పెనుబల్లి: పెనుబల్లి మండలం లంకాసాగర్కు చెందిన బాలుడు నీటి తొట్టిలో పడి మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన కిరణ్ – పద్మ దంపతులకు ఇద్దరు సంతానం. రైస్ మిల్లులో పనిచేస్తూ ఆయన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరి చిన్నకుమారుడు నిఖిల్సాయి(3) శుక్రవారం మామిడి పండు కడుక్కునేందుకు నీటి తొట్టి వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తు అందులో పడ్డాడు. కాసేపటికి కుటుంబీకులు గమనించేసరికే అపస్మారక స్థితిలోకి వెళ్లగా ఆస్పత్రికి తీసుకెళ్లేసరికి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
వడదెబ్బతో వ్యక్తి ...
ఖమ్మంక్రైం: వడదెబ్బ బారిన పడిన గుర్తుతెలియని(45) వ్యక్తి శుక్రవారం మృతి చెందాడు. ఖమ్మం గాంధీచౌక్లోని రఘు బుక్ సెంటర్ సమీపాన ఓ వ్యక్తి ఎండవేడికి తాళలేక వడదెబ్బకు గురై కన్నుమూశాడు. ఈ విషయమై సమాచారం అందుకున్న త్రీ టౌన్ పోలీసులు అన్నం సేవా ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
చికిత్స పొందుతున్న వృద్ధురాలు...
కామేపల్లి: ఆత్మహత్యయత్నానికి పాల్పడిన మండలంలోని లాల్యతండా గ్రామానికి చెందిన బాదావత్ లక్ష్మి(61) చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. పదేళ్లుగా అనారోగ్యంతో బాదపడుతున్న ఆమె జీవితంపై విరక్తితో నాలుగు రోజుల క్రితం ఎలుకల మందు తాగింది. దీంతో లక్ష్మిని కుటుంబీకులు ఖమ్మంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది. ఘటనపై ఆమె భర్త సోమ్లా శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ప్రవీణ్కుమార్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు...
సత్తుపల్లిరూరల్: ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో పాసింజర్ ఆటో గూడ్స్ ఆటో ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. సత్తుపల్లి మండలం మేడిశెట్టివారిపాలెం క్రాస్ వద్ద శుక్రవారం జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం కలగరకు చెందిన కొవ్వూరు తిరుపతిరావు(35) ప్రయాణికుల ఆటోతో అశ్వారావుపేట వైపు నుంచి సత్తుపల్లి వస్తున్నాడు. ఈ ఆటో వెనకాల వేగంగా వచ్చిన మరో సరుకుల ఆటో ఎదురుగా వచ్చే వాహనాన్ని తప్పించే క్రమంలో తిరుపతిరావు ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు ఢీకొనగా డ్రైవర్ తిరుపతిరావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈమేరకు సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆయన మృతి చెందాడు.