
దామెరభీమనపల్లిలో మాట్లాడుతున్న రేవంత్రెడ్డి. చిత్రంలో స్రవంతి, జీవన్రెడ్డి
మర్రిగూడ: ప్రత్యేక రాష్ట్రం కోసం 1200 మంది తెలంగాణ వీరులు ఆత్మబలిదానాలు చేసుకుంటే వచ్చిన రాష్ట్రంలో కేసీఆర్ అధికారం చేపట్టిన ఎనిమిదేళ్ల నుంచి ఏం అభివృద్ధి జరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రశ్నించారు. సోమవారం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం లెంకలపల్లి, దామెరభీమనపల్లి, వట్టిపల్లి, మర్రిగూడ, శివన్నగూడ గ్రామాల్లో నిర్వహించిన రోడ్ షోలలో ఆయన మాట్లాడారు.
2018లో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని మునుగోడులో 22వేల మెజారిటీతో గెలిపిస్తే రూ.22వేల కోట్లకు బీజేపీకి అమ్ముడుపోయారని ఆరోపించారు. 50 ఏండ్లు కాంగ్రెస్ పార్టీకి పనిచేసి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పాల్వాయి గోవర్దన్రెడ్డి బిడ్డకు మొదటిసారి పార్టీ నుంచి అవకాశం వచ్చిందని, గెలిపించుకొని మహిళాశక్తిని నిరూపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతిరెడ్డి మాట్లాడుతూ ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే ప్రజల కోసం జీవితాంతం పోరాడుతానని ఓటర్లను కోరారు.
డ్రామాలు మానుకుని
గజకర్ణ, గోకర్ణ, టక్కుటమారా డ్రామాలు మానుకుని పరిపాలనపై టీఆర్ఎస్, బీజేపీ దృష్టి సారించాలని రేవంత్రెడ్డి హితవు పలికారు. ‘బీజేపీ మంత్రాలతో చింతకాయలు రాలవు. టీఆర్ఎస్ తంత్రాలతో ప్రజల సమస్యలు తీరవు. ఆ రెండు పార్టీల చీకటి దోస్తీ ప్రజలకు అర్థమైపోయింది’అని సోమవారం ట్విట్టర్లో రేవంత్ పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment