Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

PM Narendra Modi warning to Pakistan1
'అణు'మాత్రం బెదరం!.. దాయాదికి ప్రధాని మోదీ హెచ్చరిక

న్యూఢిల్లీ: ‘‘ఉగ్రవాద చర్యలకు ఇకపై ఆపరేషన్‌ సిందూర్‌తోనే బదులిస్తాం. ఇదే భారత ప్రభుత్వ నీతి. ఇదే మన నూతన విధానం’’ అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ‘‘దాయాది అణు బెదిరింపులకు దిగితే సహించే ప్రసక్తే లేదు. అంతేకాదు, ఉగ్రవాదాన్నీ, దానికి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్న పాక్‌ ప్రభుత్వాన్నీ ఇకనుంచి వేర్వేరుగా చూడబోం. పాక్‌ చర్యలన్నింటినీ ఇకపై ‘సిందూర్‌’ గీటురాయితోనే పరిశీలిస్తాం. మనపై ఎలాంటి దుశ్చర్యకు పాల్పడ్డా ‘సిందూర్‌’ తరహాలో ఆ దేశంపై నిర్ణాయక రీతిలో దాడులు చేస్తాం. జన్మలో మర్చిపోలేని రీతిలో గుణపాఠం నేర్పుతాం’’ అని కుండబద్దలు కొట్టారు. పాక్‌ ‘అణు’ ఆటలు మనముందు సాగవని ఆ దేశ సైనిక స్థావరాలపై జరిపిన దాడులతో ప్రపంచానికి ఇప్పటికే నిరూపించామన్నారు. ‘‘కశ్మీర్‌ మంచుకొండల నుంచి రాజస్తాన్‌ ఎడారుల దాకా పాక్‌ దాడులన్నింటినీ తిప్పికొట్టాం. కేవలం మన సరిహద్దులపై దాడికి ప్రయత్నించినందుకే దాయాది ఆయువుపట్లను తూట్లు చేశాం. అది గొప్పగా చెప్పుకునే వైమానిక స్థావరాలన్నింటినీ పూర్తిగా నేలమట్టం చేసి కాళ్లబేరానికి తీసుకొచ్చాం. భారత్‌తో యుద్ధానికి దిగిన ప్రతిసారీ పాక్‌ను మట్టి కరిపించాం’’ అని గుర్తు చేశారు. ఆ విజయ పరంపరలో ఆపరేషన్‌ సిందూర్‌ను కలికితురాయిగా అభివర్ణించారు. పాక్‌ ప్రభుత్వం, సైన్యం కలసికట్టుగా దశాబ్దాలుగా పెంచి పోషిస్తున్న ఉగ్రవాద భూతం చివరికి ఆ దేశాన్నే కబళిస్తుందని మోదీ హెచ్చరించారు. ‘‘ఆ దేశం మనుగడ సాగించాలంటే ఉగ్రవాదాన్ని దాని గడ్డపై నుంచి కూకటివేళ్లతో పెకిలించాల్సిందే. దానికి మరో మార్గం లేదు’’ అంటూ హితవు పలికారు. ఆపరేషన్‌ సిందూర్‌ అనంతరం ప్రధాని తొలిసారిగా సోమవారం రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. పాక్‌పై మన సైనిక విజయాన్ని దేశంలోని ప్రతి తల్లికి, సోదరికి, కూతురికి అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... సిందూర్‌... దేశ భావనకు ప్రతిరూపం ‘‘సిందూరం కేవలం పేరు కాదు. సరైన న్యాయానికి అఖండ ప్రతిజ్ఞ. కోట్లాది భారతీయుల భావనలకు ప్రతిరూపం. ఉగ్రవాదం తాలూకు వికృత రూపమే పహల్గాం దాడి! అమాయక పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడి నన్నెంతగానో కలచివేసింది. భార్యాపిల్లల కళ్లముందే ఒక్కొక్కరిని కాల్చి పొట్టన పెట్టుకున్న వికృతత్వాన్ని ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా ఖండించాయి. అందుకు ప్రతీకారం కోసం దేశమంతా ఒక్కటైంది. ఉగ్రవాదులను మట్టిలో కలిపేందుకు సైన్యానికి ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. వారు కలలో కూడా ఊహించని విధంగా పాక్, పీఓకేలోని బహావల్‌పూర్, మురిద్కే తదితర ఉగ్రవాద కేంద్రాలు, శిక్షణ శిబిరాలపై మన సైన్యం విరుచుకుపడి నేలమట్టం చేసింది. అవన్నీ నిజానికి ప్రపంచ ఉగ్రవాద యూనివర్సిటీలు. అమెరికాపై 9/11, లండన్‌ మెట్రో తదితర దాడులన్నింటికీ అక్కడినుంచే పథకరచన జరిగింది. అలాంటి కేంద్రాలతో పాటు ఉగ్రవాదుల స్థైర్యాన్ని కూడా మన ధ్వంసం చేసింది. దశాబ్దాలుగా పాక్‌ గడ్డపై బాహాటంగా రొమ్ములు విరుచుకుని సంచరిస్తున్న 100 మందికి పైగా అత్యంత కరడుగట్టిన ఉగ్రవాదులను హతమార్చింది. మన మహిళల నుదుటి సిందూరం తుడిపేస్తే ఏమవుతుందో ప్రతి ఉగ్ర ముఠాకూ తెలిసొచ్చేలా చేశాం. ఉగ్రతండాలనే సమూలంగా తుడిచిపెట్టేశాం. కాల్పులకు కేవలం విరామమే ఉగ్ర కేంద్రాలపై మన దాడితో పాక్‌ బిక్కచచ్చిపోయింది. మన దాడుల్లో హతమైన ఉగ్రవాదులకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపింది. వాటిలో పాక్‌ సైనిక ఉన్నతాధికారులు బాహాటంగా పాల్గొన్నారు. పాక్‌ ప్రభుత్వ ప్రోత్సాహంతో ఉగ్రవాదులు చెలరేగిపోతున్నారనేందుకు ఇది తిరుగులేని రుజువు. తన గడ్డ మీది ఉగ్ర శిబిరాలు తుడిచిపెట్టుకుపోయాయనే నిరాశతో పాక్‌ దుస్సాహసానికి దిగింది. ఉగ్ర పోరులో మనతో కలిసి రావాల్సింది పోయి మనపైనే దాడులకు తెగబడింది. విచక్షణ కోల్పోయి మన సైనిక స్థావరాలతో పాటు విద్యా సంస్థలు, ప్రార్థనాలయాలు, ఇళ్లను కూడా లక్ష్యం చేసుకుంది. కానీ ఆ ప్రయత్నంలో ఘోరంగా విఫలమైంది. పాక్‌ డ్రోన్లు, క్షిపణులను మన ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ ఎక్కడివక్కడ నేలకూల్చింది. మనం అంతటితో ఆగలేదు. వాళ్లు సరిహద్దులపై దాడి చేస్తే నేరుగా పాక్‌ గుండెకాయకే గురిపెట్టాం. ప్రధాన నగరాల్లోని వాళ్ల కీలక సైనిక, వైమానిక స్థావరాలన్నింటినీ నేలమట్టం చేశాం. పాక్‌ సైన్యానికి ఊహించలేనంత నష్టం మిగిల్చాం. ఆ క్రమంలో మన బలగాలు అంతులేని సామర్థ్యాన్ని, సంయమనాన్ని ఏకకాలంలో అద్భుత రీతిలో ప్రదర్శించాయి. మన దేశీయ ఆయుధ వ్యవస్థ తాలూకు పాటవాన్ని పూర్తిస్థాయిలో రుచిచూపాయి. దాంతో బెంబేలెత్తిపోయి దాయాది కాళ్లబేరానికొచ్చింది. ఎలాగోలా పరువు కాపాడుకునే ప్రయత్నాలకు దిగింది. కాపాడండంటూ ప్రపంచ దేశాలను వేడుకుంది. మే 10న మన పాక్‌ డీజీఎంఓ మన డీజీఎంఓకు కాల్‌ చేశారు. ‘‘ఇకపై మా గడ్డపై ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలూ, సైనిక దుస్సాహాసాలూ జరగబోవు’’ అని స్పష్టంగా హామీ ఇచ్చారు. అప్పటికే పాక్‌ గుండెలపై పుట్టుకొచ్చిన ఉగ్ర తండాలన్నింటినీ మనం నేలమట్టం చేయడమే గాక దాని పీచమణచాం. కనుక వారి అభ్యర్థనపై ఆలోచించాం. అయినా కాల్పులకు కేవలం విరామం మాత్రమే ఇచ్చాం. ఎలాంటి కవి్వంపులకు దిగినా పాక్‌కు మరోసారి బుద్ధి చెప్పేందుకు మన సైన్యం, వైమానిక, నావికా దళాలు, బీఎస్‌ఎఫ్‌ సర్వ సన్నద్ధంగా ఉన్నాయి. ఐక్యతే మన శక్తి ఉగ్రవాదాన్ని ఇకముందు ఏమాత్రమూ సహించేది లేదు. మన ఐక్యతే దానికి మరణశాసనం. అదే మన అతిపెద్ద శక్తి. ఇది యుద్ధాల యుగం కాదు. నిజమే. కానీ ఉగ్రవాద యుగం కూడా కాదని ప్రపంచమంతా ఒక్కతాటిపైకి వచ్చి స్పష్టమైన సందేశమివ్వాలి. 21వ శతాబ్దపు అధునాతన యుద్ధ రీతులతో ఉగ్రవాదాన్ని తుదముట్టించాల్సిన సమయం ఆసన్నమైంది. అప్పుడే మెరుగైన సమాజానికి బాటలు పరిచిన వాళ్లమవుతాం.’’ పీఓకేను అప్పగించాల్సిందే ఏ చర్చలైనా ఆ అంశంపైనే ఉగ్రవాదంపై భారత వైఖరి సుస్పష్టమని మోదీ చెప్పారు. ‘‘ఉగ్రవాదం, వాణిజ్యం, చర్చలు ఏకకాలంలో కొనసాగలేవు. నీళ్లు, రక్తం కలసికట్టుగా పారడం జరగని పని’’ అని స్పష్టం చేశారు. తద్వారా ఉగ్రవాదానికి పాక్‌ పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేసేదాకా ఆ దేశంపై ఆర్థిక, వాణిజ్య ఆంక్షలు, సింధూ జలాల ఒప్పందం నిలిపివేత తదితర చర్యలు కొనసాగుతాయని చెప్పకనే చెప్పారు. ‘‘ఉగ్రవాదాన్ని ఆపాల్సిందే. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌కు అప్పగించి తీరాల్సిందే. పాక్‌తో ఏ చర్చలైనా కేవలం ఈ రెండు అంశాలపైనే జరుగుతాయి. పాక్‌తో పాటు ప్రపంచ దేశాలకు కూడా ఈ విషయం స్పష్టం చేస్తున్నా’’ అంటూ ప్రధాని కుండబద్దలు కొట్టారు. శక్తితోనే శాంతి ‘‘నేను బుద్ధపూర్ణిమ. ప్రపంచానికి బుద్ధుడు చూపిన శాంతిమార్గం కూడా శక్తి గుండానే సాగుతుంది’’ అని మోదీ స్పష్టం చేశారు. ‘ప్రతి భారతీయుడూ శాంతియుతంగా జీవించాలి. వికసిత భారత స్వప్నం సాకారం కావాలి. అందుకు భారత్‌ శక్తిమంతమైన దేశంగా మారడం తప్పనిసరి. ఆ శక్తిని అవసరమైనప్పుడు ప్రదర్శించి చూపాలి. గత కొద్ది రోజులుగా మనం చేసింది సరిగ్గా అదే. ఆ యజ్ఞంలో భాగస్వాములైన సైనిక బలగాలకు, నిఘా వర్గాలకు, శాస్త్రవేత్తలకు అందరికీ ప్రతి భారతీయుని తరఫునా నా సెల్యూట్‌.

Chandrababu TDP Govt corruption in the name of new liquor policy2
బాబే సూత్రధారి.. ‘ముఖ్య’నేత సమర్పించు.. మందు ‘పాత్రలు’!

సాక్షి, అమరావతి: మద్యం మాఫియా డాన్‌గా గుర్తింపు పొందిన ముఖ్యమంత్రి చంద్రబాబు రెడ్‌బుక్‌ కుట్రను రక్తి కట్టించేందుకు సరికొత్త కుతంత్రాలకు పదును పెడుతున్నారు. వ్యూహాత్మకంగా పాత్రధారులను ఎంపిక చేసుకుని ప్రలోభపెట్టి, బెదిరించి దారికి తెచ్చుకుని అబద్ధపు వాంగ్మూలాలతో రోజుకో భేతాళ కథను తెరపైకి తెస్తున్నారు. కట్టు కథలు అల్లుతూ, బేతాళ కథలను సృష్టిస్తూ వాటిని వారితో పలికిస్తున్నారు. అవే కల్పిత కథలను రిమాండ్‌ రిపోర్టులో పొందుపరుస్తున్నారు. దానిపై తాము సంతకం చేయలేదని నిందితులే స్వయంగా న్యాయమూర్తుల ఎదుట వెల్లడిస్తున్నారంటే బాబు భేతాళ కథలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక టీడీపీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వ్యాపార భాగస్వామిగా ఉన్న రాజ్‌ కేసిరెడ్డిని సరికొత్త పాత్రధారిగా చంద్రబాబు తీసుకొచ్చారు. తాను అబద్ధాలు చెప్పలేనని, ఇంత దారుణమైన రిమాండ్‌ రిపోర్టుపై సంతకం చేయలేదని రాజ్‌ కేసిరెడ్డి స్వయంగా చెప్పారు. అదే విషయాన్ని న్యాయస్థానంలోనూ వెల్లడించారు. సిట్‌ అధికారుల వేధింపులు, అబద్ధపు వాంగ్మూలాలపై మూడుసార్లు కోర్టుకు మొర పెట్టుకున్న బెవరేజెస్‌ కార్పొరేషన్‌ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి చివరకు తమ దారికి రావడంతో ప్రభుత్వ పెద్దలు ఆగమేఘాలపై రిలీవ్‌ చేసి కేంద్ర సర్వీసులకు సాగనంపారు. రెడ్‌బుక్‌ అరాచకాలు, బెదిరింపులను డిస్టిలరీల యజమానులు సైతం న్యాయస్థానానికి నివేదించారు. చంద్రబాబు సూత్రధారిగా ఆడిస్తున్న ఈ కపట నాటకంలో బెవరేజస్‌ కార్పొరేషన్‌ పూర్వ ఉద్యోగులు సత్యప్రసాద్, అనూష, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ నేత ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్‌రెడ్డి పావులుగా మారారు. బెదిరించడం.. వెంటాడి వెంటాడి వేధించడం.. అబద్ధపు వాంగ్మూలాలు ఇప్పించడం దాకా అంతా చంద్రబాబు డైరెక్షన్‌లోనే సాగుతోంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో అడ్డంగా దొరికిపోయి బెయిల్‌పై ఉన్న చంద్రబాబు.. గత ప్రభుత్వం అమలు చేసిన పారదర్శక మద్యం విధానంపై దుష్ప్రచారం సాగిస్తూ అవే అంశాలను పాత్రధారులతో పలికిస్తున్నారు. గతంలో 2014–19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా సాగించిన మద్యం దందాను మించి ఇప్పుడు 2024లో నూతన విధానం పేరుతో దోపిడీకి రాచబాట వేసుకున్నారు. టీడీపీ సిండికేట్‌ దోపిడీకి అడ్డుకట్ట వేసి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన దశలవారీ మద్య నియంత్రణ విధానంపై అక్రమ కేసుతో కుయుక్తులకు పదును పెడుతున్న వైనం ఇదిగో ఇలా ఉంది... సిట్‌ వేధింపులపై మూడుసార్లు కోర్టుకు.. చివరికి తలొగ్గడంతో కేంద్ర సర్వీసులకు చంద్రబాబు రెడ్‌బుక్‌ కుట్రలో మొదటి పాత్రధారి బెవరేజస్‌ కార్పొరేషన్‌ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి. తమ కుట్రకు అనుగుణంగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని టీడీపీ ప్రభుత్వం ఆయన్ను తీవ్రంగా బెదిరించింది. అందుకు మొదట్లో ససేమిరా అన్న వాసుదేవరెడ్డి మూడుసార్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం గమనార్హం. అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని సిట్‌ అధికారులు తనను బెదిరిస్తున్నట్లు కోర్టుకు మొర పెట్టుకున్నారు. అయినా సరే సిట్‌ అధికారులు వెనక్కి తగ్గకుండా వేధించారు. కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన ఆయనను డెప్యుటేషన్‌ కాలపరిమితి ముగిసినా రిలీవ్‌ చేయలేదు. చివరికి సిట్‌ వేధింపులకు వాసుదేవరెడ్డి తలొగ్గారు. చంద్రబాబు కుట్రకు అనుగుణంగా.. సిట్‌ అధికారులు చెప్పమన్నట్లుగా అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ఈ కుట్ర నాటకంలో తాను ఇచ్చిన పాత్రకు వాసుదేవరెడ్డి న్యాయం చేశారని చంద్రబాబు సంతృప్తి చెందారు. అంతే.. ఆ వెంటనే ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం రిలీవ్‌ చేయడం... ఢిల్లీలో కేంద్ర సర్వీసులో చేరిపోవడం చకచకా జరిగిపోయాయి. ఆ ఇద్దరూ.. కీలు బొమ్మలే బెవరేజస్‌ కార్పొరేషన్‌ పూర్వ ఉద్యోగులు సత్యప్రసాద్, అనూషను సైతం చంద్రబాబు తన కుట్ర నాటకంలో పాత్రధారులుగా చేశారు. వారిని కూడా సిట్‌ అధికారులు భయపెట్టి, బెదిరించి దారికి తెచ్చుకున్నారు. దాంతో సిట్‌ అధికారులు చెప్పినట్టుగా సత్యప్రసాద్, అనూష అబద్ధపు వాంగ్మూలాలు ఇచ్చారు.రాజకీయ పాత్రధారి విజయసాయిరెడ్డి అనంతరం చంద్రబాబు పక్కా పన్నాగంతో తన కుట్రలో రాజకీయ నేతను పాత్రధారిగా ప్రవేశపెట్టారు. అది మరెవరో కాదు.. మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి. వైఎస్సార్‌సీపీ అధినేత ఆయన్ను విశ్వసించి వరుసగా రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా చేశారు. మరో మూడున్నరేళ్లు పదవీ కాలం మిగిలి ఉన్నప్పటికీ ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఉపఎన్నికలు వస్తే రాజ్యసభ సీటును తిరిగి గెలుచుకునేంత ఎమ్మెల్యేల బలం వైఎస్సార్‌సీపీకి లేదని తెలిసి కూడా రాజీనామా చేయడం గమనార్హం. అంటే రాజ్యసభలో టీడీపీ కూటమికి ప్రయోజనం కలిగించేందుకే ఆయన రాజీనామా చేశారు. అనంతరం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై టీడీపీ కూటమి సర్కారు బనాయించిన అక్రమ కేసుకు ఆయన వంతపాడటం అసలు కుట్రను బట్టబయలు చేసింది. కాకినాడ పోర్టులో వాటాల బదిలీపై కేసు విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి బయటకు వచ్చాక మద్యం అక్రమ కేసు గురించి మాట్లాడారంటే దీని వెనుక ఉన్న వ్యూహాన్ని అర్థం చేసుకోవచ్చు. తాజాగా తెరపైకి టీడీపీ నేత శ్రీధర్‌రెడ్డిరెడ్‌బుక్‌ కపట నాటకంలో చంద్రబాబు తాజాగా టీడీపీ నేత శ్రీధర్‌రెడ్డిని తెరపైకి తెచ్చారు. 2014లో వైఎస్సార్‌సీపీ తరఫున నంద్యాల ఎంపీగా గెలిచి, వెంటనే టీడీపీలోకి ఫిరాయించిన ఎస్పీవై రెడ్డికి ఆయన అల్లుడు కావడం గమనార్హం. అందుకే ఎస్పీవై రెడ్డి కుటుంబ డిస్టిలరీకి టీడీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అప్పటి నుంచి శ్రీధర్‌రెడ్డి టీడీపీ కూటమిలో రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయనతో అబద్ధపు వాంగ్మూలం ఇప్పించి వైఎస్సార్‌సీపీపై దుష్ప్రచారం చేయించేందుకు సిట్‌ కుట్ర పన్నుతుండటం గమనార్హం. విజయవాడ ఎంపీ వ్యాపార భాగస్వామి రాజ్‌ కేసిరెడ్డి ఈ కుట్రలకు మరింత పదును పెడుతూ ఈ కేసులో రాజ్‌ కేసిరెడ్డిని ఏ 1గా చూపించారు. ఆయన ఎవరో కాదు.. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) వ్యాపార భాగస్వామే! ఇద్దరి కంపెనీల చిరునామా, మెయిల్‌ ఐడీ కూడా ఒకటే కావడం గమనార్హం. అమెరికా, దుబాయ్‌ సహా వివిధ దేశాలకు అక్రమ నిధులు తరలించేందుకు వారిద్దరూ భాగస్వాములుగా ఏర్పాటు చేసుకున్న కంపెనీల వివరాలను చిన్ని అన్న, మాజీ ఎంపీ కేశినేని నాని ఇటీవల స్వయంగా వెల్లడించడం తెలిసిందే. ఎంపీ కేశినేని చిన్ని, ఆయన భార్య జానకిలక్ష్మి, రాజ్‌ కేసిరెడ్డి ప్రైడ్‌ ఇన్ఫ్రా ఎల్‌ఎల్‌పీతోపాటు ఇతర వ్యాపార సంస్థల్లో భాగస్వాములుగా ఉన్నట్లు కేశినేని నాని స్వయంగా సీఎం చంద్రబాబుకు లేఖ రాయడం తెలిసిందే. ఆ అధికారులకేం సంబంధం..? చంద్రబాబు పక్కా పన్నాగంతోనే గత ప్రభుత్వ హయాంలో సీఎంవోలో విధులు నిర్వర్తించిన ఉన్నతాధికారులను ఈ అక్రమ కేసులో ఇరికిస్తున్నారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఏ.ధనుంజయ్‌రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, వికాట్‌ కంపెనీ డైరెక్టర్‌ బాలాజీ గోవిందప్పను ఈ కేసులో నిందితులుగా చేర్చడం కుట్రలకు పరాకాష్ట. ధనుంజయ్‌రెడ్డి సీఎంవోలో ఎక్సైజ్‌ శాఖ వ్యవహారాలను ఏనాడూ పర్యవేక్షించలేదు. ఇక ఓఎస్డీ కృష్ణ మోహన్‌రెడ్డికి ఎక్సైజ్‌ శాఖ, బెవరేజస్‌ కార్పొరేషన్‌ వ్యవహారాలతో ఎలాంటి సంబంధం ఉండదు. అయినా సరే వారిని నిందితులుగా చేర్చడం విడ్డూరంగా ఉంది. సీఐడీ చేతులెత్తేయడంతో.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం కేసును సీఐడీకి అప్పగించింది. మూడు నెలలపాటు దర్యాప్తు చేసిన సీఐడీ ఎలాంటి అక్రమాలూ లేవని చేతులెత్తేసింది. అయినా సరే ఇది ఎల్లో మీడియాకు పట్టదు. తరువాత టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో ఏర్పాటైన సిట్‌ ఈ కుట్రలకు వత్తాసు పలుకుతోంది. రోజుకో కట్టుకథ అల్లుతూ అవాస్తవాలు, అభూత కల్పనలు ప్రచారంలోకి తేవడమే పనిగా పెట్టుకుంది. కమీషన్లు టీడీపీ పెద్దలకే తెలుసు..! మద్యం అమ్మకాలు పెరిగే కొద్దీ డిస్టిలరీలకు లాభాలు పెరుగుతాయి. మరి ఏ ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు పెరిగాయన్నది పరిశీలించాలి. చంద్రబాబు పాలనలో 2014–19లో మద్యం అమ్మ­కాలు భారీ ఎత్తున జరగగా... అనంతరం వైఎస్‌ జగన్‌ హయాంలో 2019–24 మధ్య అమ్మకాలు గణనీయంగా తగ్గాయని ఎక్సైజ్‌ శాఖ రికార్డులే స్పష్టం చేస్తున్నాయి. అంటే డిస్టిలరీల నుంచి కమీషన్లు అందింది టీడీపీ పెద్దలకేనని స్పష్టమవుతోంది.సిట్‌ వేధింపులపై కోర్టుకు డిస్టిలరీల ప్రతినిధులుదర్యాప్తు పేరిట సిట్‌ అధికారులు తమను వేధిస్తుండటంపై పలు డిస్టిలరీల ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. సిట్‌ అధికారులు తమను హింసిస్తున్నారని వాపోయారు. దాంతో డిస్టిలరీల ప్రతినిధులను వారి నివాసాల్లోనే విచారించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ అక్రమ కేసులో ఇరికించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎంతగా బరి తెగిస్తోందో చెప్పేందుకు ఈ ఉదంతమే తార్కాణం. మిథున్‌రెడ్డి సవాల్‌పై స్పందించని సర్కారు చంద్రబాబు తాను ప్రవేశపెట్టిన పాత్రధారుల ద్వారా వైఎస్సార్‌సీపీ కీలక నేతలపై తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారు. వాటిని తిప్పికొడుతూ వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి విసిరిన సవాల్‌కు మాత్రం స్పందించలేదు. తన నివాసంలో సమావేశమయ్యామని విజయసాయిరెడ్డి పేర్కొనటాన్ని ఎంపీ మిథున్‌రెడ్డి తీవ్రంగా తిప్పికొట్టారు. అదే నిజమైతే గూగుల్‌ టేక్‌ అవుట్‌ ద్వారా నిరూపించాలని మిథున్‌రెడ్డి సవాల్‌ చేస్తే కూటమి ప్రభుత్వం నోరు విప్పలేదు.మద్యం దోపిడీ వ్యవస్థీకృతం..రాచబాట పరిచిన టీడీపీ సర్కారు మద్యం విధానం ముసుగులో 2014–19 మధ్య భారీ దోపిడీకి కుట్ర పన్నింది చంద్రబాబు ప్రభుత్వమే. అందుకు అవసరమైన అన్ని దోపిడీ మార్గాలను పొందుపరిచింది చంద్రబాబే. భారీగా నల్లధనం వరద పారించేందుకు అవసరమైన దొంగదారులన్నిటికీ తమ ప్రభుత్వ విధానంలో స్థానం కల్పించారు. అందుకే 14 డిస్టిలరీలకు టీడీపీ ప్రభుత్వమే అనుమతినిచ్చింది. అవన్నీ యనమల రామకృష్ణుడు, పుట్టా సుధాకర్‌ యాదవ్, ఎస్పీవై రెడ్డి, డీకే ఆదికేశవులు తదితర టీడీపీ నేతలకు చెందినవే కావడం గమనార్హం. బెవరేజస్‌ కార్పొరేషన్‌ ద్వారా మద్యం కొనుగోళ్ల కోసం రాష్ట్రంలోని మొత్తం 20 డిస్టిలరీలను ఎంప్యానల్‌ చేసింది కూడా చంద్రబాబు ప్రభుత్వమే. మద్యం అమ్మకాలు భారీగా పెంచి డిస్టిలరీల నుంచి కమీషన్లు కొల్లగొట్టింది. ఊరూపేరూలేని మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టింది స్వయానా చంద్రబాబే. క్షేత్రస్థాయిలో మద్యం విక్రయించే మొత్తం 4,380 మద్యం దుకాణాలన్నీ టీడీపీ సిండికేట్‌కు అడ్డగోలుగా కట్టబెట్టారు. వాటికి అనుబంధంగా అనధికారిక బార్లుగా 4,380 పర్మిట్‌ రూమ్‌లకు అనుమతినిచ్చారు. అంతేకాదు.. ఏకంగా 43 వేల బెల్ట్‌ దుకాణాలను ఏర్పాటు చేశారు. ఎంఆర్‌పీ కంటే బాటిల్‌పై రూ.15 నుంచి రూ.25 అధిక ధరకు మద్యం విక్రయించారు. మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్‌ ఫీజును రద్దు చేస్తూ రెండు చీకటి జీవోలు జారీ చేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారు. అంటే మద్యం దోపిడీదారు చంద్రబాబే అన్నది నిగ్గు తేలుతోంది. వైఎస్సార్‌సీపీ పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై బురద జల్లుతుండటం కేవలం రెడ్‌బుక్‌ కుట్రేనన్నది స్పష్టం. మద్యం విధానం ముసుగులో 2014–19లో చేసిన దోపిడీని చంద్రబాబు ఇప్పుడు మరింత భారీ స్థాయిలో కొనసాగిస్తున్నారు. లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించే కుతంత్రం.. వైఎస్సార్‌సీపీ హయాంలో మద్యం విధానంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని తెలుసు కాబట్టే అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాల కోసం సిట్‌ దర్యాప్తు ముసుగులో చంద్రబాబు ప్రభుత్వం బరి తెగించి వేధింపులకు తెగబడుతోంది. 2019–24 మధ్య వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దశలవారీ మద్య నియంత్రణ విధానాన్ని సమర్థంగా అమలు చేసింది. అంతకుముందు టీడీపీ హయాంలో దోపిడీకి పాల్పడ్డ ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రవేశపెట్టి వేళలను కుదించింది. టీడీపీ హయాంలో ఉన్న 4,380 మద్యం దుకాణాలను 2,934కి తగ్గించింది. చంద్రబాబు సర్కారు అనధికారిక బార్లుగా లైసెన్సులు జారీ చేసిన 4,380 పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేసింది. టీడీపీ హయాంలో విచ్చలవిడిగా ఏర్పాటైన 43 వేల బెల్ట్‌ దుకాణాలను నిర్మూలించింది. కొత్తగా ఒక్క మద్యం డిస్టిలరీకి కూడా లైసెన్సు మంజూరు చేయలేదు. ఇలా విప్లవాత్మక చర్యలతో వైఎస్సార్‌సీపీ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. మద్యం అమ్మకాలు పెరిగితేనే డిస్టిలరీలు లాభాలు గడించి కమీషన్లకు ఆస్కారం ఉంటుంది. మరి వైఎస్సార్‌సీపీ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గడంతో డిస్టిలరీలకు లాభాలు తగ్గాయి. అలాంటప్పుడు కమీషన్లకు ఆస్కారం ఎక్కడుంది? మద్యం అక్రమ కేసులో సిట్‌ ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోవడంతో తాను ఎంపిక చేసుకున్న పాత్రధారుల ద్వారా చంద్రబాబు అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు ఇప్పిస్తున్నట్లు స్పష్టమవుతోంది.అక్రమ కేసు కుట్రలు మరోస్థాయికి..అందుకే బాలాజీ గోవిందప్పను నిందితుడిగా చేర్చిన వైనం వికాట్‌ కంపెనీ డైరెక్టర్‌ బాలాజీ గోవిందప్పను ఈ అక్రమ కేసులో చేర్చడం చంద్రబాబు భేతాళ కుట్రకు పరాకాష్ట. ఎందుకంటే ఆయనకు ప్రభుత్వ వ్యవహారాలతో అసలు ఏమాత్రం సంబంధమే లేదు. వికాట్‌ అంతర్జాతీయ దిగ్గజ సిమెంట్‌ కంపెనీ. 12 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న బహుళ జాతీయ సంస్థ. యూరప్‌లో టాప్‌ 5 కంపెనీల్లో ఒకటిగా ఉంది. సిమెంట్‌ రంగంలో అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు ఉన్న వికాట్‌ కంపెనీకి అనుబంధ సంస్థ భారతీ సిమెంట్స్‌. అటువంటి అంతర్జాతీయ కంపెనీకి భారత్‌లో ఆపరేషన్ల ఫైనాన్స్‌ డైరెక్టర్‌గా బాలాజీ గోవిందప్ప ఉన్నారు. ఆ కంపెనీ వ్యవహారాలతోనే ఆయన క్షణం తీరిక లేకుండా ఉంటారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండరు. బాలాజీ గోవిందప్ప వృత్తి రీత్యా చార్టెడ్‌ అకౌంటెంట్‌. వికాట్‌ కంపెనీ వ్యవహారాలతోనే ఆయన నిరంతరం తలమునకలై ఉంటారు. ఆంధ్రప్రదేశ్‌తో సంబంధమే లేని ఆయనకు ఐఏఎస్‌లతోగానీ ఇతర ప్రభుత్వ అధికారులతోగానీ ఎలాంటి సంబంధంగానీ, పరిచయంగానీ లేనే లేవు. ఇక రాజ్‌ కేసిరెడ్డితో కనీసం పరిచయం ఉండే ఆస్కారమే లేదు. పక్కా కుతంత్రంతోనే బాలాజీ గోవిందప్పను ఈ అక్రమ కేసులో నిందితుడిగా చేర్చారు. తద్వారా ఈ అక్రమ కేసు కుట్రను మరో స్థాయికి తీసుకువెళ్లాలన్నదే చంద్రబాబు పన్నాగం. భారతీ సిమెంట్స్‌ను ఏనాడో టేకోవర్‌ చేసిన వికాట్‌.. భారతీ సిమెంట్‌ కంపెనీలో మెజార్టీ వాటా వికాట్‌ కంపెనీకే ఉంది. మైనార్టీ వాటా మాత్రమే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబానికి ఉంది. కాబట్టి కంపెనీ సర్వసభ్య సమావేశ వివరాలు తెలియచేయడం, కంపెనీ భవిష్యత్‌ ప్రణాళికలు వివరించడం, త్రైమాసిక ఫలితాల ముందుగానీ తరువాతగానీ తెలియజేయడం.. భారతీ సిమెంట్స్‌పై కొనసాగుతున్న సీబీఐ అక్రమ కేసుల పురోగతి వివరాలు వివరించేందుకు వైఎస్‌ జగన్‌ కుటుంబాన్ని ఆయన అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. వైఎస్‌ జగన్‌ కుటుంబం వికాట్‌ కంపెనీలో వాటాదారు కావడంతోపాటు నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ స్థానంలో ఉన్నందున ఆ పరిణామాలన్నీ వివరిస్తారు. ఓ కంపెనీ తన వాటాదారులకు ఈ అంశాలను వివరించడం సర్వసాధారణ వ్యవహారం. రిలయన్స్‌ లాంటి కంపెనీలు కూడా తమ కంపెనీల్లో ఎక్కువ షేర్లు ఉన్నవారికి సంస్థకు సంబంధించిన పరిణామాలను తరచూ వివరిస్తూ ఉంటాయి. ఈ అంశాలను వక్రీకరిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేయడం పక్కా కుట్రే. వైఎస్‌ జగన్‌ కుటుంబ కంపెనీ కాకపోయినా భారతీ సిమెంట్స్‌ను అప్రతిష్ట పాలు చేయడం, అందులో మైనార్టీ వాటాదారుగా మాత్రమే ఉన్న ఆ కుటుంబంపై దుష్ప్రచారం చేయాలన్న లక్ష్యంతోనే చంద్రబాబు పన్నిన భేతాళ కుట్రే ఇది. బాబు కుట్రలకు ఎల్లో మీడియా భజనచంద్రబాబు కుట్రలకు ఎల్లో మీడియా కోరస్‌ పాడుతోంది. వైఎస్‌ జగన్‌ కుటుంబానికి బాలాజీ గోవిందప్ప ఆర్థిక సలహాలు ఇస్తుంటారని దుష్ప్రచారం చేస్తోంది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఫ్లెక్సీ డిపాజిట్లు, షేర్లలో పెట్టుబడులపై వైఎస్‌ జగన్‌ కుటుంబం బాలాజీ గోవిందప్ప సలహాలను ఎందుకు తీసుకుంటారు? వైఎస్‌ జగన్‌ కుటుంబానికి దశాబ్దాలుగా పవర్‌ ప్రాజెక్టులు, మీడియా, రియల్‌ ఎస్టేట్‌ లాంటి సొంత కంపెనీలున్నాయి. తమకు మెజార్టీ వాటా ఉన్న ఆ కంపెనీల ద్వారా ఏటా దాదాపు రూ.150 కోట్ల లాభం ప్రకటిస్తున్నారు. ఆ కంపెనీల ఆర్థిక కార్యకలాపాలు పర్యవేక్షించేందుకు, సలహాలు ఇచ్చేందుకు ఎంతోమంది ఆడిటర్లు, ఫైనాన్స్‌ డైరెక్టర్లు ఉన్నారు. ఆర్థిక సలహాల కోసం వారిని సంప్రదిస్తారు. అంతేగానీ తాను మైనార్టీ వాటాదారుగా ఉన్న భారతీ సిమెంట్స్‌ డైరెక్టర్‌ను ఎందుకు సంప్రదిస్తారు? ఈ దుష్ప్రచారం అంతా కేవలం చంద్రబాబు భేతాళ కుట్రే. వాస్తవాలతో నిమిత్తంలేని ఎల్లో మీడియా ఇందులో తరిస్తోంది. చంద్రబాబు డైరెక్షన్‌లో వైఎస్‌ జగన్‌ కుటుంబంపై దుష్ప్రచార కుతంత్రానికి వత్తాసు పలుకుతోంది.

China and US agree to ease tariffs for 90 days as trade war talks extended3
ఇటు30 అటు10

జెనీవా: ఎడాపెడా టారిఫ్‌లు విధించుకుంటూ వాణిజ్యయుద్ధాన్ని మొదలెట్టిన అమెరికా, చైనా ఎట్టకేలకు శాంతించాయి. పరస్పర వాణిజ్య ప్రయోజనాలే పరమావధిగా సమష్టిగా సంధికి ఆమోదముద్ర వేశాయి. ఇందులోభాగంగా సోమవారం స్విట్జర్లాండ్‌లోని జెనీవా నగర వేదికగా వాణిజ్య ఒప్పందాన్ని కుదర్చుకుని టారిఫ్‌ రణానికి ముగింపు పలికినట్లు సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. చైనా ఉత్పత్తులపై 145 శాతం టారిఫ్‌ విధిస్తామని ట్రంప్‌ సర్కార్, అందుకు దీటుగా అమెరికా ఉత్పత్తులపై 125 శాతం టారిఫ్‌ వసూలుచేస్తామని జిన్‌పింగ్‌ ప్రభుత్వం గతంలో ప్రకటించడం తెల్సిందే. సోమవారం కుదిరిన తాజా వాణిజ్య ఒప్పందంతో ఈ టారిఫ్‌లు భారీగా దిగిరానున్నాయి. ఒప్పందం మేరకు ఇకపై చైనా ఉత్పత్తులపై అమెరికా 30 శాతం టారిఫ్‌లు విధించనుంది. అమెరికా ఉత్పత్తులపై చైనా కేవలం 10 శాతం టారిఫ్‌లు విధించనుంది. తొలుత 3 నెలలపాటు అమలుతొలుత 90 రోజులపాటు ఈ టారిఫ్‌లనే అమలుచేసి, సమీక్ష జరిపి అందుకు అనుగుణంగా తదుపరి నిర్ణయాలు తీసుకోనున్నారు. జెనీవాలో ఈ మేరకు అమెరికా, చైనా తరఫున అత్యున్నత స్థాయి అధికారులు మంతనాల జరిపి ట్రేడ్‌ డీల్‌ను ఖరారుచేశారు. ఐక్యరాజ్యసమితిలో స్విస్‌ రాయబారి అధికారిక నివాసంలో జరిగిన ఈ చర్చల్లో అమెరికా తరఫున అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్‌ బెసెంట్, వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి జేమ్సన్‌ గ్రీర్‌ పాల్గొన్నారు. ఆర్థిక, వాణిజ్యం సంబంధాలపై ఇకమీదటా ద్వైపాక్షిక చర్చలు కొనసాగుతాయని స్కాట్‌బెసెంట్‌ అన్నారు. ‘‘ ఇరువైపులా పెరిగిన అత్యధిక టారిఫ్‌లతో వాణిజ్యం ఒక్కసారిగా స్తంభించిపోయింది. చైనాతో వాణిజ్యబంధం బలోపేతానికే కృషిచేస్తున్నాం. అందుకే పెంచిన టారిఫ్‌లను మళ్లీ తగ్గిస్తున్నాం. సమతుల వాణిజ్యం కోరుకుంటున్నాం. ఈ తరహా వాణిజ్యాన్ని సాకారాంచేస్తాం’’ అని బెసెంట్‌ వ్యాఖ్యానించారు. తర్వాత చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదలచేసింది. ‘‘ ఇరువైపులా 91 శాతం టారిఫ్‌ తగ్గించుకున్నాం. మేం మరో 90 రోజులకోసం మరో 24 శాతం తగ్గించాం. దీంతో అమెరికాపై మా టారిఫ్‌ 10 శాతానికి దిగొచ్చింది. ఏప్రిల్‌ రెండో తేదీన అమెరికా టారిఫ్‌లు పెంచాక మేం తీసుకున్న ప్రతీకార నిర్ణయాలనూ ఉపసంహరించుకుంటున్నాం’’ అని చైనా ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే 90 రోజులపాటు ఈ రేట్లనే కొనసాగించి తర్వాత సమీక్ష జరపనున్నారు. దీనిపై కొందరు అంతర్జాతీయ ఆర్థికవేత్తలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ‘‘ ఇది తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం లాంటిదే. 90 రోజుల తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం’’ అని క్యాపిటల్‌ ఎకనమిక్స్‌లో చీఫ్‌ ఆసియా ఎకానమిస్ట్‌ మార్క్‌ విలియమ్స్‌ వ్యాఖ్యానించారు. ‘‘ 90 రోజుల తర్వాత ఏం జరుగుతుందనే ఇక్కడ అసలు ప్రశ్న’’ అని చైనాలో యురోపియన్‌ యూనియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు జేన్స్‌ ఎస్కీలెండ్‌ అన్నారు. సింథటిక్‌ డ్రగ్‌ అయిన ఫెంటానిల్‌ను తమ దేశంలోకి చైనా పోటెత్తిస్తోందంటూ ట్రంప్‌ సర్కార్‌ తొలుత టారిఫ్‌ల పెంపు జెండా ఎగరేయడం తెల్సిందే.

Rasi Phalalu: Daily Horoscope On 13-05-2025 In Telugu4
ఈ రాశి వారు శుభవార్తలు వింటారు.. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: బ.పాడ్యమి రా.10.57 వరకు, తదుపరి విదియ, నక్షత్రం: విశాఖ ఉ.8.02 వరకు, తదుపరి అనూరాధ, వర్జ్యం: ప.12.26 నుండి 2.12 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.04 నుండి 8.56 వరకు, తదుపరి రా.10.49 నుండి 11.33 వరకు, అమృత ఘడియలు: రా.10.56 నుండి 12.42 వరకు; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 5.33, సూర్యాస్తమయం: 6.18. మేషం.... కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.వృషభం.... వ్యవహారాలలో విజయం. శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. సంఘంలో విశేష గౌరవం. ఆస్తి ఒప్పందాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో సమస్యల నుంచి విముక్తి.మిథునం.... అదనపు రాబడి ఉంటుంది. సన్నిహితులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలత.కర్కాటకం.... బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. అనుకున్న పనులలో ఆటంకాలు. విద్యార్థులకు కొంత నిరాశ. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.సింహం... కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యసమస్యలు. పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. బంధువుల కలయిక. వ్యాపారాలు గందరగోళంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.కన్య... నూతన వరిచయాలు. శుభకార్యాల నిర్వహణ. వాహనయోగం. సంఘంలో ఆదరణ. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.తుల..... ఆర్థిక లావాదేవీలు అంతగా కలిసిరావు. పనుల్లో జాప్యం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యాపారాలలో అదనపు బాధ్యతలు. ఉద్యోగాలలో ఒత్తిడులు.వృశ్చికం.... చేపట్టిన పనులలో విజయం. విందువినోదాలు. సోదరులతో వివాదాలు తీరతాయి. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత సానుకూలత.ధనుస్సు...... విద్యార్థులకు కొత్త ఆశలు. కాంట్రాక్టులు దక్కుతాయి. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.మకరం.... పనులలో తొందరపాటు వద్దు. దూరప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త చిక్కులు.కుంభం... వ్యవహారాలలో కొద్దిపాటి ఆటంకాలు. బంధువులతో విభేదాలు. ఆధ్యాత్మిక చింతన. ఆస్తి వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉంటాయి.మీనం... పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. పనులు చకచకా సాగుతాయి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

Sakshi Guest Column On Chandrababu Govt In Andhra Pradesh5
ప్రజల్ని పక్కదారి పట్టించేందుకే...

ఈ ఏడాది ఉగాది నుంచి ‘స్వర్ణాంధ్ర–2047’ విజన్‌లో భాగంగా రాష్ట్రంలోని అత్యంత నిరుపేదలను ఆదుకోవడానికి చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ‘ప్రభుత్వ–ప్రైవేటు–ప్రజల భాగ స్వామ్యం’ (పీ4). మరింత వివరంగా చెప్పాలంటే, అత్యంత పేదరికం (జీరో పావర్టీ)తో మగ్గిపోతున్న 20 శాతం కుటుంబాలను అత్యున్నత స్థాయిలో ఆర్థికంగా నిలదొక్కుకున్న 10 శాతం మంది మార్గదర్శకులు పేదరికం నుండి విముక్తి చేసే బాధ్యతను చేపట్టాలని చంద్రబాబు నిర్దేశి స్తున్నారు. ఈ పథకంతో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించటం సాధ్యమేనా? 1991 తర్వాత దేశంలో ప్రవేశపెట్టబడిన సరళీకృత ఆర్థిక విధానాలు ఏ వర్గాలకు ఉపయోగపడ్డాయి? ఈ విధానాలు ఆశ్రిత పెట్టు బడిదారీ వర్గం పెరగడానికి తోడ్పడ్డాయి. కనుకనే జాతీయ ఆర్థిక అభివృద్ధి పెరిగినట్లు కనిపిస్తోంది కానీ పేదరికం తగ్గలేదు. ఫలితంగా భారత దేశం ఆకలి సూచీలో 150వ స్థానానికి దిగజారింది. ఈ అసలు వాస్తవా లను మరుగుపరిచి చంద్రబాబు ‘పీ4’ పథకంతో పేదరికాన్ని నిర్మూలి స్తానని చెప్పటం వృథా ప్రయాస.వాస్తవానికి ఈ పీ4 విధానం చంద్ర బాబు కొత్తగా కనిపెట్టినది ఏమీ కాదు! ఏనాడో గాంధీ ప్రబోధించిన ధర్మకర్తృత్వ సిద్ధాంతంలో భాగంగా వచ్చినదే. 2013లో మన్మోహన్‌ సింగ్‌ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలోనే నూతన ఆర్థిక సంస్కరణల అమలులో భాగంగా కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సి బిలిటీ (సీఎస్‌ఆర్‌) పథకాన్ని చట్టం రూపంలోకి తీసుకొచ్చారు. కార్పొరేట్‌ సంస్థలు రాష్ట్రంలో ఏదైనా ప్రాజెక్టులు చేపట్టినా, పెట్టు బడులు పెట్టినా ఓ ప్రాంతాన్ని లేదా మండలాన్ని లేదా గ్రామాన్ని దత్తత తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ అభివృద్ధి చేయడమే కాదు, ప్రజలను కూడా పేదరికం నుంచి గట్టెక్కించాలి. సింపుల్‌గా ఇదే పీ4 కాన్సెప్ట్‌. టాటాలు మొదలుకొని మైక్రోసాఫ్ట్‌ అధినేతల వరకు అనేక ట్రస్టుల పేరులతో కొన్ని వేల కోట్ల రూపాయల వరకు వివిధ రూపాలలో సామా జిక అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారు. అయినా దేశ సామాజిక చిత్రంలో మౌలిక మార్పులు జరిగాయా! లేకపోగా దేశ సామాజిక చిత్రపటం మరింతగా మసకబారి పోయింది. ఈ వాస్తవాల నేపథ్యంలో చూసిన ప్పుడు పీ4 పథకంతో పేదరికాన్ని నిర్మూలించడం సాధ్యమేనా? అసలు పీ4 పథకంలో ప్రకటించిన మార్గదర్శకులు ఎవరు? నూతన ఆర్థిక విధానాలలో భాగమైన ప్రైవేటీకరణకు పుట్టిన బిడ్డలే కదా! సహ జంగా ఈ సమాజంలో నెలకొన్న జీవ కారుణ్య సిద్ధాంతాలలో భాగంగా ధనవంతులు పేదవారికి సహాయం చేస్తున్నారు. కానీ చంద్రబాబు అమలు చేస్తున్న ప్రైవేటీకరణ విధానాల ఫలితంగా లాభం పొందిన పెట్టుబడిదారులకు ‘మార్గదర్శకులు’ అని పేరు పెట్టడం అన్యాయం. వివిధ రాయితీల రూపంలో ప్రజల ఆస్తులను చౌకగా కట్టబెట్టిన పెట్టు బడిదారుల చేత సహాయం చేయించి, పేదరికాన్ని నిర్మూలించాలను కోవడం ఎవరి ప్రయోజనాలను కాపాడటం కోసం? సామాజిక వ్యవస్థలో నానాటికీ పెరుగుతున్న ఆర్థిక అసమానతల ఫలితంగా ఉద్య మాలవైపు ఆకర్షితులవుతున్న ప్రజల్ని పేదరిక నిర్మూలన జరుగుతుందనే ఊహాజనిత భ్రమల్లో ముంచడానికి ప్రపంచ బ్యాంకు నిర్దేశిత పథకాల్లో ఒకటైన పీ4 పథకాన్ని ప్రజలపై ప్రయోగించటానికి పూనుకున్నారు చంద్రబాబు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన ‘జన్మభూమి’ పథకాన్ని కొత్తరూపంలో ప్రవేశపెట్టిందే పీ4 పథకం! ఉత్పత్తి సాధనాలపై ప్రజల యాజమాన్యంలో భాగంగా ‘దున్నే వానికే భూమి’, అటవీ ప్రాంతాల్లో అపారంగా ఉన్న ఖనిజ వనరులపై ఆదివాసులకు పూర్తి హక్కులు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పటం, ప్రైవేటీకరణ విధానా లను విడనాడి ప్రభుత్వ రంగంలో అన్ని రంగాల పరిశ్రమలనూ నెలకొల్పడం లాంటి విధానపరమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యమాల బాట పడుతున్న ప్రజల్ని ఉద్య మాల బాట వైపు వెళ్లకుండా నిరోధించటా నికి, అంతిమంగా ప్రజలు తమ పట్ల విధేయ తాభావంతో ఉండి తమను నాలుగు కాలాల పాటు అధికారంలో కొనసాగేలా, తమను ప్రజల పాలిట ధర్మ ప్రభువులుగా పొగిడేలా చేసుకోవడానికి ఈ పథకం ప్రవేశపెట్టారన్నది అసలు రహస్యం. ఎన్నికల్లో అధికారంలోకి రావటానికి, ప్రజల ఓట్లను కొల్ల గొట్టడానికి ఆచరణ సాధ్యం కానీ ‘సూపర్‌ సిక్స్‌’ హామీలు ఇచ్చి, ఆ పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను నెరవేర్చటంలో తమ ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపై విసురుతున్న ‘పీ4’ లాంటి మాయా పథకాలను ఈ దృక్కోణంతోనే చూడాలి. ప్రజలను ఆ భ్రమల్లో పడనీయకుండా చైతన్య పరుస్తూ, ప్రజా పోరాటాలను ఉద్ధృతం చేయాలి! – ముప్పాళ్ళ భార్గవ శ్రీసీపీఐ ఎంఎల్‌ నాయకులు ‘ 98481 20105

Virat Kohli announces Test retirement after 14-year career6
టెస్టులకు కోహ్లి వీడ్కోలు

న్యూఢిల్లీ: విరాట్‌ కోహ్లి తన మనసులో మాటకే కట్టుబడ్డాడు... టెస్టు క్రికెట్‌ నుంచి తప్పుకోవాలనుకున్న తన నిర్ణయంపై ఎలాంటి పునరాలోచన చేయలేదు... అతడిని ఒప్పించేందుకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. టెస్టుల నుంచి రిటైర్‌ అవుతున్నట్లు కోహ్లి సోమవారం అధికారికంగా ప్రకటించాడు. భారత టెస్టు క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా, సారథిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అతను 14 ఏళ్ల కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ కోసం త్వరలోనే టీమ్‌ను సెలక్టర్లు ప్రకటించనున్న నేపథ్యంలో తన రిటైర్మెంట్‌ సమాచారాన్ని ముందుగానే బీసీసీఐకి తెలియజేయడం సరైందని విరాట్‌ భావించాడు. ఈ నిర్ణయం తీసుకోవడం కష్టంగానే అనిపిస్తున్నా అది సరైందేనని అతను పేర్కొన్నాడు. 2011 జూలైలో కింగ్‌స్టన్‌ వేదికగా వెస్టిండీస్‌తో తన తొలి టెస్టు ఆడిన కోహ్లి... 2025 జనవరిలో సిడ్నీలో ఆ్రస్టేలియాతో చివరి టెస్టు మ్యాచ్‌ ఆడాడు. గత ఏడాది వరల్డ్‌ కప్‌ విజయం తర్వాత టి20 ఫార్మాట్‌ నుంచి రిటైర్‌ అయిన కోహ్లి ఇకపై వన్డేల్లోనే కొనసాగనున్నాడు. గత మంగళవారం రోహిత్‌ శర్మ టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించగా, ఆ్రస్టేలియా సిరీస్‌ మధ్యలోనే స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తప్పుకోవడంతో తక్కువ వ్యవధిలో ముగ్గురు భారత సీనియర్లు ఈ ఫార్మాట్‌ నుంచి ని్రష్కమించినట్లయింది. ఎందుకీ వెనకడుగు? రోహిత్‌ టెస్టులకు గుడ్‌బై చెబితే పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు గానీ ఇప్పుడు కోహ్లి అనూహ్యంగా రిటైర్మెంట్‌ అనేశాడు. నిజానికి సవాళ్లను ఎదుర్కొనేందుకు కోహ్లి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కీలకమైన ఇంగ్లండ్‌ పర్యటన కోసం అతను కూడా సన్నద్ధమైనట్లు కనిపించింది. ఆస్ట్రేలియా టూర్‌ ముగిసిన తర్వాత ఐపీఎల్‌ ఆరంభానికి ముందు తన టెస్టు బ్యాటింగ్‌ లోపాలను సరిదిద్దుకునేందుకు ఎర్ర బంతితో సంజయ్‌ బంగర్‌ పర్యవేక్షణలో అతను తీవ్రంగా సాధన చేయడాన్ని బట్టి చూస్తే ఇప్పటికిప్పుడు టెస్టుల నుంచి తప్పుకోడని అర్థమైంది. అతని అద్భుతమైన ఫిట్‌నెస్‌ ఒక కారణం కాగా, ఇంగ్లండ్‌లో తన అనుభవంతో జట్టుకు మార్గదర్శిగా నిలిచే సత్తా అతనిలో ఉంది. రిటైర్మెంట్‌పై సరైన కారణంగా బయటికీ ఎవరికీ తెలియకపోయినా... వేర్వేరు కారణాలు అతడిని రిటైర్మెంట్‌ వైపు నడిపించాయి. తాను ఆశించినప్పుడు టెస్టు కెప్టెన్సీ మళ్లీ ఇవ్వకపోవడంతో నిరాశకు గురయ్యాడనని చెబుతున్నా... నాయకత్వం లేకపోతే ఆడలేనని చెప్పే తక్కువ స్థాయి కాదు అతనిది. జట్టు కోసం వంద శాతం శ్రమించే అతనికి ఇది పెద్ద విషయం కాదు. అయితే ప్రస్తుత స్థితిలో కొన్ని అంశాలు అతను తప్పుకోవడానికి కారణంగా కనిపిస్తున్నాయి. ఇంగ్లండ్‌ సిరీస్‌తో కొత్తగా 2025–27 వరల్డ్‌ టెస్టు చాంపియన్‌íÙప్‌ సైకిల్‌ మళ్లీ మొదలవుతోంది. వచ్చే రెండేళ్ల పాటు కోహ్లి కొనసాగడం కష్టం కావచ్చు. యువ ఆటగాళ్లతో ప్రణాళికలు రూపొందించుకునే విధంగా తాను తప్పుకోవడమే సరైందని అతను భావించాడు. ఆ్రస్టేలియాతో తొలి టెస్టు సెంచరీ తర్వాత మిగతా 7 ఇన్నింగ్స్‌లు కలిపి 85 పరుగులే చేశాడు. ఇదే వైఫల్యం ఇంగ్లండ్‌లో కొనసాగితే మరింత చెడ్డపేరు రావచ్చు. ప్రస్తుత స్థితిలో మళ్లీ ఫామ్‌ను అందుకొని చెలరేగిపోగలననే నమ్మకం అతనిలో తగ్గినట్లుంది. బీసీసీఐ సూచనల మేరకు రంజీ ట్రోఫీ ఆడినా అక్కడా హిమాన్షు సాంగ్వాన్‌లాంటి సాధారణ బౌలర్‌ బంతికి క్లీన్‌బౌల్డ్‌ అయిన తీరు కూడా తన ఆటపై సందేహాలు రేకెత్తించి ఉంటుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కోరినట్లు ఇంగ్లండ్‌తో సిరీస్‌ వరకు ఆడినా కొత్తగా అతను సాధించేదేమీ ఉండదు. పైగా తీవ్ర ఒత్తిడి, అంచనాలు కూడా. రోహిత్‌ శర్మలాంటి బ్యాటర్‌ కూడా తప్పుకోవడంతో అందరి కళ్లూ ఇప్పుడు తన బ్యాటింగ్‌పైనే ఉంటాయి. అంత ఒత్తిడి అనవసరం అని అతను భావించి ఉంటాడు.టెస్టు క్రికెట్‌లో తొలిసారి బ్యాగీ బ్లూ ధరించి 14 ఏళ్లయింది. ఈ ఫార్మాట్‌ నాపై ఇంతగా ప్రభావం చూపిస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. టెస్టు క్రికెట్‌ నన్ను పరీక్షించింది. తీర్చిదిద్దింది. జీవితానికి కావాల్సిన పాఠాలు నేర్పించింది. టెస్టులు ఆడటంలో వ్యక్తిగతంగా ఎంతో తృప్తి ఉంది. అందులోని తీవ్రత, సుదీర్ఘ రోజులు, కొన్ని కీలక క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేనివి. ఈ ఫార్మాట్‌ నుంచి తప్పుకోవడం కష్టంగా అనిపిస్తోంది. కానీ సరైన నిర్ణయమే. టెస్టు క్రికెట్‌కు నేను ఎంతో ఇచ్చాను. నేను ఆశించిన దానికంటే ఇది ఎక్కువ నాకు తిరిగి ఇచ్చింది. ఈ ఆటకు, నాతో కలిసి ఆడిన వారికి, అండగా నిలిచిన వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నా టెస్టు కెరీర్‌ పూర్తి సంతృప్తితో ముగిస్తున్నా. #269 వీడ్కోలు. –వీడ్కోలు ప్రకటనలో విరాట్‌ కోహ్లి‘కెప్టేన్‌ ఫైర్‌’టీమిండియాను విదేశీ గడ్డపై కూడా వెన్నెముక ఉన్న జట్టుగా సౌరవ్‌ గంగూలీ నిలబెడితే ఎమ్మెస్‌ ధోని ‘కూల్‌ కెప్టేన్‌’గా జట్టును నడిపించి చూపించాడు. కానీ విరాట్‌ కోహ్లి అలాంటివాడు కాదు. అతను నాయకుడిగా ఒక రగులుతున్న అగ్నిపర్వతంలాంటివాడు. అప్పటి వరకు ఉన్న స్క్రిప్ట్‌ను తగలబెట్టిన అతను కొత్త నాయకత్వ లక్షణాలను రచించాడు. తన బౌలర్లు, ఫీల్డర్లనుంచి అతను వంద శాతంకు మించి ప్రదర్శనను ఆశించాడు. అందరికంటే ముందు తానే అది చేసి చూపించాడు. తన బౌలింగ్, ఫీల్డింగ్‌ను నమ్ముకొని ‘60 ఓవర్లు వీరికి నరకం కనిపించాలి’ అని లార్డ్స్‌ మైదానంలో ఇంగ్లండ్‌ను ఆడుకున్న తీరు మర్చిపోలేనిది.కోహ్లికి ముందు చూస్తే బ్యాటర్లయినా భారీ స్కోరుతో జట్టును గెలిపించాలి లేదా స్పిన్నర్లపై భారం ఉండేది. కానీ స్వదేశమైనా, విదేశీ పిచ్‌ అయినా పేసర్లను అద్భుతంగా వాడుకొని గెలిపించిన తీరు అసాధారణం. ఒక బ్యాటర్‌ను తగ్గించి అయినా అదనపు బౌలర్‌ను తీసుకొని ప్రత్యర్థిని ఆలౌట్‌ చేయడం, మ్యాచ్‌ గెలవడమే ముఖ్యంగా కోహ్లి వ్యూహరచన సాగింది. కోహ్లి కెప్టేన్సీలో పేస్‌ బౌలర్లు కేవలం 26 సగటుతో 591 వికెట్లు పడగొట్టారు. 80ల్లో వివ్‌ రిచర్డ్సన్‌ నాయకత్వంలో మాత్రమే పేసర్ల సగటు (22.89) ఇంతకంటే మెరుగ్గా ఉంది. 68 టెస్టుల్లో 40 మ్యాచ్‌లు గెలిపించి భారత అత్యుత్తమ కెప్టేన్‌గా అతను నిలిచాడు. ప్రతికూలతలను దాటి ఆ్రస్టేలియా గడ్డపై తొలి సారి టెస్టు సిరీస్‌ గెలిపించిన సారథిగా (2018–19) కోహ్లి చరిత్రలో నిలిచిపోయాడు. మరచిపోలేని కొన్ని ఇన్నింగ్స్‌ 115, 141 (అడిలైడ్, 2014): ధోని గైర్హాజరులో కెప్టెన్‌గా తొలి టెస్టు మ్యాచ్‌లో కోహ్లి అసాధారణ బ్యాటింగ్‌ ప్రదర్శన కనబర్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో ఆసీస్‌కు భారీ ఆధిక్యం దక్కకుండా చేసిన అతను రెండో ఇన్నింగ్స్‌లో 364 పరుగుల లక్ష్య ఛేదనలో చివరి వరకు పోరాడాడు. 119, 96 (జొహన్నెస్‌బర్గ్, 2013): తొలి ఇన్నింగ్స్‌లో విరాట్‌ సెంచరీతో భారత్‌కు ఆధిక్యం దక్కగా, రెండో ఇన్నింగ్స్‌ స్కోరుతో జట్టుకు గెలుపు అవకాశం సృష్టించాడు. 153 (సెంచూరియన్‌ 2018): కఠినమైన పిచ్‌పై 379 నిమిషాల పాటు పట్టుదలగా నిలబడి సాధించిన సెంచరీ. జట్టులో తర్వాతి అత్యుత్తమ స్కోరు 46 అంటే ఈ ఇన్నింగ్స్‌ విలువ అర్థమవుతుంది. 123 (పెర్త్, 2018): చేతి వేళ్లకు గాయాలు, హెల్మెట్‌కు దెబ్బలు, బ్యాటర్లంతా కుప్పకూలుతున్నారు. ఇలాంటి స్థితిలో అత్యుత్తమ పేస్, సీమ్‌ బౌలింగ్‌ను అనూహ్యంగా స్పందిస్తున్న పిచ్‌పై ఎదుర్కొని చేసిన శతకం. ఇరు జట్లలో కలిపి ఇతర బ్యాటర్ల అత్యధిక స్కోరు 70 మాత్రమే. 254 నాటౌట్‌ (పుణే, 2019): కెరీర్‌లో అత్యధిక స్కోరు. స్వదేశంలో సఫారీ బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ చేసిన డబుల్‌ సెంచరీలతో జట్టుకు విజయం. సచిన్‌ ‘100’ పదిలం!అంతర్జాతీయ క్రికెట్‌లో దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ నెలకొల్పిన 100 సెంచరీల రికార్డు ఇక ఎప్పటికీ చెరిగిపోకపోవచ్చు. ఈ ఘనతను అధిగమించగల సత్తా ఉన్న ఒకే ఒక బ్యాటర్‌గా విరాట్‌ కోహ్లి కనిపించాడు. ఒక దశలో వరుస శతకాలు బాదుతున్న సమయంలో అతను చేరువగా వచ్చినట్లే అనిపించింది. ఆపై ఫామ్‌ కోల్పోయి కొంత కాలం సెంచరీ లేక విరాట్‌ కాస్త వెనుకబడ్డాడు. అయితే 2023 వన్డే వరల్డ్‌ కప్‌లో మూడు సెంచరీలు కొట్టిన కోహ్లి...ముంబైలోనే 50వ సెంచరీతో వన్డేల్లో సచిన్‌ అత్యధిక సెంచరీల రికార్డును సమం చేశాడు.ఆపై పెర్త్‌ టెస్టులో వంద బాదిన అతను... చాంపియన్స్‌ ట్రోఫీలో పాక్‌పై సెంచరీతో సచిన్‌ రికార్డును కూడా దాటాడు. దీంతో ఓవరాల్‌గా కోహ్లి సెంచరీల సంఖ్య 82కు చేరింది. కనీసం మరో రెండేళ్లు అటు టెస్టులు, ఇటు వన్డేలు ఆడి నిలకడైన ప్రదర్శన కనబరిస్తే 100 కష్టం కాదనిపించింది. కానీ ఇప్పుడు టెస్టులను కోహ్లి తప్పుకున్నాడు. తన ఫిట్‌నెస్, ఇష్టమైన ఫార్మాట్‌ దృష్ట్యా 2027 వన్డే వరల్డ్‌ కప్‌ కొనసాగి ఆపై రిటైర్‌ అయ్యే ఆలోచనతో కోహ్లి ఉండవచ్చు. ఆ మెగా టోరీ్నలోగా భారత్‌ వేర్వేరు జట్లతో మొత్తం 27 వన్డేలు ఆడాల్సి ఉంది. కోహ్లి వీటిల్లో ఎంత బాగా ఆడగలడనేది చెప్పలేం. ఎంత అద్భుతమైన ఫామ్, చెలరేగి ఆడినా సరే 27 వన్డేల్లో 18 సెంచరీలు దాదాపు అసాధ్యం! అలా చూస్తే సెంచరీల సెంచరీ రికార్డులు ఢోకా లేదు. నీ క్రికెట్‌ ప్రస్థానం ఎంతో మంది చిన్నారులు ఆటను ఎంచుకు⇒ నేందుకు స్ఫూర్తిగా నిలిచింది. నీ టెస్టు కెరీర్‌ నిజంగా చాలా అద్భుతంగా సాగింది. నువ్వు భారత క్రికెట్‌కు పరుగులు మాత్రమే ఇవ్వలేదు. కొత్తతరం వీరాభిమానులను, క్రికెటర్లను అందించావు. అభినందనలు. –సచిన్‌ టెండూల్కర్‌⇒ నువ్వు రిటైర్‌ అయ్యావంటే నమ్మలేకపోతున్నా. ఆధునిక క్రికెట్‌ దిగ్గజంగా, ఆటకు అసలైన రాయబారిగా నిలిచావు. మనం కలిసి పని చేసినప్పుడు ఎప్పటికీ మర్చిపోలేని ఎన్నో జ్ఞాపకాలను అందించావు. –రవిశాస్త్రి⇒ ఆధునిక క్రికెట్‌ యుగంలో టెస్టు ఫార్మాట్‌ కోసం అన్నీ ఇచి్చన అతి పెద్ద బ్రాండ్‌ కోహ్లి. టెస్టు క్రికెట్‌ అతనికి ఎంతో రుణపడి ఉంది. –సంజయ్‌ మంజ్రేకర్‌ ⇒ సింహంలాంటి పోరాటతత్వం ఉన్నవాడు. ఇకపై నీ లోటు కనిపిస్తుంది. –గౌతమ్‌ గంభీర్‌⇒ ‘నేను ఈ నిర్ణయాన్ని ఊహించలేదు. మరికొంత కాలం టెస్టులు ఆడగల సత్తా కోహ్లిలో ఉంది. అతనికి ఘనంగా మైదానంలో వీడ్కోలు దక్కాల్సింది. –అనిల్‌ కుంబ్లే

Sakshi Guest Column On India Pakistan Issues7
ముక్కలు చేయడమే మార్గం!

క్రమం తప్పకుండా జరుగుతున్న భారీ ఉగ్ర వాద దాడులు భారత్, పాకిస్తాన్‌ సంబంధాలను ఘోరంగా దెబ్బతీశాయి. సాధారణంగా, ప్రతి పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ పదవీకాలంలో కనీసం ఒక్కసారైనా ఇలాంటి దాడులు జరుగుతాయి. ఎక్కువకాలం సైనిక నాయకత్వ స్థానంలో ఉన్న వ్యక్తి, పౌర అధికారంపై మరింతగా నియంత్రణ సాధించాల్సిన అవసరం ఉందని భావించినప్పుడు లేదా అతని బలగాలు దేశంలో గౌరవాన్ని కోల్పోతున్నప్పుడు ఉగ్రవాద దాడులు చోటు చేసుకుంటాయి. భారతదేశం నుండి సైనిక ముప్పు ఉందన్న ప్రచారం కంటే పాకిస్తాన్‌ ప్రజలను మరేదీ కలిపి ఉంచదు. పైగా వరదలు, కరవులు, ఉగ్రవాద ఘటనలతో సహా పాకిస్తాన్‌ లో జరిగే ప్రతిదానికీ భారతదేశంపైనే నిందలు మోపుతూ వస్తారు.భారతదేశం మన పాకిస్తాన్‌ను నాలుగు ముక్కలు చేయాలని చూస్తోందనీ, దాన్ని రక్షించే ఏౖకైక శక్తి పాక్‌ సైన్యమే అనీ పాక్‌ ప్రజలకు తొలి నుంచీ నేర్పించారు. భారత్‌ సహన పరిమితిని దాటిన ప్రతి ఉగ్రవాద ఘటన తర్వాత, పాకిస్తాన్‌ సాధారణ వ్యాఖ్యలను పునరావృతం చేస్తుంటుంది. వారి మంత్రులు దీనిని భారతదేశం ప్రారంభించిన ‘తప్పుడు’ ఆపరేషన్‌ అని, లేదంటే ఇది కశ్మీర్‌ ‘స్వాతంత్య్ర సమరయోధుల’ పని అని గావుకేకలు పెడతారు. తమ గడ్డపైనే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నామనే ఆరోపణను వారు నిరంతరం తిరస్కరిస్తారు. పైగా ఉగ్రవాదానికి అత్యంత ప్రభావి తమైన దేశం తమదే అని వాపోతుంటారు. అయితే దాదాపు ప్రతి ప్రపంచ స్థాయి ఉగ్రవాద ఘటనకూ పాకిస్తాన్‌తో సంబంధం ఉందనీ, ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ఉగ్రవాదులలో అత్యధికులు పాక్‌లోనే ఆశ్రయం పొందారనీ ప్రపంచానికి తెలుసు.ఎన్నని సహిస్తాం?కథ పునరావృతమవుతుంది. పైగా విసుగు పుట్టిస్తుంది. బహిరంగ అంతర్జాతీయ దర్యాప్తునకు పాక్‌ వైపు నుంచి ఎప్పుడూ హామీ ఉంటుంది, కానీ ఈ ప్రతిపాదనను ఎవరూ నమ్మరు. ముంబై ఉగ్ర దాడి సూత్రధారులలో ఒకరైన తహవ్వుర్‌ రానాను అమెరికా ఇటీవలే భారతదేశానికి అప్పగించింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కూడా ముంబై ఉగ్రవాద దాడులపై ఇంకా దర్యాప్తు చేయవలసి వస్తోంది. ఉగ్రవాద నాయకులపై పాకిస్తాన్‌ ఎప్పటికీ చర్య తీసు కోదు. ఎందుకంటే వారే పాక్‌ ప్రధాన ఆస్తులు. పహల్‌గామ్‌ ఉగ్ర దాడిపై దర్యాప్తు కూడా దశాబ్దాలుగా నిగూఢంగా ఉండిపోతుంది. దావూద్‌ ఇబ్రహీమ్‌ ఉనికిని అది ఎల్లప్పుడూ ఖండిస్తూ వచ్చింది. అయినప్పటికీ ప్రతి ప్రపంచ సంస్థకూ పాకిస్తాన్‌ లో అతని బహుళ నివాసాల గురించి తెలుసు. దీనికి విరుద్ధంగా, ప్రతీకారం తీర్చు కుంటామని ఇండియా బెదిరిస్తే, వారు అకస్మాత్తుగా తమ భూ భాగంపై ఉగ్రవాద కార్యకలాపాలలో భారతదేశ ప్రమేయం ఉందని ఇష్టారాజ్యంగా అబద్ధాలాడతారు.ప్రజల మద్దతు పొందాలనే ఆశతో, సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేయడంపై భారతదేశాన్ని పాక్‌ బెదిరించడం ప్రారంభించింది. దాని ఆనకట్టలు భారతీయ రక్తంతో నిండిపోతా యని రెచ్చ గొట్టేంత వరకు వెళ్ళింది. చరిత్ర గమనిస్తే, భారత ప్రభు త్వాలు రావల్పిండిని నియంత్రించడంపై ప్రపంచ మద్దతు కోరుతూ పాకిస్తాన్‌ ఉగ్రవాద దాడులపై తీవ్ర విమర్శ చేస్తూ వచ్చాయి. కానీ అది ఎప్పుడూ పని చేయలేదు. దీనికి విరుద్ధంగా, తరచుగా విరామాలతో కూడిన ఉగ్రవాద దాడులకు పాక్‌ తలుపులు తీసింది. 2001 అక్టోబర్‌లో జమ్మూ–కశ్మీర్‌ శాసనసభపై దాడి, ఆ తర్వాత అదే సంవత్సరం డిసెంబర్‌లో పార్లమెంటుపై దాడి, 2002 సెప్టెంబర్‌లో అక్షరధామ్‌పై దాడి, 2003 ఆగస్టులో ముంబై బాంబు దాడులు, ఆ తర్వాత 2005 అక్టోబర్‌లో ఢిల్లీలో బహుళ బాంబు దాడులు, 2006 జూలైలో ముంబై రైలు దాడులు, 2008 నవంబర్‌లో ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడి కొన్ని ఉదాహరణలు. బాలాకోట్‌పై జరిగిన దాడి తర్వాత మాత్రమే భారత్‌ సందేశం అంతటా వినిపించింది. కానీ సరిహద్దులు దాటి భారత్‌ చేసిన బాలాకోట్‌ సర్జికల్‌ దాడి కూడా పాకిస్తాన్‌ను నిరోధించడంలో విఫలమైంది. ఎందుకంటే భారత్‌ దాడిలో సంభవించిన ప్రాణనష్టాన్ని పాక్‌ దాచగలిగింది. కారణం... హతమార్చబడిన వారు ఉగ్రవాదులు!పెద్ద మార్పు ఉండదు!సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేసిన ప్రభావం ఇస్లామాబాద్‌కు బాగా తెలుసు. వారి నాయకత్వాన్ని అది భయ పెట్టింది. కానీ, ఇది అంతర్జాతీయ చట్టానికి విరుద్ధమని చెప్పడం తప్ప వారికి వేరే పరిష్కారం లేదు. భారతదేశం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని వారు ఇక ఒప్పించలేరు. రెండు దేశాల మధ్య సంబంధాలు శాంతియుతంగా ఉండాలనే ముందస్తు షరతు పైనే ఈ ఒప్పందంపై సంతకం చేశారనేది వాస్తవం. మరోవైపున అఫ్గానిస్తాన్‌కు భారతదేశం సన్నిహితం కావడం పాకిస్తాన్‌లో ఆందోళనలను మరింత పెంచింది. ముఖ్యంగా పాకిస్తాన్‌ తన బలగాలను భారత సరిహద్దుకు తరలించినప్పుడల్లా బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ, తెహ్రీక్‌ ఎ తాలిబన్‌ పాకిస్తాన్‌ ఈ అంతరాన్ని బాగా ఉపయోగించు కుంటాయి. అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంట పాకి స్తాన్‌ తన సైన్యాన్ని మోహరించి ఉంచినంత కాలం, వారి ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే భారత్‌ ఎదుర్కొంటున్న సమస్య ఏమిటంటే, అది ఏ సైనిక చర్య తీసుకున్నా, పెద్దగా మార్పు ఉండదు. పాక్‌లో కొత్త ఆర్మీ చీఫ్‌ వచ్చి తనవంతుగా ఏదైనా చేయాలని భావించే వరకు, పాకిస్తాన్‌ ఉగ్రవాదానికి తక్కువ స్థాయిలో మద్దతు ఇస్తూనే ఉంటుంది. తర్వాత, మరొక ఘటన జరుగుతుంది. కథ పునరావృతమవుతూ ఉంటుంది. పాకిస్తాన్‌ ప్రాయోజిత ఉగ్రవాదం నుండి భారతదేశాన్ని రక్షించడానికి ఏకైక పరిష్కారం దాని బాల్కనైజేషన్‌ మాత్రమే (అంటే ఒక దేశం లేదా ప్రాంతాన్ని బహుళ చిన్న, శత్రు యూనిట్లుగా విభజించే ప్రక్రియ). దీని కోసం, పాకిస్తాన్‌ నుండి స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న సమూహాలకు భారతదేశం తన మద్దతును ఇవ్వాలి.హర్ష కక్కడ్‌ వ్యాసకర్త భారత సైన్యంలో రిటైర్డ్‌ మేజర్‌ జనరల్‌(‘ద స్టేట్స్‌మన్‌’ సౌజన్యంతో)

Sakshi Editorial On PM Narendra Modi Comments about Pakistan8
దృఢనిశ్చయం

ప్రధాని నరేంద్ర మోదీ ఎలాంటి శషభిషలూ లేకుండా కుండబద్దలు కొట్టారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ వాణిజ్యం అంటే కుదరదని, ఉగ్రవాదానికి ఊతమిస్తూ నీళ్లు కావాలంటే చెల్లదని, ఉగ్రవాదానికి అండదండలందిస్తూ చర్చలంటే అంగీకరించబోమని, అణు బెదిరింపులు తమను భయపెట్టలేవని మోదీ పంపిన సందేశంతోనైనా పాకిస్తాన్‌ ఇకపై బుద్ధెరిగి ప్రవర్తించాలి. జాతినుద్దేశించి సోమవారం ఆయన చేసిన ప్రసంగం ఆద్యంతమూ కశ్మీర్‌ విషయంలో పాక్‌ తీరుతెన్నులపై భారత్‌ వైఖరిలో వచ్చిన మార్పునకు అద్దం పట్టింది. ఒక కొత్త క్రమం బయల్దేరిందన్న సంకేతాన్నిచ్చింది. ఇకపై ఉగ్రవాదులనూ, వారికి సాయం చేసే ప్రభుత్వాన్నీ వేర్వేరుగా పరిగణించబోమని ఆయన ప్రకటించటం ఒక్క పాకిస్తాన్‌ మాత్రమే కాదు...ప్రపంచ దేశాలన్నీ గమనించాల్సిన అత్యంత కీలక అంశం. కాల్పుల విరమణ తాత్కాలిక దశేనని, ఉగ్రవాదం శిరసెత్తినప్పుడల్లా ‘ఆపరే షన్‌ సిందూర్‌’ కొనసాగుతూనే వుంటుందని మోదీ చెప్పటం గమనార్హం. ఉగ్రవాదం విషయంలో అమెరికా నిర్లిప్తంగా ఉంటున్నది. 2001లో తమ దేశంలో ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు ‘ఉగ్ర వాదంపై యుద్ధం’ పేరిట ప్రపంచంలో ఎక్కడున్నా ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తామని ప్రక టించిన అమెరికా... కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్‌ను ఎప్పటికప్పుడు వెనకేసు కొస్తోంది. మొన్నటికి మొన్న పాక్‌కు ఐఎంఎఫ్‌ అప్పు పుట్టడంలో యథోచితంగా సహకరించింది. దాని చీకటి వ్యవహారాలు తెలియనట్టే ప్రవర్తిస్తూ ఎప్పటికప్పుడు నిధులూ, ఆయుధాలూ ఉదారంగా అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘ఆపరేషన్‌ సిందూర్‌’ కొనసాగుతుందని మోదీ ప్రకటించాల్సి వచ్చింది. దారుణ ఉదంతాలు జరిగినప్పుడల్లా ఏదో కారణం చూపి పాకిస్తాన్‌ను గట్టెక్కి స్తున్న దేశాలు ఇకముందు దీన్ని గమనించుకోక తప్పదు. ఎంతటి క్లిష్టసమయాల్లోనైనా పట్టువిడుపులు ప్రదర్శించటంలోనే పరిణతి వ్యక్తమవుతుంది. ‘ఆపరేషన్‌ సిందూర్‌’తో పాకిస్తాన్‌లోని ఉగ్రమూకల స్థావరాలను ధ్వంసం చేయటంలోనూ, అక్కడి సైన్యం ప్రతిఘటనను తిప్పికొట్టడంలోనూ తెగువనూ, సాహసాన్నీ చూపిన భారత్‌... లక్ష్యసాధన పూర్తికాగానే కాల్పుల విరమణకు కూడా సిద్ధపడి తన పరిణతిని తెలియజెప్పింది. కానీ విఫల రాజ్యం అనే పేరును సార్థకం చేసుకుంటూ కాల్పుల విరమణకు ఒప్పుకున్నట్టే ఒప్పుకుని ఆ వెంటనే ఉల్లంఘించి పాక్‌ తన నైజాన్ని చాటుకుంది. ఆ దేశంలో రాజకీయ నాయకత్వానికీ, సైన్యానికీ ఎప్పుడూ సరైన సంబంధాలు ఉండవన్నది ప్రపంచానికి తెలిసిన సత్యం. కానీ సైనిక దళాలు సైతం ముఠాలుగా చీలివున్నాయని, వాటిపై ఎవరికీ అదుపులేదని తాజా పరిణామాలు నిరూపించాయి. ఈ నిజాన్ని గ్రహించకుండా, పాకిస్తాన్‌కు చీవాట్లు పెట్టకుండా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అణు యుద్ధాన్ని నివారించామని స్వోత్కర్షకు పోవటం... భారత్, పాక్‌లను ఒకే గాటన కట్టడం ఆశ్చర్య కరం. పాకిస్తాన్‌ చర్యల పర్యవసానం తమ వరకూ రానేరాదన్న భ్రమేదో ఆయనకున్నట్టుంది. కానీ ఉగ్రవాదాన్ని దుంపనాశనం చేయకపోతే అది ఏ దేశాన్నీ విడవకుండా మింగేస్తుందని ట్రంప్‌ గ్రహించటం అవసరం. ఉగ్రముఠాలను ప్రోత్సహించి ఊచకోతలను సాగిస్తున్న దేశాన్ని ఎవరైనా ఎలా ఉపేక్షించగలరు? దాని దగ్గర అణ్వాయుధాలున్నాయనీ, అది ముప్పు కలిగిస్తుందనీ... కనుక నోర్మూసుకు పడివుండాలనీ ట్రంప్‌ చెప్పదల్చుకున్నారా? వాణిజ్యాన్ని ఆపేస్తానని బెదిరించటంవల్ల రెండు దేశాలూ దారికొచ్చి కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయని ఆయన అనటం కూడా అత్యంత అభ్యంతరకరమైంది. ఇలాంటి తర్కంతో ప్రోత్సహిస్తున్నదెవరినో గమనించుకుంటున్నారా? తాను ప్రపంచ దేశాలతో అధిక సుంకాల పేరిట యుద్ధం సాగిస్తున్నారు. గాజాలో ఇజ్రాయెల్‌ను నియంత్రించటం లేదు. అక్కడి మారణకాండను ఆపటం లేదు. మరి భారత్‌–పాక్‌ విషయంలో ఇంత ఆత్రుత దేనికో? ఎవరూ కోరకుండానే కశ్మీర్‌ సమస్యలో వేలెడతానని ఆయన తనకు తానుగా ఎలా చెప్పుకుంటారు? 2019లో సైతం ట్రంప్‌ ఇవే తరహా మాటలు మాట్లాడారు. ఆ తర్వాత జ్ఞానో దయమై ఆ సమస్యను రెండు దేశాలూ చర్చించి పరిష్కరించుకుంటాయని స్వరం మార్చారు. మళ్లీ ఇప్పుడేమైంది? తాజా ఘర్షణలకు మూలం ఎక్కడున్నదో ఆయన గ్రహించలేకపోయారని ట్రంప్‌ మాటలు గమనిస్తే తెలుస్తుంది. పహల్గామ్‌లో 26మంది పర్యాటకుల్ని పొట్టనబెట్టుకున్న ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ ‘ఆపరేషన్‌ సిందూర్‌’ని ప్రారంభించింది. పాక్‌లోని 24చోట్ల ఉగ్రముఠాల స్థావ రాలను ధ్వంసం చేసింది. వందమంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. కశ్మీర్‌లో ఉగ్రవాదులు చేసిన దాడికిది ప్రతీకారమే తప్ప కశ్మీర్‌ సమస్య పరిష్కారాన్ని ఉద్దేశించి మొదలెట్టిన దాడులు కాదు. అమెరికాకు చిత్తశుద్ధి ఉంటే ఉగ్రవాదులకు ప్రోత్సాహం అందించినంతకాలమూ తమ వైపుగా ఎలాంటి సాయమూ అందబోదని పాకిస్తాన్‌కు చెప్పాలి. ఆ దేశంతో సంబంధ బాంధవ్యాలు కొన సాగించే దేశాలపై కూడా ఆంక్షలుంటాయని ప్రకటించాలి. కానీ అందుకు విరుద్ధంగా ఆ దేశం కారణంగా నష్టపోతున్న భారత్‌నూ, దాన్నీ ఒకే గాటన కట్టడం ఎలాంటి సందేశం పంపుతుంది? ఇరు దేశాల మధ్యా చర్చలంటూ ఉంటే అది కేవలం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌పైనా, ఉగ్రవాదుల అప్పగింతపైనా మాత్రమే ఉంటాయని తన సందేశంలో మోదీ చెప్పటం ప్రశంసించదగ్గది. అమెరికా పోకడలు గమనిస్తే వర్తమాన ప్రపంచంలో ఎలాంటి న్యాయం అమలవుతున్నదో స్పష్టంగానే అర్థమవుతుంది. దశాబ్దాలుగా చీకాకు పెడుతున్న ఉగ్రవాద సమస్యపై మోదీ దృఢ నిశ్చయాన్ని ప్రకటించటం ఈ తరహా న్యాయాన్ని ప్రశ్నించటమే!

IPL 2025 Cricket reschedule announced9
ఐపీఎల్ రీ షెడ్యూల్ ప్రకటన...

న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలతో వాయిదా పడిన ఐపీఎల్‌ 18వ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లను ఈ నెల 17 నుంచి తిరిగి నిర్వహించనున్నట్లు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెలిపింది. కేంద్ర ప్రభుత్వం, పోలీసు సిబ్బంది, ప్రైవేట్‌ సెక్యూరిటీ ఏజెన్సీలు, లీగ్‌ భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరిపిన బోర్డు మిగిలి పోయిన 17 మ్యాచ్‌ల్ని ఆరు వేదికలు బెంగళూరు, జైపూర్, న్యూఢిల్లీ, లక్నో, ముంబై, అహ్మదాబాద్‌లలో నిర్వహిస్తామని ప్రకటించింది. మే 17 నుంచి 27 వరకు లీగ్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో రెండు ఆదివారాలు రాగా రెండేసి మ్యాచ్‌లు (డబుల్‌ హెడర్‌) నిర్వహిస్తారు. 29న తొలి క్వాలిఫయర్, 30న ఎలిమినేటర్, 1న రెండో క్వాలిఫయర్, 3న ఫైనల్‌తో ఈ సీజన్‌ ఐపీఎల్‌ ముగుస్తుంది. ‘ప్లేఆఫ్స్‌’ మ్యాచ్‌ వేదికల్ని తర్వాత ప్రకటిస్తారు. కాగా ఈ నెల 10న హైదరాబాద్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరగాల్సిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆఖరి పోరును 25వ తేదీన న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. ఈనెల 8న ధర్మశాలలో అర్ధాంతరంగా ఆగిన పంజాబ్‌ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌ను 24న న్యూఢిల్లీలో మొదటి నుంచి నిర్వహిస్తారు.

Keir Starmer has announced tighter British immigration rules10
బ్రిటన్‌ వీసా నిబంధనలు మరింత కఠినం

లండన్‌: గత ప్రభుత్వాల ఉదారవాద విధానాల కారణంగా బ్రిటన్‌లోకి వలసలు పోటెత్తాయని, స్థానికులకు ఉపాధి అవకాశాలు భారీగా తగ్గిపోయాయని ఆరోపిస్తూ అధికార లేబర్‌ పార్టీ కఠిన నిబంధనలను అమల్లోకి తేవాలని నిర్ణయించింది. బ్రిటన్‌లో వలసకార్మికుల సంఖ్యను భారీగా తగ్గించడమే లక్ష్యంగా కొత్త నిబంధనలను అమలుచేయనుంది. వలసదారులు బ్రిటన్‌లో శాశ్వత నివాస హోదా పొందాలంటే ఇకపై ఐదేళ్లకు బదులు కనీసం పదేళ్లు యూకేలో నివసిస్తూ ఉండాలని నిబంధనను కఠినతరం చేయనున్నారు. దీంతో అత్యధిక వర్క్‌ వీసాల పొందే భారతీయుల బ్రిటన్‌ శాశ్వత స్థిరనివాస కలలు నెలవేరడం మరింత కష్టంకానుంది. భారతీయులు ఎక్కువగా వైద్యం, ఐటీ, ఇంజనీరింగ్, విద్య, ఆతిథ్యం, కేటరింగ్, వాణిజ్యవిభాగాల్లో పనిచేసేందుకు వీసాలు పొంది బ్రిటన్‌కు వస్తుంటారు. 2024 జూన్‌లో ముగిసిన 12 నెలల కాలానికి 1,16,000 మంది భారతీయులు వర్క్‌ వీసాలు పొంది బ్రిటన్‌లో పలు రకాల్లో వృత్తుల్లో స్థిరపడ్డారు. వీసా నిబంధనల్లో ముఖ్యమైన మార్పులేంటి?చిన్నారులు, వృద్ధులు, రోగుల బాగోగులు చూసుకునే ఓవర్‌సీస్‌ కేర్‌ వర్కర్లకు ఇచ్చే వీసాలను ఇకపై ఆపేయనున్నారు. ఇకపై విదేశీయులను కేర్‌ వర్కర్లుగా నియమించుకోకూడదనే నిబంధనను అమల్లోకి తేనున్నట్లు పార్లమెంట్‌లో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టనున్న హోం శాఖ మంత్రి వెట్టీ కూపర్‌ చెప్పారు. దీంతో ఈ ఉద్యోగాలు స్థానికులకు లభిస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది. నైపుణ్యమున్న వాళ్లకు మంజూరుచేసే స్కిల్డ్‌ వర్కర్‌ వీసాను ఇకపై కనీసం గ్రాడ్యుయేషన్‌ విద్యార్హత ఉన్న వ్యక్తులకే ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. వైద్యులు, ఇంజనీర్లు, కృత్రిమ మేధ ఉద్యోగులు ఇలా నైపుణ్యమున్న వాళ్లకే స్కిల్డ్‌ వర్కర్‌ వీసా మంజూరుచేయాలని శ్వేతపత్రంలో ప్రతిపాదించారు. నిబంధనలను పాటిస్తూ దేశార్థికాన్ని తమ వంతు తోడ్పాటునందించే వాళ్లకే ప్రాధాన్యత ఇవ్వనున్నారు. స్కిల్డ్‌ వర్కర్‌ వీసా కోరే వాళ్లు కనీసం యూనివర్సిటీ డిగ్రీ పట్టభద్రులై ఉండాలి. ఈ నిబంధనలతో బ్రిటన్‌ హోం శాఖ సోమవారం ఒక శ్వేతపత్రం విడుదలచేసింది.డిపెండెంట్‌లకూ ఇంగ్లిష్‌ పరీక్షవీసాదారులపై ఆధారపడి బ్రిటన్‌లో అడుగుపెట్టే వారి జీవితభాగస్వాములు, తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు ఇంగ్లిష్‌ భాషపై కనీస పరిజ్ఞానం, పట్టు ఉండాల్సిందే. వీళ్లంతా ఏ1–లెవల్‌ ఇంగ్లిష్‌ టెస్ట్‌ను పాసవ్వాల్సి ఉంటుంది. ఎక్కడ ఉంటున్నారు?. ఏ పని మీద వచ్చారు?. ఏం చేస్తారు? ఇలా బ్రిటన్‌ పోలీసులు ఎక్కడైనా ప్రశ్నిస్తే కనీసం సమాధానం ఇంగ్లిష్‌లో చెప్పేలా బేసిక్‌ లెవల్‌ ఇంగ్లిష్‌ తెలిసి ఉండాలనే నిబంధనను జతచేయనున్నారు. వీసా గడువు కాలాన్ని వర్కర్లుగానీ, వాళ్ల కుటుంబసభ్యులుగానీ పెంచుకోవాలనుకుంటే వారిపై ఆధారపడే వాళ్లు హై లెవల్‌ ఏ2 ఇంగ్లిష్‌ టెస్ట్‌ పాస్‌ అవ్వాల్సి ఉంటుంది. బ్రిటన్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసుకున్న విదేశీ విద్యార్థులు అదనంగా మరో 24 నెలలపాటు బ్రిటన్‌లోనే ఉండేందుకు వెసులుబాటు ఉండేది. దానిని ఇప్పుడు 18 నెలలకు కుదించారు. ఊహించనంతగా చట్టబద్ధంగా, అక్రమంగా వస్తున్న వారితో బ్రిటన్‌ ‘అపరిచితుల ద్వీపం’గా తయారవుతోందని సోమవారం 10 డౌనింగ్‌ స్ట్రీట్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ప్రధాని స్టార్మర్‌ వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement