
షిల్లాంగ్: ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో బంగ్లాదేశ్ రాజకీయ నాయకుడి మృతదేహం లభించడం తీవ్ర కలకలం సృష్టించింది. భారత సరిహద్దు నుంచి 1.5 కి.మీ దూరంలో తమలపాకు తోటలో అవామీ లీగ్ నాయకుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అనంతరం, అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు.
వివరాల ప్రకారం.. భారతదేశం-బంగ్లాదేశ్ సరిహద్దు నుండి 1.5 కి.మీ దూరంలో ఉన్న ఈస్ట్ జైన్తియా హిల్స్ జిల్లాలో బంగ్లాకు చెందిన అవామీ లీగ్ నాయకుడు ఇషాక్ అలీ ఖాన్ కన్నా మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్బంగా జైన్తియా ఎస్పీ గిరిప్రసాద్ మాట్లాడుతూ.. మృతుడి దగ్గర బంగ్లాదేశ్ పాస్పోర్ట్ దొరికింది. అతడిని బంగ్లాదేశ్లోని ఫిరోజ్పూర్ జిల్లాకు చెందిన అవామీ లీగ్ నాయకుడు ఇషాక్ అలీ ఖాన్ పన్నాగా గుర్తించాము. పోస్టుమార్గం నిమిత్తం అతడిని ఖలీహ్రియత్లోని సివిల్ ఆసుపత్రి తరలించినట్టు తెలిపారు.
ఇక, పోస్టుమార్టం అనంతరం, తదుపరి ప్రక్రియల కోసం డెడ్ బాడీని ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచినట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ ప్రభుత్వం పతనం తర్వాత పన్నా పరారీలో ఉన్నాడు. షేక్ హసీనా ప్రభుత్వంలో పన్నా కీలక వ్యక్తిగా ఉన్నట్టు సమాచారం. అయితే, భారత్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చి ఉంటుంది అధికారులు భావిస్తున్నారు. ఆయన మృతిపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment