
స్కాన్ చెయ్.. టికెట్ తీయ్
సిద్దిపేటకమాన్: జిల్లాలోని ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ పేమెంట్స్ సేవలు ప్రారంభమయ్యాయి. నగదు రహిత సేవలు ప్రారంభం కావడంతో ప్రయాణికులు జేబులో డబ్బు లేకున్నా ఆన్లైన్ (గూగుల్ పే, ఫోన్ పే) ద్వారా డబ్బులు చెల్లించి తమ గమ్యస్థానాలకు వెళ్లొచ్చు. ఇక నుంచి ఆర్టీసీ బస్సులలో ప్రయాణికులకు, కండక్టర్లకు మధ్య చిల్లర విషయంపై గొడవలు తలెత్తకుండా సమస్య పరిష్కారం కానుంది. సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ డీఎం టి.రఘు తెలిపారు.
ప్రస్తుతం పది డీలక్స్ బస్సుల్లో ప్రారంభం
సిద్దిపేట ఆర్టీసీ డిపో పరిధిలో 53 ఆర్టీసీ, 53 అద్దె బస్సులతో కలిపి మొత్తం 106 బస్సులు ఉన్నాయి. వీటిలో పది డీలక్స్ బస్సులు సేవలు అందిస్తున్నాయి. ఈ బస్సులు ప్రతి రోజు సుమారు 39వేల కిలో మీటర్లు తిరుగుతూ ప్రయాణికులను తమ గమ్య స్థానాలకు చేరవేస్తున్నాయి. గతంలో టికెట్ చార్జీల చెల్లింపులకు సంబంధించి చిల్లర విషయంలో బస్ కండక్టర్లకు, ప్రయాణికులకు మధ్య గొడవలు, వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు ఆర్టీసీ యాజమాన్యం బస్సులలో నగదు రహిత సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో భాగంగానే సిద్దిపేట ఆర్టీసీ డిపోలోని 10 డీలక్స్ బస్సులలో గురువారం డిజిటల్ పేమెంట్ సేవలను ప్రారంభించారు. టిమ్ యంత్రాల ద్వారా ప్రయాణికుల నుంచి ఆన్లైన్ (పోన్ పే, గూగుల్ పే) ద్వారా టికెట్ చార్జీలు వసూలు చేస్తున్నారు. ఆన్లైన్ పేమెంట్స్ ద్వారా ప్రయాణం సులభతరం అవుతుందని పలువురు ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డీలక్స్ బస్సులు ప్రతి రోజు సిద్దిపేట నుంచి జేబీఎస్కు 20 ట్రిప్పుల ద్వారా 5వేల కిలోమీటర్లు తిప్పుతున్నారు. త్వరలో దశల వారీగా అన్ని బస్సులకు డిజిటల్ టిమ్ యంత్రాలను ఏర్పాటు చేసి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయనున్నామని, డిపోకు ఇప్పటికే 90 డిజిటల్ టిమ్ యంత్రాలు వచ్చాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
డీలక్స్ బస్సుల్లో ప్రారంభమైన ఆన్లైన్ సేవలు
సిద్దిపేట డిపోకు చేరుకున్న
90 డిజిటల్ టిమ్ యంత్రాలు
దశల వారీగా అన్ని బస్సుల్లో ఏర్పాటు
తీరనున్న చిల్లర కష్టాలు
ఇక ప్రయాణం సులభతరం
ఆన్లైన్ పేమెంట్స్తో సులభం
సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ జేబీఎస్కు వెళుతున్నాను. టికెట్ చార్జీలు ఆన్లైన్ చెల్లింపులు చేయడం బాగుంది. గతంలో చిల్లర సమస్య తలెత్తేది. ప్రస్తుతం నగదు రహిత సేవల వల్ల టికెట్ తీసుకోవడం సులభమైంది. ఆన్లైన్ సేవలు బాగున్నాయి.
– రాజు, ప్రయాణికుడు
సద్వినియోగం చేసుకోవాలి
సిద్దిపేట డిపోలోని డీలక్స్ బస్సులలో డిజిటల్ టిమ్ యంత్రాలను ఏర్పాటు చేశాం. ఈ బస్సులు సిద్దిపేట నుంచి జేబీఎస్ రూట్లో తిప్పుతున్నాం. ఆర్టీసీ బస్సులో ప్రయాణించే సమయంలో ప్రయాణికులు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా ఆన్లైన్ పేమెంట్స్ ద్వారా డబ్బులు చెల్లించి సురక్షితంగా ప్రయాణించవచ్చు. ఆన్లైన్ చెల్లింపులు, సేవల ద్వారా చిల్లర సమస్య పరిష్కారం కానుంది. నగదు రహిత ఆన్లైన్ సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి.
– టి.రఘు, సిద్దిపేట డిపో మేనేజర్

స్కాన్ చెయ్.. టికెట్ తీయ్

స్కాన్ చెయ్.. టికెట్ తీయ్