
పాలమూరు: తెలంగాణ ప్రజల నాడి తెలిసిన కేసీఆర్కు పీకే అవసరం ఎందుకు వచ్చిందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నించారు. మహబూబ్నగర్ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజా సంక్షేమ పాలన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలిచ్చేందుకు డబ్బులు లేని సర్కార్ రూ.250 కోట్లు వెచ్చించి ఇతర రాష్ట్రాల్లో ప్రకటనలు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. ఇక్కడి రైతులను పట్టించుకోని ఈ ప్రభుత్వ అధినేత.. దేశ ప్రధాని కావాలనే ఆశతో ఇతర రాష్ట్రాల్లోని రైతులకు నష్టపరిహారంగా ఇస్తున్న సొమ్ము తెలంగాణ ప్రజలది కాదా?.. అని నిలదీశారు.
రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోవటం ఖాయమని ఈటల జోస్యం చెప్పారు. ప్రజలంతా బీజేపీ వైపే చూస్తున్నారని, టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ అవతరించబోతోందని స్పష్టం చేశారు. కాంగ్రెస్కు ఓటేసినా.. టీఆర్ఎస్కు ఓటేసినా కేసీఆరే తిరిగి అధికారంలోకి వచ్చి ఆయనే సీఏం అవుతారని తెలిపారు. తెలంగాణ ప్రజలు ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీనే భావిస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని అందిపుచ్చుకునేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని సూచించారు. ç