
తిరువనంతపురం: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కేరళలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ప్రారంభించారు. వాతావరణ మార్పుపై పోరాటంలో భాగంగా భారత్ సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రాముఖ్యతనిస్తోందని వ్యాఖ్యానించారు. రైతులను కూడా ఈ సౌర విద్యుదుత్పత్తి రంగంలో భాగస్వామ్యులను చేయనున్నామన్నారు. రానున్న ఆరేళ్లలో దేశ సౌర విద్యుత్ సామర్థ్ధ్యం 13 రెట్లు పెరగనుందని వెల్లడించారు. 320 కేవీ పుగలుర్(తమిళనాడు)– త్రిస్సూర్(కేరళ) పవర్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్టును ప్రధాని జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టుకు రూ. 5,070 కోట్లు వ్యయం అయింది. సుపరిపాలనకు, అభివృద్ధికి కులం, వర్గం, జాతి, లింగం, మతం, భాషతో సంబంధం లేదని ప్రముఖ మలయాళ కవి కుమరనాసన్ రాసిన ‘నీ కులమేంటని అడగడం లేదు సోదరీ.. నాకు దాహంగా ఉంది. నీళ్లు మాత్రమే అడుగుతున్నాను’ అన్న కవిత పంక్తిని ఉటంకిస్తూ వ్యాఖ్యానించారు.
విజన్ డాక్యుమెంట్ రూపొందించండి
స్థానిక రైతులు, కళాకారులు ప్రపంచ మార్కెట్లను చేరుకునేందుకు వీలుగా సహకారం అందించాలని విశ్వభారతి విద్యార్థులను ప్రధాని మోదీ అభ్యర్థించారు. విశ్వభారతి యూనివర్సిటీ స్నాతకోత్సవంలో శుక్రవారం ప్రధాని ఆన్లైన్ విధానంలో పాల్గొని, ప్రసంగించారు. రానున్న 25 ఏళ్లలో అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టను పెంచేందుకు విద్యాసంస్థలు చేపట్టాల్సిన చర్యలపై 25 అంశాలతో విజన్ డాక్యుమెంట్ను రూపొందించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment