
తిరువనంతపురం: కేరళలో కరోనా రెండో దశ విశ్వరూపం చూపిస్తోంది. రాష్ట్రంలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ కట్టడికి కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేరళ రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. ఈనెల 8 నుంచి 16 వరకు లాక్డౌన్ అమలు కానున్నట్లు కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు. రాష్ట్రంలో రోజురోజుకి కరోనా పరిస్థితి ఆందోళనకరంగా మారుతోందని, మహమ్మారి కట్టడికి లాక్డౌన్ తప్పడం లేదని సీఎం పేర్కొన్నారు. అత్యవసర సేవలకు మాత్రమే లాక్డౌన్ నుంచి మినహాయింపు ఉంటుందని ఆయన తెలిపారు.
కాగా కేరళలో బుధవారం ఒక్కరోజే 41,953 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి 23,106 మంది కోలుకోగా... 58 మంది మరణించారు. మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 17,43,932కి చేరింది. వీరిలో 13,62,363 మంది కోలుకున్నారు. కోవిడ్ బారినపడి ఇప్పటి వరకు 5,565 మంది మరణించారు. ప్రస్తుతం 3,76,004 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇక శనివారం నుంచి లాక్డౌన్ అమలు కానుంది.
చదవండి: కరోనా విశ్వరూపం: మరోసారి 4 లక్షలు దాటిన రోజువారీ కేసులు