సాక్షి, హైదరాబాద్: అత్యాధునిక సీకర్ ఫెసిలిటీ సెంటర్(ఎస్ఎఫ్సీ)లో ఆకాశ్ క్షిపణి కోసం ఉత్పత్తి చేసిన తొలి రేడియో ఫ్రీక్వెన్సీ (ఆర్ఎఫ్) సీకర్ను డీఆర్డీవోకు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) అప్పగించింది. భూమి మీది నుంచి గాలిలోకి, గాలి లో నుంచి గాలిలోకి మిస్సైల్స్ను ప్రయోగించినప్పుడు లక్ష్య సాధన కోసం ఉపయోగించే క్లిష్టమైన టెక్నాలజీ కలిగిన ఇంటెన్సివ్ సబ్ సిస్టమ్నే సీకర్గా పేర్కొంటారు.
ఈ రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ను డిఫె న్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) రీసెర్చ్ సెంటర్ ఇమారత్లో రూపొందించగా, బీడీఎల్ కంచన్బాగ్ యూనిట్లో కొత్తగా ఏర్పాటు చేసిన ఎస్ఎఫ్సీలో ఉత్పత్తి చేశారు. కంచన్బాగ్ యూనిట్లో బుధవారం జరిగిన కార్యక్రమంలో బీడీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎ. మాధవరావు తొలిæ ఆర్ఎఫ్ సీకర్ను డీఆర్డీఓ చైర్మ న్, కార్యదర్శి డాక్టర్ సమీర్ వి కామత్కు అందజేశారు.
దేశ రక్షణ సామర్థ్యాలలో ముందడుగు
ఈ సందర్భంగా కామత్ మాట్లాడుతూ బీడీఎల్లో సీకర్ ఫెసిలిటీ సెంటర్ను ఏర్పాటు చేయడం వల్ల ఆర్ఎఫ్ సీకర్ ఉత్పత్తి రంగంలో భారత్ స్వయం ప్రతిపత్తిని సాధించి, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేయడంలో దోహదపడుతుందన్నారు. బీడీఎల్ సీఎండీ మాధవరావు మాట్లాడుతూ ఈ విజయం దేశ రక్షణ సామర్థ్యాలలో ముందడుగని వ్యాఖ్యానించారు.