
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: నార్త్జోన్ ఐజీ కార్యాలయంలో వెలుగుచూసిన ఫోర్జరీ గ్యాంగ్ బాగోతంపై డీజీపీ కార్యాలయం స్పందించింది. కోవిడ్–19 కాలంలో ఐజీ కార్యాలయం నుంచి వెలువడిన 191 అధికారిక ఉత్తర్వుల్లో మొత్తం ఐదు ఉత్తర్వులను ఐజీ కిందిస్థాయి సిబ్బంది తమకు అనుకూలంగా మార్చుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు జగిత్యాల అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) సురేశ్కుమార్ను విచారణాధికారిగా నియమించారు.
త్వరలోనే దీనిపై విచారణ జరుగుతుందని, నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఐజీ నాగిరెడ్డి ఆదివారం తెలిపారు. బదిలీలకు సంబంధించి సంబంధిత ఎస్పీలు, కమిషనర్లతో సంప్రదించాకే ముందుకెళతామని పేర్కొన్నారు. పిల్లల చదువు, అనారోగ్యం తదితర కారణాలకు మాత్రమే బదిలీలను పరిగణనలోకి తీసుకుంటామని, ఎలాంటి మధ్యవర్తిత్వాలు, లంచాలు డిమాండ్ చేసినా తీవ్ర పరిణామాలు ఉంటాయని స్పష్టం చేశారు.