WPL 2025: వారియర్స్‌ ఆశలు ఆవిరి! | Mumbai Indians win over UP in wpl | Sakshi
Sakshi News home page

WPL 2025: వారియర్స్‌ ఆశలు ఆవిరి!

Mar 7 2025 4:26 AM | Updated on Mar 7 2025 9:17 AM

Mumbai Indians win over UP in wpl

యూపీపై ముంబై ఇండియన్స్‌ ఘనవిజయం

హేలీ మాథ్యూస్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన

ఐదు వికెట్లతో మెరిసిన అమెలియా కెర్‌ 

లక్నో: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) టి20 క్రికెట్‌ టోర్నీలో ‘ప్లే ఆఫ్‌’ దశకు అర్హత సాధించే అవకాశాలు సజీవంగా ఉండాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌ జట్టు నిరాశపరిచింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో మాజీ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ 6 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌పై గెలిచి ప్లే ఆఫ్స్‌ దశకు చేరువైంది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన యూపీ వారియర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. 

జార్జియా వోల్‌ (33 బంతుల్లో 55; 12 ఫోర్లు) డబ్ల్యూపీఎల్‌లో తొలి అర్ధశతకంతో ఆకట్టుకోగా... గ్రేస్‌ హ్యారిస్‌ (28; 3 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్‌ దీప్తి శర్మ (27; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. కిరణ్‌ నవ్‌గిరె (0), షినెల్‌ హెన్రీ (6), శ్వేత సెహ్రావత్‌ (0), ఉమా ఛెత్రీ (1) విఫలమయ్యారు. ముంబై ఇండియన్స్‌ బౌలర్లలో అమేలియా కెర్‌ 38 పరుగులిచ్చి 5 వికెట్లతో అదరగొట్టగా... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హేలీ మాథ్యూస్‌ (2 వికెట్లు; 68 పరుగులు) ఆల్‌రౌండ్‌ ప్రదర్శన తో మెరిపించింది. 

ఓపెనర్లు రాణించడంతో ఒకదశలో 7.5 ఓవర్లలో 74 పరుగులు చేసిన యూపీ వారియర్స్‌ ఆ తర్వాత అదే జోరు కొనసాగించలేకపోయింది. అమేలియా విజృంభణతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి సాధారణ స్కోరుకే పరిమితమైంది. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్‌ 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. హేలీ (46 బంతుల్లో 68; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), సివర్‌ బ్రంట్‌ (23 బంతుల్లో 37; 7 ఫోర్లు) రాణించారు.

వీరిద్దరూ రెండో వికెట్‌కు 58 బంతుల్లోనే 92 పరుగులు జోడించడంతో ముంబై సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. లీగ్‌లో భాగంగా శుక్రవారం జరగనున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో గుజరాత్‌ జెయింట్స్‌ ఆడుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement