మిస్టరీ గర్ల్‌తో శిఖర్‌ ధవన్‌.. సోషల్‌మీడియాను షేక్‌ చేస్తున్న ఫోటోలు | Shikhar Dhawan Spotted With Mystery Woman At Champions Trophy 2025 | Sakshi
Sakshi News home page

మిస్టరీ గర్ల్‌తో శిఖర్‌ ధవన్‌.. సోషల్‌మీడియాను షేక్‌ చేస్తున్న ఫోటోలు

Published Sat, Feb 22 2025 9:18 AM | Last Updated on Sat, Feb 22 2025 10:19 AM

Shikhar Dhawan Spotted With Mystery Woman At Champions Trophy 2025

టీమిండియా మాజీ ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ (Shikhar Dhawan) ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్‌ ట్రోఫీకి (Champions Trophy 2025) అఫీషియల్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో అతను ఫిబ్రవరి 20న దుబాయ్‌లో జరిగిన భారత్‌, బంగ్లాదేశ్‌ మ్యాచ్‌కు హాజరయ్యాడు. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు టీమిండియా క్రికెటర్లతో కలియ తిరిగిన ధవన్‌.. ఆతర్వాత వీఐపీ గ్యాలరీలో కూర్చుని మ్యాచ్‌ను వీక్షించాడు. 

ఆ సమయంలో ధవన్‌ పక్కనే ఓ విదేశీ యువతి తారసపడింది. ధవన్‌.. సదరు విదేశీ యువతి పక్కపక్కనే కూర్చున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ ఫోటోలకు నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తుంది. ధనవ్‌ కొత్త అమ్మాయితో డేటింగ్‌ చేస్తున్నాడంటూ ప్రచారం జరుగుతుంది. 

ఇంతకీ ఆ విదేశీ అమ్మాయి ఎవరని ఆరా తీయగా.. ఆమె పేరు సోఫీ షైన్‌ అని తెలిసింది. ఐర్లాండ్‌కు చెందిన ఈ యువతిని ధవన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో​ కూడా చేస్తున్నట్లు బయటపడింది. దీంతో సోఫీ, ధవన్‌ మధ్య ఏదో నడుస్తుందని నెటిజన్లు కామెంట్లు గుప్పిస్తున్నారు. ధవన్‌ కొద్ది రోజుల కిందట ఇదే యువతితో ఎయిర్‌పోర్ట్‌లో కూడా కనిపించాడని అంటున్నారు.

కాగా, 39 ఏళ్ల ధవన్‌.. తన మాజీ భార్య, ఆసీస్‌ పౌరురాలైన అయేషా ముఖర్జీతో విడాకులు తీసుకుని ప్రస్తుతం సింగిల్‌గా ఉంటున్నాడు. ధవన్‌, ఆయేషాకు జోరావర్‌ అనే కుమారుడు ఉన్నాడు. అయేషాతో విడిపోయాక ధవన్‌ ఎక్కువగా తన కుమారుడి గురించి సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నాడు. అయేషా.. బిడ్డను తనతో కలువనివ్వట్లేదని ధవన్‌ పలు సందర్భాల్లో వాపోయాడు. 

ప్రొఫెషనల్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాక ధవన్‌ ప్రస్తుతం పలు ప్రైవేట్‌ లీగ్‌ల్లో పాల్గొంటున్నాడు. ధవన్‌ ఇటీవలే నేపాల్‌ క్రికెట్‌ లీగ్‌లో ఆడాడు. ధవన్‌ 2012లో అయేషాను పెళ్లాడాడు. వీరిద్దరికి సోషల్‌మీడియాలో పరిచయం ఏర్పడింది. అయేషా ధవన్‌ కంటే పదేళ్లు పెద్దది. ధవన్‌తో పెళ్లి కాక ముందే అయేషాకు వేరే వ్యక్తితో వివాహమైంది. అయేషా ఆ వ్యక్తితో ఇద్దరు కుమార్తెలను కనింది. అయేషా మాజీ కిక్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌.

ఇదిలా ఉంటే, ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025లో భారత్‌ తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌.. తౌహిద్‌ హృదయ్‌ వీరోచిత శతకంతో (100) పోరాడటంతో 49.4 ఓవర్లలో 228 పరుగులు చేసింది. హృదయ్‌కు జాకిర్‌ అలీ (68) సహకరించాడు. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉండిన బంగ్లాదేశ్‌కు ఈ ఇద్దరు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించారు. భారత బౌలర్లలో షమీ ఐదు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు.

అనంతరం శుభ్‌మన్‌ గిల్‌ (101) అజేయ శతకంతో చెలరేగడంతో భారత్‌ మరో 3.3 ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. రోహిత్‌ శర్మ (41) తన సహజ శైలిలో బ్యాట్‌ను ఝులింపించగా.. కేఎల్‌ రాహుల్‌ (41 నాటౌట్‌) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ టోర్నీలో భారత్‌ తమ తదుపరి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఎదుర్కొంటుంది. ఈ మ్యాచ్‌ దుబాయ్‌ వేదికగా ఫిబ్రవరి 23న జరుగనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement