ఛూ మంతర్‌.. ఒక చంద్రబాబు.. వెయ్యి అబద్దాలు | Analysts Criticises Chandrababu Naidu Manifesto As Full Of Lies, Details Inside - Sakshi
Sakshi News home page

ఛూ మంతర్‌.. ఒక చంద్రబాబు.. వెయ్యి అబద్దాలు

Published Thu, Mar 7 2024 1:42 PM | Last Updated on Fri, Mar 8 2024 1:56 PM

Analysts criticises Babu manifesto as full of lies - Sakshi

నవ్విపోదురుగాక నాకేటీ సిగ్గు

అడ్డగోలు హామీలతో మరోసారి వచ్చిన బాబు

ఎన్నికల ముందు మాయ మాటలు, ఆ తర్వాత అంతా భ్రమే

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 'హామీల అనుభవాలు' ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సుపరిచితమే. చంద్రబాబు మాట నీటి మూట. ఆంధ్రప్రదేశ్‌లో ఈ నానుడి బాగా ఫేమస్. చంద్రబాబు మాటలనే కాదు.. ఆయనను కూడా ప్రజలు నమ్మడం లేదు. 'జయహో బీసీ' పేరుతో టీడీపీ - జనసేన సంయుక్తంగా సభ నిర్వహించాయి.  2014లో అధికారంలోకి రావడానికి చంద్రబాబు 600లకు పైగా హామీలిచ్చారు. ఒక్క హామీనైనా 100 శాతం అమలు చేశారా..? అమలు చేస్తే చంద్రబాబు మేనిఫెస్టో దాచి పెట్టే పరిస్థితి, టీడీపీ అధికార వెబ్ సైట్ నుంచి తొలగించి పరిస్థితి ఎందుకు వచ్చిందో చంద్రబాబు సమాధానం చెప్పగలరా..? . "చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నాది పూచి" అన్న పవన్ కల్యాణ్ ఏనాడైనా చంద్రబాబును ప్రశ్నించారా...? ఈ రోజున ఈ ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్‌ ప్రజల నుంచి వస్తున్నవే. ఈ ప్రశ్నలకు చంద్రబాబు, పవన్‌లు సమాధానం చెప్పి బీసీ డిక్లరేషన్ విడుదల చేస్తే బాగుండేది.

"బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు జడ్జీలుగా పనికిరారు.. వారి తెలివి ఉండదని" కేంద్రానికి లేఖలు రాసిన చంద్రబాబు బడుగులకు న్యాయం చేస్తానని సభ నిర్వహిస్తే ప్రజలు నమ్ముతారా...? తమకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని సచివాలయానికి వచ్చిన నాయీ బ్రాహ్మణులు వస్తే "మీ తోకలు కత్తిరిస్తా" అని వేలు చూపిస్తూ బెదిరించింది చంద్రబాబు కాదా..? "సార్ మేం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నాం ఆదుకోండి" అని మత్స్యకారులంటే "ఏయ్.. నోరు మూసుకో తోలు తీస్తా" అని బెదిరించింది చంద్రబాబు కాదా...?. బీసీల పిల్లలు పెద్ద చదువులు చదవడానికి తోడ్పాటు ఇవ్వకుండా ఇస్త్రీ పెట్టెలు, మోకులు, కత్తెరులు ఇచ్చింది చంద్రబాబు కాదా..? ప్రపంచానికి పాఠాలు చెప్పానని చెప్పుకునే, తన అనుకూల మీడియాలో చెప్పించుకునే చంద్రబాబు ఇస్త్రీ పెట్టెలు, కత్తిరెలు ఇవ్వడం ఏంటనీ సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు.  వైఎస్ఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాకనే బీసీ పిల్లలు ఉన్నత చదువులు చదివి, విమానాల్లో వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారని బీసీ మేధావులు గుర్తు చేస్తున్నారు.

ఒకసారి తెలుగుదేశం పార్టీలో పరిస్థితి చూస్తే.. ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ అధ్యక్షుడైన అచ్చెన్నాయుడిని ఏనాడైనా నారా లోకేష్ గౌరవించాడా...?. టీడీపీ కీలక నిర్ణయాల్లో అచ్చెన్నాయుడి భాగస్వామ్యం ఉందా...? టీడీపీ వ్యూహాత్మక భేటీల్లో బీసీ నేత అయిన అచ్చెన్నాయుడి ఆలోచనలు పరిగణనలోకి తీసుకుంటున్నారా..? గుండె మీద చేయి వేసుకుని ఆత్మ సాక్షిగా  అచ్చెన్నాయుడే ఈ ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పగలరా..?

బీసీల డీఎన్‌ఏలోనే టీడీపీ ఉందని బాబు అంటున్నారు. బీసీల డీఎన్‌ఏలో టీడీపీ ఉంటే 23 సీట్లు ఇచ్చి మూలన ఎందుకు కూర్చోబెడతారు..? కుప్పం నియోజకవర్గంలో 30 వేలకే మీ మెజార్టీ ఎందుకు తగ్గిపోయింది..? బీసీల సీటు మంగళగిరిలో నారా లోకేష్ ఘోరంగా ఎందుకు ఓడిపోయారు..? ఈ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పగలరా..?  అధికారంలోకి వస్తే పింఛన్ రూ.4 వేలు చేస్తానని బాబు చెబుతున్నారు.

2014-19 మధ్య చంద్రబాబు హయాంలో 40 లక్షల మందికి మాత్రమే పింఛన్లు ఇచ్చేవారు. బాబు  హయాంలో నెలవారీ పింఛన్ బడ్జెట్ కేవలం రూ.400 కోట్లు. వైఎస్ జగన్ పాలనలో 65 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నారు. ఈ జనవరి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పింఛన్ రూ.3 వేలకు పెంచారు. సీఎం జగన్ పాలనలో నెలవారీ పింఛన్ బడ్జెట్ రూ.2 వేల కోట్లు. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఎలా ఉందంటే.. చంద్రబాబు రూ.4 వేల పింఛన్ కాదు రూ.5 వేలు ఇస్తానన్నా ఆయనను నమ్మే పరిస్థితి లేదు. చంద్రబాబు హయాంలో  పింఛన్ తీసుకోవాలంటే నడుచుకుంటూ వెళ్లాలి.. గంటలు కొద్దీ వెయిట్ చేయాలి..లైన్‌లో నుంచోలేక పండుటాకులు ప్రాణాలు వదిలిన సందర్భాలు అనేకం. కానీ.. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనలో ఫస్ట్ తేదీ వచ్చిందంటే చాలు వలంటీర్‌ వచ్చి చేతిలో పింఛన్ డబ్బులు పెట్టి వెళ్తున్నారు. ఈ తేడాను ప్రజలు గమనిస్తున్నారు. కళ్లతో చూస్తున్నారు.

విచిత్రం ఏమంటే.. కర్ణాటక, తెలంగాణ మేనిఫెస్టోలు కాపీ కొట్టడమే కాదు.. చివరికు వైఎస్ఆర్ సీపీ నినాదాలు కూడా చంద్రబాబు కాపీ కొడుతున్నారు. "బీసీలు బ్యాక్‌ వర్డ్ క్లాసెస్ కాదు.. బ్యాక్‌ బోన్‌ క్లాసెస్‌" అని మొదట నినదించింది వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. చివరకు ఈ నినాదాన్ని కూడా బాబు బ్యాచ్ కాపీ కొట్టడంపై జనాలు నవ్వుకుంటున్నారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్‌ సీపీ ఏలూరులో బీసీ గర్జన సభ నిర్వహించింది. ఈ సభలో ఇచ్చిన హామీల కంటే 58 నెలల పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎక్కువగానే చేశారు. డీబీటీ - నాన్ డీబీటీ కింద వైఎస్ఆర్‌ సీపీ ప్రభుత్వం రూ.1.71 లక్షల కోట్లు బీసీలకు లబ్ధి చేకూర్చింది. సంక్షేమ పథకాల్లో సింహభాగం బీసీ లబ్ధిదారులే. 2014లో ఏడాదికి రూ.10 వేల కోట్లు చొప్పున ఏడాదికి రూ.50 వేల కోట్లు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ ఐదేళ్లలో వాస్తవానికి ఆయన ఇచ్చింది కేవలం రూ.19 వేల కోట్లు.

2014 ఎన్నికల్లో రూ.87,612 కోట్ల రైతు రుణాలను బేషరతుగా మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కోటయ్య కమిటీ వేసి కోతలు, వాతలు పెట్టారు. బేషరతుగా రైతు రుణాలు మాఫీ చేస్తానన్న చంద్రబాబు రూ.15 వేల కోట్ల రుణాలు మాత్రమే మాఫీ చేసి అన్నదాతలకు ఇచ్చిన మాట తప్పారు. అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానన్నారు.. ఈ రుణాలు కూడా మాఫీ చేయకపోవడంతో ఆ రుణాలు వడ్డీలతో కలుపుకుని రూ.25 వేల కోట్లు అయ్యాయి. 2019లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్‌ఆర్‌ ఆసరా పేరుతో చంద్రబాబు ఎగ్గొట్టిన డ్వాక్రా రుణాలను చెల్లిస్తున్నారు. డ్వాక్రా రుణాల చెల్లింపు సాధ్యం కాదని ఆనాటి మంత్రి పరిటాల సునీత ద్వారా  అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు చెప్పారు. అంటే.. ప్రజాక్షేత్రంలో ఇచ్చిన మాటను అసెంబ్లీ సాక్షిగా తప్పారు చంద్రబాబు.

చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా బీసీలే కాదు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు.  చంద్రబాబు విశ్వసనీయతలేని నాయకుడిగా గుర్తింపు పొందారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విశ్వసనీయత ఉన్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఈ తేడానే 2024 ఎన్నికల్లో నిజమైన ఫలితాన్ని ప్రజల ముందుంచనుంది.

- YV రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement