
నాగలికి ఫ్లెక్సీ కట్టుకుని డీజీపీ కార్యాలయానికి వెళుతున్న రైతు సురేందర్
దుగ్గొండి/ఖైరతాబాద్: తనకు రావాల్సిన ఆస్తి విషయమై న్యాయం చేయాల ని కోరుతూ ఓ రైతు వినూత్నంగా నిరసన బాటపట్టాడు. లంచాలు ఇవ్వక పోవడంతో తనకెవరూ న్యాయం చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తన మొర వినిపించేందుకు నాగలి ఎత్తుకొని అర్ధనగ్నంగా డీజీపీ కార్యాలయానికి వెళ్లాడు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం పొనకల్కి చెందిన గట్ల సురేందర్ అన్నదమ్ముల మధ్య కొన్నేళ్లుగా ఆస్తి గొడవలు ఉన్నాయి.
ఊరి పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది. అయితే పెద్ద మనుషులు లంచాలు తీసుకుని ఫోర్జరీ పత్రాలు సృష్టించి తనకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఈ మేరకు రాసి ఉన్న ఫ్లెక్సీని నాగలికి కట్టాడు. ఆ నాగలిని ఎత్తుకుని హైదరాబాద్ ఇందిరాపార్కు నుంచి డీజీపీ కార్యాలయం వరకు నడుచుకుంటూ బయలుదేరాడు. డీజీపీ కార్యాలయం వద్ద పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. జిల్లా కార్యాలయాల్లో మూడేళ్లుగా తన సమస్య పరిష్కారం కాకపోవడంతో హైదరాబాద్ వచ్చానని సురేందర్ అన్నారు.