Delhi Chalo March: రైతుల ‘చలో ఢిల్లీ’.. హర్యానా ప్రభుత్వం సంచలన నిర్ణయం
Published
Mon, Feb 12 2024 8:21 AM
ఫిబ్రవరి 13న రైతు సంఘాలు ‘ఢిల్లీ చలో’ మార్చ్కు పిలుపునివ్వడాన్ని దృష్ట్యాలో పెట్టుకుని పంజాబ్ నుండి ఢిల్లీ వరకు హై అలర్ట్ ప్రకటించారు. పంజాబ్లోని పలు ప్రాంతాలకు చెందిన రైతులు ఇప్పటికే తమ ట్రాక్టర్లపై నిరసన ప్రదర్శనకు బయలుదేరారు. అయితే వారిని ఢిల్లీకి రాకుండా అడ్డుకునేందుకు ఆ దారిలోని ప్రతి కూడలిలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు హర్యానా పోలీసులు.
హర్యానా ప్రభుత్వం చౌదరి దల్బీర్ సింగ్ ఇండోర్ స్టేడియం, సిర్సా, గురుగోవింద్ సింగ్ స్టేడియం, దబ్వాలిని తాత్కాలిక జైళ్లుగా మార్చింది. ఆందోళనకు దిగుతున్న రైతులను వీటిలో పెట్టేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే హర్యానాలోని 15 జిల్లాల్లో సెక్షన్ 144 విధించారు. ఏడు జిల్లాల్లో ఫిబ్రవరి 13 వరకు ఇంటర్నెట్ బంద్ చేశారు. డ్రోన్ల ద్వారా అధికారులు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీకి ఆనుకుని ఉన్న హర్యానా, పంజాబ్ సరిహద్దులను మూసివేయడానికి భారీ కాంక్రీట్ బారికేడ్లను ఏర్పాటు చేసి, పదునైన ముళ్ల తీగలను అమర్చారు.
#WATCH | Ambala, Haryana: Shambhu border sealed ahead of the farmers' call for march to Delhi on 13th February. pic.twitter.com/9jbrddosnV
మరోవైపు రైతుల నిరసనకు కాంగ్రెస్ మద్దతు పలికింది. పంజాబ్లో జరిగిన సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రైతుల ఉద్యమానికి మద్దతునిస్తున్నట్లు తెలిపారు. ఇదేసమయంలో కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలతో చర్చలు జరుపుతోంది. గురువారం జరిగిన మొదటి రౌండ్ చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఫిబ్రవరి 13 న నిరసనకు దిగుతున్నట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. అయితే ఈరోజు(సోమవారం) ముగ్గురు కేంద్ర మంత్రులు రైతు సంఘాల ప్రతినిధులతో భేటీ కానున్నారు.