![Former Australia Test Cricketer Joe Burns To Play For Italy](/styles/webp/s3/article_images/2024/05/28/Untitled-3_6.jpg.webp?itok=jruBV1hU)
ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ జో బర్న్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సొంతదేశాన్ని వీడి ఇటలీ జాతీయ క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించాడు. ఇటలీని టీ20 వరల్డ్కప్ 2026కు అర్హత సాధించేలా చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. అలాగే ఈ ఏడాది తనువు చాలించిన తన సోదరుడు డొమ్నిక్ బర్న్స్కు నివాళిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు.
డొమ్నిక్ గౌరవార్ధం తన జెర్సీపై 85 నంబర్ను ధరించనున్నట్లు వెల్లడించాడు. డొమ్నిక్ తన చివరి మ్యాచ్లో ఇదే సంఖ్య గల జెర్సీని ధరించినట్లు చెప్పుకొచ్చాడు. తన తల్లి ఇటలీ పౌరసత్వం కలిగి ఉండటంతో బర్న్స్ ఆ దేశానికి ప్రాతినిథ్యం వహించేందుకు అర్హత సాధించాడు. పై పేర్కొన్న కారణాలే కాకుండా బర్న్స్ ఆస్ట్రేలియాను వీడేందుకు మరిన్ని కారణాలు కూడా ఉన్నాయి.
అతనికి ఈ ఏడాది (2024-25) తన సొంత దేశవాలీ జట్టైన క్వీన్స్లాండ్ జట్టు కాంట్రాక్ట్ లభించలేదు. అలాగే బిగ్బాష్ లీగ్తోనూ బర్న్స్ కాంట్రాక్ట్ ముగిసింది. పై పేర్కొన్న కారణాలన్నిటినీ చూపుతూ బర్న్స్ ఆస్ట్రేలియాకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు ఇన్స్టా వేదికగా తన సందేశాన్ని పంపాడు. 34 ఏళ్ల బర్న్స్ 2014-2020 మధ్యలో ఆస్ట్రేలియా తరఫున 23 టెస్ట్లు, 6 వన్డేలు ఆడి 1608 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు (టెస్ట్లు), 8 హాఫ్ సెంచరీలు (7 టెస్ట్, ఒకటి వన్డే) ఉన్నాయి.
ఇదిలా ఉంటే, ఇటలీ ఇప్పటివరకు ఏ ఫార్మాట్లోనూ ప్రపంచకప్కు అర్హత సాధించలేదు. ఈ దేశానికి 2026 టీ20 వరల్డ్కప్కు అర్హత సాధించే అవకాశాలు ఉన్నాయి. జూన్ 9 నుంచి జరిగే వరల్డ్కప్ రీజియనల్ క్వాలిఫయర్స్లో ఇటలీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ పోటీల్లో ఇటలీ.. ఫ్రాన్స్, ఐసిల్ ఆఫ్ మ్యాన్, లక్సంబర్గ్, టర్కీ జట్లతో పోటీపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment