సైఫ్‌పై దాడి.. నిందితుడు బంగ్లాదేశీ: ముంబై పోలీసులు | Saif Ali Khan attack case: Police suspect accused to be Bangladeshi national | Sakshi
Sakshi News home page

సైఫ్‌పై దాడి.. నిందితుడు బంగ్లాదేశీ: ముంబై పోలీసులు

Published Sun, Jan 19 2025 10:09 AM | Last Updated on Sun, Jan 19 2025 1:10 PM

Saif Ali Khan attack case: Police suspect accused to be Bangladeshi national

ముంబై: బాలీవుడ్‌ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడికి పాల్పడింది బంగ్లాదేశీయుడని ముంబై పోలీసులు అధికారికంగా ప్రకటించారు. గత అర్ధరాత్రి నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే నిందితుడి పేరు విజయ్‌ దాస్‌ అని ముందుగా ప్రచారం జరిగింది. దీంతో ఈ ఉదయం మీడియా సమావేశం నిర్వహించిన ముంబై డీసీపీ జోన్ 9 దీక్షిత్ గెడం పూర్తి వివరాలు వెల్లడించారు. 

నిందితుడి పేరు మహ్మద్ షరీఫుల్ షెహజాద్‌. విజయ్‌ దాస్‌గా అందరికీ తన పేరును చెప్పుకుంటున్నాడు. ఆరు నెలల కిందట నకిలీ పత్రాలతో బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా భారత్‌లోకి చొరబడ్డాడు. నగరంలో మారు పేర్లతో తిరుగుతూ చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాడు. కొన్నాళ్లుగా నగరంలోని ఓ బార్‌లో వెయిటర్‌గా పని చేస్తున్నాడు. దొంగతనం కోసమే నటుడు సైఫ్‌ అలీఖాన్‌ ఇంట్లోకి చొరబడ్డాడు. ఇందుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలను స్వాధీనం చేసుకున్నాం. 

కొన్ని రోజుల పాటు ఓ హౌస్ కీపింగ్ ఏజెన్సీలో పని చేశాడు. ఆ టైంలోనే సైఫ్‌ ఇంటికి వెళ్లినట్లు అనుమానాలున్నాయి. ప్రస్తుతం ఖర్ పోలీస్ స్టేషన్‌లో అతని విచారణ జరుగుతోందని తెలిపారాయన. కాగా.. సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసిన నిందితుడిని ముంబై పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. థానే కాసర్వదవల్లి ఎస్టేట్‌లోని మెట్రో నిర్మాణ స్థలంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు. 

‘‘జనవరి 16వ తేదీ తెల్లవారుజామున 2 గంటలకు సైఫ్‌ అలీఖాన్‌పై దాడి జరిగింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశాం. 30 ఏళ్ల మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ అనే వ్యక్తిని నిందితుడిగా గుర్తించాం. అతడిని నిన్న(శనివారం) అరెస్ట్‌ చేశాం. దొంగతనం చేయాలనే ఉద్దేశంతో అతడు సైఫ్‌ నివాసంలోకి వెళ్లాడు. అతడిని న్యాయస్థానం ఎదుట హాజరు పరిచి కస్టడీ కోరుతాం. దీనికి సంబంధించిన తదుపరి విచారణ చేపడతాం. ప్రాథమిక విచారణలో అతడిని బంగ్లాదేశీయుడిగా గుర్తించాం. నిందితుడు అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించాడు. భారత్‌ వచ్చాక విజయ్‌ దాస్‌గా పేరు మార్చుకున్నాడు. ఆరు నెలల క్రితం ముంబయి వచ్చాడు. భారతీయుడని చెప్పడానికి అతడి వద్ద సరైన ఆధారాలు లేవు’’ అని తెలిపారు.

ఇదిలా ఉంటే.. బాంద్రాలోని సైఫ్‌ నివాసంలో గురువారం (జనవరి 16) తెల్లవారుజామున 2.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. సైఫ్, అతడి కుటుంబసభ్యులు నిద్రలో ఉండగా.. దుండగుడు సైఫ్‌ చిన్న కుమారుడు జేహ్‌ గదిలోకి వెళ్లాడు. దుండగుడిని చూసిన జేహ్‌ కేర్‌టేకర్‌ కేకలు వేయగా సైఫ్‌ అక్కడికి చేరుకొన్న సమయంలో పెనుగులాట జరిగింది. ఈక్రమంలో సైఫ్‌ గాయపడ్డారు. ఆరుచోట్ల కత్తి గాయాలయ్యాయి. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ని హుటాహుటిన లీలావతి ఆస్పత్రికి తరలించారు. శస్త్రచికిత్స అనంతరం ఆయన క్షేమంగా ఉన్నారని వైద్యులు ప్రకటన విడుదల చేశారు. ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మార్చారు. ప్రస్తుతం సైఫ్‌ లీలావతి ఆస్పత్రిలోనే ఉన్నారు. దాడి ఘటనపై కేసు నమోదు చేసుకున్న ముంబయి పోలీసులు దాదాపు 20 బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపులు చేపట్టారు. దాదాపు మూడు రోజుల తర్వాత అతడిని అరెస్ట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement