నిబ్బరంతో నిలబడదాం.. భవిత మనదే: వైఎస్‌ జగన్‌ YS Jagan Comments in meeting with MLCs | Sakshi
Sakshi News home page

నిబ్బరంతో నిలబడదాం.. భవిత మనదే: వైఎస్‌ జగన్‌

Published Fri, Jun 14 2024 3:49 AM | Last Updated on Fri, Jun 14 2024 7:10 AM

YS Jagan Comments in meeting with MLCs

ఎమ్మెల్సీలతో సమావేశంలో వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం  

ఆత్మస్థైర్యాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు.. భవిత మనదే

ఇంటింటికీ మనం చేసిన మంచి.. మన పట్ల విశ్వసనీయత బతికే ఉంది 

అర్హతే ప్రామాణికంగా కులమతాలు, పార్టీలు చూడకుండా పథకాలను అందించాం 

కూటమికి ఓటేయలేదనే ఏకైక కారణంతో దాడులకు తెగబడి రావణకాష్టంలా మార్చారు 

శిశుపాలుడి పాపాల్లో ఇవన్నీ భాగమే 

బీజేపీ 240 స్థానాలకే పరిమితమైంది 

ఇలాంటి పరిస్థితుల్లోనూ ప్రత్యేక హోదా అడగకుండా చంద్రబాబు పాపం చేశారు 

ఆ పాపాలన్నీ పండే రోజు వస్తుంది 

అసెంబ్లీలో ఏకైక ప్రతిపక్షమైన మనకు అవకాశం ఇస్తారా? అన్నది సందేహమే 

శాసన మండలిలో మీ పాత్ర కీలకం 

ప్రజల్లోనే ఉందాం.. ప్రజల కోసం పోరాడదాం 

సాక్షి, అమరావతి:  ‘రాష్ట్రంలో ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం హనీమూన్‌ కాలం నడుస్తోంది. వాళ్లకు కొంత సమయం ఇద్దాం. దాడులకు గురైన మన కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపి ఆత్మస్థైర్యంతో నిలబడదాం’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. గురువారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘శాసనసభలో ఇప్పుడు మన సంఖ్యా బలం పెద్దగా లేదు. ఆ సభలో గొంతు విప్పే అవకాశం మనకు రాకపోవచ్చు. 

మనల్ని గొంతు విప్పనివ్వకపోవచ్చు. కానీ శాసన మండలిలో మనకు బలం ఉంది. ప్రజల పక్షాన మీ పాత్ర మీరు సమర్థంగా పోషించాలి’ అని ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ‘రాబోయే రోజుల్లో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలు ముమ్మరం చేద్దాం. ప్రజల్లోనే ఉందాం. ప్రజలతో కలసి పోరాడే కార్యక్రమాలు చేపడదాం. గతంలో నేను ఏకంగా 14 నెలలు పాదయాత్ర చేశా. ఆ వయసు, సత్తువ నాకు ఈ రోజుకీ ఉన్నాయి’ అని పేర్కొన్నారు. సమావేశంలో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

ఫలితాలు చూసి నిబ్బరం కోల్పోవద్దు
ఈ ఫలితాలు చూసి మీరు నిబ్బరాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. జరిగిన పరిస్థితులన్నీ మీకు తెలుసు. గత ఐదేళ్లలో చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఏకంగా 99 శాతం వాగ్దానాలను అమలు చేశాం. రాష్ట్ర, దేశ చరిత్రలోగానీ ఎప్పుడూ ఇలా జరగలేదు. మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీత మాదిరిగా ఒక పవిత్ర గ్రంథంలా భావించి అమలు చేశాం. మేనిఫెస్టోను చూపించి అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతల ఆశీస్సులు తీసుకుని అమలు జరిగాయా? లేదా? అని వారినే అడిగి మరీ టిక్‌ పెట్టించాం. చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. 

ఏకంగా రూ.2.7 లక్షల కోట్లు ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా ప్రజలకు నేరుగా అందించాం. ఏ నెలలో ఏమిస్తామో ముందే ప్రకటించి ఏటా క్యాలెండర్‌ విడుదల చేసి మాట తప్పకుండా పథకాలు అమలు చేశాం. ఇవన్నీ ఎప్పుడూ చూడని మార్పులు. విద్య, వైద్యం, వ్యవసాయం, సామాజిక న్యాయం, మహిళా సాధికారిత, సుపరిపాలన విషయంలో ఎప్పుడూ చూడని సంస్కరణలు తెచ్చాం. ఇవన్నీ చేసి చూపించి ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాం. కానీ.. ఎన్నికల్లో ఏమైందో తెలియదు.  

సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీలు    

వ్యక్తిత్వం.. విలువలు, విశ్వసనీయతే ముఖ్యం 
రాజకీయాల్లో అన్నిటికంటే ముఖ్యమైన అంశం క్యారెక్టర్‌. విలువలు, విశ్వసనీయతకు అర్థం తెలుసుకోవడం చాలా అవసరం. రాజకీయాలంటే అధికారం మాత్రమే కాదు. అధికారంలో లేనప్పుడు ఒక మనిషి ఎలా ప్రవర్తిస్తాడు? ఎలా ఉంటాడు? అన్నది కూడా రాజకీయమే. అధికారంలో లేనప్పుడు కచ్చితంగా కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు వచ్చినప్పుడు ఎలా స్పందిస్తామన్నది మన చేతుల్లో ఉంది. కష్టాలు వచ్చినప్పుడు విలువలు, విశ్వసనీయత లేని మనిషిగా రాజకీయాలు చేద్దామా? లేక ఆ కష్టాలను ఎదుర్కొంటూ హుందాగా నిలబడి ముందడుగులు వేసి కష్టపడితే.. మళ్లీ అధికారంలోకి వస్తామా? అన్నది ఆలోచన చేయాలి.  



శిశుపాలుడి పాపాలు అప్పుడే మొదలయ్యాయి.. 
మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు. మహా అయితే ఇంకో నాలుగు కేసులు పెట్టగలుగుతారు. అంతకు మించి వాళ్లు ఏం చేయగలుగుతారు? చంద్రబాబు హయాంలో చాలా త్వరగా పాపాలు పండుతాయి. మన కళ్లముందే చంద్రబాబు  పాపాలు ఎలా పండుతాయో గతంలో మనం అంతా చూశాం. మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడలేదు. చివరికి ఏ పార్టీకి ఓటు వేశారు అన్నది చూడకుండా ప్రతి పథకాన్ని డోర్‌ డెలివరీ చేశాం. అర్హతే  ప్రామాణికంగా ప్రతి పథకాన్ని ఇంటికే అందించాం. అలాంటి పాలన మనదైతే.. ఈ రోజు వాళ్ల పార్టీకి ఓటు వేయకపోవడమే పాపం అన్నట్టుగా రావణకాష్టం సృష్టిస్తున్నారు. విధ్వంసం చేస్తున్నారు. ఆస్తులకు నష్టం చేస్తున్నారు. అమానుషంగా దాడులకు దిగుతున్నారు. అవమానిస్తున్నారు. ఇవన్నీ శిశుపాలుడి పాపాల మాదిరిగా మొదలయ్యాయి. వారు చేసిన పాపాలు ఊరికే పోవు. 

హోదా అడక్కపోతే ఏ ఒక్క యువకుడూ క్షమించడు 
చంద్రబాబు రెండో పాపం కూడా అప్పుడే పండింది. కేంద్రంలో ఇప్పుడు నెలకొన్న రాజకీయ పరిస్థితులు ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేవు. కేంద్రంలో బీజేపీ 240 సీట్లకే పరిమితం కావడం, మరోవైపు రాష్ట్రంలో టీడీపీకి మంచి ఎంపీ సీట్లు రావడంతో ఎన్‌డీఏలో కీలకంగా మారిన పరిస్ధితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా అడగకపోవడం చంద్రబాబు చేసిన మరో పాపం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడగకుంటే రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడూ క్షమించడు.  

నైతిక విలువలు పాటిస్తారా? 
అసెంబ్లీలో మనకున్న బలం ప్రకారం ప్రతిపక్ష హోదా ఇస్తారా? లేదా అన్నది సందేహమే. తమకు ఓటు వేయలేదన్న ఒకే ఒక్క కారణంతో మనుషులు మీద దాడులు చేస్తూ.. ఆస్తులకు  నష్టం చేకూర్చి అవమానిస్తున్న పరిస్థితుల్లో.. ప్రతిపక్షంగా ఉన్న ఒకే ఒక్క పార్టీకి ఆ హోదా ఇవ్వాలన్న కనీస నైతిక విలువలు పాటిస్తారా? లేదా? అన్నది సందేహమే. అందుకే శాసన మండలిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల పాత్ర కీలకం.  

గతంలో మాదిరిగా మళ్లీ పైకి లేస్తాం
2019 నుంచి 2024 వరకు ఐదేళ్లు ఇట్టే గడిచిపోయాయి. అదే మాదిరిగా 2024 నుంచి 2029 వరకు కూడా ఐదేళ్లు ఇట్టే గడుస్తాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే.. సినిమాలో ప్రస్తుతం ఫస్ట్‌ హాఫ్‌ మాత్రమే అయింది. గతంలో ఇదే మాదిరిగా పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఎలా పైకి లేచామో మీ అందరికీ తెలిసిందే. మనం చేసిన మంచి ఇవాళ్టికీ ఉంది. ఇంటింటికీ మనం చేసిన మంచి బతికే ఉంది. మన పాలన మీద విశ్వసనీయత ప్రజల్లో ఇప్పటికీ ఉంది. 

మన పట్ల విశ్వసనీయత ఇంకా బతికే ఉంది. గడప గడపకూ మనం చేసిన మంచి ఇంకా బతికే ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు మళ్లీ మనం పైకి లేవడం అన్నది కూడా తథ్యం. కాకపోతే కొంత సమయం పడుతుంది. ఆ సమయం మనం ఇవ్వాలి. ఆ టైం ఇచ్చినప్పుడు, వాళ్ల పాపాలు పండినప్పుడు కచ్చితంగా మనం పైకి లేస్తాం. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి.

పాపాలన్నీ పండేదాకా ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు.. 
మనం అధికారంలో ఉండి ఉంటే క్యాలెండర్‌ ప్రకారం అమ్మఒడి, రైతుభరోసా, విద్యాదీవెన, వసతి దీవెన, మత్స్యకార భరోసా లాంటి పథకాలు ఇప్పటికే అమల్లో ఉండేవి. అవి ఇప్పుడు వస్తాయో, రావో తెలియని పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో ఈ పాపాలు పండుతాయి. ఈ పాపాలన్నీ పండేదాకా.. మనం ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు. మనం గట్టిగా నిలబడి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లగలిగేలా ప్రజల్లో నిరంతరం ఉండాలి. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. నేను కేవలం గుర్తు చేస్తున్నాను. కష్టాలు రావడం సహజం. వాటిని ఎదుర్కొని నిలబడ్డం అన్నది మన చేతుల్లో అంశం.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement