
ఢిల్లీ: కొత్త చట్టాలను అనుసరించి.. హిట్ అండ్ రన్ కేసుల్లో కఠిన శిక్షలను నిరసిస్తూ ట్రక్కు డ్రైవర్లు ఇటీవల దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో వెనక్కి తగ్గిన కేంద్రం.. నిబంధన ఇంకా అమల్లోకి రాలేదని ట్రాన్స్ పోర్టు సంఘాలతో విస్త్రృత చర్చలు జరిపిన తర్వాతే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. ఈ క్రమంలో ఇప్పుడు ‘హిట్ అండ్ రన్’కు పరిష్కారం.. రవాణాశాఖ(MoRTH.. The Union road transport and highways ministry) కీలక సూచన చేసినట్లు తెలుస్తోంది.
ప్రమాదాలు జరిగిన వెంటనే ఆ విషయాన్ని అధికారులకు తెలియజేసే సాంకేతిక వ్యవస్థను ట్రక్కు డ్రైవర్లు వినియోగించేందుకు అనుమతించాలని సూచించినట్లు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తద్వారా అటువంటి వాటిని ‘హిట్ అండ్ రన్’ కింద పరిగణించకుండా ఉండవచ్చని తెలిపింది. అయితే ఈ అంశం కేంద్ర హోంశాఖ పరిధిలోకి వస్తుందని.. తుది నిర్ణయం ఆ శాఖ తీసుకుంటుందని రవాణాశాఖ పేర్కొంది.
‘ప్రమాదం జరిగిన అనంతరం బాధితులకు సహాయం చేసేందుకు అక్కడే ఉంటే స్థానికులు వారిపై దాడి చేసే ప్రమాదం ఉందని ట్రక్కు డ్రైవర్లు భావిస్తున్నారు. దీనికి పరిష్కారంగా మనం సాంకేతికతను ఉపయోగించుకోవచ్చు. ప్రమాదం జరిగిన వెంటనే ఆ విషయాన్ని అధికారులకు తెలియజేసేందుకు డ్రైవర్లు సాంకేతికత వాడుకోవచ్చు. ఆ తర్వాత ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి 25-50 కి.మీ పరిధిలో ఉన్న పోలీసులకు ఆ విషయాన్ని తెలియజేయవచ్చు. అటువంటి దాన్ని ‘హిట్ అండ్ రన్’ కేసుగా పరిగణనలోకి తీసుకోకుండా ఉండవచ్చు’ అని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర హోంశాఖకు సూచించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment