దగాకోరు చంద్రబాబుతో తస్మాత్‌ జాగ్రత్త: పేర్ని నాని | Sakshi
Sakshi News home page

దగాకోరు చంద్రబాబుతో తస్మాత్‌ జాగ్రత్త: పేర్ని నాని

Published Thu, May 2 2024 6:54 PM

Ex Minister Perni Nani Fires On Chandrababu

సాక్షి, కృష్ణా జిల్లా: చంద్రబాబు చెప్పేవన్నీ మాయ మాటలేనని.. కూటమి మేనిఫెస్టోలో మోదీ ఫొటో మాయమైందని మాజీమంత్రి పేర్ని నాని మండిపడ్డారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సీఎం జగన్‌ జనం గుండెల్లో గూడు కట్టుకున్నారన్నారు.

‘‘జగన్‌ను కూలదోయడానికి కూటమి జట్టు కట్టుకట్టారు. మాయ మాటలతో ప్రజలను మోసం చేసేందుకు పక్కా ప్రణాళికతో వస్తున్నారు. చంద్రబాబు ముగ్గురు ఫోటోలతో కూటమి అని బయల్దేరాడు. మేనిఫెస్టో నాటికి మూడు ఫోటోలు కాస్తా రెండు ఫోటోలయ్యాయి. సూపర్ 6 అంటూ ఇంటింటికీ పాంప్లెట్లు పంచారు. ఇప్పుడేమో మేనిఫెస్టోకు బీజేపీ ఆర్ధిక అనుమతులు లేవంటున్నాడు. చంద్రబాబు ఇచ్చిన ప్రకటనల్లో ఇప్పుడు పవన్ ఫోటో మాయం చేశాడు. చంద్రబాబు మేనిఫెస్టోలో ఫోటోలతో పాటు హామీలు కూడా ఒక్కొక్కటి మాయమవుతున్నాయి. నాలుగు వేల పెన్షన్ అంటూ ఇంటింటికీ తిరిగి ఊదరగొట్టారు. ఇప్పుడు సూపర్ సిక్స్ నుంచి చివరి పేజీలోకి పోయింది. ఈ రోజు ఇచ్చిన ప్రకటనలో అసలు పెన్షనే లేకుండా ఎత్తేశారు’’ అని పేర్ని నాని ఎద్దేవా చేశారు.

పేర్ని నాని మీడియాతో ఇంకా ఏం మాట్లాడారంటే:

నిన్న మోదీ..నేడు పవన్‌ కల్యాణ్‌ ఫోటోలు మాయం:
⇒చంద్రబాబు, మోదీ, పవన్‌ కల్యాణ్‌లు ఈ రాష్ట్రాన్ని ఉద్దరిస్తామని కూటమిగా ఏర్పడ్డారు. 
⇒సీఎం జగన్‌ లాంటి జనం గుండెల్లో గూడు కట్టుకున్న ప్రజా నాయకుడి​ని కూలదోయాలనే కుట్రతో ముగ్గురూ కలిశారు 
⇒వారు జట్టు కట్టి మాయ మాటలతో ప్రజల్ని వంచించాలని పక్కా ప్రణాళికతో వస్తున్నారు
⇒బీజేపీతో నేను కలిశానంటే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే అని చంద్రబాబు అంటారు
⇒జగన్‌ను కూలదోయడం కోసం పవన్‌ కల్యాణ్‌తో కలిశానని చెప్తున్నాడు
⇒ముగ్గురు ఫోటోలతో బయలుదేరిన ఆయన మేనిఫెస్టో విడుదలలో మూడు ఫోటోలు రెండు ఫోటోలు అయ్యాయి
⇒మోదీ మాయమయ్యాడు. చంద్రబాబు, పవన్‌ కల్యాణే మిగిలారు
⇒ముందు సూపర్‌ సిక్స్‌ అని చంద్రబాబు, వవన్, మోదీ ఫోటోలతో ఇంటింటికీ పాంప్లెట్‌ ఇచ్చారు
⇒మేనిఫెస్టోలో మోదీ ఫోటో మాయమైంది. ఎందుకయ్యా అంటే మా మేనిఫెస్టోకి బీజేపీ ఆర్థిక పరమైన ఒత్తాసు లేదని చెప్తున్నారు
⇒ఈ మేనిఫెస్టో అమలు చేయాలంటే రెండు లక్షల కోట్ల వరకూ కావాలి. .అంత మోసం మేం చేయలేం అని బీజేపీ తప్పుకుంది
⇒ఈ రోజు చంద్రబాబు రాష్ట్రంలోని పత్రికలన్నిటికీ కోట్లు ఖర్చు పెట్టి ప్రకటనలు ఇచ్చుకున్నాడు
⇒సరే పాపపు సొమ్ము ఉంది కాబట్టి ప్రకటనలు ఇచ్చుకుంటాడు. ఈ ప్రకటనలో పవన్‌ కల్యాణ్‌ మాయం
⇒ముందు ముగ్గురం అన్నాడు.. మేనిఫెస్టోలో మోదీ మాయమయ్యాడు. ఎన్నికల దగ్గరయ్యే కొద్దీ పవన్‌ కల్యాణ్‌ కూడా మాయం

ఫోటోలే కాదు.. ఆయనిచ్చిన హామీలు మాయం:
⇒ఫోటోలే కాదు..చంద్రబాబు ఇచ్చిన హామీలు కూడా మాయమై పోతున్నాయి. 
⇒ఇంటింటికీ సూపర్‌ సిక్స్‌ పేరుతో ఊదరగొట్టారు. డబ్బా కబుర్లు చెప్పారు. 
⇒ఈ రోజు ఇచ్చిన ప్రకటనలో వారి సూపర్‌ సిక్స్‌లో నాలుగు వేల పింఛన్‌ ఎత్తేశారు.
⇒రూ.4వేలు పింఛన్‌ అని ముందు ఊదరగొట్టారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గరయ్యే కొద్దీ దాన్ని కనిపించకుండా చేస్తున్నాడు.
⇒మేనిఫెస్టోలో నాలుగు వేల పింఛన్‌ చివరి పేజీకి వెళ్లిపోయింది. ఈ రోజు అసలు కనిపంచనే లేదు.
⇒ఇవాళ అప్పుడే చంద్రబాబు దగాకోరుతనం, మోసం మొదలైపోయింది.
⇒ఇంతకు ముందు చంద్రబాబు ఓట్లు వేయించుకున్న తర్వాత మోసం మొదలు పెట్టేవాడు. 
⇒ కానీ ఇప్పుడు ఇంకా పోలింగ్‌ కాకముందే మోసం మొదలుపెట్టాడు.
⇒1994లో ఎన్టీఆర్‌ రెండు రూపాయలకే కిలో బియ్యం, 50 రూపాయలకే హార్స్‌పవర్‌ విద్యుత్, మద్యపాన నిషేదం అని చెప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
⇒1995లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఎగిరి ఆ కుర్చీలో కూర్చున్న చంద్రబాబు రెండు రూపాయల కిలో బియ్యాన్ని వెంటనే ఐదున్నర రూపాయలు చేశాడు.
⇒వ్యవసాయ విద్యుత్‌లో హార్స్‌పవర్‌ రూ.50 ఉన్నదాన్ని రూ.650 చేశాడు.
⇒రామారావు గారు పెట్టిన మద్యపాన నిషేదాన్ని ఎత్తేశాడు.
⇒అంటే 1994 నుంచే మేనిఫెస్టోపై దగా చేయడం చంద్రబాబుకు అలవాటు.
⇒1999లో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోలో 25 లక్షల ఉద్యోగాలిస్తాను..లేకపోతే కుటీర పరిశ్రమలు పెట్టుకోడానికి ఆర్థిక సాయం అన్నాడు.
⇒బలహీనవర్గాలకు ఐదేళ్లలో 35 లక్షల ఇళ్ల నిర్మాణం చేస్తానన్నాడు.
⇒ఏపీలో ఉన్న ప్రతి ఒక్క పాఠశాలను పక్కా భవంతిగా చేస్తానన్నాడు.
⇒చట్టసభల్లో మహిళలకు 3వ వంతు రిజర్వేషన్‌కి నేను బాధ్యత తీసుకుంటాను అన్నాడు. 
⇒ఆయన పోరాటం చేయలేదు.. కనీసం తన పార్టీలో పది శాతం మందికి కూడా టికెట్లు ఇవ్వలేదు.
⇒మహిళా బ్యాంకులు ఏర్పాటు చేస్తాను అన్నాడు. ఎక్కడున్నా చూశారా మీరు? 
⇒పోస్టు గ్రాడ్యుయేషన్‌ స్థాయి వరకూ మహిళలకు ఉచిత విద్యాసౌకర్యం అన్నాడు. ఎక్కడన్నా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చాడా?
⇒2009లో కూడా మేనిఫెస్టో ఇచ్చాడు కానీ ఆయన మాటలు ఎవరూ నమ్మలేదు.
⇒వైఎస్సార్‌ ఆ రోజు రెండే హామీలిచ్చారు. ప్రతి వ్యక్తికి 6కేజీల బియ్యం, 7 గంటల నిరంతర విద్యుత్‌ ఇస్తానని చెప్పారు.
⇒చంద్రబాబు ఆరోజు డబ్బులు వేస్తానని ఇళ్లలో డమ్మీ ఏటీఎం కార్డులు పంచిపెట్టాడు.

రైతు రుణమాఫీ చేయకపోగా... ఆశకు హద్దుండాలన్న వ్యక్తి చంద్రబాబు:
⇒2014కు వచ్చే సరికి 600 హామీలు ఇచ్చాడు.. వాటిలో ఒక్కటీ అమలు చేయలేదు.
⇒పేదవాళ్లకు మూడు సెంట్లు స్థలం అన్నాడు. అమలు చేయలేదు.
⇒పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రూ.25వేలు ఇస్తానన్నాడు. డ్వాక్రా రుణాలు రూ.14వేల కోట్ల రుణాల మాఫీ అన్నాడు. ఏదీ చేయలేదు.
⇒రైతులకు రూ.85 వేల కోట్ల రుణమాపీ చేస్తాను అన్నాడు. 
⇒వారి అడబిడ్డల నగలను కూడా బ్యాంకుల నుంచి విడిపించి ఇంటికి తెచ్చిస్తానన్నాడు. 
⇒మాఫీ చేయకపోగా..ఆశకు హద్దుండాలయ్యా అన్నాడు.
⇒మళ్లీ 2024 వచ్చింది. మళ్లీ బయలుదేరి మేనిఫెస్టో అంటాడు.
⇒రెండు స్థలం అన్నాడు. 2014లో మూడు సెంట్లు అని మూడు గజాలు కూడా ఇవ్వలేదు.
⇒ఇంటికో ఉద్యోగం చొప్పున 20 లక్షల ఉద్యోగాలట. 2014లో కూడా కోటి ఉద్యోగాలు..జాబు రావాలంటే బాబు రావాలన్నాడు. 
⇒ఒక్క ఇంటికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు. ఇస్తానన్న నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదు.
⇒రాష్ట్రంలో ఒక్క బాబుగారి కొడుక్కి తప్ప ఎవరికి జాబు వచ్చింది?
⇒లోకేశ్‌ బాబుకు తప్ప రాష్ట్రంలో ఏ బాబుకూ ఉద్యోగం రాలేదు
⇒అందుకే ఈ దొంగ మేనిఫెస్టో నుంచి మోడీ తెలివిగా తప్పుకున్నాడని భావించాలి
⇒ఇక పవన్‌ కల్యాణ్‌ ఫోటో కూడా మాయమైంది కాబట్టి ఆయననూ బాబు పక్కన పెట్టేసినట్లే
⇒వీళ్ల ఫోటోలకు సూపర్ సిక్స్ లో ఇచ్చిన నాలుగు వేల పింఛన్‌ హామీ కూడా మాయమైపోయింది
⇒మోదీ, పవన్‌ కల్యాణ్‌లు ఆటలో అరటిపండ్లు..
⇒నేను ఎంతటి వాడినైనా మోసం చేయగలను అనే ధీమా చంద్రబాబుది
⇒ఈ దగాకోరు, నక్కజిత్తుల చంద్రబాబునాయుడితో తస్మాత్‌ జాగ్రత్త!
⇒ జనసేన కార్యకర్తలు కూడా ఈ రోజు చంద్రబాబు ఇచ్చిన ప్రకటన చూడండి
⇒మేమందరం ఒకటే అన్నాడు. నేనూ పవన్‌ కల్యాణ్‌ కవల పిలల్లం అన్నాడు
⇒పవన్‌ కల్యాణ్‌ వీరుడు, సూరుడు ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి వచ్చాడు అన్నాడు..ఏకంగా ఫోటోనే లేపేశాడు
⇒ఆంధ్రరాష్ట్ర ప్రజలారా..తస్మాత్‌ జాగ్రత్త
⇒జగన్‌ అంటే ఒక నడిచే నమ్మకం. చంద్రబాబు అంటే ఒక ముసలి అపనమ్మకం
⇒ఒక్కసారి ఆలోచన చేసుకోండి. జాగ్రత్తపడండి
⇒చంద్రబాబు కన్నా ఈ రాష్ట్ర ప్రజలు తెలివైన వారని నా నమ్మకం
⇒కొడుకు కోసం ఈ మోసపు మాటలతో పిల్లమొగ్గలు వేస్తున్న చంద్రబాబును తెడ్డుకాల్చి వాతపెట్టి పంపిస్తారని నా బలమైన నమ్మకం

చంద్రబాబు, నిమ్మగడ్డలకు వృద్ధుల ఉసురు తగలకమానదు:
⇒చంద్రబాబు తన బంధువైన నిమ్మగడ్డతో కోర్టుల్లో కేసులు వేయించి పింఛన్‌ ఇంటికి ఇవ్వకుండా చేశాడు.
⇒వాలంటీర్ల ద్వారా సాఫీగా పంచే పింఛను అందించకుండా వృద్ధులను ముప్పుతిప్పలు పెడుతున్న వ్యక్తి చంద్రబాబే.
⇒మొన్న సచివాలయాలకు రావాల్సిన పరిస్థితి వస్తే..ఈ రోజు బ్యాంకులకు రావాల్సిన పరిస్థితి వచ్చింది.
⇒ఆ చంద్రబాబు బంధువు బ్యాంకుల్లో వేస్తే మంచిదే కదా అని చెప్పుకొస్తున్నాడు.
⇒రాష్ట్రంలోని 65 లక్షల మంది పింఛన్‌దారుల్లో 45 లక్షల మంది ఎకౌంట్లు మైనస్‌లలో ఉన్నాయి. 
⇒ఈ పింఛన్‌ డబ్బు పడగానే దానికి జమ అయిన పరిస్థితితో వృద్ధులంతా లబోదిబోమంటున్నారు.
⇒చంద్రబాబు, ఆయన చుట్టమైన నిమ్మగడ్డకు కచ్చితంగా వృద్ధుల ఉసురు తగులుతుంది.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement