ఐసీడీఎస్ పీడీగా రుక్సానాబేగం
విజయనగరం ఫోర్ట్: ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్గా రుక్సానా బేగం శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గుంటూరులో సీడీపీఓగా పనిచేస్తూ ఉద్యోగోన్నతిపై ఆమె ఇక్కడకు వచ్చారు. ఐసీడీఎస్ సిబ్బంది ఆమెకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఇక్కడ ఇన్చార్జి పీడీగా పనిచేసిన ఉషారాణి పార్వతీపురం మన్యం జిల్లాకు డీఆర్డీఏ పీడీగా బదిలీపై వెళ్లారు.
చేపల వేట సాగిస్తే చర్యలు
వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టులో అక్రమంగా చేపలవేట సాగిస్తే చర్యలు తీసుకుంటామని రాజాం మత్స్యశాఖ సహాయ పరిశీలకుడు సీహెచ్వీవీ ప్రసాద్ అన్నారు. గత నెల 31వ తేదీన ‘మడ్డువలసలో అక్రమంగా చేపలవేట’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. మగ్గూరు, వంగర గ్రామాల సమీపంలో మడ్డువలస ప్రాజెక్టును శుక్రవారం సందర్శించారు. అక్కడ ఉన్న వలలు, బోట్లును పరిశీలించారు. అనంతరం అక్కడ ఉన్న మత్స్యకారులతో మాట్లాడారు. ప్రాజెక్టులో చేపల వేట నిషేధం అమలులో
ఉందన్నారు.
మత్స్యసంపద వృద్ధికి చర్యలు
విజయనగరం ఫోర్ట్: ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద జిల్లాలో మత్య్స సంపద వృద్ధికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో శుక్రవారం మత్స్యశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మత్స్య సంపద వృద్ధితో ప్రజలకు పోషకారంతో పాటు ఎన్నో కుటుంబాలకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. చేపల పెంపకానికి మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు 60 శాతం, ఇతరులకు 30 శాతం రాయితీ వర్తిస్తుందన్నారు. చివరి ఏడాది జిల్లాలోని 110 చెరువుల్లో చేపపిల్లల పెంపకానికి చర్యలు తీసుకున్నామన్నారు. సమావేశంలో మత్స్యశాఖ డీడీ ఎన్.నిర్మలాకుమారి, జిల్లా వ్యవసాయ అధికారి వి.తారకరామారావు, పశు సంవర్థక శాఖ జేడీ వై.వి.రమణ, డీఆర్డీఏ ఏపీడీ సావిత్రి, డీటీడబ్ల్యూ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుకు రూ.50 వేల లంచం!
● మరో రూ.10వేలు డిమాండ్
● ఇవ్వకపోవడంతో వేరే మహిళకు పోస్టింగ్
● అధికారులకు ఫిర్యాదుచేసిన బాధితురాలు
గుర్ల: కూటమి ప్రభుత్వంలో ఉపాధిహామీ పోస్టులను అమ్మకానికి పెట్టారా అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు భారీ మొత్తంలో లంచాలు వసూలు చేస్తున్నారు. ఎక్కువ మొత్తం ముట్టజెప్పిన వారికి పోస్టింగ్లు ఇప్పిస్తున్నారు. దీనికి గుర్ల మండలంలోని మణ్యపురిపేటలో ఫీల్డు అసిస్టెంట్ నియామకంలో వెలుగులోకి వచ్చిన అవినీతి తంతే నిలువెత్తు సాక్ష్యం. గ్రామానికి చెందిన గార రామలక్ష్మి సీనియర్ మేట్గా కొనసాగుతున్నారు. రెండు నెలల కిందట ఆమెను ఫీల్డ్ అసిస్టెంట్గా నియమించాలని సర్పంచ్ బడుగంటి హైమవతి ఆధ్వర్యంలో గ్రామసభలో తీర్మానం చేసి ఏపీఓ కామేశ్వరరావుకు పంపించారు. రూ.50వేలు ఇస్తేనే పోస్టింగ్ ఇస్తామని ఏపీఓ డిమాండ్ చేయడంతో ఆమె గతనెల 2వ తేదీన నగదు అందజేశారు. అయితే, ఏపీఓ అదే గ్రామంలోని మరో మహిళను ఫీల్డ్ అసిస్టెంట్గా నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో ఆమె శుక్రవారం ఎంపీడీఓ శేషుబాబుకు ఫిర్యాదు చేశారు. ఏపీఓ రూ. 50 వేలతో పాటు మరో రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. నగదు ఎందుకని ప్రశ్నిస్తే ఎంపీడీఓ, ఉపాధిహామీ ఏపీడీ, పీడీలకు వాటాలు ఇవ్వాలని చెప్పారని తెలిపింది. కనీసం ఉపాధి హమీ పథకంలో ఒక్కరోజు కూడా ఉపాధిహామీ పనిచేయని మహిళను ఫీల్డ్ అసిస్టెంట్గా ఎలా నియామించారో వివరాలు కావాలని కోరారు. ఫిర్యాదు అంశాన్ని ఎంపీడీఓ వద్ద ప్రస్తావించగా విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment