
సాక్షి, హైదరాబాద్: సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన మలయాళ బ్లాక్ బస్టర్ `లూసీఫర్`. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక మెగాస్టార్ చిరంజీవి 153వ సినిమాగా తెరకెక్కనున్న ఈ మూవీ కోసం ఆయన స్క్రిప్టు, దర్శకుడిని ఫైనల్ చేశారు. ఓ వైపు ఆచార్య షూటింగ్ కొనసాగుతుండగానే, లూసిఫర్ రీమేక్ పనులతో బిజీ అయ్యారు. సంక్రాంతి తర్వాత ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లనున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. లూసీఫర్ సినిమా స్క్రిప్టు ఫైనల్ అయ్యిందని తెలిపారు. `తనిఒరువన్` (ధృవ) ఫేం మోహన్ రాజా దర్శకత్వం వహిస్తారని పేర్కొన్నారు. ‘‘రీమేక్ కథ ఓకే అయ్యింది. మన నేటివిటీకి తగ్గట్టుగా ఈ ప్రతిష్టాత్మక స్క్రిప్టును మోహన్ రాజా చాలా బాగా నేరేట్ చేశాడు. సంక్రాంతి తర్వాత సెట్స్కు వెళతాం.
ఫిబ్రవరి-మార్చి - ఏప్రిల్ లో జరిగే షూటింగ్ తో నా 153 వ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. నాతో సినిమా చేయాలని వేచి చూస్తున్న చిరకాల సన్నిహితులు ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నా సినిమాల పంపిణీదారుడిగా ఆయనతో ఎంతో అనుబంధం ఉంది`` అని తెలిపారు. ఇక దర్శకుడు మోహన్ రాజా మాట్లాడుతూ-``మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన హిట్లర్ (ముత్యాల సుబ్బయ్య దర్శకుడు) చిత్రానికి తాను అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసినట్లు తెలిపారు. ఇప్పుడు ఆయనను డైరెక్ట్ చేసే అదృష్టం దక్కడం తన పూర్వజన్మ సుకృతం అన్నారు. ‘‘ఈ అవకాశం దక్కినందుకు ఆనందంగా ఉంది. ఎన్వీ ప్రసాద్ గారు నిర్మాతగా రాజీ లేకుండా తెరకెక్కించనున్నారు`` అని తెలిపారు.(చదవండి: కాజల్- గౌతమ్లకు చిరంజీవి ఆశీర్వాదాలు)
కాగా ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అండ్ ఎన్వీ ప్రసాద్ (ఎన్వీఆర్ సినిమా) సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ విషయం గురించి నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘చిరంజీవి గారి సినిమాని మోహన్ రాజా తెరకెక్కించడం చాలా సంతోషంగా ఉంది. చిరంజీవితో పాటుగా మా అందరికీ నచ్చేలా మార్పులు చేర్పులతో ఎంతో అద్భుతంగా ఈ స్క్రిప్టును మలిచి మోహన్ రాజా మెప్పించారు. బాస్తో సినిమా అంటేనే కొత్త ఉత్సాహం అందరిలో నెలకొంది. రాజీ పడకుండా భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం’ అని తెలిపారు.
ఇక ప్రఖ్యాత ఎడిటర్ మోహన్ వారసుడిగా మోహన్ రాజా సినీ అభిమానులకు సుపరిచితం. ఆయన తమిళంలో పాపులర్ డైరెక్టర్. అయిదు తెలుగు సినిమాల్ని తమిళంలోకి రీమేక్ చేసి బ్లాక్ బస్టర్లుగా మలిచారు. ఇక ఎడిటర్ మోహన్ నిర్మించిన `హిట్లర్` సినిమాకి ముత్యాల సుబ్బయ్య వద్ద మోహన్ రాజా అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశారు. ఇప్పుడు చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారనే అభిమానులు భావిస్తున్నారు. తమిళంలో సంచలన విజయం సాధించిన `తని ఒరువన్` (జయం రవి హీరో) దర్శకుడిగా అతడి పేరు జాతీయ స్థాయిలో మార్మోగింది. రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో `ధృవ` టైటిల్తో తనిఒరువన్ రీమేకై తెలుగులోనూ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment