
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే వైఎస్సార్సీపీ ప్రభుత్వ లక్ష్యమని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. రాష్ట్రంలో తప్పకుండా మూడు రాజధానులు ఏర్పాటు చేసి.. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
మేనిఫెస్టోలో ఇచ్చిన 94.5 శాతం హామీలను సీఎం వైఎస్ జగన్ నెరవేర్చారని పేర్కొన్నారు. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. 2 ఏళ్ల పాలనపై సీఎం జగన్ విడుదల చేసిన బుక్లెట్ను ప్రతి లబ్ధిదారుడికి పంపిస్తామని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధిని ప్రభుత్వం రెండు కళ్లుగా భావిస్తోందన్నారు. ప్రజలు కూడా తమ ఆశీస్సులను సీఎం జగన్కు సంపూర్ణంగా అందించాలని కోరారు. టీడీపీ నేత నారా లోకేష్ ఆరోపణలన్నీ పిచ్చి మాటలని.. సీఎం జగన్ ఇచ్చిన మాట ఏది తప్పారో నిరూపించాలని లోకేష్కు బొత్స సవాల్ విసిరారు.