
ముంబై ఇండియన్స్ నయా సంచలనం నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ.. తన ఆరాధ్య క్రికెటర్ సురేశ్ రైనాను ఫాలో అవుతున్నాడు. షాట్లు ఆడే విధానంలోనే కాక, రికార్డులు నమోదు చేయడంలోనే తిలక్.. రైనా అడుగుజాడల్లో నడుస్తున్నాడు. నిన్న (మే 26) గుజరాత్ టైటాన్స్తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్లో 14 బంతుల్లో 307.14 స్ట్రయిక్ రేట్తో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 43 పరుగులు చేసిన తిలక్.. గతంలో రైనా సాధించిన ఓ అరుదైన రికార్డును షేర్ చేసుకున్నాడు.
2014 సీజన్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో రైనా 25 బంతుల్లో 348 స్ట్రయిక్ రేట్తో 12 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 87 పరుగులు చేశాడు. తద్వారా ఐపీఎల్ ప్లే ఆఫ్స్ చరిత్రలో 40 అంతకంటే ఎక్కువ పరుగులు చేసి, 300కు పైగా స్ట్రయిక్ రేట్ నమోదు చేసిన తొలి ఆటగాడిగా రైనా రికార్డుల్లోకెక్కాడు. తాజాగా గుజరాత్తో జరిగిన మ్యాచ్లో తిలక్ ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా రైనా సరసన చేరాడు. నాటి మ్యాచ్లో రైనా జట్టు ఎలాగైతే భారీ లక్ష్య ఛేదనలో పోరాడి ఓడిందో.. గుజరాత్తో మ్యాచ్లో ముంబై సైతం అలాగే పోరాడి ఓటమిపాలైంది.
ఇదిలా ఉంటే, ఐపీఎల్-2023లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నిన్న (మే 26) జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై గుజరాత్ టైటాన్స్ 62 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా గుజరాత్ వరుసగా రెండో సీజన్లో ఫైనల్లోకి అడుగుపెట్టి, టైటిల్ పోరులో సీఎస్కేతో అమీతుమీకి సిద్ధమైంది.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. శుభ్మన్ గిల్ విధ్వంసకర శతకంతో (60 బంతుల్లో 129; 7 ఫోర్లు, 10 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 233 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనలో తడబడిన ముంబై.. మోహిత్ శర్మ (5/10) ధాటికి 18.2 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. సూర్యకుమార్ (38 బంతుల్లో 61), తిలక్ వర్మ (14 బంతుల్లో 43) మెరుపులు వృధా అయ్యాయి.
చదవండి: గెలవదగిన ఆట ఆడలేదు.. శుభ్మన్ సూపర్, అదే మా ఓటమికి కారణం: రోహిత్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment