
బంగ్లాదేశ్తో అఖరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్లో 5 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం ఫేక్ ఫీల్డింగ్ వివాదం తెరపైకి వచ్చింది. మ్యాచ్ ఉత్కంఠగా జరుగుతున్నప్పుడు విరాట్ కోహ్లి "ఫేక్ ఫీల్డింగ్" చేశాడని బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ నూరుల్ హసన్ ఆరోపించాడు. విరాట్ ఫేక్ ఫీల్డింగ్ను అంపైర్లు గుర్తించలేదని హసన్ తెలిపాడు.
మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో నూరుల్ హసన్ మాట్లాడుతూ.. "ఔట్ ఫీల్డ్ తడిగా ఉన్నప్పటికీ అంపైర్లు మ్యాచ్ను ప్రారంభించారు. అటువంటింది మా ఇన్నింగ్స్ మధ్యలో కోహ్లి నకిలీ ఫీల్డింగ్ను మాత్రం గుర్తించలేకపోయారు. ఒకవేళ అంపైర్లు అది గమనించినట్లయితే మాకు ఐదు పరుగులు పెనాల్టీ రూపంలో వచ్చేవి. తద్వారా ఈ మ్యాచ్లో మేము విజయం సాధించే వాళ్లం. కానీ దురదృష్టవశాత్తు అది కూడా జరగలేదు" అని అతడు పేర్కొన్నాడు.
అసలేం జరిగిందంటే?
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 7వ ఓవర్ వేసిన అక్షర్ పటేల్ బౌలింగ్లో లిటన్ దాస్ స్వీపర్ కవర్ దిశగా షాట్ ఆడాడు. అయితే బంగ్లాదేశ్ బ్యాటర్లు రెండో పరుగు పూర్తే చేసే క్రమంలో అర్ష్దీప్ సింగ్ బంతిని వికెట్ కీపర్ వైపు త్రో చేశాడు. ఈ క్రమంలో ఇన్సైడ్ రింగ్లో ఉన్న కోహ్లి మాత్రం.. బంతి తన చేతిలో లేకపోయినప్పటికీ నాన్ స్ట్రైకర్ వైపు త్రో చేసేటట్లు యాక్షన్ చేశాడు. అయితే దీన్ని ఫీల్డ్ అంపైర్లు గుర్తించలేదు. అదే విధంగా ఇద్దరు బ్యాటర్లు లిటన్ దాస్, షాంటో కూడా ఏ విధమైన అప్పీల్ చేయలేదు.
ఐసీసీ నియమాలు ఏం చెబుతున్నాయి?
ఐసీసీ నియమం 41.5 ప్రకారం.. "బ్యాటర్ను ఉద్దేశపూర్వకంగా మోసం చేయడం అడ్డుకోవడం వంటివి చేయకూడదు". అటువంటి సంఘటన జరిగితే అంపైర్లు నిబంధనల ప్రకారం ఆ బంతిని డెల్ బాల్గా ప్రకటించవచ్చు. అదే విధంగా బ్యాటింగ్ జట్టుకు ఐదు పరుగుల పెనాల్టీ కూడా ఇవ్వవచ్చు.
ఈ నేపథ్యంలోనే నూరుల్ హసన్ ఈ మేరకు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అయితే, ‘‘వరల్డ్క్లాస్ బ్యాటర్ అయిన కోహ్లి.. ఉద్దేశపూర్వకంగా ప్రత్యర్థి బ్యాటర్లను తప్పుదారి పట్టించే విధంగా వ్యవహరించడు’’ అని ఫ్యాన్స్ అంటున్నారు. మరి కొంత మంది నాన్ స్ట్రైక్ వైపు త్రో చేయమని అర్ష్దీప్కు విరాట్ సైగలు చేశాడని కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా కోహ్లి చర్య సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.
#FakeFielding or not ???#Askthepavilion #PakVSa #NoBall pic.twitter.com/1Z25J8WVDV
— Muhammad Shehroz 🇵🇰 (@Iam_Shehroz) November 2, 2022
చదవండి: T20 WC 2022: అంతన్నావు.. ఇంతన్నావు! ఇప్పుడు ఏమైంది షకీబ్?
Comments
Please login to add a commentAdd a comment