తమిళసినిమా: దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం (నడిగర్సంఘం) నూతన భవన నిర్మా ణాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రస్తుత కార్యవర్గం వడివడిగా అడుగులు వేస్తోంది. స్థానిక అబిబుల్లా రోడ్డులోని పాత భవనా న్ని పడగొట్టి పలు ఆధునిక వసతులతో , సంఘం సభ్యులకు మేలు కలిగేలా నూతన భవన నిర్మాణాన్ని చాలాకాలం క్రితమే ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఆర్థిక సమస్యల కారణంగా ఈ భవన నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతూ వచ్చింది. దీన్ని పూర్తి చేయడానికి సంఘం నిర్వాహకులు నడుంబిగించారు. కావలసిన నిధిని సమకూర్చే పనికి శ్రీకారం చుట్టారు.
ఆ మధ్య నటుడు కమలహాససన్ నడిగర్ సంఘం నూతన భవనానికి కోటి రూపాయలను విరాళంగా అందజేశారు. మరిందరి సహకారంతో చాలా కాలంగా ఆగిపోయిన ఈ నూతన భవన నిర్మాణాన్ని సోమవారం మళ్లీ ప్రారంభించారు. ఈ సంఘం అధ్యక్షుడు నాజర్, కోశాధికారి కార్తీ తదితరుల ఆధ్వర్యంలో నూతన భవన నిర్మాణం మలి విడత పనులు మొదలయ్యాయి. ఈ ఏడాది చివరికల్లా నూతన భవనాన్ని పూర్తి చేస్తామని సంఘం కార్యదర్శి విశాల్ ఇటీవల ఒక భేటీలో పేర్కొన్నారు. ఈ బాధ్యతలను నటుడు కార్తీ చూసుకుంటున్నారని చెప్పారు. మెరీనా తీరంలోని ఎంజీఆర్ సమాధిని చూడడానికి వచ్చే విధంగా నడిగర్ సంఘం నూతన భవనం సందర్శకులు ఆకర్షిస్తుందన్నారు.