
జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పోలింగ్ ఏజెంట్ మృతి చెందాడు. పాలి జిల్లాలో ఓ అభ్యర్థికి సంబంధించిన పోలింగ్ ఏజెంట్ శనివారం ఉదయం పోలింగ్ జరుగుతుండగా కుప్పకూలిపోయాడు.
సుమేర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని బూత్ నంబర్ 47లో శాంతిలాల్ అనే పోలింగ్ ఏజెంట్ కుప్పకూలినట్లు పోలింగ్ అధికారి తెలిపారు. వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
పోలింగ్ ఏజెంట్ మృతికి గుండెపోటు కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే మృతి చెందిన పోలింగ్ ఏజెంట్ పార్టీకి సంబంధించినవారు అనే వివరాలు వెంటనే తెలియరాలేదు. కాగా రాజస్థాన్లో 200 అసెంబ్లీ స్థానాలు ఉండగా 199 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగున్నాయి. కరణ్పూర్ నియోజకవర్గంలో ఓ అభ్యర్థి మృతి చెందడంతో అక్కడ పోలింగ్ వాయిదా పడింది.