
జైపూర్: అధికార బీజేపీ సైద్ధాంతిక భావజాలమే మణిపూర్ను మంటల్లోకి నెట్టిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. అమాయక ప్రజలను చంపేశారని, మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రధాని మోదీ నిజంగా తలచుకొంటే రెండు మూడు రోజుల్లో మణిపూర్ మంటలు ఆరిపోతాయని చెప్పారు. కానీ, ఆ మంటలు అలాగే చెలరేగాలని మోదీ కోరుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రపంచ గిరిజన దినోత్సవం సందర్భంగా రాజస్తాన్లోని మన్గఢ్ ధామ్లో బుధవారం కాంగ్రెస్ ప్రచార సభలో రాహుల్ ప్రసంగించారు.
మణిపూర్ను ప్రధాని మోదీ రెండు విభజించారని ఆరోపించారు. గత మూడు నెలలుగా మణిపూర్ భారతదేశంలో ఒక భాగంగా లేనట్లు కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజనులను బీజేపీ నేతలు ‘ఆదివాసీ’ అని కాకుండా ‘వనవాసీ’ అని సంబోధిస్తూ అవమానిస్తున్నారని రాహుల్ మండిపడ్డారు. గిరిజనులకు చెందిన అడవులను బలవంతంగా లాక్కొని అదానీకి కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. గిరిజనులకు హక్కులు దక్కాలని, వారి ఆకాంక్షలు నెరవేరాలని కాంగ్రెస్ కోరుకుంటోందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment