
స్లాట్ రిజిస్ట్రేషన్
● రేపటి నుంచే బుకింగ్ విధానం అమలు
తిరుపతి అర్బన్ : ఆస్తుల క్రయవిక్రయాలకు ప్రభుత్వం నూతన విధానం ప్రవేశపెట్టింది. రిజిస్ట్రేషన్కు సంబంధించి స్లాట్ బుకింగ్కు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు శుక్రవారం నుంచి ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాంటే స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా తిరుపతిలో తొలి రోజు ఈ విధానం అమలు చేయనున్నారు. ఇందుకోసం ఓ సీనియర్ అసిస్టెంట్ను ఏర్పాటు చేశారు. తిరుపతి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఓ కౌంటర్ను ఏర్పాటు చేయనున్నారు. తర్వాత వరుసగా జిల్లాలోని 15సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోను ఇదే పద్ధతిని అమలు చేయనున్నారు. ఈ క్రమంలోనే తిరుపతి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ నీరజ నేతృత్వంలో ఏర్పాట్లు చేపట్టారు. పనిదినాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 గంటల మధ్య స్లాట్స్ను బుక్ చేసుకోవచ్చు. అనంతరం నిర్దేశించిన సమయంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా గంటకు ఆరు రిజిస్ట్రేషన్లకు వీలుగా స్లాట్స్ కేటాయించనున్నారు. ఒక సబ్ రిజిస్టార్ ఉన్న కార్యాలయంలో గరిష్టంగా 39 స్లాట్స్, ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు ఉన్నచోట గరిష్టంగా 78 స్లాట్స్ను రోజుకు అందించనున్నారు.క్రయవిక్రయదారులు పబ్లిక్ డేటా ఎంట్రీ సిస్టమ్ ద్వారా అధికారిక వెబ్సైట్గా ఉన్న రిజిస్ట్రేషన్.ఏపీ.జీవోవీ.ఇన్ లోని స్టాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకునే సౌకర్యం కల్పించారు. తిరుపతిలో అదనపు సమాచారం కోసం హెల్ప్ డెస్క్ నంబర్ 9885378880 ఏర్పాటు చేశారు.
బుకింగ్కే తొలి ప్రాధాన్యత
ఆస్తుల రిజిస్ట్రేషన్కు సంబందించి కచ్చితంగా స్లాట్స్ బుకింగ్ చేసుకున్న వారికే తొలి ప్రాధాన్యత ఉంటుంది. ఈ మేరకు జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ముందుగా తిరుపతిలో ప్రారంభిస్తున్నాం. తర్వాత జిల్లాలోని అన్ని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మొదలుపెడతాం. సాయంత్రం 5.30 తర్వాతే స్లాట్ బుకింగ్ చేయని వారికి రిజిస్ట్రేషను చేయాల్సి ఉంటుంది.
– శ్రీరామకుమార్, జిల్లా రిజిస్ట్రార్, తిరుపతి