Day 2: చెలరేగిన ఇంగ్లండ్‌ స్పిన్నర్లు.. ఆదుకున్న జైస్వాల్‌ | Ind vs Eng 4th Test Day 2: Jaiswal Fifty Bashir Takes 4 Ind Trial By 134 Runs | Sakshi
Sakshi News home page

Ind vs Eng 4th Test Day 2: చెలరేగిన ఇంగ్లండ్‌ స్పిన్నర్లు.. ఆదుకున్న జైస్వాల్‌

Published Sat, Feb 24 2024 5:08 PM | Last Updated on Sat, Feb 24 2024 5:18 PM

Ind vs Eng 4th Test Day 2: Jaiswal Fifty Bashir Takes 4 Ind Trial By 134 Runs - Sakshi

India vs England, 4th Test Day 2 Score: టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య నాలుగో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. రాంచి వేదికగా శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. తొలిరోజు ఆటలో అరంగేట్ర పేసర్‌ ఆకాశ్‌ దీప్‌ మూడు వికెట్లతో చెలరేగగా.. రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా కూడా ఇంగ్లండ్‌ బ్యాటర్లకు చుక్కలు చూపించారు.

అయితే, జో రూట్‌ రాకతో సీన్‌ మారిపోయింది. ‘బజ్‌బాల్‌’ కాన్సెప్ట్‌నకుకు విరుద్ధంగా అచ్చమైన సంప్రదాయ క్రికెట్‌ ఆడుతూ రూట్‌ అజేయ సెంచరీతో చెలరేగిన కారణంగా.. తొలి రోజు ఇంగ్లండ్‌ తిరిగి పుంజుకోగలిగింది. ఆట పూర్తయ్యే సరికి 300 పరుగుల మార్కు దాటేసింది.ఈ క్రమంలో 302/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో శనివారం ఆట మొదలుపెట్టి 353 పరుగులకు ఆలౌట్‌ అయింది.

ఓవరాల్‌గా భారత బౌలర్లలో రవీంద్ర జడేజా అత్యధికంగా నాలుగు వికెట్లు దక్కించుకోగా.. ఆకాశ్‌ దీప్‌ మూడు వికెట్లు, మహ్మద్‌ సిరాజ్‌ రెండు, రవిచంద్రన్‌ అశ్విన్‌ ఒక వికెట్‌ పడగొట్టారు.

ఈ క్రమంలో బ్యాటింగ్‌ మొదలుపెట్టిన టీమిండియాకు ఇంగ్లండ్‌ దిగ్గజ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సర్‌ ఆదిలోనే షాకిచ్చాడు. భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మను 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దే పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత యువ బౌలర్‌ షోయబ్‌ బషీర్‌ తన స్పిన్‌ మాయాజాలం ప్రదర్శించాడు.

పాక్‌ మూలాలున్న ఈ రైటార్మ్‌ స్పిన్నర్‌ దెబ్బకు శుబ్‌మన్‌ గిల్‌(38), రజత్‌ పాటిదార్‌(17) లెగ్‌ బిఫోర్‌ వికెట్లుగా వెనుదిరిగారు. ఇక జట్టును ఆదుకుంటాడనుకున్న రవీంద్ర జడేజా(12)ను కూడా బషీరే పెవిలియన్‌కు పంపడం గమనార్హం.

ఇలా ఓవైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ మాత్రం నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. అర్ధ శతకం పూర్తి చేసుకుని దానిని సెంచరీగా మలిచే ప్రయత్నం చేయగా.. బషీర్‌ అద్బుత రీతిలో అతడి బౌల్డ్‌ చేశాడు. దీంతో 73 పరుగులకే జైస్వాల్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది. 

ఇక సర్ఫరాజ్‌ ఖాన్‌(14), రవిచంద్రన్‌ అశ్విన్‌(1)లను మరో స్పిన్నర్‌ టామ్‌ హార్లే పెవిలియన్‌కు పంపాడు. ఫలితంగా 177 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది టీమిండియా. ఈ క్రమంలో జైస్వాల్‌ స్థానంలో క్రీజులోకి వచ్చిన వికెట్‌ కీపర్‌ ధ్రువ్‌ జురెల్‌, అశూ స్థానంలో వచ్చిన కుల్దీప్‌ యాదవ్‌ ఆచితూచి ఆడే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో శనివారం నాటి ఆట ముగిసే టీమిండియా 73 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 219 పరుగులు మాత్రమే చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ కంటే 134 పరుగులు వెనుబడి ఉంది. చేతిలో ఇంకా మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఇక ఆట పూర్తయ్యే సరికి జురెల్‌ 30, కుల్దీప్‌ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు.  మొత్తానికి రెండో రోజు ఆటలో ఇంగ్లండ్‌ టీమిండియాపై పైచేయి సాధించి పటిష్ట స్థితిలో నిలిచింది.

చదవండి: బంతితో చెలరేగిన బషీర్‌.. అంతకంటే ముందు సర్ఫరాజ్‌కు షాకిచ్చాడిలా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement