ఇక బీజేపీకి మ‌ద్ద‌తిచ్చేది లేదు.. ప్ర‌తిప‌క్ష‌పాత్రే: బీజేడీ | No More Support To BJP Only Opposition: Naveen Patnaik Party MP | Sakshi
Sakshi News home page

బీజేపీకి మ‌ద్ద‌తిచ్చేది లేదు.. రాజ్య‌స‌భ ఎంపీల‌కు ప‌ట్నాయ‌క్ దిశానిర్దేశం

Published Mon, Jun 24 2024 5:13 PM | Last Updated on Mon, Jun 24 2024 5:58 PM

No More Support To BJP Only Opposition: Naveen Patnaik Party MP

భువ‌నేశ్వ‌ర్‌: త‌మ పార్టీకి చెందిన తొమ్మిది మంది రాజ్య‌స‌భ ఎంపీల‌తో బీజేడీ అధ్య‌క్షుడు న‌వీన్ ప‌ట్నాయ‌క్ సోమ‌వారం స‌మావేశం నిర్వ‌హించారు. జూన్ 27వ తేదీ నుంచి ప్రారంభంకానున్న పార్ల‌మెంట్ స‌మావేశాల స‌మ‌యంలో.. శక్తివంతమైన, చురుకైన ప్ర‌తిప‌క్షంగా రాజ్య‌స‌భ‌లో వ్య‌వ‌హ‌రించాల‌ని త‌మ పార్టీ ఎంపీల‌కు ఆయ‌న దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి చెందిన స‌మ‌స్య‌ల‌పై కూడా స‌భ‌లో కేంద్ర స‌ర్కారును నిల‌దీయాల‌ని  చెప్పారు.

న‌వీన్ ప‌ట్నాయ‌క్‌తో జ‌రిగిన స‌మావేశం అనంత‌రం రాజ్య‌స‌భ ఎంపీ స‌స్మిత్ పాత్ర మీడియాతో మాట్లాడుతూ .. ఈసారి బీజేడీ ఎంపీలు కేవ‌లం స‌మ‌స్య‌ల‌పై మాత్ర‌మే మాట్లాడ‌ర‌ని, ఒడిశా ప్ర‌యోజ‌నాల‌ను కేంద్రం విస్మ‌రిస్తే, అప్పుడు బీజేపీ  స‌ర్కారుపై తీవ్ర పోరాటం చేస్తామ‌ని చెప్పారు. ఒడిశాకు ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌న్న డిమాండ్‌ను లేవ‌నెత్త‌నున్న‌ట్లు చెప్పారు.

రాష్ట్ర‌వ్యాప్తంగా మొబైల్ క‌నెక్టివిటీ బ‌ల‌హీనంగా ఉంద‌ని, బ్యాంకుల‌కు చెందిన బ్రాంచీలు కూడా త‌క్కువ‌గా ఉన్నాయ‌ని ఆయ‌న‌ తెలిపారు. బొగ్గు రాయాల్టీని కూడా సవరించాలన్న ఒడిశా డిమాండ్‌ను గ‌త ప‌దేళ్ల నుంచి కేంద్రం విస్మ‌రించింద‌ని, దీని వల్ల రాష్ట్ర ప్రజలకు సరైన వాటా దక్కకుండా పోతుంద‌ని మండిప‌డ్డారు. రాజ్యసభలో తొమ్మిది మంది ఎంపీలు బలమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తారని, పార్లమెంటులో రాష్ట్ర ప్రజల హక్కుల కోసం పోరాడాలని నవీన్ పట్నాయక్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన‌ట్లు చెప్పారు.

కాగా దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు ఒడిశాను పాలించిన బిజు జనతాదళ్‌ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం చవిచూసిన విషయం తెలిసిందే. మొత్తం 147 స్థానాలకు గాను బీజేపీ 78 సీట్లతో అధికారం కైవసం చేసుకోగా.. బిజు జనతాదళ్‌ 51, కాంగ్రెస్‌ 14, స్వతంత్రులు 1, సీపీఎం 1 స్థానాలు చొప్పున గెలుచుకున్నాయి. దీంతో బీజేపీకి చెందిన ఆదివాసీ నేత మోహన్‌చరణ మాఝి ఒడిశా కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. 

అటు లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేడీ ఒక్క సీటు కూడా గెల‌వ‌లేదు. 21 స్థానాల‌కు గానూ బీజేపీ 20 చోట్ల విజ‌య కేత‌నం ఎగుర‌వేయ‌గా.. కాంగ్రెస్ ఒక చోట గెలుపొందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement