విజయనగరం అర్బన్: పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశించారు. జేఎన్టీయూ విజయనగరం గురజాడ (జీవీ) యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన రెండు ఫెసిలిటేషన్ కేంద్రాలను బుధవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఓటింగ్ ప్రక్రియ, ఏర్పాట్లను పరిశీలించారు. వీలైనంత వేగంగా పోలింగ్ ప్రక్రియను నిర్వహించాలని సూచించారు. అసిస్టెంట్ కలెక్టర్ వెంకట త్రివినాగ్, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి కె.సందీప్కుమార్, డీఆర్డీఏ పీడీ ఎ.కల్యాణ చక్రవర్తి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సుధారాణి, మెప్మా పీడీ సుధాకరరావు, మున్సిపల్ కమిషనర్ మల్లయ్యనాయుడు, అసిస్టెంట్ కమిషనర్ తిరుమలరావు, తదితరులు పాల్గొన్నారు.
రిసెప్షన్ సెంటర్ వద్ద పటిష్ట ఏర్పాట్లు
ఎన్నికల రోజు ఏర్పాటు చేసే రిసెప్షన్ సెంటర్ వద్ద పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని వేదిక ఇన్చార్జ్లను కలెక్టర్ ఆదేశించారు. పటిష్టంగా బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. కౌంటర్ల వద్ద, ప్రాంగణంలో లైటింగ్ ఏర్పాటు చేయా లని సూచించారు. పర్యటనలో వేదిక ఇన్చార్జ్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సుధారాణి, డిప్యూటీ సీఈఓ కె.రాజ్కుమార్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
సజావుగా ఏపీ ఈసెట్
ఎచ్చెర్ల క్యాంపస్: ఏపీ ఈసెట్–2024 ఆన్లైన్ పరీక్ష బుధవారం సజావుగా జరిగింది. చిలకపాలేంలోని శ్రీ శివానీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్లో మొదటి షిఫ్ట్లో 100కి 90 మంది, రెండో షిఫ్ట్లో 100 కి 99 మంది, ఎచ్చెర్ల శ్రీ వెంకటేశ్వరా ఇంజినీరింగ్ కాలేజ్లో మొదటి షిఫ్ట్లో 100 కి 98, రెండో షిఫ్ట్లో 100 కి 95 మంది హాజరయ్యారు. మొత్తం 400 మందికి రెండు పరీక్ష కేంద్రాలను కేటాయించగా, 382 మంది హాజరయ్యారు. ప్రత్యేక పరిశీలకులు పరీక్ష పర్యవేక్షించారు.
సారా స్థావరాలపై పోలీసుల దాడులు
మెళియాపుట్టి: మండలంలోని సవర కుడ్డబ గ్రామంలో డీటీఎఫ్, ఎస్ఈబీ, ఇంటెలిజెన్స్ బృందాలు సమన్వయంతో బుధవారం సారా తయారీ స్థావరాలపై దాడులు చేశాయి. ఈ దాడుల్లో 1100 లీటర్ల పులిసిన బెల్లపు ఊటలను ధ్వంసం చేశారు. 20 లీటర్ల నాటుసారాని స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తిపై కేసునమోదు చేశారు. శ్రీకాకుళం ఎస్ఈబీ జేడీ గంగాధరం సూచనల మేరకు దాడులు నిర్వహించినట్లు సిబ్బంది తెలిపారు. దాడుల అనంతరం ఆయా గ్రామాల ప్రజలకు నాటుసారా తయారీ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. పలాస డీటీఎఫ్ సీఐ, రామచంద్ర కుమార్, టెక్కలి ఎస్ఈబీ సీఐ రాజశేఖర్ నాయుడు, పలువురు సిబ్బంది ఉన్నారు.