
జైలులో జామర్.. ఎమ్మెల్యే ధర్నా
యశవంతపుర: జైలు అధికారులు కారాగారం చుట్టు వేసిన జామర్లతో ప్రజలకు ఇబ్బందిగా ఉందంటూ మంగళూరు నగర బీజేపీ నాయకులు శనివారం స్థానిక జైలు ముందు ధర్నా చేశారు. ఒక జామర్ వల్ల ప్రజలకు సమస్యగా ఉందని ఎమ్మెల్యే వేదవ్యాస కామత్ అరోపించారు. సమస్యను పరిష్కరించండి, లేదా జామర్ను తొలగించండి అని ఆయన డిమాండ్ చేశారు. జైలు అధికారులు, పోలీసు ఉన్నత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జైలుకు జామర్ అవసరం లేకున్నా ఎందుకు కొనసాగిస్తున్నరో అర్థం కావటంలేదన్నారు. జామర్ల వల్ల పరిసర ప్రాంతాల ప్రజల మొబైల్ఫోన్లకు అంతరాయం కలుగుతోందని తెలిపారు. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని తరలించారు.
సీఐ సస్పెన్షన్
శివమొగ్గ: శివమొగ్గ నగరంలో ఉన్న వినోభనగర పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ చంద్రకళ సస్పెండ్ అయ్యారు. విధులలో నిర్లక్ష్యం చూపినట్లు ఆరోపణలు రావడంతో తూర్పు విభాగం ఐజిపి రవికాంత్గౌడ ఈ మేరకు చర్య తీసుకున్నారు. ఈద్గా మైదానం వివాదం గురించి ఎస్పీ అన్ని స్టేషన్ల ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలతో సమావేశం నిర్వహించారు. ఇందుకు చంద్రకళ హాజరు కాలేదు. ఎస్పీ ఫిర్యాదు చేయడంతో వేటు పడింది.
సిద్ధలింగేశ్వర జాతర
తుమకూరు: ప్రసిద్ధ యడియూరు శ్రీ సిద్ధలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో శనివారం మధ్యాహ్నం రథోత్సవం కనులపండువగా జరిగింది. ఏటా మాదిరిగానే ఉగాది పండుగ ముగిసిన తరువాత స్వామి జాతర, తేరు జరుగుతుంది. మంగళవాయిద్యాలతో, వీరగాసె కళాకారుల నృత్యాల మధ్య రథోత్సవం జరిగింది. పలువురు స్వామీజీ పాల్గొని టెంకాయలు కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. పలు జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు పాల్గొన్నారు.
వాకింగ్ చేస్తుండగా చైన్స్నాచింగ్
మైసూరు: మైసూరులో చైన్స్నాచర్లు తెగబడ్డారు. ఓ మహిళ మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లారు. ఈ ఘటన నగరంలోని మండి పోలీసు స్టేషన్ పరిధిలోని వెస్లి రోడ్డు వద్ద జరిగింది. లలిత (53) అనే మహిళ ఇంటి వెనుక రోడ్డులో వాకింగ్ చేస్తుండగా స్కూటర్పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని రూ.1.45 లక్షల విలువ చేసే 35 గ్రాముల బంగారు మంగళసూత్రాన్ని లాక్కొని పరారయ్యారు. ఘటన అక్కడే ఉన్న సీసీ టీవీ కెమెరాలో రికార్డయింది. లలిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు మండి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
బజార్లకు నవమి కళ
చింతామణి: శ్రీరామనవమి పండుగ రావడంతో బజార్లు కిటకిటలాడుతున్నాయి. చింతామణి పట్టణంలో పూలు పండ్లు తదితర వస్తువులను కొనుగోలుకు ప్రజలు తరలివచ్చారు. పూలు పండ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా పండుగ కావడంతో కొనుగోళ్లు చేశారు.
కావేరి జలాల్లో అన్యాయమే
● కేంద్రమంత్రి కుమారస్వామి
శివాజీనగర: మన నీరు మన హక్కు, ప్రజల పన్నుల సొమ్ముతో ఆనకట్టలను నిర్మించి తమిళనాడుకు నీరు విడుస్తున్నాము అని కేంద్ర మంత్రి హెచ్.డీ.కుమారస్వామి అన్నారు. బెంగళూరు కువెంపు కళాక్షేత్రలో కావేరి నది రక్షణ సమితి చేపట్టిన కావేరి నది నీటి పంపకాల గురించి చర్చాగోష్టిలో పాల్గొని మాట్లాడారు. కావేరి నీటి విషయంలో మనకు అన్యాయం అయింది. పొరుగు రాష్ట్రానికి అనుకూలం అవుతోంది. కన్నడిగుల్లో ఐక్యత లేదు, నీటి విషయంలో కూడా అదే జరుగుతోందన్నారు. మేకెదాటు ప్రాజెక్ట్పై రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ విధానాన్ని అనుసరిస్తున్నదని ఆరోపించారు. మనలో ఐక్యత రాకపోతే కావేరి నీటిలో న్యాయం జరగదన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మలానందనాథ స్వామి, సౌమ్యనాథ స్వామి, సిద్దరామేశ్వర స్వామి, నిశ్చలానందనాథ స్వామి, బీజేపీ పక్ష నాయకుడు ఆర్.అశోక్, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి వీ గోపాలగౌడ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

జైలులో జామర్.. ఎమ్మెల్యే ధర్నా

జైలులో జామర్.. ఎమ్మెల్యే ధర్నా