
ఒలింపిక్స్లో పతకమే లక్ష్యంగా ప్యారిస్లో అడుగుపెట్టిన వరల్డ్ ఛాంపియన్, తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్కు కఠినమైన డ్రా లభించింది. ఒలింపిక్స్ 2024 బాక్సింగ్ డ్రాను నిర్వహకులు శుక్రవారం విడుదల చేశారు. 50 కేజీల బాక్సింగ్ ఈవెంట్ తొలి రౌండ్లో నిఖత్ జరీన్ జర్మనీ సంచలనం కరీనా క్లొయెట్జర్తో తలపడనుంది. క్లొయెట్జర్పై విజయం సాధిస్తే రెండో రౌండ్లో జరీన్కు ప్రపంచ ఛాంపియన్షిప్ స్వర్ణ పతక విజేత, టాప్ ర్యాంకర్ వూ యూ(చైనా) నుంచి గట్టి సవాల్ ఎదురుకానుంది.
నిఖత్ జరీన్తో పాటు మరో భారత మహిళా బాక్సర్, టోక్యో ఒలింపిక్ కాంస్య పతక విజేత లోవ్లినా బోర్గోహైన్కు కూడా కష్టమైన డ్రా లభించింది. 75 కేజీల విభాగంలో తొలి రౌండ్లో నార్వేకు చెందిన సున్నివా హాఫ్స్టాడ్తో లోవ్లినా తలపడనుంది. ఒకవేళ ఆమె ఫస్ట్ రౌండ్లో విజయం సాధిస్తే.. రెండు సార్లు ఒలింపిక్స్ మెడలిస్ట్, చైనా స్టార్ బాక్సర్ లి కియాన్తో అమీతుమీ తెల్చుకోనుంది.
అదేవిధంగా మహిళల 54 కేజీల విభాగంలో మరో భారత బాక్సర్ జైస్మిన్ లంబోరియా తొలి రౌండ్లో టోక్యోలో సిల్వర్ గెలిచిన ఫిలిప్పీన్స్ బాక్సర్ నెస్తీ పెటెసిను ఢీకొట్టనుంది. మరోవైపు పురుషుల విభాగంలో పోటీ పడుతున్న బాక్సర్లు నిషాంత్ దేవ్(71 కిలోలు), అమిత్ పంగల్ (52 కిలోలు)కు మాత్రం బై దక్కింది. ఇక శనివారం నుంచి(జూలై 27) బాక్సింగ్ పోటీలు షురూ కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment