
సాక్షి, సత్తుపల్లి: ఆనందంతో ఉండాల్సిన పెళ్లింట విషాద ఘటన చోటుచేసుకుంది. ముందు రోజు రాత్రి వరకూ పెళ్లి సంబరాల్లో సంతోషంగా గడిపిన ఆ కుటుంబం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. ఇంటి పెద్ద కోడలి మృతితో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. ఏపీలోని ఏలూరు జిల్లా చింతలపూడి మండలం కోటపాడుకు చెందిన పామర్తి మారేశ్వరరావు, జ్యోత్స్న(24) దంపతులు. అయితే, జ్యోత్స్న కడుపు నొప్పితో బాధపడుతుండగా బుధవారం రాత్రి సత్తుపల్లిలోని ఆల్ఫా స్కానింగ్ సెంటర్కు తీసుకొచ్చారు. అక్కడ పరీక్షించిన రేడియాలజిస్ట్ పరిస్థితి విషమంగా ఉందని, ఎదురుగా ఉన్న ఆస్పత్రికి వెళ్లాలని సూచించగా.. ఎస్వీసీ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యుడు జ్యోత్స్న గర్భం దాల్చిందని, గర్భసంచిలో కాకుండా పేగులో పిండం పెరగటంతో అది పగిలిపోయి రక్తస్రావమైందని, వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పారు. దీంతో మారేశ్వరరావు రూ.40వేలు ఫీజు చెల్లించారు.
ఈ క్రమంలో ఆపరేషన్ చేసేందుకు కుటుంబీకులు అంగీకరించగా మరో వైద్యుడితో కలిసి శస్త్రచికిత్స చేసిన హర్షిత్ పరిస్థితి మెరుగుపడిందని చెప్పాడు. కానీ, గురువారం ఉదయం జ్యోత్స్న పరిస్థితి ఆందోళన కరంగా ఉందని కుటుంబీకులు ప్రశ్నించగా మత్తు ప్రభావం కావొచ్చని బదులిచ్చాడు. ఆ కాసేపటికి వైద్యుడు ఆమెను పరీక్షించి హార్ట్ ఫెయిల్ అయి చనిపోయిందని చెప్పడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. శస్త్రచికిత్స జరిగిన గంటల్లోనే మహిళ మృతి చెందగా.. ఆస్పత్రి ఎదుట ఆమె బంధువులు ఆందోళనకు దిగారు.
మృతదేహం చూపించకుండా..
ఉదయం 10 గంటలకు జ్యోత్స్య మృతి చెందగా, ఆమె కుటుంబీకులకు రాత్రి ఏడు గంటల వరకు మృతదేహాన్ని చూపించలేదు. అంతసేపు ఆస్పత్రి ఎదుట రోదిస్తూ ఆందోళనకు చేపట్టారు. ఆస్పత్రిలో వెంటిలేటర్, ఐసీయూ లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. కాగా, జ్యోత్స్యకు రెండేళ్ల కుమార్తె ఉంది. బుధవారం రాత్రి మారేశ్వరరావు తమ్ముడు చెన్నారావు వివాహం. ఆమె మరిది పెళ్లి కోటపాడులో బుధవారం రాత్రి జరుగుతుండగానే ఆరోగ్యం విషమించడంతో సత్తుపల్లి తీసుకొచ్చారు. ఇక్కడ ఆమె మృతి చెందగా కుటుంబంలో విషాదం నెలకొంది. అయితే, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆమె బంధువులతో డాక్టర్ల బృందం చర్చలు జరిపినట్లు తెలిసింది. చివరకు రాత్రి పరస్పరం అంగీకారం కుదిరినట్లు తెలుస్తుండగా, జ్యోత్స్న మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకెళ్లారు.