నియోజకవర్గాల వారీగా ముఠాలు | - | Sakshi
Sakshi News home page

నియోజకవర్గాల వారీగా ముఠాలు

Published Mon, Mar 3 2025 1:47 AM | Last Updated on Mon, Mar 3 2025 1:47 AM

నియోజ

నియోజకవర్గాల వారీగా ముఠాలు

ఒక్క కర్నూలులోనే

25కు పైగా గ్యాంగులు

పట్టుకోసం రెండు వర్గాల మధ్య

ఆధిపత్యపోరు

ఎక్కడికక్కడ ఎమ్మెల్యేల

పేరు చెప్పుకొని అక్రమ రవాణా

కళ్లెదుటే సాగుతున్నా నోరు మెదపని

అధికారులు

పోలీసులకు పెద్ద ఎత్తున మామూళ్లు

● ఆదోని పట్టణంలో కోసిగికి చెందిన రాఘవేంద్ర, గోవిందమ్మల నుంచి 5.27 క్వింటాళ్ల బియ్యం, రవాణా వాహనం సీజ్‌ సీజ్‌.

● కర్నూలు రూరల్‌ మండలం పంచలింగాల సమీపంలో లారీని సీజ్‌ చేసి 135 బస్తాల బియ్యం స్వాధీనం. లారీ ఓనర్‌ ప్రైమ్‌ సీలోరియాతో పాటు మద్దిలేటి అనే వ్యక్తిపై క్రిమినల్‌ కేసు.

● పత్తికొండ మండలం హోసూరులో 52 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం. అరుణాక్షి, రామకృష్ణలపై క్రిమినల్‌, 6ఏ కేసులు.

● తుగ్గలి మండలం రాంపల్లి వద్ద లారీ, ఓ కారును సీజ్‌ చేసి 1100 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం. అనంతపురం జిల్లాకు చెందిన డి.శంకర్‌, శివప్రసాద్‌, తుగ్గలి మండలం రాంపల్లికి చెందిన భాస్కరరెడ్డి, డోన్‌ మండలం చింతలపేటకు చెందిన వడ్డే సురేష్‌లపై కేసు.

● కల్లూరు చెన్నమ్మ సర్కిల్‌వద్ద 30 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం. కె.మహేశ్‌, జయప్రకాష్‌నాయుడు, ఇర్ఫాన్‌పై కేసు.

● మంత్రాలయం మండలం మాధవరం చెక్‌పోస్టు వద్ద కర్ణాటకకు తరలిస్తున్న 80 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం.

● ఆదోని పట్టణం ఢణాపురం రోడ్డులో 3.20 క్వింటాళ్ల బియ్యం సీజ్‌ చేసి షేక్‌ షబ్బీర్‌పై కేసు నమోదు. మరో కేసులో 3.51 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం. వాహనాన్ని సీజ్‌ చేసి అబ్దుల్‌ రహిమాన్‌ అనే వ్యక్తిపై కేసు.

కర్నూలు(సెంట్రల్‌): పేదల బియ్యం అక్రమార్కుల పాలిట వరంగా మారింది. ఏ స్థాయిలో దందా చేసుకుంటే అంతటి ఆదాయాన్ని సమకూర్చి పెడుతోంది. గతంలో ఎన్నడూలేని విధంగా రేషన్‌ బియ్యం కోసం మాఫియాలు పుట్టుకొచ్చాయి. నియోజకవర్గాల వారీగా టీడీపీ ప్రజాప్రతినిధుల అనుచరులు ముఠాలుగా ఏర్పడి సొమ్ము చేసుకుంటున్నారు. రాత్రికి రాత్రి రేషన్‌ బియ్యాన్ని జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. ఇందులో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, పోలీసు, ఇతర అధికారులందరికీ మామూళ్లు ముడుతున్నట్లు చర్చ జరుగుతోంది. జిల్లాలో నెలకు దాదాపు రూ.100 కోట్లకుపైగా బియ్యం అక్రమ రవాణా వ్యాపారం సాగుతున్నట్లు తెలుస్తోంది. చాలా చోట్లా నేరుగా ఎండీయూ ఆపరేటర్లే బియ్యాన్ని రూ.10 నుంచి రూ.15 వరకు కొనుగోలు చేస్తున్నారు. కొన్ని చోట్ల డీలర్లు, ఎండీయూ ఆపరేటర్లు కలసి అక్రమాలకు పాల్పడుతున్నారు. మరికొన్ని చోట్ల వినియోగదారుల నుంచే నేరుగా తక్కువ ధరకు కొనుగోలు చేసే గ్యాంగులు ఉండటం గమనార్హం.

కర్నూలులో బరితెగించిన రెండు ముఠాలు

అక్రమ బియ్యం దందా జిల్లా అంతటా సగం ఉంటే.. మిగిలిన సగం జిల్లా కేంద్రంలో నడుస్తోంది. ఇక్కడ ఏకంగా 170 చౌకధరల దుకాణాల పరిధిలో 1,100 టన్నుల బియ్యం కేటాయింపులు ఉంటున్నాయి. దీంతో ఇక్కడ పట్టుకోసం టీజీ, గౌరుల పేర్లు చెప్పుకొని వ్యాపారం చేసే వారు బరితెగించారు. కర్నూలులో 25 గ్యాంగుల వరకు పనిచేస్తున్నాయి. వీరంతా ఇద్దరు వ్యాపారులకు ఇన్నాళ్లూ బియ్యం ఇచ్చేవారు. అయితే కొత్తగా వెలుగోడు కేంద్రంగా ఓ వ్యక్తి చక్రం తిప్పుతున్నాడు. గౌరు అనుచరుడినంటూ చెప్పుకొని అప్పటికే ఉన్న వారిద్దరిని కూడా తనకే బియ్యం అమ్మాలంటూ హుకుం జారీ చేశాడు. అమ్మకుంటే అంతు చూస్తానని హెచ్చరించినట్లు సమాచారం. ఒకానొక సమయంలో దాడులు కూడా చేసినట్లు తెలుస్తోంది. అయితే చివరకు పోలీసులు కలుగజేసుకొని కర్నూలులో వ్యాపారం చేస్తున్న బాషా, శరణయ్యలను వెలుగోడు వ్యక్తికి సహకరించాలని, లేదంటే ఇబ్బందులు పడతారని హెచ్చరించి రాజీ చేసినట్లు చర్చ జరరుగుతోంది. అయినప్పటికీ రెండు వర్గాల మధ్య వార్‌ నడుస్తోందని, ఎప్పుడు ఏమి జరుగుతుందోననే ఆందోళన నెలకొంది.

మిన్నకుండిపోయిన నిఘా వ్యవస్థలు

జిల్లాలో ప్రతి నెలా బియ్యం దందా రూ.100 కోట్ల వరకు జరుగతున్నా పౌరసరఫరా, పోలీసు, విజిలెన్స్‌ నిఘాలకు మాత్రం దొరకని పరిస్థితి. బహిరంగంగా తెలిసినా ఎవరూ తమకు తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారు. పైగా అక్రమ బియ్యం ఎక్కడైనా ఉంటే తమకు చెబితే పట్టుకుంటామని పౌరసరఫరాల అధికారులు చెబుతుండడం గమనార్హం. మరోవైపు విజిలెన్స్‌ ఇన్‌ఫ్మార్మర్లను సైతం పచ్చ మూకలు కనిపెట్టినట్లు తెలుస్తోంది. వారిని దారికి తెచ్చుకోవడం, లేదంటే భయపెట్టే వరకు వెళ్లడంతో ఆ వ్యవస్థ కూడా దిక్కుతోచని స్థితిలో ఉంటోంది. ఇక పోలీసులు చాలా చోట్ల వారికి అన్నీ తెలిసినా ఏమీ అనకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ బియ్యం దందాలో పోలీసులకు పెద్ద ఎత్తున మామూళ్లు అందుతున్నట్లు బహిరంగంగానే చర్చ జరుగుతోంది.

ఇటీవల నమోదైన కొన్ని 6ఏ, క్రిమినల్‌ కేసులు

నియోజకవర్గాల వారీగా ‘పచ్చ’ ముఠాలు

కర్నూలులో దాదాపు 25 గ్యాంగులు బియ్యం దందాలో ఉన్నాయి.

బుధవారపేటకు చెందిన వ్యక్తి, పాతబస్తీకి చెందిన మరో వ్యక్తి ఆయా గ్యాంగుల నుంచి బియ్యాన్ని సేకరిస్తున్నారు.

వీరికి పట్టణం నడిబొడ్డున బుధవారపేట, శరీన్‌నగర్‌, వీకర్‌ సెక్షన్‌కాలనీ, పంచలింగాలలో గోదాములు ఉన్నాయి. అక్కడి నుంచి బియ్యాన్ని జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు.

కాగా, వీరిద్దరూ ఓ మంత్రికి అనుచరులు.

శ్రీశైలం నియోజకవర్గంలోని వెలుగోడుకు చెందిన ఓ వ్యాపారి ఓ ఎమ్మెల్యే భర్త ఆశీస్సులతో శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం, కర్నూలులలో బియ్యం సిండికేట్‌కు తెరలేపారు.

డోన్‌, కోడుమూరు, పత్తికొండలో అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరుడు వెల్దుర్తి కేంద్రంగా బియ్యం అక్రమ రవాణా చేస్తున్నాడు. గతంలో ఆయన ఉమ్మడి జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఆదోనిలో ఓ బీజేపీ నాయకుడు తన కింద 10మందితో బియ్యం దందాను నడిపి కర్ణాటకలోని శిరుగుప్పు, రాయచూరు, బళ్లారి వరకు విస్తరించారు.

ఆలూరు నియోజకవర్గంలో బియ్యం అక్రమ రవాణా వ్యాపారాన్ని గుంతకల్‌కు చెందిన వ్యక్తులు నడిపిస్తున్నారు.

మంత్రాలయం, ఎమ్మిగనూరులో కొంత భాగం వెల్దుర్తి కేంద్రంగా పనిచేసే వ్యాపారి, మిగిలిన భాగాలను కొందరు టీడీపీ నాయకులు కర్ణాటక వ్యాపారులతో కలిసి నిర్వహిస్తున్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
నియోజకవర్గాల వారీగా ముఠాలు 
1
1/2

నియోజకవర్గాల వారీగా ముఠాలు

నియోజకవర్గాల వారీగా ముఠాలు 
2
2/2

నియోజకవర్గాల వారీగా ముఠాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement