
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్రావు కస్టడీ ద్వారా కీలక విషయాల్ని రాబట్టడంలో దర్యాప్తు బృందం దూకుడుగా వ్యవహరించింది. ఏడు రోజుల విచారణలో ఆయన నుంచి ప్రధాన పాత్రధారులెవరనేది దాదాపుగా నిర్ధారించుకున్న అధికారులు.. ఇప్పుడు రాజకీయ నేతలపై ఫోకస్ చేసినట్లు సమాచారం.
విచారణ సమయంలో ప్రణీత్రావు పోలీస్ అధికారులతో పాటు పలువురు నేతల పేర్లు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ నేతలకు నోటీసులు ఇచ్చి పశ్నించాలని అధికారులు భావిస్తున్నారు. బీఆర్ఎస్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఇద్దరు నేతలకు నేడో, రేపో నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. తద్వారా ప్రణీత్ చెప్పిన విషయాలకు సంబంధించి వాళ్ల నుంచి సమాచారాన్ని సేకరించాలని.. వాళ్లిచ్చే సమాధానంతో తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ప్రణీత్రావు నడిపించిన ట్యాపింగ్ రాకెట్తో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ ఇప్పటికే బీఆర్ఎస్ కీలక నేతలు కొందరు బహిరంగంగా మీడియా ముందుకు వచ్చారు. ఇక.. ఇప్పటికే ఈ వ్యవహారంలో గత ప్రభుత్వంతో అంటకాగిన మాజీ పోలీస్ బాస్లు పరారీలో ఉండగా.. ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగ్రావు, తిరుపతన్నలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment