిటీలు నియమించి, ఉత్సవాలను నిర్వహించే ఆనవాయితీ ఉంది. జిల్లాలో కొత్తగట్టు మత్స్యగిరీంద్ర స్వామి, జిల్లా కేంద్రంలోని విజయగణపతి సాయిబాబా, గౌరీశంకర, భక్తాంజనేయ స్వామి, వేంకటేశ్వర స్వామి(మంకమ్మతోట), పొద్దుటూరి వారి ధర్మసంస్థ, హరిహర, గిద్దెపెరుమాండ్ల స్వామి, వీరాంజనేయ స్వామి, ప్రసన్నాంజనేయ స్వామి, కోతిరాంపూర్ పోచమ్మ, కట్టరాంపూర్ అభయాంజనేయ, గణేశ్నగర్ ప్రసన్నాంజనేయ, హనుమాన్(హుజూరాబాద్), సీతా రామస్వామి (నల్గొండ, తిమ్మాపూర్), వెంకటేశ్వర స్వామి(జమ్మికుంట) ఆలయాలకు దేవస్థాన కమిటీల చైర్మన్, డైరెక్టర్ పదవుల కోసం కాంగ్రెస్ నాయకులు పావులు కదుపుతున్నారు. జిల్లాలో ఇద్దరు కాంగ్రెస్, ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. కరీంనగర్ జిల్లాలోని 4 నియోజకవర్గాల పరిధిలో 16 మండలాలు ఉన్నాయి. చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలుగా అధికార పార్టీకి చెందిన మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కరీంనగర్, హుజూరాబాద్ నుంచి బీఆర్ఎస్కు చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, పాడి కౌశిక్రెడ్డి ఉన్నారు. కరీంనగర్, హుజూరాబాద్లలో కాంగ్రెస్ ఇన్చార్జీలుగా పురమల్ల శ్రీనివాస్, వొడితెల ప్రణవ్ వ్యవహరిస్తున్నారు. ఓటమి చెందినప్పటికీ ఆ నియోజకవర్గాలకు వీరినే ఇన్చార్జీలుగా నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీంతో పదవులు ఆశిస్తున్న కాంగ్రెస్ నాయకులు వారి కనుసన్నల్లోనే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇవి చదవండి: సూర్యాపేట: ఉద్రిక్తత.. మాజీ ఎంపీపీ కవితపై స్థానికుల దాడి! -
రేవంత్ రెడ్డి ఫోకస్ మారితేనే మంచిది!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును బెదిరిస్తున్నట్లుగా ఉంది. పులి బయటకు వస్తే బోనులో బంధిస్తామని చెప్పడం ద్వారా తన ఉద్దేశాన్ని ఆయన వెల్లడించారు. లండన్లో తన అభిమానులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ.. బీఆర్ఎస్ను వచ్చే పార్లమెంటు ఎన్నికలలో వంద మీటర్ల లోతున పాతిపెడతామని కూడా ఆయన అన్నారు. లండన్ నుంచే ఆయన పార్లమెంటు ఎన్నికల ప్రచారం ఆరంభించినట్లు అనిపిస్తుంది. నిజానికి విదేశాలకు వెళ్లినప్పుడు తన ప్రభుత్వం ఏమి చేస్తుందో చెప్పడానికి సహజంగా యత్నిస్తారు. తన లక్ష్యాలను వివరిస్తారు. కాని రేవంత్ తన స్పీచ్లో కేసీఆర్ను, కేటీఆర్, హరీష్ రావులను టార్గెట్గా చేసుకుని మాట్లాడినట్లు అనిపిస్తుంది. రాజకీయాలలో ఎవరు ఎప్పుడు పులి అవుతారో, ఎప్పుడు పిల్లి అవుతారో చెప్పలేం. ఎవ్పుడైనా ,ఎవరైనా, ఏమైనా కావచ్చు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ రేవంత్ రెడ్డే. 2015లో ఆయన ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని జైలుపాలైనప్పుడు ఆయన భవిష్యత్తు అగమ్యగోచరంగా కనిపించింది. శాసనసభ నుంచి ఆయన బహిష్కరణకు కూడా గురయ్యారు. తదుపరి 2018లో కొడంగల్ నుంచి శాసనసభకు పోటీ చేసి ఓటమి చెందారు. అప్పుడు రేవంత్ రాజకీయంగా బాగా వెనకబడి పోయినట్లు అనిపించింది. కాని అదృష్టం కలిసి వచ్చి మల్కాజిగిరి నుంచి స్వల్ప ఆధిక్యతతో లోక్సభకు గెలవడం ఆయన రాజకీయ జీవితంతో ఒక పెద్ద మలుపు అయింది. తదుపరి రేవంత్ ఏకంగా పీసీసీ అధ్యక్షుడు అవడం, అనంతరం ఎన్నికలలో విజయం సాధించి ముఖ్యమంత్రి కావడం జరిగింది. రేవంత్ పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పై చాలా దురుసుగా మాట్లాడేవారు. కొన్నిసార్లు ఆయన భాషపై అభ్యంతరాలు వచ్చేవి. అయినా రేవంత్ తగ్గలేదు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి. ఆయనపై విమర్శలు బీఆర్ఎస్ వంతుగా మారింది. కేసీఆర్ ఇంతవరకు ఒక్క మాట కూడా అనలేదు. ఆయన కుమారుడు, బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ కాని, మాజీ మంత్రి హరీష్ రావు కాని కాంగ్రెస్ హామీలను పదే, పదే గుర్తు చేస్తున్నారు. ప్రజలలో ప్రభుత్వంపై అసమ్మతి, అసంతృప్తి పెరిగేలా ఉపన్యాసాలు ఇస్తున్నారు. అది రేవంత్కు గుర్రుగానే ఉంటుంది. ఆయన మంత్రివర్గ సహచరుల ఫీలింగ్ కూడా అలాగే ఉంటుంది. ఆ క్రమంలోనే రేవంత్ తనదైన శైలిలో కేసీఆర్పై విరుచుకుపడ్డారు. 'ఎన్నికలలో బీఆర్ఎస్ బొక్కబోర్లాపడ్డా బుద్ది రాలేదు. పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ ఆనవాళ్లు కనిపించకుండా వంద మీటర్ల లోతున బొందపెడతాం. పులి బయటకు వచ్చేస్తోందంటూ బీఆర్ఎస్ వాళ్లు మాట్లాడుతున్నారు. అందుకోసమే ఎదురుచూస్తున్నా.. నా దగ్గర బోను, వల ఉన్నాయి..' అని ఆయన వ్యాఖ్యానించడం ఆసక్తికరమైన అంశమే. అంటే దీని అర్ధం కాలు జారి పడ్డ కేసీఆర్ కోలుకుని మళ్లీ ప్రజాజీవనంలోకి వస్తే ఆయనను ఏదో కేసులో పెట్టి అరెస్టు చేస్తామని చెప్పడమేనా అన్న ప్రశ్న వస్తుంది. కాకపోతే, ఆ మాట ఆయన నేరుగా చెప్పలేదు. కేసీఆర్ ప్రభుత్వంలోని అవినీతిపై చర్చ జరగకూడదని, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ప్రజలకు తెలియచేయరాదన్నట్లుగా బీఆర్ఎస్ నాయకత్వం ప్రవర్తిస్తోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. నిజమే! కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఆత్మరక్షణలో ఉన్న బీఆర్ఎస్ ఆ విషయం తప్ప మిగిలిన అంశాలపైనే కేంద్రీకరిస్తుంది. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను పదే, పదే ప్రస్తావించడం ద్వారా రేవంత్ను ఇరకాటంలోకి నెట్టడానికి కేటీఆర్, హరీష్రావు ఇతర నేతలు వ్యవహరిస్తారు. కేసీఆర్ ఇప్పుడిప్పుడే కోలుకుని వాకర్ సాయంతో నడుస్తున్నారు. ఆయన తక్షణమే ప్రజలలో తిరగాలని అనుకోకపోవచ్చు. మహా వస్తే పార్టీ ఆఫీస్కు వచ్చి కాసేపు కూర్చుని వెళ్లవచ్చు. ఎటూ మరో మూడు నెలల్లో పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ తేల్చుకుందామని రేవంత్ అన్నట్లుగానే కేసీఆర్ కూడా అందుకు సిద్దం అవుతుండాలి. ఈలోగానే మాటల యుద్దంలో పైచేయి సాధించడానికి ఇరుపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. బీఆర్ఎస్ కు కాళేశ్వరం వీక్ పాయింట్ అయినట్లుగానే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఆరు గ్యారంటీలు, ఇతర హామీలు వీక్ పాయింట్లు అవుతాయి. వాటిని అమలు చేయలేక ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దానిని కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ పైన, బీఆర్ఎస్ నేతలపైన విమర్శలు చేస్తున్నారన్న భావన ఏర్పడుతుంది. ఇంతవరకు ఆర్టీసీ బస్లలో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని అమలు చేశారు. దీనివల్ల మొదట కాస్త ఆకర్షణ ఏర్పడినా, రానురాను అది తగ్గుతోందన్న అభిప్రాయం కలుగుతోంది. బస్లలో సీట్లు చాలకపోవడం, అందరిని ఎక్కించుకోకపోవడం, అన్ని బస్ లలో ఈ సదుపాయం లేకపోవడం, ఈ స్కీమ్ వల్ల పెద్దగా ప్రయోజనం లేదని అనుకునే పరిస్థితి ఏర్పడుతోంది. దీనికన్నా వంట గ్యాస్ సిలిండర్ను 500 రూపాయలకే ఇచ్చే స్కీమ్ అమలు చేసి ఉంటే రేవంత్ ప్రభుత్వానికి ప్రజలలో ప్రత్యేకించి పేదవర్గాలలో గుడ్ విల్ పెరిగేది. కాని ఆ స్కీమ్ అమలు చేయాలంటే డబ్బు కూడా ఎప్పటికప్పుడు చెల్లించవలసి ఉంటుంది. గ్యాస్ సిలిండర్ల వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదు. సుమారు కోటి మంది వరకు ఆ స్కీమ్ కింద సిలిండర్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనికి ఏడాది అయ్యే వ్యయం సుమారు 2500 కోట్లు అని అంచనా వేశారు. దీనితో పాటు వృద్దులకు పెన్షన్ నాలుగువేల రూపాయలు ఇవ్వవలసి ఉంది. రెండు లక్షల రూపాయల రుణమాఫీ, రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు, ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయవలసిన వాగ్దానాల జాబితా చాంతాడు అంత అవుతుంది. ఈ నేపధ్యంలోనే కేటీఆర్ ఒక పిలుపు ఇచ్చారు. గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీ అని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అందువల్ల జనవరి బిల్లులను చెల్లించవద్దని, ఆ బిల్లులను సోనియాగాంధీ చిరునామాకు పంపించాలని ఆయన ప్రజలకు సూచించారు. వీటిని గుర్తు చేస్తే కాంగ్రెస్ నేతలకు కోపం వస్తుంది. ఎందుకంటే వీటన్నిటిని అమలు చేయడం సాధ్యం కాదని వారికి తెలుసు కాబట్టి. బీఆర్ఎస్ ను వంద మీటర్ల లోతున బొందపెట్టడం సరే కాని, ముందుగా వంద రోజుల లోపు హామీలను అమలు చేయాలని, రేవంత్ మాదిరి అహంకారంగా మాట్లాడేవారిని చాలామందిని చూశామని ఆయన అన్నారు. కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే ప్రతిపక్షంపై వ్యాఖ్యలు చేసేవారు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి రావవడంతో వాటి రుచిని ఆయన చవిచూస్తున్నారు. రేవంత్ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాధ్ షిండేతో పోల్చుతూ ఎప్పటికైనా కాంగ్రెస్ను చీల్చుతారన్నట్లుగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. రేవంత్ది బీజేపీ రక్తమని కూడా ఆయన అన్నారు. రాజకీయంగా చూస్తే ఒకప్పుడు కేసీఆర్ కూడా టీడీపీవారే. అలాగే రేవంత్ కూడా తొలుత ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వ్యక్తి అయినా, ఆ తర్వాత టీడీపీలోకి వచ్చి తదుపరి కాంగ్రెస్లో చేరారు. కేసీఆర్ సొంతంగా పార్టీని పెట్టుకున్నారు. రేవంత్కు కాంగ్రెస్ను చీల్చవలసిన అవసరం ఎందుకు వస్తుందో తెలియదు. ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి దించివేస్తే అప్పుడు అలా అవుతారని చెప్పడం కేటీఆర్ ఉద్దేశం కావచ్చు. కాని ఇదేదో ఊహాజనిత విమర్శగా కనిపిస్తుంది. అయితే వచ్చే పార్లమెంటు ఎన్నికలు అటు రేవంత్ కు, ఇటు కేసీఆర్ కు ఇద్దరికి ప్రతిష్టాత్మకమే. మధ్యలో బీజేపీ తన వంతు గెలుపుకోసం ప్రయత్నిస్తుంది. మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోలేకపోతే అప్పుడు ఆ పార్టీలో అసమ్మతి పెరిగితే పెరగవచ్చు. ఎక్కువ స్థానాలు గెలిస్తే మాత్రం రేవంత్కు డోకా ఉండదనే చెప్పాలి. కేసీఆర్ కు కూడా పరీక్ష సమయమే. గౌరవప్రదమైన సంఖ్యలో లోక్ సభ సీట్లు గెలుచుకోలేకపోతే బీఆర్ఎస్ క్యాడర్ కు భవిష్యత్తుపై అనుమానాలు వస్తాయి. మరో నాలుగేళ్లపాటు పార్టీని నడపడానికి చాలా కష్టాలు పడవలసి ఉంటుంది. ఎందుకంటే గతంలో మాదిరి సెంటిమెంట్తో రాజకీయాలు చేయడం అంత తేలిక కాకపోవచ్చు. రేవంత్ డావోస్ పర్యటనలో వచ్చిన పెట్టుబడులపై కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్దం జరిగింది. రేవంత్ గతంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదానిని విమర్శించేవారు. ఆ మాటకు వస్తే రాహుల్ గాంధీ సైతం ఆదానిపై విరుచుకుపడుతుంటారు. డావోస్ లో మాత్రం అదానిని రేవంత్ కలవడం సహజంగానే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. కాంగ్రెస్ తన విధానం మార్చుకుందా? లేక అవకాశవాదంతో పోతోందా అనే సందేహం వస్తుంది. మూసి నదికి సంబంధించి శుద్ది చేయాలన్న ఆలోచనలు బాగానే ఉన్నాయి. లండన్లో దీనిపై చర్చలు జరిపే నెపంతో ఎమ్.ఐ.ఎమ్. నేత అక్బరుద్దీన్ ఓవైసీని పిలిపించుకోవడంలో రాజకీయం కూడా ఉంటుందన్నది బహిరంగ రహస్యమే. ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. రేవంత్ రెడ్డిని తన బ్లాక్ మెయిల్ ద్వారా ఒక మీడియా యజమాని ఇప్పటికే లొంగదీసుకున్నారని రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. అదే కొనసాగితే రేవంత్ కు కొత్త చిక్కులు రావచ్చు. ప్రస్తుతం రేవంత్కు ఆ మీడియా పెట్టే జాకీలపై ఆధారపడకుండా, తన స్వశక్తి ద్వారా ప్రజలలో ఆదరణ పొందగలిగితేనే నిలబడగలుగుతారు.లేకుంటే రాజకీయంగా చేదు అనుభవాలు ఎదురు అవుతాయి. ఉదాహరణకు మల్కాజిగిరి లోక్ సభ స్థానంలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్కచోట కూడా కాంగ్రెస్ గెలవలేదు. గతసారి ఇక్కడ నుంచే రేవంత్ పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఈసారి జరిగే ఎన్నికలలో అదే పరిస్థితి ఎదురైతే ఆయన నైతికంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. మరో సంగతి ఏమిటంటే రేవంత్ రెడ్డి ఇటీవల ప్రధాని మోదీని కలిసినప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికు వ్యతిరేకంగా మాట్లాడినట్లు, అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఫర్వాలేదు కాని, బీఆర్ఎస్ మాత్రం ఉండకూడదన్నట్లు మాట్లాడినట్లు తోక పత్రిక యజమాని ప్రచారం చేస్తున్నారు. నిజంగా మోదీ ఒక కాంగ్రెస్ నేతతో అలా అంటారా అన్నది డౌటే. కల్పిత కధలు రాయడంలో దిట్టగా పేరిందిన ఈయన మాటలు జనం ఎవరూ నమ్మరు. అలాగే టీడీపీకి మద్దతు ఇచ్చే మరో పత్రిక పట్ల కూడా రేవంత్ వ్యవహరించే శైలిని కూడా ప్రజలు గమనిస్తారు. ఉదాహరణకు రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ఒక ప్రమాదంలో ఒక ప్రముఖ కంపెనీ సీఈఓ మరణించారు. ఈ కేసును రేవంత్ ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుందన్నది కూడా చర్చనీయాంశంగా ఉంది. రేవంత్ తమ చెప్పుచేతలలో ఉన్నాడని ఆ పత్రిక యాజమాన్యం భావిస్తోందని చెబుతారు. ఇలా తెలుగుదేశం మీడియా గుప్పిట్లోనే రేవంత్ కనుక కొనసాగితే భవిష్యత్తులో రాజకీయంగా ఇబ్బందులు వస్తాయి. వారితో తగాదా తెచ్చుకోవాలని చెప్పడం లేదు కాని వారి ఆటలకు అనుగుణంగా రేవంత్ డాన్స్ చేస్తే మాత్రం అప్రతిష్టపాలవుతాడని చెప్పకతప్పదు. మొత్తం మీద చూస్తే బీఆర్ఎస్ తనపై ఆరోపణలు జనంలోకి వెళ్లకుండా చూడడానికి విశ్వయత్నం చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చిన హామీలను ప్రజలు మర్చిపోతే బాగుండు అన్నట్లుగా వ్యవహరిస్తుందని భావించవచ్చు. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
TS: తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకోవడం కాదు.. ప్రజలివ్వడమే మేలు!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నెల రోజుల పాలన సంతృప్తి ఇచ్చిందని చెప్పారు. సంతోషమే. కాకలు తీరిన యోధుడుగా పేరొందిన బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించి, ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన రేవంత్ పాలన నెలరోజులు సాఫీగానే సాగిపోవడం వరకు ఓకే.కాని తన పాలనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకోవడం కాకుండా ప్రజల నుంచి పొందగలిగితే ఆయనకు ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. మీడియా లో రేవంత్ సంతృప్తి ప్రకటించడం తప్పు కాదు. తానే ఏదైనా ఆడ్వర్స్ వ్యాఖ్య చేస్తే దాని ప్రభావం ప్రభుత్వంపైన, మంత్రులపైన, ఎమ్మెల్యేలపైన ఉంటుంది.ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్న అలాగే చెబుతారు. కాని ఒక్కసారి మొత్తం పరిస్తితిని సమీక్షిస్తే ప్రభుత్వం వచ్చిన కొత్త కనుక ఎవరికి వారు సర్దుకుపోతున్నట్లుగా అనిపిస్తుంది.ఎవరైనా కామెంట్ చేసినా వారిపై ఎదురు విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం వచ్చి నెల రోజులే అయినా విమర్శలు చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు.మంత్రులు కాని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాని ప్రస్తుతానికి ఒకింత అయోమయ పరిస్థితిలో ఉన్నారనిపిస్తుంది. కెసిఆర్ ప్రభుత్వాన్ని ఓడించగలిగారు కాని, తాము ఈ ప్రభుత్వాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలా అన్నదానిపై మల్లగుల్లాలు పడుతున్నట్లుగా ఉంది. ఆయా నిర్ణయాలను మార్చుకోవలసి రావడం, ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక హామీలను అమలు చేయడం ఎలా అన్నది అర్ధం కాక తలపట్టుకుంటున్న తీరు కనిపిస్తూనే ఉంది. ఇవి ఒక ఎత్తు అయితే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి ముఖ్యమంత్రి పదవిపై చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించేవి. మల్లు భట్టి నేరుగా అనకపోయినా, ఆయన మనసులోని మాటను భార్య బయటపెట్టారని అనుకోవచ్చు. మరో వైపు ఇంకో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనకు క్యాబినెట్ లో బాగా ప్రాదాన్యం ఉందని చెప్పడంపై కూడా కాంగ్రెస్లో చెవులు కొరుక్కుంటారు. భవిష్యత్తులో ఇలాంటి ఘట్టాలు మరెన్నో వచ్చే అవకాశం ఉంది. కర్నాటకలో సైతం పదవుల పంచాయతీ తెగడం లేదు. తెలంగాణ కూడా అందుకు భిన్నంగా ఉండకపోవచ్చు. ఈ అంశాన్ని పక్కనబెడితే రేవంత్రెడ్డి కొన్ని తప్పులు చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. రేవంత్ దురుద్దేశంతో పొరపాట్లు చేశారని చెప్పకపోయినా, ఆయన కొన్ని నిర్ణయాలలో కొంత అనుభవ రాహిత్యం తెలుస్తుంది. ఉదాహరణకు ఫార్మాసిటీ రద్దు ప్రకటన ప్రభుత్వానికి నష్టం చేసిందన్న అభిప్రాయం ఉంది.దాంతో సర్దుబాటు ధోరణికి వెళ్లి పార్మాసిటీని ఏదో విభజిస్తామని,ఇంకేదో చేస్తామని చెప్పినా, దానిలో స్పష్టత లేదు. ఫార్మాసిటీ ఆధారంగా జరిగిన రియల్ ఎస్టేట్ లావాదేవీలు దెబ్బతిన్నాయన్న భావన ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ముందే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మందగించింది. ఈ ప్రభుత్వం వచ్చాక అది ఇంకా మెరుగు కాలేదు. కొద్ది రోజుల క్రితం కూడా మీడియాలో వచ్చిన కధనాలు చూస్తే వేలాది అపార్టుమెంట్ల అమ్మకాల కోసం ఎదురు చూస్తున్నాయి. భూముల క్రయ,విక్రయాల లావాదేవీలు ఆశించినంతగా పుంజుకోలేదు.గత ప్రభుత్వ టైమ్ లో అట్టహాసంగా ప్రచారం పొందిన ఎఫ్ 1 కార్ రేసింగ్ ఒప్పందాన్ని రద్దు చేయడం , ఆ సంస్థను తిరిగి డబ్బు చెల్లించాలని నోటీసు ఇవ్వడం ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది చూడాల్సి ఉంది. రేవంత్ పై దాడి చేసే మీడియా లేకపోయింది కాబట్టి సరిపోయింది కాని, ఈపాటికి గందరగోళం సృష్టించి ఉండేవి. ఉదాహరణకు ఎపిలో ఇలాంటి నిర్ణయాలు ఏవి జరిగినా ఈనాడు, ఆంద్రజ్యోతి తదితర ఎల్లో మీడియా రచ్చ,రచ్చ చేసి ఉండేవి. తాజాగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సమీక్షించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని సమాచారం వచ్చింది. దీని పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరం. గతంలో జగన్ ప్రభుత్వం ఎపిలో పిపిఎల సమీక్ష చేయాలని నిర్ణయం తీసుకుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయనకు మద్దతు ఇచ్చే ఎల్లో మీడియా ఎంత రభస చేశాయో గమనిస్తే, ప్రస్తుతం తెలంగాణలో రేవంత్కు అలాంటి ఇబ్బందులు లేవని అర్ధం చేసుకోవచ్చు. దానికి కారణం ఈనాడు రామోజీరావుకు తెలంగాణలో ఆస్తులు అధికంగా ఉండడం, తాను భుజాన వేసుకుని తిరిగే తెలుగుదేశం పార్టీ కూడా రేవంత్కు పరోక్షంగా మద్దతు ఇస్తుండడంతో ఆయన నోరు మెదపడం లేదు. ఇక ఆంద్రజ్యోతి రాదాకృష్ణ అయితే ప్రస్తుతానికి రేవంత్ ప్రభుత్వాన్ని తెగ పొగిడేస్తున్నారు. దీనికి కూడా ఒక కధ లేకపోలేదు. మధ్యలో కొద్దిరోజులు రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావాలని కొన్ని కదనాలు ఇచ్చారట.దాంతో రేవంత్ దిగి వచ్చి రాధాకృష్ణ కోరినట్లు వ్యవహరించారన్న అభిప్రాయం వ్యాప్లిలోకి వచ్చింది. ముఖ్యంగా ఏ మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వకపోయినా , ఆంధ్రజ్యోతికి మాత్రం ఇవ్వక తప్పలేదు.దానికి కారణం రాదాకృష్ణ బ్లాక్ మెయిలింగేనని రాజకీయవర్గాలలో ప్రచారం అయింది. పైగా రేవంత్ను ముఖ్యమంత్రిగా కాకుండా, అదేదో తన అదీనంలో ఉన్న వ్యక్తి మాదిరి ఆయన ఇంటర్వ్యూ చేశారని పలువురు వ్యాఖ్యానించారు. రాధాకృష్ణ ప్రవర్తన, బాడీ లాంగ్వేజ్, వ్యవహార శైలి అంత అహంకారపూరితంగా ఉన్నాయని అంటున్నారు. రేవంత్ వీటిని భరించడమే కాకుండా, రాధాకృష్ణ ట్రాప్లో పడి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిని పరోక్షంగా కించపరుస్తున్నట్లుగా మాట్లాడారని సోషల్ మీడియాలో విస్తారంగా ప్రచారం అయింది.ప్రత్యేకించి ఎమ్మెల్యేల ఫిరాయింపులు, కొనుగోళ్ల లావాదేవీలు మొదలైనవాటికి సంబందించి అడిగిన ప్రశ్నకు జవాబు ఇస్తూ ప్రకృతి జవాబు ఇచ్చిందన్నట్లుగా వ్యాఖ్యానించడం నిజంగానే అభ్యంతరకరం అని చెప్పకతప్పదు. నిజానికి ఏపాటి కొద్ది అనుభవం ఉన్న జర్నలిస్టు అయినా ఒక ప్రశ్న కచ్చితంగా వేసి ఉండేవారు.రేవంత్ కూడా గతంలో ఒక నామినెటేడ్ ఎమ్మెల్యే కొనుగోలు కేసులో పట్టుబడిన సంగతిని గుర్తు చేసేవారు.ఆ ప్రశ్న వేయకుండా వైఎస్ ఆర్ ను కించపరిచేలా రాధాకృష్ణ ప్రశ్నించడం, దానికి రేవంత్ సమర్ధించడం బాగున్నట్లు అనిపించదు.అయినా ప్రస్తుతం రేవంత్ నిస్సహాయుడని అనుకోవాలి. ఇదే రేవంత్ ఎన్నికల ప్రచార సమయంలో వైఎస్ ఆర్ ను పొగిడిన ఘట్టాలు మరచిపోయి మాట్లాడినట్లు అనిపిస్తుంది.ఎపి ముఖ్యమంత్రి జగన్ పట్ల కూడా అనుచిత వ్యాఖ్యలను రాధాకృష్ణ చేయించారు. జగన్ పోన్ చేసి అభినందించలేదని రాధాకృష్ణ అన్నప్పుడు అలా ఎందుకు! ఎక్స్ లో శుభాకాంక్షలు తెలిపారు కదా అని అనిఉండాల్సింది.అలాకాకుండా భిన్నంగా మాట్లాడడం అంత సరికాదనిపించింది. పైగా ఇదే రాధాకృష్ణ గతంలో జగన్ పోన్ చేస్తే రేవంత్ పోన్ ఎత్తలేదని, అదేదో గొప్ప విషయంగా రాశారు. రేవంత్ను రాదాకృష్ణే నడిపిస్తున్నారన్న భావన ప్రబలితే అది ఆయనకే నష్టం అని చెప్పాలి. ప్రజావాణి, ప్రజాపాలన వంటి విషయాలలో ప్రభుత్వానికి అంత మంచి మార్కులేమీ రాలేదు. ఆర్టిసి బస్ లలో మహిళలకు ఉచిత ప్రయాణం వరకు కాస్త పాజిటివ్ గా ఉన్నా దాని దుష్పరిణామాల ప్రభావం ఎక్కువగా కనిపించేలా ఉంది.ప్రజా పాలన పేరుతో సంబంధిత ఆరు గ్యారంటీల స్కీముల కోసం తెలంగాణ ప్రజలు లక్షల సంఖ్యలో రోడ్లపై క్యూ కట్టవలసి రావడం, ఆ దరఖాస్తులు ఒక చోట రోడ్లపై కనిపించడం కూడా అప్రతిష్టే అయింది.ఇక్కడే ఎపి తో పోల్చుకుని తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు. రైతు భరోసా కింద గత నెల తొమ్మిదిన వేస్తామన్న పదిహేనువేల రూపాయలు రైతుల ఖాతాలలో పడకపోవడం అసంతృఫ్తికి దారి తీసింది.ఇళ్లకు ఉచిత విద్యుత్, గ్యాస్ సిలిండర్లను 500 రూపాయలకే ఇవ్వడం వంటివి ఇంకా మొదలు కాలేదు. ఇవన్ని ఒక రూపానికి వచ్చి ఎప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం సర్దుకుంటుందో ఎవరూ చెప్పలేరు. - కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడమీ చైర్మన్. -
‘గ్రీన్’ పాలిటిక్స్! చెట్టంత ఓటు
సాక్షి, తెలంగాణ: ‘గులాబీ’ పార్టీ అనగానే అందరికీ టక్కున బీఆర్ఎస్ పేరు గుర్తొస్తుంది.. ఎర్ర పార్టీలనగానే అందరూ సీపీఐ, సీపీఎం పేర్లు చెబుతారు... మరి గ్రీన్ పార్టీ అంటే ఏం గుర్తొస్తుందని అడిగితే మీరేమంటారు?!! ఇదేం పేరు.. మేం ఎప్పుడూ వినలేదే అని అవాక్కవుతున్నారా? మనం ఇంకా వినలేదేమోగానీ అభివృద్ధి చెందిన దేశాల్లో పదులకొద్దీ పార్టీలు పుట్టుకొచ్చి క్రియాశీల రాజకీయాలు సైతం సాగిస్తున్నాయి! మరి ఆ పార్టీలేంటో తెలుసుకుందాం.' గ్రీన్ పార్టీ అంటే...?.. : యూరప్, అమెరికా ఖండాల్లోని పారిశ్రామిక దేశాలు చాలా దశాబ్దాలుగా అతిగా కర్బన ఉద్గారాలను వెలువరిస్తూ పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫక్తు ఆధిపత్య రాజకీయాలకే పరిమితం కాకుండా పర్యావరణవాదం, సామాజిక నాయ్యం, అహింస తదితర అంశాలపై దృష్టి కేంద్రీకరించేందుకు పుట్టుకొచ్చిన రాజకీయ పార్టీలే గ్రీన్ పార్టీలు. సాధారణంగా ఇవి సోషల్ డెమోక్రటిక్ ఆర్థిక విధానాలను అనుసరిస్తూ వామపక్ష పార్టీలతో జత కడుతూ ఉంటాయి. రాజకీయాలవైపు అడుగులు.. : పర్యావరణ సమస్యలపై ఉద్యమాలు చేపట్టే సంఘాలు, సంస్థలే కాలక్రమంలో గ్రీన్ రాజకీయ పార్టీలుగా మారుతున్నాయి. యూరప్, అమెరికా ఖండాల్లోని సంపన్న దేశాల్లో 1960వ దశకంలో రాడికల్ సోషల్ యాక్టివిస్టులు, ముఖ్యంగా విద్యార్థుల నిరసనోద్యమాలు.. 1970–80 దశకాల్లో అణ్వాయుధ వ్యతిరేక ఉద్యమాల నుంచి తొలినాటి గ్రీన్ పార్టీలు ఆవిర్భవించాయి. 1972లో తొలిసారి ఏర్పాటు.. : తొలి రెండు గ్రీన్ పార్టీలు ఆ్రస్టేలియాలో (ద యునైటెడ్ టాస్మేనియా గ్రూప్), న్యూజిలాండ్ (ద వేల్యూస్ పార్టీ) 1972లో ఏర్పాటయ్యాయి. 1973లో యునైటెడ్ కింగ్డమ్లో పీపుల్ (తర్వాత ద ఎకాలజీ పార్టీగా మారింది) పార్టీ పుట్టింది. 1979లో గ్రీన్ పార్టీ ఆఫ్ జర్మనీ రిజిస్టరైంది. 250 పర్యావరణ సంఘాలను ఏకం చేసి హెర్బర్ట్ గ్రూల్, పెట్రా కెల్లీ ఈ పార్టీని నెలకొల్పారు. 1983లో జాతీయ ఎన్నికల్లో ఈ పార్టీ ప్రతినిధి తొలుత గెలుపొందారు. 1998 నుంచి 2005 వరకు సోషల్ డెమోక్రటిక్ పార్టీతో కలసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగింది. 2021 ఎన్నికల్లో అపూర్వమైన రీతిలో 15% ఓట్లు గెల్చుకుంది. ఉమ్మడి మేనిఫెస్టో... : 1992లో బ్రెజిల్లోని రియో డి జెనీరో నగరంలో జరిగిన గ్రీన్ పార్టీల తొలి అంతర్జాతీయ సమావేశం గ్లోబల్ గ్రీన్స్ ప్రకటనను వెలువరించాయి. ‘గ్రీన్ పొలిటికల్ పార్టీలకు ప్రజలు ఓట్లు వేసినప్పుడే పర్యావరణ సమస్యలపై ప్రభుత్వాలు సీరియస్గా స్పందిస్తున్నాయని అనుభవాలు చెబుతున్నాయ’ని ఈ ప్రకటన పేర్కొంది. ఈ నేపథ్యంలో 2001లో తొలి ‘గ్లోబల్ గ్రీన్ పార్టీల కాంగ్రెస్’ ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రాలో జరిగింది. ‘గ్లోబల్ గ్రీన్స్ చార్టర్’పేరిట పూర్తిస్థాయి ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించాయి. ఆ తర్వాత 2012లో డకర్లో, 2017లో ఇంగ్లండ్లోని లివర్పూల్లో గ్రీన్ పార్టీల కాంగ్రెస్లు జరిగాయి. ఈ ఏడాది ఆగస్టులో దక్షిణ కొరియాలో జరిగిన కాంగ్రెస్లో గ్లోబల్ గ్రీన్స్ చార్టర్ అప్డేట్ చేశారు. 6 మూల సూత్రాలు... : పర్యావరణ పరిజ్ఞానం, సాంఘిక న్యాయం, భాగస్వామ్య ప్రజాస్వామ్యం (పార్టిసిపేటరీ డెమోక్రసీ), అహింస, సుస్థిరత, వైవిధ్యానికి గౌరవం.. ఇవీ గ్లోబల్ గ్రీన్ పార్టీలు మేనిఫెస్టోలో పేర్కొన్న ఆరు మూల సూత్రాలు. ‘భూమి జీవ శక్తి, వైవిధ్యం, సౌందర్యం మీద ఆధారపడి మనం జీవిస్తున్నాం. వీటిని అంతరింపజేయకుండా, వీలైతే మెరుగుపరిచి, మన తదుపరి తరానికి అందించడం మన బాధ్యత’అని దీని పీఠికలో తొలి వాక్యం చాటి చెబుతోంది. ‘పౌరులందరికీ తమ అభిప్రాయాలను వ్యక్తీకరించే హక్కు ఉన్న ప్రజాస్వామ్యం కోసం కృషి చేస్తాం. వారి జీవితాలను ప్రభావితం చేసే పర్యావరణ, ఆర్థిక, సామాజిక, రాజకీయ నిర్ణయాలలో ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు’ అని చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా 87 గ్రీన్ పార్టీలు.. : ‘గ్లోబల్ గ్రీన్స్’సమాచారం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 87 గ్రీన్ పొలిటికల్ పార్టీలున్నాయి. ఈ పార్టీలన్నీ కలసి 2001లో గ్లోబల్ గ్రీన్స్ పేరిట సమాఖ్యను ఏర్పాటు చేసుకున్నాయి. బ్రస్సెల్స్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థలో 87 గ్రీన్ రాజకీయ పార్టీలతోపాటు 9 పర్యావరణ సంస్థలు కూడా సభ్యులుగా ఉన్నాయి. 12 మంది సభ్యులుగల స్టీరింగ్ కమిటీకి బాబ్ హలె, గ్లోరియా పొలాంకో 2020 నుంచి కన్వీనర్లుగా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగా సురేశ్ నాటియాల్ 2019లో నెలకొల్పిన ‘ఇండియా గ్రీన్స్ పార్టీ’కి కూడా ఈ సమాఖ్యలో సభ్యత్వం ఉంది. గ్లోబల్ గ్రీన్స్లోని పార్లమెంటేరియన్ నెట్వర్క్లో ప్రపంచవ్యాప్తంగా 400 మందికిపైగా గ్రీన్ పార్లమెంటు సభ్యులు ఉన్నారు. పెరుగుతున్న ఆదరణ.. : ప్రధాన స్రవంతి రాజకీయాల్లో ముఖ్యంగా యూరోపియన్ దేశాల్లో గ్రీన్ పార్టీలకు ప్రాధాన్యం పెరుగుతూ వస్తోంది. కీలకమైన పార్లమెంటరీ స్థానాల్లో గెలుపొందటమే కాదు ముఖ్యమైన ప్రభుత్వ పదవులను సైతం చేపడుతుండటం విశేషం. క్లైమెట్ ఛేంజ్ వల్ల పర్యావరణ విపత్తులు గతమెన్నడూ ఎరుగని రీతిలో విరుచుకు పడుతున్న ప్రస్తుత తరుణంలో సంప్రదాయ రాజకీయ పార్టీల కూసాలు కదులుతుండగా గ్రీన్ పార్టీలకు ప్రజల్లో అంతకంతకూ ప్రాధాన్యం పెరుగుతోంది. - పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ ఇవి కూడా చదవండి: ఇది గ్రీన్ పాలిటిక్స్ యుగం! రాజకీయ పార్టీలే గ్రీన్ పార్టీలుగా..! -
రైతుల గోస తీర్చినం: సీఎం కేసీఆర్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/ ఆర్మూర్/ నిర్మల్: తెలంగాణ వ్యవసాయ రాష్ట్రం కాబట్టి వ్యవసాయ స్థిరీకరణతోనే గ్రామాలు పటిష్టం అవుతాయని గుర్తించి చర్యలు చేపట్టామని.. రైతుల గోస తీర్చామని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చెప్పారు. దేశ చరిత్రలో లేని స్థాయిలో 24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా, సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. ఈ పథకాలను వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్తోపాటు ఐక్యరాజ్యసమితి కూడా మెచ్చుకుందని చెప్పారు. ఇప్పుడు ఎరువుల కోసం చెప్పుల లైన్లు లేవని, కల్తీ విత్తనాలు లేవని తెలిపారు. ఎవరు మంచి చేశారో ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా భైంసా, జగిత్యాల జిల్లా కోరుట్ల, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. వివరాలు కేసీఆర్ మాటల్లోనే.. ‘‘ప్రజాస్వామ్యంలో ప్రజల చేతిలో వజ్రాయుధం ఓటు. అది దేశ భవిష్యత్తుకు బాట వేస్తుంది. గుడ్డిగా ఓటు వేయొద్దు. అభ్యర్థి వెనుక ఉన్న పార్టీలను, వాటి నడవడికను చూడాలి. ఈ అంశా లపై మీ ఊళ్లలో చర్చ పెట్టాలి. అలాగైతే మంచి నాయకులు వస్తరు, మంచి ప్రభుత్వాలు వస్తాయి. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం జరిగింది? అంతకుముందు కాంగ్రెస్ హయాంలో ఏం జరిగిందో ఆలోచించాలి. గతంలో పోచంపల్లి, దుబ్బాకలలో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. భూదాన్ పోచంపల్లిలో ఏడుగురు నేతన్నలు చనిపోతే.. లక్ష రూపాయల చొప్పున ఇవ్వాలని అప్పటి సీఎంను కోరాం. కానీ రూపాయి కూడా ఇవ్వలేదు. ఎరువుల కోసం చెప్పుల లైన్లతో.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎరువుల బస్తాల కోసం రైతులు పోలీస్స్టేషన్ల దగ్గర గంటల తరబడి నిలబడేది. చెప్పులు లైన్లలో పెట్టి ఎదురుచూసేది. ఆ పరిస్థితిని మార్చాం. కల్తీలేని విత్తనాలను కూడా అందుబాటులోకి తెచ్చాం." అని సీఎం కేసీఆర్ అన్నారు. "ధరణిని రద్దు చేస్తామని, రైతు బంధు దుబారా అని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు. ధరణితో దళారులు, లంచావతారాల బెడద, వ్యవసాయ భూముల్లో అక్రమాల బాధ తప్పాయి. ఇప్పటికే రెండుసార్లు రైతు రుణాలను మాఫీ చేశాం. ఈసారి రూ.లక్షకుపైగా ఉన్న రుణాలు మాఫీచేసేలోగా ఎన్నికల కోడ్ రావడంతో ప్రక్రియ ఆగిపోయింది. రోడ్డును చూస్తే తేడా తెలుస్తది. పక్కనే ఉన్న మహారాష్ట్ర నుంచి మీరు వస్తుంటే మన తెలంగాణ వచ్చిందన్న విషయాన్ని రోడ్లే చెప్తాయి. ఎక్కడి నుంచి రోడ్డు నున్నగా వస్తదో అక్కడి నుంచే తెలంగాణ అని మహారాష్ట్రవాళ్లు అంటున్నరు. అది మన అభివృద్ధికి సూచిక. ఇళ్లు, పరిశ్రమలు, ఐటీ, వ్యవసాయ రంగాలకు 24 గంటలపాటు కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్ర మనదే. మహారాష్ట్రలో కరెంటు లేదు. " అని సీఎం కేసీఆర్ చెప్పారు. " మన మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు వందల ఏళ్ల నుంచి భైంసా, ముధోల్, ఆదిలాబాద్, హైదరాబాద్లలో హిందువులు, ముస్లింలు కలసిమెలసి ఉండి పని చేసుకుంటున్నరు. భైంసా అంటే రోజూ కొట్టుకుంటారనే అబద్ధాలు ప్రచారం చేసి, మన మధ్యనే చిచ్చు పెట్టాలని చూస్తున్నరు. గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కరోజు కూడా కర్ఫ్యూ, లాఠీచార్జి లేదు. తెలంగాణ ప్రశాంతంగా ఉండాలా లేక మతపిచ్చి మంటలతో నెత్తురు పారాలా? కేసీఆర్ బతికున్నంతకాలం తెలంగాణ సెక్యులర్గానే ఉంటుంది. గత పదేళ్లలో మైనారీ్టల సంక్షేమానికి రూ.12వేల కోట్లు ఖర్చు చేశాం. బీడీ కార్మికులకు కొత్త పింఛన్లు బీడీలు చేసే వారి బాధలు నాకు తెలుసు. ఎవరూ దరఖాస్తు చేసుకోకముందే వారికి పింఛన్ ఇచ్చిన. బీడీ కార్మికులకు పింఛన్ రూ.2వేల నుంచి రూ.5 వేల వరకు దశలవారీగా పెంచి ఇస్తాం. కొత్తగా నమోదు చేసుకున్న బీడీ కార్మికులకు పింఛన్ ఇవ్వాలని ఎమ్మెల్యే సంజయ్, జీవన్రెడ్డి, కేటీఆర్లు కోరు తున్నారు. తప్పకుండా ఇస్తాం’’ అని చెప్పారు. ఇదీ చదవండి: మేడిగడ్డ 7వ బ్లాక్ పూర్తిగా పునర్నిర్మించాల్సిందే..! -
త్వరలో తెలంగాణ శాసనసభ ఎన్నికలు.. హడావుడిగా నేతల కసరత్తులు..
కామారెడ్డి: జిల్లాలో నాలుగు నియోజకవర్గాలున్నాయి. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి స్పీకర్ కాగా.. కామారెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్గా, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధే ప్యానెల్ స్పీకర్గా వ్యవహరించారు. స్పీకర్ స్థానంలో ఉన్న పోచారం శ్రీనివాస్రెడ్డి నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలంలో జరిగిన శాసనసభ సమావేశాలకు అధ్యక్షత వహించారు. ప్రొటెం స్పీకర్గా హన్మంత్ సింధేకు అప్పుడప్పుడు అవకాశం వచ్చింది. ప్రభుత్వ విప్ హోదాలో గంప గోవర్ధన్ తన పాత్ర ను నిర్వర్తించారు. అవకాశం చిక్కినపుడల్లా ఆయన కామారెడ్డి నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించారు. ఇక ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ కూడా ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్లలో తన నియోజక వర్గంలోని సమస్యలను ప్రస్తావిస్తూ వాటి పరిష్కారం కోసం ప్రయత్నించారు. జనం మదిని గెలిచేందుకు.. ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. వచ్చే నెలాఖరులో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని భావిస్తున్నారు. మరోవైపు ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. ఎన్నికల్లో తిరిగి పోటీ చేయడానికి ఉవ్విళ్లూరుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాలాకాలంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో జనంలో తిరుగుతున్నారు. అయితే ఆఖరి అసెంబ్లీ సమావేశాలు ముగిసిన నేపథ్యంలో ఇక అందరూ నియోజకవర్గాల్లో పూర్తిస్థాయి సమయం కేటాయించనున్నారు. షెడ్యూల్ వెలువడితే ఎన్నికల కోడ్ వస్తుందని, ఆలోపు అన్ని అభివృద్ధి పనులను ప్రారంభించడానికి వేగంగా అడుగులు వేస్తున్నారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడం, పూర్తయిన వాటిని ప్రారంభించడం వంటివాటిపై దృష్టి పెట్టనున్నారు. అటు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యేలు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. గ్రామాలు, మండలాలవారీగా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుని, కార్యక్రమాలు చేపట్టనున్నారు. పార్టీ శ్రేణులకు దగ్గరవుతూ, ఇతర పార్టీల్లోని నేతలను తమ వైపు తిప్పుకునేందుకు వలసలపై దృష్టి సారించారు. వచ్చే ఎన్నికల్లోనూ తామే బరిలో నిలుస్తామన్న నమ్మకంతో ఉన్న ఎమ్మెల్యేలు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మరోసారి అవకాశం దక్కేనా? శాసనసభ వర్షాకాల సమావేశాలు ఆదివారం ముగిశాయి. ప్రస్తుత శాసనసభ కాలం మరో నాలుగు నెలల్లో ముగిసిపోనుంది. త్వరలో అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఈ దఫాలో ఇవే చివరి సమావేశాలని భావిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎమ్మెల్యేలంతా ఇక జనంలోనే ఉండనున్నారు. ప్రజల మద్దతు కోసం ప్రయత్నించనున్నారు. జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా అధికార పార్టీకి చెందినవారే.. ఆయా స్థానాల్లో వారే పోటీ చేస్తారని భావిస్తున్నారు. బాన్సువాడలో పోచారం శ్రీనివాస్రెడ్డే తిరిగి పోటీ చేస్తారని అప్పట్లో తెలంగాణ తిరుమల ఆలయ వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో పోచారం తిరిగి పోటీ చేస్తారన్న విషయం స్పష్టమైంది. ఇటీవల జుక్కల్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి కేటీఆర్ అక్కడి ఎమ్మెల్యే సింధేను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడంతో ఆయనకు సైతం మరోసారి అవకాశం దక్కడం ఖాయమని తెలుస్తోంది. ఎల్లారెడ్డిలో మంత్రి హరీష్రావు పర్యటన సందర్భంగా సురేందర్ కష్టపడే వ్యక్తి అని, ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ తిరిగి సురేందర్నే బరిలో నిలపవచ్చని భావిస్తున్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ వరుస విజయాలు సాధించారు. నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. అయితే ఇటీవల సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. సీఎం పోటీ చేయకపోతే గంప గోవర్ధనే తిరిగి బరిలో నిలిచే అవకాశాలున్నాయి. -
‘పట్నం’ కాంగ్రెస్లో ముసలం!
రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నం కాంగ్రెస్లో ముసలం పుట్టింది. ఓ వైపు ఎన్నికల గడువు సమీపిస్తుండగా.. మరో వైపు పార్టీలో అంతర్గత పోరు తార స్థాయికి చేరుకుంది. ఇప్పటికే పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు కాంగ్రెస్ను వీడి అధికార పార్టీలో చేరగా.. తాజాగా మరికొంత మంది అదే బాటలో పయనించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్కు గట్టి పోటీ ఇస్తుందని భావించిన కాంగ్రెస్ పార్టీ.. ఉన్నత స్థాయి నేతల తీరుతో అప్రతిష్ట పాలవుతోంది. మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, సీనియర్ నేతలు దండెం రామిరెడ్డి, మర్రి నిరంజన్రెడ్డి నియోజకవర్గంలో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పార్టీ సంక్షోభ సమయంలో అంతా కలిసి పని చేయాల్సి ఉండగా.. ఎవరికి వారే అనే చందంగా సాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ నాకంటే.. నాకే వస్తుందని ప్రచారం చేసుకుంటూ గ్రూపు రాజకీయాలకు తెరలేపారు. వీరి ప్రవర్తన నచ్చక ఇప్పటికే గ్రామాల్లోని పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు బీఆర్ఎస్లో చేరడం గమనార్హం. తాజాగా తుర్కయాంజాల్, పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీలకు చెందిన పలువురు కౌన్సిలర్లు సైతం పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నేతల మధ్య కొట్లాట పట్నం నియోజకవర్గానికి 1952 నుంచి 2018 వరకు 16సార్లు ఎన్నికలు జరిగాయి. ఎనిమిది సార్లు కాంగ్రెస్, మూడుసార్లు సీపీఎం, నాలుగుసార్లు టీడీపీ, ఒకసారి బీఆర్ఎస్ గెలుపొందాయి. జిల్లాలో కాంగ్రెస్కు మంచి పట్టున్న నియోజకవర్గాల జాబితాలో ఇది మొదటి స్థానంలో ఉంటుంది. 2018 ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా ఈ సీటును సామరంగారెడ్డికి త్యాగం చేయాల్సి వచ్చింది. అప్పటికే కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి పొత్తులో భాగంగా భంగపడిన మల్రెడ్డి రంగారెడ్డి ఆ తర్వాత బీఎస్పీ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. అనంతరం జరిగిన సర్పంచ్, మండల, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులే మెజార్టీ సీట్లు దక్కించుకున్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీకి గట్టిపట్టుంది. అయితే ప్రస్తుతం సీనియర్ నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు ఆ పార్టీకి శాపంగా మారాయి. మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీకి సన్నాహాలు చేసుకుంటుండగా.. మరో వైపు ఎంపీ కోమటిరెడ్డి వర్గంగా చెప్పుకుంటున్న మర్రి నిరంజన్రెడ్డి, గ్రేటర్ పరిధిలోని ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు సన్నిహితుడిగా చెప్పుకొనే దండెం రామిరెడ్డి సైతం ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి సొంత నియోజకవర్గంలోనే పార్టీ నేతల మధ్య సమన్వయం కొరవడటం విశేషం. పార్టీని వీడే యోచన తుర్కయాంజాల్ మున్సిపల్ పరిధిలోని మాజీ ఎంపీపీ, రైతుసేవా సహకార సంఘం బ్యాంకు మాజీ చైర్మన్ రొక్కం భీంరెడ్డి సహా ఎనిమిది మంది కౌన్సిలర్లు, మరో ముగ్గురు కో ఆప్షన్ మెంబర్లు కాంగ్రెస్ను వీడి.. బీఆర్ఎస్లో చేరే యోచ నలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరంతా స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డితో టచ్లో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. భీంరెడ్డి గతంలో టీడీపీలో పని చేశారు. 2018లో టీడీపీ టికెట్ ఆశించారు. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరారు. ప్రస్తుతం ఆయనకు ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ మల్రెడ్డి రంగారెడ్డి, భీంరెడ్డికి మధ్య సఖ్యత లేదు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రెండున్నరేళ్లకు చైర్మన్ పీఠాన్ని భీంరెడ్డి కోడలికి ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. కానీ ఇప్పటికీ అది నిలబెట్టుకోలేదు. దీంతో వారంతా పార్టీ మారేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భీంరెడ్డి వర్గీయులు పార్టీ వీడకుండా మల్రెడ్డి వర్గీయులు బుజ్జగింపులు.. బేరసారాలకు దిగుతున్నారు. అయినా వారు పట్టు వీడటం లేదు. ఈ నెల 19న మంత్రి కేటీఆర్ సమక్షంలో వీరంతా పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీలోని పలువురు కాంగ్రెస్ కౌన్సిలర్లు నియోజకవర్గ ఇన్చార్జ్ మల్రెడ్డి సోదరుల నాయకత్వాన్ని విభేదిస్తున్నారు. వీరంతా పక్క బాటపట్టే అవకాశం లేకపోలేదు. -
పొలిటికల్ కారిడర్ 15th Oct 2019
-
పొలిటికల్ కారిడర్ 16th september 2019
-
పొలిటికల్ కారిడర్ 13th Sep 2019
-
పొలిటికల్ కారిడార్ 9th Sep 2019
-
పొలిటికల్ కారిడార్ 31st Aug 2019
-
పొలిటికల్ కారిడర్ 30th Aug 2019
-
పొలిటికల్ కారిడర్ 27th Aug 2019
-
పొలిటికల్ కారిడర్ 22nd 2019
-
పొలిటికల్ కారిడర్ 19th March 2019
-
పొలిటికల్ కారిడర్ 18th March 2019
-
పొలిటికల్ కారిడర్ 14th March 2019
-
పొలిటికల్ కారిడర్ 7th March 2019
-
పొలిటికల్ కారిడర్ 12th Feb 2019
-
పొలిటికల్ కారిడర్ 9th Feb 2019
-
పొలిటికల్ కారిడర్ 8th Feb 2019
-
పొలిటికల్ కారిడర్ 7th Feb 2019
-
పొలిటికల్ కారిడర్ 4th Feb 2019
-
పొలిటికల్ కారిడర్ 2nd Feb 2019
-
పొలిటికల్ కారిడర్ 31st Jan 2019
-
పొలిటికల్ కారిడర్ 26th jan 2019
-
పొలిటికల్ కారిడర్ 25th Jan 2019
-
పొలిటికల్ కారిడర్ 24th Jan 2019
-
పొలిటికల్ కారిడర్ 3rd Jan 2019
-
పొలిటికల్ కారిడర్ 29th Dec 2018
-
పొలిటికల్ కారిడార్ 22nd dec 2018
-
పొలిటికల్ కారిడర్ 17th Dec 2018
-
పోలిటికల్ కారిడార్ 14th Dec 2018
-
పోరు తెలంగాణ
-
పొలిటికల్ కారిడర్ 8th Oct 2018
-
పొలిటికల్ కారిడర్ 6th Oct 2018
-
పొలిటికల్ కారిడర్ 17th Sep 2018
-
పొలిటికల్ కారిడర్ 15th Sep 2018
-
పొలిటికల్ కారిడర్ 8th Sep 2018
-
పొలిటికల్ కారిడర్ 30th August 2018
-
పొలిటికల్ కారిడర్ 25th August 2018
-
పొలిటికల్ కారిడర్ 24th August 2018
-
పొలిటికల్ కారిడర్ 18th August 2018
-
పొలిటికల్ కారిడర్ 14th August 2018
-
పొలిటికల్ కారిడర్ 11th August 2018
-
పొలిటికల్ కారిడర్ 9th August 2018
-
పొలిటికల్ కారిడర్ 2nd August 2018
-
పొలిటికల్ కారిడర్ 21st July 2018
-
పొలిటికల్ కారిడర్ 13th July 2018