శాటిలైట్‌ స్టేషన్‌గా రాయనపాడు | - | Sakshi
Sakshi News home page

శాటిలైట్‌ స్టేషన్‌గా రాయనపాడు

Published Sat, Mar 8 2025 2:25 AM | Last Updated on Sat, Mar 8 2025 2:21 AM

శాటిల

శాటిలైట్‌ స్టేషన్‌గా రాయనపాడు

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లోని రాయనపాడు రైల్వే స్టేషన్‌కు మహర్దశ పట్టనుంది. ఎన్‌ఎస్‌జీ–5 కేటగిరీ కలిగిన ఈ రైల్వే స్టేషన్‌ దక్షిణ తీర ప్రాంతంలో అత్యంత రద్దీగా ఉండే చైన్నె – బల్హార్షా – నాగ్‌పూర్‌ – న్యూఢిల్లీ లైన్‌లోని గ్రాండ్‌ ట్రంక్‌ మార్గంలో ఉంది. నిత్యం 250 రైళ్లు, 1.40 లక్షల మంది ప్రయాణికులతో విజయవాడ రైల్వేస్టేషన్‌లో అధిక రద్దీ నెలకుంటుండటంతో దీనికి ప్రత్యామ్నాయంగా రాయన పాడు రైల్వే స్టేషన్‌ను శాటిలైట్‌ స్టేషన్‌గా ఆధునీకరించేందుకు రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు కొన్ని సాధారణ రైళ్లు మాత్రమే ఆగే ఈ స్టేషన్‌లో భవిష్యత్తులో అన్ని ప్రధాన రైళ్లు కూడా ఆగనున్నాయి. ముఖ్యంగా నాగ్‌పూర్‌, సికింద్రాబాద్‌ మార్గం నుంచి వరంగల్‌ మీదుగా విశాఖపట్నం, భువనేశ్వర్‌, కోల్‌కతా వైపు వెళ్లే అనేక రైళ్లు విజయవాడ రైల్వే స్టేషన్‌కు వెళ్లకుండా రాయనపాడు మీదుగా దారి మళ్లించనున్నారు. దీంతో విజయవాడ ప్రధాన స్టేషన్‌పై చాలావరకు వత్తిడి తగ్గుతుంది. ఈ కారణంగానే రాయనపాడు రైల్వే స్టేషన్‌ను విజయవాడ బైపాస్‌ స్టేషన్‌ అని కూడ పిలుస్తున్నారు.

శాటిలైట్‌ స్టేషన్‌గా వేగంగా పనులు...

అమృత్‌ భారత్‌ స్టేషన్‌ స్కీం (ఏబీఎస్‌ఎస్‌) పథకంలో భాగంగా విజయవాడ ప్రధాన రైల్వే స్టేషన్‌కు ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు రాయనపాడు రైల్వే స్టేషన్‌ను శాటిలైట్‌ స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక మౌలిక సదుపాయాలతో అభివృద్ధి పర్చేందుకు రైల్వేశాఖ రూ.12.13 కోట్లతో స్టేషన్‌ పునరాభివృద్ధి పనులు చేపట్టింది. గత ఏడాది ఫిబ్రవరిలో స్టేషన్‌ పునరాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేయగా ఇప్పటి వరకు 58 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది చివరి కల్లా మిగిలిన పనులను కూడ పూర్తిచేసే దిశగా అధికారులు పనులను వేగవంతం చేశారు.

రూ.12.13 కోట్లతో స్టేషన్‌ ఆధునికీకరణ పనులు అంతర్జాతీయ ప్రమాణాలతో బహుళ అంతస్తుల నిర్మాణం

అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేషన్‌ ఆధునికీకరణ పనులు...

అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకంలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఆంధ్రప్రదేశ్‌లో 53 స్టేషన్‌లలో పునరాభివృద్ధి పనులకు రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే విజయవాడ డివిజన్‌లో 22 స్టేషన్‌లు ఈ పథకానికి ఎంపిక చేయగా అందులో రాయపాడు స్టేషన్‌ ఒకటి. ఈ ప్రాజెక్ట్‌లో స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఆధునిక బహుళ అంతస్తుల స్టేషన్‌ భవన నిర్మాణాలు, పరిసర ప్రాంతాలలో గ్రీనరీ, ఏసీ, నాన్‌ ఏసీ వెయిటింగ్‌ హాల్స్‌, ప్లాట్‌ఫాంల పొడిగింపు, ఎస్కలేటర్లు, లిఫ్ట్‌ల ఏర్పాటు, ఫుట్‌ బ్రిడ్జి నిర్మాణాలు, రిజర్వేషన్‌ కౌంటర్‌లు, ముఖ్యంగా దివ్యాంగ ప్రయాణికుల కోసం ప్రత్యేక ర్యాంపు మార్గాలు, మాడ్యులర్‌ టాయిలెట్‌ల నిర్మాణాలు చేపట్టనున్నారు. పనులను వేగవంతంగా చేపట్టామని, ఇప్పటివరకు 58 శాతం భౌతిక పనులు పూర్తయ్యాయని, ఈ ఏడాది చివరి నాటికి మొత్తం ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా పనులు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
శాటిలైట్‌ స్టేషన్‌గా రాయనపాడు1
1/1

శాటిలైట్‌ స్టేషన్‌గా రాయనపాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement