
టెస్టు క్రికెట్లో పాకిస్తాన్ జట్టు తమ ఓటముల పరంపరను కొనసాగిస్తోంది. ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్లో 47 పరుగుల తేడాతో పాక్ ఘోర ఓటమిని చవిచూసింది. 267 పరుగుల వెనకంజతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ 220 పరుగులకే ఆలౌటైంది. పాక్ రెండో ఇన్నింగ్స్లో అఘా సల్మాన్(63) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.
ఇంగ్లండ్ బౌలర్లలో స్పిన్నర్ జాక్ లీచ్ 4 వికెట్లు పడగొట్టగా.. అట్కినసన్, కార్సే తలా రెండు వికెట్లు సాధించారు. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 823 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లీష్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్(317) ట్రిపుల్ సెంచరీతో మెరవగా,జో రూట్(262) డబుల్ సెంచరీ చేశారు.
147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలిసారి
ఇక ఈ మ్యాచ్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన పాకిస్తాన్ అంత్యంత చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. టెస్టు చరిత్రలోనే తొలి ఇన్నింగ్స్లో 550కి పైగా పరుగులు చేసినప్పటికీ, ఆ మ్యాచ్లో ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయిన తొలి జట్టుగా పాక్ నిలిచింది. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ హిస్టరీలో ఇలా జరగడం ఇదే తొలిసారి. పాక్ కంటే ముందు ఏ జట్టు కూడా మొదటి ఇన్నింగ్స్లో అంత భారీ స్కోర్ సాధించి ఆ మ్యాచ్ను కోల్పోలేదు.
అదేవిధంగా గత 40 నెలలగా పాకిస్తాన్ కనీసం ఒక్క టెస్టు మ్యాచ్లో కూడా గెలవలేదు. చివరగా 2021లో రావల్పిండి వేదికగా దక్షిణాఫ్రికాపై టెస్టు మ్యాచ్ విజయాన్ని పాక్ నమోదు చేసింది. అప్పటి నుంచి 11 మ్యాచ్లు ఆడిన పాక్ జట్టు.. రెండు డ్రాలు, తొమ్మిదింట ఓటమి పాలైంది. అంతేకాకుండా ఈ ఓటమితో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పాక్ ఆఖరి స్ధానానికి పడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment