మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: వివిధ యాజమాన్యాల పరిధిలోని విద్యార్థులు ఎస్సెస్సీ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించాలని డీఈఓ రవీందర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు సబ్జెక్టులలోపు ఉంటే రూ.110, మూడు సబ్జెక్టుల కంటే ఎక్కువగా ఉంటే రూ.125 చెల్లించాలన్నారు. ఈ నెల 16లోగా పాఠశాల హెచ్లకు ఫీజులు చెల్లిచాలని సూచించారు.
నీట్కు పకడ్బందీగా ఏర్పాట్లు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కోఆర్డినేటర్, సమర్థ పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీకాంత్ కోటా అన్నారు. శుక్రవారం సమర్థ పాఠశాలలో నీట్ పరీక్షకు సంబంధించి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 11 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, పరీక్ష ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు ఉంటుందని, విద్యార్థులను ఉదయం 11 గంటల నుంచే కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. పరీక్షకు సంబంధించి విద్యార్థులు ఎన్టీఏ సూచనలను తప్పకుండా పాటించాలని, బయోమెట్రిక్ తనిఖీల కోసం నీట్ అడ్మిట్ కార్డు, ఐడీ ప్రూఫ్ వెంట తీసుకురావాలన్నారు. పీడబ్ల్యూడీ వర్తించేవారు సదరు సర్టిఫికెట్ తెచ్చుకోవాలన్నారు. విద్యార్థులు సాధారణ దుస్తులు ధరించి పరీక్షకు రావాలని, ఆభరణాలు, బూట్లు ధరించరాదని, సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావొద్దని సూచించారు. వేసవికాలం దృష్ట్యా విద్యార్థులు వెంట వాటర్ బాటిళ్లు తెచ్చుకోవాలని, పరీక్ష పూర్తయ్యే వరకు బయటకు పంపకుండా సంబంధిత ఇన్చార్జ్లు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
డీఆర్సీసీలోఫైర్ మాక్ డ్రిల్
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: స్థానిక కోయిల్కొండ ఎక్స్ రోడ్డులోని డంపింగ్ యార్డులో ఏర్పాటు చేసిన డీఆర్సీసీలో శుక్రవారం రాత్రి అగ్నిమాపక సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రస్తుతం వేసవికాలం కావడంతో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవిస్తే ఏవిధంగా నియంత్రించాలో చూపించారు.వాస్తవానికి ఇక్కడికి నిత్యం టన్నుల కొద్దీ పొడిచెత్త వస్తుంటుంది. ఒకవేళ ఏదైనా ప్రమాదం ఏర్పడితే వెంటనే ఎలా ఆర్పివేయాలో మహిళలకు ప్రయోగాత్మకంగా వివరించారు.