
కార్డీఫ్: కార్డీఫ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో పాకిస్తాన్ పై ఇంగ్లండ్ 9 వికెట్ల తేడా తో ఘనవిజయం సాధించింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన పాకిస్తాన్.. ఇంగ్లండ్ పేసర్ షకీబ్ మహమూద్ దెబ్బకు 141 పరుగులకే కూప్పకులిపోయింది. ఆ తర్వాత 142 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆదిలోనే ఓపెనర్ ఫిల్ సాల్ట్ వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో మరో ఓపెనర్ డేవిడ్ మలన్ (68), జాక్ క్రాలే (58) అజేయంగా అర్ధ సెంచరీలు సాధించడంతో 21.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని సునాయసంగా సాధించింది. జాక్ క్రాలే అరంగేట్ర మ్యాచ్ లోనే ఆర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. అంతకుముందు ఫాస్ట్ బౌలర్ షకీబ్ మహమూద్ సహాయంతో ఇంగ్లండ్ 35.2 ఓవర్లలో 141 పరుగులకే పాకిస్థాన్ను కట్టడి చేసింది.
షకీబ్ 42 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టాడు. షకీబ్ మహమూద్తో పాటు లూయిస్ గ్రెగొరీ, మాట్ పార్కిన్సన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.తొలి వన్డే కు ముందు ఇంగ్లాండ్ ప్రధాన ఆటగాళ్లు కొంత మంది కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలో జట్టు సభ్యులందరినీ ఐసోలేషన్కు తరలించారు. దీంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు 15 మంది ఆటగాళ్లుతో కొత్త జట్టును ప్రకటించింది. ఇందులో ఏకంగా తొమ్మిది మంది అన్ క్యాప్డ్ ప్లేయర్లను ఎంపిక చేసింది. బెన్ స్టోక్స్కు యువ జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించింది.