
సాక్షి, అమరావతి: చంద్రబాబు కోసమే పుట్టిన పార్టీ జనసేన అని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. సున్నా సున్నా కలిసినా, హెచ్చించినా సున్నానే అవుతుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాత కలయికకు రాజమండ్రిలో కొత్త రూపువచ్చిందన్నారు. ఇప్పుడు వీరిద్దరూ కొత్తగా కలిసినట్లు మాట్లాడుతున్నారని.. అసలు వాస్తవానికి వీరిద్దరూ ఎప్పుడు విడిపోయారని ప్రశ్నించారు. ప్రజల సమస్యలపై చర్చించామంటారని, చంద్రబాబు అరెస్టు తర్వాత మాత్రమే సమస్యలు గుర్తొచ్చాయా అని నిలదీశారు.
ఇలాంటి కలయికను ప్రజలు హర్షించరని స్పష్టం చేశారు. టీడీపీకి ఏదైనా నష్టం జరుగుతుందనుకుంటే వెంటనే కాపాడటానికి పవన్ వస్తారని మండిపడ్డారు. చంద్రబాబుకు మనోధైర్యం ఇవ్వడం కోసమే తప్ప రెండు పార్టీలు రాజమండ్రి భేటీలో ప్రజల కోసం ఏమీ చర్చించలేదన్నారు. రాష్ట్రానికి తెలుగుదేశం తెగులు పట్టుకుని చాలా సంవత్సరాలైందన్నారు. ఆ తెగులును కాపాడటానికి పవన్ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ఆ తెగులుకు త్వరలో అంతిమ సంస్కారం జరగబోతుందన్నారు. లోపల చంద్రబాబు ఊసలు లెక్కేసుకోవడం, బయట ఉన్న పుత్రుడు, దత్తపుత్రుడు రోజులు లెక్కేసుకోవడం ఇదే తంతు నడుస్తోందని ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం అంబటి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
చంద్రబాబు పల్లకీ మోయడానికే..
పవన్ను టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, యనమల వంటివారు స్వాగతిస్తుంటే లోకేశ్ ముఖం మాడిపోయింది. నూటికి నూరుపాళ్లు టీడీపీ బలహీనపడిందని పవన్ ఎప్పుడో చెప్పారు. దాన్ని బలోపేతం చేయడం కోసమే ఇప్పుడు టీడీపీ నేతలను కలిశానని ఆయన స్పష్టంగా చెప్పారు. మీరంతా కలిసే వస్తారని మేం మొదటి రోజు నుంచి చెబుతూనే ఉన్నాం. పవన్కు సొంత ఆలోచన లేదు. జనసేన కార్యకర్తలతో చంద్రబాబు పల్లకీ మోయించడమే పవన్ లక్ష్యం.
బాబుకు బెయిల్ ఇవ్వాలా, వద్దా అనేది న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. దానికి సీఎం వైఎస్ జగన్పై ఏడవడం దేనికి? కాపు రిజర్వేషన్ల పోరాటంలో చంద్రబాబు అరెస్టులు చేయిస్తే అవి అక్రమం కాదా? ఆయనను అరెస్ట్ చేస్తే మాత్రం అక్రమమా?
పవన్, లోకేశ్ భేటీ అట్టర్ ఫ్లాప్..
టీడీపీ ఇచ్చిన దిష్టిబొమ్మల దహనం పిలుపు, రాజమండ్రిలో పుత్రుడు, దత్తపుత్రుడు భేటీ అట్టర్ ఫ్లాప్. తానేమీ వైఎస్సార్సీపీకి వ్యతిరేకం కాదు.. వారి విధానాలకే వ్యతిరేకమని పవన్ అంటున్నారు. మరి మేం మాత్రం ఆయనకు వ్యతిరేకమా? పవన్కు, మాకూ ఏమన్నా తగాదా ఉందా? అసలు ఆయన విధానం ఏంటి? 2014లో టీడీపీతో కలిసి ముందుకు వెళ్లారు.. 2019లో టీడీపీతో కాకుండా విడిగా పోటీ చేశారు.. ఇప్పుడు మళ్లీ కలిసి పోటీ చేస్తున్నారు.. అందుకే పవన్ను ప్యాకేజీ స్టార్ అంటున్నాం.
ఏ తప్పూ లేకుండా 42 రోజులు జైల్లో పెడతారా?
చంద్రబాబు తన లేఖలో ‘నేను జైల్లో లేను..ప్రజల గుండెల్లో ఉన్నా’ అని అంటున్నారు. ఆయన అరెస్ట్ వార్త విని 154 మంది మరణించారనేది ఎంత నిజమో.. ప్రజల గుండెల్లో ఉన్నారనేది కూడా అంతే నిజం. ఈ దేశంలో ఏ తప్పూ లేకుండా 42 రోజులు జైల్లో పెట్టడం సాధ్యమా? బాబు బయట ఉండగానే ఆయన పీఏ శ్రీనివాస్ దేశం దాటిపోయాడు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దేశంలోనే బాబు నంబర్వన్.
ఇక లోకేశ్, అమిత్షా కలయిక విషయంలో లోకేశ్ బండారమంతా కిషన్ రెడ్డి బయటపెట్టారు. లోకేశ్ను అమిత్షా రమ్మనలేదని.. ప్రాధేయపడితే తానే లోకేశ్కు అపాయింట్మెంట్ ఇప్పించానని చెప్పారు. ప్రగల్భాలు పలకడం దేనికి.. అభాసుపాలవ్వడం దేనికి లోకేశ్? పురందేశ్వరి మాత్రం తేలు కుట్టిన దొంగలా మాట్లాడటం లేదు.