
ఇన్సూరెన్స్ డబ్బు కోసమే కిడ్నాప్
● తిరుపతి జీవకోన కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు ● ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలింపు ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీలత
తిరుపతి అర్బన్: డబ్బు కోసం ఏకంగా స్నేహితుడితోపాటు వారి కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేశాడు. డబ్బులు ఇవ్వకుంటే ప్రాణాలు తీస్తామని బెదిరించిన ఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తిరుపతి ఈస్ట్ డీఎస్పీ శ్రీలత శనివారం అలిపిరి పోలీస్స్టేషన్లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి నగరం, జీవకోనలో నివాసం ఉంటున్న కాసరం రాజేష్(33) మీ సేవా కేంద్రాన్ని నడపడంతోపాటు ఇన్సూరెన్స్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాడు. ఆయన స్నేహితుడు భార్గన్ అలియస్ భాను కూడా జీవకోన ప్రాంతంలోనే నివాసం ఉన్నాడు. అయితే కాసరం రాజేష్ తల్లికి తాజాగా ఇన్సూరెన్స్ డబ్బులు పెద్ద మొత్తంలో వచ్చినట్లు తెలుసుకున్న భాను ఆ డబ్బులను ఎలాగైనా కొట్టేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో భాను తమ స్నేహితులైన వట్టికుంట అరుణ్కుమార్ అలియాస్ అరుణ్(తిరుపతి), ధమకోతి సాయికుమార్(శ్రీకాళహస్తి మండలం), బాలిపాకు మణికంఠ(రేణిగుంట మండలం), చీరాల ప్రకాష్(ఏర్పేడు మండలం), సిరియాల గమేష్(పెళ్లకురూ మండలం)కు చెందిన వారితో కలసి కుట్రకు శ్రీకారం చుట్టారు. ఈ ఆరుగురు గత నెల 28న ఓ ప్రణాళిక ప్రకారం కాసరం రాజేష్తోపాటు కుటుంబ సభ్యులను తిరుపతిలో కిడ్నాప్ చేశారు. ఇన్సూరెన్స్ డబ్బులు ఇస్తే వదిలేస్తామని లేదంటే ఐదుగురిని చంపేస్తామని బెదిరించారు.
తెలివిగా వ్యవహరించిన రాజేష్
కాసరం రాజేష్ తెలివిగా ఇన్సూరెన్స్ డబ్బులు తిరుపతిలో తమ వద్దలేవని.. చిత్తూరులోని తమ బంధువుల వద్ద ఉందని వారికి చెప్పాడు. దీంతో నిందితులు ఆరుగురు తాము కిడ్నాప్ చేసిన ఐదుగురిని తీసుకుని రెండు కార్లులో చిత్తూరుకు బయలుదేరారు. మార్గ మధ్యంలో ఐతేపల్లి వద్ద కాసరం రాజేష్ కారులో నుంచి దూకి తప్పించుకున్నాడు. దీంతో నిందితులు మిగిలిన కుటుంబ సభ్యులను అక్కడే వదిలిపెట్టి పరారయ్యారు. కాసరం రాజేష్ అలిపిరి పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుల కోసం తొమ్మిది రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శనివారం రేణిగుంట–కడప రోడ్డు మార్గంలో కుక్కలదొడ్డి వద్ద రెండు కార్లలో ఆరుగురు నిందితులు హైదరాబాద్కు పారిపోతుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. వారితోపాటు 7 మొబైల్ఫోన్లు, 4 కత్తు లు, 5మీటర్ల ప్లాస్టిక్ తాడు, వాటర్ ప్రూఫ్ టేప్, 60 నైలాన్ టైస్, ఓ ఐరన్ రాడ్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు పంపుతున్నట్లు వెల్లడించారు. నిందితుల్లో అరుణ్కుమార్, భార్గవ్, సాయిపై గతంలో పలు కేసులున్నాయని పేర్కొన్నారు.