![ప్రధాని మోదీతోనే ఆర్థికాభివృద్ధి](/sites/default/files/styles/webp/public/article_images/2024/05/25/24nsp03-330048_mr.jpg.webp?itok=uTx66cYF)
నర్సంపేట: ప్రధాని నరేంద్రమోదీ పాలనలో భారత్ ఆర్థికాభివృద్ధి సాధించిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ అన్నారు. పట్టణంలోని పద్మశాలి గార్డెన్లో శుక్రవారం నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. కరోనా సమయంలో భారతదేశ ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ అందించడమే కాకుండా ప్రపంచ దేశాలకు అందించి మానవత్వం చాటుకున్నారని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దుతో నేడు కశ్మీర్ పర్యాటకంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. సైన్యానికి భరోసాగా నిలిచిన గొప్ప ప్రధాని మోదీ అని కొనియాడారు. ఒకప్పుడు భారత్.. పాకిస్థాన్ లాంటి చిన్న దేశాలకు భయపడాల్సి వచ్చిందని, నేడు ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ సంపత్తి కలిగిన దేశంగా ఎదుగుతోందని తెలిపారు. పాకిస్థాన్ సైన్యం అభినందన్ను అరెస్ట్ చేస్తే 24 గంటల్లోనే దేశానికి తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఎయిర్పోర్టులో అబ్దుల్కలాం, మోదీని అమెరికా అవమానించిందని, అలాంటి అమెరికా.. మోదీ ప్రధాని అయ్యాక సెనేట్లో మాట్లాడుతుంటే అనేకమార్లు చప్పట్లతో స్వాగతించిందన్నారు. కేసీఆర్ పార్టీ త్వరలోనే కనుమరుగు కావడం ఖాయమని, ఆయన చేసిన పాపాలు ఆయనకే తగులుతున్నాయని జోస్యం చెప్పారు. ఎమ్మెల్సీగా ప్రేమేందర్రెడ్డిని గెలిపిస్తే చట్టసభల్లో ప్రశ్నించే గొంతుక అవుతారని తెలిపారు. సమ్మేళనంలో ఎంపీ అభ్యర్థి సీతారాంనాయక్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్రావు, ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, అధికార ప్రతినిధి రాణిరుద్రమ, జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్, నియోజకవర్గ కన్వీనర్ వడ్డేపల్లి నర్సింహరాములు, నాయకులు రాణాప్రతాప్రెడ్డి, కంభంపాటి పుల్లారావు, ఎర్రబెల్లి ప్రదీప్రావు, డాక్టర్ కాళీప్రసాదరావు, మోహన్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల