![Abdul Karim Tunda acquitted in 1993 serial train blasts case - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/1/Untitled-6.jpg.webp?itok=sjfyv1dU)
జైపూర్: 1993 వరుస బాంబు పేలుళ్ల కేసు నుంచి మాఫియా డాన్, వాంటెడ్ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం సన్నిహితుడు అబ్దుల్ కరీం తుండా(81)కు ప్రత్యేక కోర్టు విముక్తి కల్పించింది. అతడిపై మోపిన అభియోగాలను రుజువు చేసేందుకు అవసరమైన సాక్ష్యాధారాలను ప్రాసిక్యూషన్ చూపలేకపోయిందని కోర్టు పేర్కొంది. తుండాపై ఉన్న అభియోగాలన్నిటినీ కొట్టి వేస్తూ గురువారం అజ్మేర్లోని ఉగ్రవాద, విచ్ఛిన్నకర కార్యకలాపాల నివారణ చట్టం (టాడా) కోర్టు తీర్పు వెలువరించింది.
ఇదే కేసులో రైళ్లలో బాంబులను అమర్చినట్లు ఉన్న ఆరోపణలు రుజువు కావడంతో ఇర్ఫాన్, హమీదుద్దీన్లకు కోర్టు జీవిత ఖైదు విధించింది. బాబ్రీ మసీదు విధ్వంసానికి ఏడాదైన సందర్భంగా 1993 డిసెంబర్ 5, 6 తేదీల్లో లక్నో, కాన్పూర్, హైదరాబాద్, సూరత్, ముంబైల్లోని రైళ్లలో వరుసగా పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనల్లో ఇద్దరు చనిపోగా 22 మంది గాయపడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తుండా బాంబుల తయారీకి సహకరించినట్లు ఆరోపణలున్నాయి. కాగా, హమీదుద్దీన్ 14 ఏళ్లుగా, ఇర్ఫాన్ 17 ఏళ్లుగా జైలు జీవితం గడుపుతున్నారు. బాంబు పేలుళ్లతోపాటు వీరిపై పలు కేసులు నమోదై ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment