
సాక్షి, మహారాష్ట్ర: మహారాష్ట్రలో తెలంగాణ పథకాలు కావాలంటే బీఆర్ఎస్ను ఆదరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. నాందేడ్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి వనరులు లేని సింగపూర్, జపాన్, మలేషియా అద్భుతాలు సృష్టిస్తున్నాయని చెప్పారు. మన దేశంలో సహజ సంపద ఉన్నా ప్రజలకు చేరడం లేదని పేర్కొన్నారు.
'దేశంలో అవసరానికి మించి జల సంపద ఉంది. చిత్తశుద్ధి ఉంటే ప్రతి ఎకరాకు నీరు అందించవచ్చు. మా సర్కార్ వస్తే జల విధానంలో విప్లవాత్మక మార్పులు తెస్తాం. 75 ఏళ్లుగా దేశంలో రైతుల దుస్థితి మారలేదు. రైతుల ఆత్మహత్యలు దేశానికి సిగ్గుచేటు. దేశంలో రోడ్లు, ఎయిర్పోర్టులు, పోర్టులు, రైళ్లు సరిగా లేవు. ఢిల్లీలో తాగునీరు లేక ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. బీఆర్ఎస్ వస్తే కొత్త వాటర్ పాలసీ, పవర్ పాలసీ తెస్తాం. అభివృద్ధి మాటల్లో కాదు చేతల్లో జరగాలి.' అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
'సోషలైజేషన్ ఆఫ్ది లాసెస్.. ప్రైవేటైజేషన్ ఆఫ్ ప్రాఫిట్స్' ప్రస్తుతం కేంద్రం ఈ ఫార్ములానే ఫాలో అవుతోందని కేసీఆర్ మండిపడ్డారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేయకూడదని సూచించారు. అదానీపై ఉన్న ప్రేమ దేశప్రజలపైనా ఉండాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అడ్డంగా అమ్మేస్తున్నారని, అదానీ అసలు రంగు ఇప్పుడు బయటపడిందని వ్యాఖ్యానించారు. దేశ ఆర్థికవ్యవస్థకు ఇది పెనుముప్పు అని హెచ్చరించారు.
చదవండి: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర షెడ్యూల్ ఇదే..
Comments
Please login to add a commentAdd a comment